బాబు మళ్లీ మభ్యపెడుతున్నారు  | Sakshi
Sakshi News home page

బాబు మళ్లీ మభ్యపెడుతున్నారు 

Published Sun, Apr 7 2024 4:37 AM

kurasala kannababu Comments On Chandrababu Naidu - Sakshi

2014లో హామీలు నెరవేర్చలేదు.. ఇప్పుడు మళ్లీ కొత్త వాగ్దానాలు 

ఆయన గ్యారంటీలు, వారంటీలను ప్రజలు నమ్మరు 

మాజీమంత్రి కురసాల కన్నబాబు 

కాకినాడ రూరల్‌:  ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కొత్త హామీలతో గ్యారంటీలు, వారంటీలంటూ వస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మబోరని మాజీమంత్రి, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రమణయ్యపేటలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమిగా ఏర్పడిన టీడీపీ–జనసేన–బీజేపీలు 2014లో కూడా కలిసే ఉన్నాయన్నారు. నాటి మేనిఫెస్టోలో చంద్రబాబు సుమారు 650 హామీలిచ్చారని కన్నబాబు గుర్తుచేశారు. ఇందులో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, ఇప్పుడు మళ్లీ కొత్త హామీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు తిరుగుతున్నారని ఆయన విమర్శించారు.

అప్పట్లో రైతు రుణమాఫీ చేస్తామన్నారని, అక్కచెల్లెమ్మల బంగారం తానే విడిపిస్తానన్నారని.. అలాగే, అప్పట్లో ఆయనిచ్చిన హామీ ప్రకారం సుమారు రూ.87,612 కోట్ల రైతు రుణమాఫీ చేయాల్సి ఉండగా రూ.15 వేల కోట్లు మాత్రమే చేశారని కన్నబాబు చెప్పారు. ఇక రూ.14,502 కోట్ల డ్వాక్రా రుణమాఫీ చేస్తానని.. ఇంట్లో ఆడపిల్ల పుడితే రూ.25 వేలు జమ చేస్తామన్నారని, ఏ ఒక్కరికైనా చేశారా అని కన్నబాబు ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని, నిరుద్యోగ భృతి ఇచ్చి ఉంటే ప్రతి ఇంటికి 2014 నుంచి ఐదేళ్ల కాలంలో రూ.1.20 లక్షలు ఇచ్చి ఉండాలని.. కానీ ఎక్కడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని కన్నబాబు చెప్పారు.    

వలంటీర్‌ వ్యవస్థపై బాబు, పవన్‌ల అవహేళన.. 
ఇక వలంటీర్‌ వ్యవస్థపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ గతంలో చులకనగా మాట్లాడారని, ఇప్పుడు మాటమార్చి వారికి హామీలిస్తున్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించి, వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని ఆపించి ఏం సాధించారని ప్రశ్నించారు. ఇంటింటికీ పింఛన్లు అందక సుమారు 35 మంది చనిపోయారన్నారు. పింఛన్ల లబి్ధదారుల బాధలను గుర్తించే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పారు. రాష్ట్రానికి దిక్సూచిలా జగన్‌ పనిచేస్తున్నారని, చంద్రబాబు, ఆయన కూటమి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకులేదని కన్నబాబు స్పష్టంచేశారు. 

బాబు సెంటు స్థలమైనా ఇచ్చారా 
మరోవైపు.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 32 లక్షల ఇళ్ల స్థలాలిచ్చారని, ఐదేళ్ల కాలంలో చంద్రబాబు సెంటు స్థలమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. అసలు నాటి మేనిఫెస్టోనే టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించారని చెప్పారు. ఆ రోజులేని నిబద్ధత, నైతికత ఈరోజు ఎలా వస్తుందని..రూ.4 వేల పింఛను ఏవిధంగా ఇస్తారని ప్రశ్నించారు. అలాగే, నాడు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలుచేయించలేని వారు ఇప్పుడెలా చేయించగలరని కూటమి పారీ్టలను ప్రశ్నించారు. చంద్రబాబు కేవలం మీడియా బలంతో వ్యవహారం నడుపుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement