మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు: సచిన్‌ పైలట్‌ | Sachin Pilot Comments At Hyderabad Ahead Of Telangana Assembly Elections 2023, See Details Inside - Sakshi
Sakshi News home page

Sachin Pilot: మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు

Published Mon, Nov 27 2023 1:16 PM

Sachin Pilot Comments At Hyderabad Ahead Of assembly Polls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పొందిపరిచ్చిన గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని రాజస్థాన్‌  ఎమ్మెల్యే, ఏఐసీసీ జాతీయ నాయకులు సచిన్‌ పైలట్‌ తెలిపారు. తెలంగాణ యువత కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పారదర్శక పాలన అందిస్తామని పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌కు ప్రజల్లో మంచి స్పందన ఉందని.. రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంకా గాంధీల పర్యటనలకు మంచి స్పందన వస్తుందని సచిన్‌ పైలట్‌ తెలిపారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరలేదని, నిరుద్యోగం పెరిగి పోతుందని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. భారత్ జోడోయాత్ర ద్వారా తెలంగాణలో రాహుల్ గాంధీ  4 వేల కిలోమీటర్ల పాదయాత్ర  చేశారని గుర్తు చేశారు.

‘చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లతోపాటు పాటు తెలంగాణలోను కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 30వ తేదీ జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయాలి. కాంగ్రెస్‌కు  అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. బీఆరెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. వారికి క్రెడిబిలిటి లేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కర్ణాటక విజయం తరువాత జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితమే వస్తుంది. 

ఓట్ ఫర్ చేంజ్.. మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బహుమతిగా ఇవ్వండి. రాజస్థాన్‌లో  5 సంవత్సరాలకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉంది. సంప్రదాయాన్ని బ్రేక్ చేసి అక్కడ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్‌కు ఎలాంటి సహకారం ఇవ్వలేదు. ప్రజలు అర్ధం చేసుకున్నారు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. సీఎం అభ్యర్థి అనేది కాంగ్రెస్‌లో ఉండదు. అధిష్టానం సీఎంను సెలెక్ట్ చేస్తుంది.’ అని పైలట్‌ తెలిపారు

Advertisement
Advertisement