సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): సమాజ సేవలో యువత ముందుండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్లో బోస్ ఫెలోషిప్ వలంటీర్లు చేపట్టిన యంగ్ ఓరిటర్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ విద్యార్థికి కనీస అభ్యసన సామర్థ్యాలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర తల్లిదండ్రులు పిల్లల చదువులపై అధికంగా శ్రద్ధ పెట్టలేకపోవచ్చని, దీంతో విద్యార్థులు వెనుకంజలో ఉండకుండా సంబంధిత గ్రామాల యువత ముందుకు వచ్చి సదరు విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు స్వచ్ఛందంగా పనిచేయాలన్నారు. బోస్ ఫెలోషిప్ కార్యక్రమం కింద 8నెలల పాటు వలంటీర్లుగా పనిచేస్తున్న డిగ్రీ కళాశాలల విద్యార్థులు జిల్లాలో ఎంపిక చేసిన 30 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక తరగతి విద్యార్థులకు వివిధ ఆక్టీవిటిస్ ద్వారా విద్యాభోధన చేయడంపై అభినందించారు. డిగ్రీ చదివే విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంచుకొని దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, డాక్టర్ పీఎం షేక్, బోస్ ఫెలోషిప్ వలంటీర్లు పాల్గొన్నారు.
● కలెక్టర్ కోయ శ్రీహర్ష