Minister KTR Advice To The Opposition Parties Over Politics In Dire Situation Of Rains - Sakshi
Sakshi News home page

Minister KTR: విపత్కర పరిస్థితుల్లో చిల్లర రాజకీయాలొద్దు 

Published Fri, Jul 28 2023 3:55 AM | Last Updated on Fri, Jul 28 2023 10:50 AM

Minister KTRs advice to the opposition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వర్షాలు కురుస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేయడం తగదని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. వర్షాల్లో 24 గంటలు కష్టపడుతున్న ఉద్యోగుల మానసిక స్థైర్యం దెబ్బతినేలా విమర్శలు చేయవద్దని సూచించారు.

రాజకీయాలకు, ఎన్నికలకు ఇంకా సమయముందన్నారు. చేయగలిగితే ప్రజలకు సహాయం చేయాలని, అండగా నిలబడి వారికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. గురువారం హుస్సేన్‌సాగర్‌ వరద ఉధృతిని, మూసారాంబాగ్‌ వద్ద మూసీ ప్రవాహాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  

ప్రభుత్వం హైఅలర్ట్‌గా ఉంది.. 
‘రాష్ట్రంలో వరద పరిస్థితుల్ని సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌ ఉండటంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో హైఅలర్ట్‌గా ఉంది. నగరంలోనే కాకుండా రాష్ట్రంలో నూ ఎలాంటి ప్రాణనష్టం జరగరాదనే ప్రధాన ల క్ష్యంతో అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. విద్యాసంస్థలకు సెలవులివ్వడం వల్ల ట్రాఫిక్‌ తగ్గింది.

రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసి భోజనం సహా అన్ని ఏ ర్పాట్లు చేస్తున్నాం. అన్ని మునిసిపాలిటీల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశాం. వర్షాలు వెలిశాక అంటువ్యాధులు, రోగాలు ప్రబలకుండా, నీరు క లుíÙతం కాకుండా తగు చర్యలు తీసుకునేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం..’అని కేటీఆర్‌ తెలిపారు. 

ఫలితమిచ్చిన ఎస్‌ఎన్‌డీపీ పనులు.. 
‘రూ.1,000 కోట్లతో చేపట్టిన ఎస్‌ఎన్డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం) పనుల వల్ల గతంతో పోల్చుకుంటే ముంపు సమస్యలు చాలా తగ్గాయి. గతంలో జల్‌పల్లి, కొంపల్లి వంటి ప్రాంతాలు వారం పది రోజులు నీటిలోనే మునిగి ఉండేవి. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. నగరంలోని చెరువులు పూర్తిగా నిండకుండా చూస్తున్నాం. నాలాల్లో పూడికతీత జరిగింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ నుంచి వార్డు ఇన్‌చార్జుల దాకా అందరూ ఫీల్డ్‌లో ఉన్నారు.

డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఎప్పటికప్పుడు  ప్రజలకు సహాయం చేస్తున్నాయి. హుస్సేన్‌సాగర్‌ ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) వరకు వచ్చింది. దీంతో లోతట్టు ప్రాంతా లను అలర్ట్‌ చేశాం. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలిస్తాం.

ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో 24 గంటలు ప్రజలకు సేవ చేసే పనిలో నిమగ్నమై ఉంది..’అని మంత్రి తెలిపారు. వర్షాల వల్ల వచ్చే కొన్ని తాత్కాలిక స మస్యల్ని కూడా శాశ్వత సమస్యలుగా పేర్కొంటూ ‘జలమయం’వంటి మాటలు వాడి హైదరాబాద్‌ ఇమేజ్‌ను దెబ్బతీయవద్దని మీడియాను కోరారు. 

త్వరలో మూసారాంబాగ్‌ బ్రిడ్జి పనులు.. 
‘లోతట్టు ప్రాంతాలు, నాలాలపై కబ్జాలు మాకు వారసత్వంగా వచ్చిన సమస్యలు. వాటిని ఒక్కటొక్కటిగా పరిష్కరించుకుంటూ పోతున్నాం. పైనుంచి వరద నీరు వస్తుండటం వల్ల తలెత్తుతున్న మూ సారాంబాగ్‌ సమస్యకు పరిష్కారంగా త్వరలోనే బ్రిడ్జి పనులు చేపడతాం.

మూసీపై 14 బ్రిడ్జిలకు టెండర్లు పిలవగా ఐదు టెండర్లు పూర్తయ్యాయి. మూసీని కూడా బాగు చేస్తాం..’అని కేటీఆర్‌ చెప్పా రు. మంత్రి వెంట ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్, మునిసిపల్‌శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రాస్, వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్‌ తదితరులున్నారు.
 
అధికారులు, అదనపు కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్‌ 

భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్‌ గురువారం మున్సిపల్‌ ఉన్నతాధికారులు, జిల్లాల అదనపు కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పురపాలక శాఖ అధికారుల సెలవులను రద్దు చేసినట్లు తెలిపారు. వర్ష ఉధృతిని పరిశీలించడానికి శుక్రవారం వరంగ ల్‌ వెళ్లనున్నట్లు చెప్పారు. భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ప్రజలకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు అండగా నిలవాలి 
వర్షం, వరదల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలవాలని  కేటీఆర్‌ పిలుపునిచ్చారు. కొన్ని జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉందని, దీంతో ప్రభావితమైన ప్రజలకు అన్ని విధాలుగా సహాయం చేయాలని గురువారం ఒక ప్రకటనలో సూచించారు.

ముఖ్యంగా వరంగల్‌ లాంటి జిల్లాల్లో నీట మునిగిన ప్రాంతాలు, గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు నిత్యావసరాలు అందించడం మొదలుకుని తోచిన విధానంలో సాయం చేయాలని, ప్రభుత్వ యంత్రాంగానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement