
విశాఖ రుషికొండ పర్యటనలోనూ పుంగనూర్ తరహా మాస్టర్ ప్లాన్..
సాక్షి, విశాఖపట్నం: పుంగనూరు హింసాత్మక ఘటనతో రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీయాలనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్ర భగ్నం అయ్యింది. అంత ఉద్రిక్త పరిస్థితుల్లోనూ పోలీసులు సంయమనం పాటించి పరిస్థితిని చెయ్యి జారిపోకుండా అదుపు చేసుకున్నారు. ఈ తరుణంలో బాబు స్ఫూర్తితో ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాన్ ఇవాళ విశాఖ పర్యటనతో అలాంటి ఉద్రిక్తతలనే రాజేయాలని ప్రయత్నించారేమో అనిపించకమానదు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ్టి విశాఖ పర్యటనలో మామూలు ఓవరాక్షన్ చేయలేదు. ఎప్పటిలాగే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాదు.. నిబంధనలకు విరుద్ధంగా అభిమానులతో ర్యాలీ కూడా నిర్వహించాడు. ఎప్పటిలాగే పోలీసులతో సైతం వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే దిశగా పరిస్థితి మారింది. కానీ, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఇక నిబంధనలకు అనుగుణంగా రుషికొండపై నిర్మాణాలు జరుగుతుంటే.. ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఉన్న పవన్ ఇష్టానుసారం విమర్శలు చేసుకుంటూ పోయారు.
హడావిడి తప్ప ఏముంది?
పవన్ సేమ్ ఆరోపణలతో రుషికొండను గతంలోనూ పర్యటించాడు. మరి అప్పటికీ.. ఇప్పటికీ ఏం మార్పు వచ్చిందని నిలదీస్తున్నారు స్థానికులు. ఎందుకంటే పవన్ పర్యటన వల్ల ఇవాళ వాళ్లు బాగా ఇబ్బంది పడ్డారు కాబట్టి!. ఉదయం నుంచే తన పర్యటన అంటూ లీకులు ఇచ్చి.. జనసైనికుల్ని, అభిమానుల్ని గుమిగూడేలా చేశారు పవన్. ఇక సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చి.. హడావిడి చేసి వెళ్లాడంతే. ఈ క్రమంలో ఫ్యాన్స్, జనసైనిక్స్కు తప్ప పవన్ పర్యటన వల్ల ప్రజలకు ఒరిగిందేం లేదని, పైగా ఈ పర్యటనతో తాము ఇబ్బంది పడాల్సి వచ్చిందని జనం తిట్టుకుంటున్నారు.
ఇక పవన్ ఆదేశాలతో జోడిగుళ్లపాలం వద్ద జనసేన నేతల పేరిట కొందరు చేసిన హడావిడి అయితే మామూలుగా లేదు. ఏకంగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు వాళ్లు. ఇదిలా ఉంటే.. రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారంటూ ఇప్పటికే జనసేనానికి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే.
ఇదీ చదవండి: వారాహి యాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు