TS Assembly Top Stories
-
చివరి ప్రచార సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
సాక్షి, గజ్వేల్ : ‘నరేంద్రమోదీ దేశం మొత్తం 157 మెడికల్ కాలేజీలు పెట్టాడు. నేను 100సార్లు అడిగితే కూడా తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. జిల్లాకో నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టంలో ఉన్నా ఒక్కటి కూడా ఇయ్యలే. ఇలాంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకెయ్యాలి. మనమేమన్న పిచ్చిపోషి గాళ్లమా..మనం గొర్రెలం కాదని 30వ తేదీ నిరూపించాలి. మన మీద కుట్రలు చేసే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలో ఆలోచించాలి. ఏమియ్యకున్నా ఓటేస్తే మనల్ని గొర్రెలే అనుకుంటారు’ అని బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్లో జరిగిన చివరి ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ గెలిచేది లేదు సచ్చేది లేదు. ఒకవేళ గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నరు. ఆకలి చావుల ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి. నెహ్రూ, ఇందిర పాలనలో మంచి పనులు చేస్తే దళితులు ఇంకా ఇలా ఎందుకు ఉన్నారు కాంగ్రెస్ వస్తే ఆకలిచావులే. రైతుబంధు దుబారా అని ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతున్నడు. రైతులకు 3 గంటల కరెంట్ చాలని పీసీసీ అధ్యక్షుడంటున్నడు. 3 గంటల కరెంట్ కావాల్నా..24 గంటల కరెంట్ కావాల్నా’ అని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ‘ఫిబ్రవరి నెల వస్తే నాకు 70 ఏళ్లు వస్తాయి. తెలంగాణ తెచ్చిన కీర్తి నాకు చాలు. పదవులు వద్దు. ఇప్పటికే పదేళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. తెలంగాణ నెంబర్ వన్ కావాలన్నదే నా లక్ష్యం. ఈసారి బీఆర్ఎస్ గెలిస్తే గజ్వేల్ నియోజకవర్గంలో అందరికీ దళితబంధు ఇస్తాం. గజ్వేల్లో రెండుసార్లు గెలిపించారు. ఈసారి మళ్లీ ఆశీర్వదించండి. గజ్వేల్కు ఐటీ టవర్లు తెచ్చిపెట్టే బాధ్యత నాది. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పిస్తా. వారికి త్యాగం వెలకట్టలేనిది. వారికి నా కృతజ్ఞతలు. ట్రిపుల్ ఆర్ పూర్తయితే గజ్వేల్ దశ మారిపోతుంది’అని కేసీఆర్ తెలిపారు. ఇదీచదవండి..తెలంగాణ ఓటర్లకు సోనియాగాంధీ భావోద్వేగ సందేశం -
బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసే పనిచేస్తాయి: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు చివరి రోజు ప్రచారంలో కాంగ్రెస్ నేతలు స్పీడ్ పెంచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. నాంపల్లిలో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. నాంపల్లి సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘ప్రేమను పంచాలనే లక్ష్యంతో భారత్ జోడో యాత్ర చేశాను. బీజేపీ విభజన రాజకీయాలు చేసింది. మన దేశ సంస్కృతి ఇది కాదు. నాపై దేశవ్యాప్తంగా కేసులు పెట్టారు. నాపై పరువు నష్టం కేసు కూడా వేశారు. నా లోక్సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. నాపై 24 కేసులు ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఒవైసీపై ఎన్ని కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ఉంటాయి. ఒవైసీపై ఎందుకు ఉండవు. కాంగ్రెస్, బీజేపీ పోటీచేసే రాష్ట్రాల్లో.. మా ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం వస్తుంది. బీజేపీ ఇచ్చిన లిస్ట్తో తమ అభ్యర్థులను ఎంఐఎం ప్రకటిస్తుంది. బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయి. నేను మోదీతో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. కేంద్రంలో మోదీని ఓడించాలంటే.. తెలంగాణలో కేసీఆర్ను ఓడించాలి. హైదరాబాద్లో మెట్రో, ఎయిర్పోర్టు నిర్మించింది కాంగ్రెస్ హయాంలోనే. బైబై కేసీఆర్ అని చెప్పే సమయం వచ్చింది’ అని కామెంట్స్ చేశారు. -
BRS ధనిక పార్టీ.. డబ్బు ఎలా వచ్చింది: ప్రియాంక గాంధీ
సాక్షి, జహీరాబాద్: నేటితో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. ఈ క్రమంలో చివరి రోజు పార్టీల నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. జహీరాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా ప్రియాంక మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్ఎస్ ఏంచేసింది. ప్రశ్నాపత్నాలు లీక్ అయ్యాయి. ధరణితో రైతుల కష్టాలు పెరిగాయి. రుణమాఫీ పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదు. అధిక ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. బైబై కేసీఆర్.. మార్పు రావాలి. తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ప్రాజెక్ట్ల నిర్మాణంలో బీఆర్ఎస్ అవినీతి చేసింది. బీఆర్ఎస్ అత్యంత ధనిక పార్టీ. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కర్ణాటకలో మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం.. ఇక్కడ కూడా అమలు చేస్తాం’ అని అన్నారు. -
గెలిచినా, ఓడినా.. ప్రజల కోసమే పనిచేస్తా
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం రాజకీయ వారసురాలిగా ఆమె కోడలు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఇప్పుడు హుజూర్నగర్ నుంచి సీపీఎం అభ్యర్థీగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. మల్లు స్వరాజ్యం రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 40 ఏళ్ల తర్వాత అదే కుటుంబం నుంచి లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వివిధ అంశాలపై మాట్లాడారు. ఆమె మాటల్లోనే.. మహిళల సంక్షేమం, అభివృద్ధిపై వివక్ష.. మహిళా సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయి. పాలకులెవరైనా కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ మహిళల సంక్షేమానికి పాటుపడుతున్నామని చెబుతున్నాయే తప్ప ఆచరణలో పట్టించుకోవడం లేదు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. మల్లు స్వరాజ్యం కోడలిగా ఆమె చూపిన బాటలో నడుస్తున్నా. ప్రజా పోరాటాలు చేసినా, ప్రజాస్వామిక ఎన్నికల్లో పోటీ చేసినా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపించవచ్చనే ఆలోచనతోనే ఎన్నికల బరిలో నిలిచాను. గెలిచినా, ఓడినా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతా. మహిళల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా సమానత్వం, మహిళా సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తా. అత్తామామల ప్రోద్బలంతోనే.. మా అత్తామామ మల్లు స్వరాజ్యం, మల్లు వెంకటనర్సింహారెడ్డి, నా భర్త నాగార్జునరెడ్డి ప్రోత్సాహంతోనే ఇంతవరకు వచ్చాను. వివాహం అయ్యాక అత్తమామల ప్రోద్బలంతో కుటుంబాన్ని చూసుకుంటూనే చదువుకున్నా. డిగ్రీ, ఎల్ఎల్బీ పూర్తి చేశా. రాజకీయ అవగాహన ఉంది సీపీఎం అనుబంధ ప్రజా సంఘమైన ఐద్వాకు లీగల్ సెల్ కన్వీనర్గా పనిచేశా. ఐద్వా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశా. తెలంగాణ వచ్చిన తర్వాత ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి సీపీఎం తరఫున పోటీచేశా. పోరాటమే గెలిపిస్తుంది నిత్యం ప్రజల్లో ఉంటూ మహిళలు, కార్మిక సమస్యలపై పోరాడాను. సూర్యాపేట మండలం రాయినిగూడెం ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికయ్యాక, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు సాధించా. నల్లగొండలో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల రుణాలు, గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేశాను. పోలీసుల లాఠీచార్జ్లకు గురయ్యా.. జైలుకు వెళ్లా. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలపై పోరాడాను, ఏడు కిలోమీటర్లు పాదయాత్ర చేశా. నిరంతరం ప్రజల కోసం పోరాడా.. ఆ పోరాటమే నన్ను ఈ ఎన్నికల్లో గెలిపిస్తుందని ఆశిస్తున్నా. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి ఈ ఎన్నికల్లో గెలిస్తే ఉపాధిహామీ పనులను పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేసేలా కృషిచేస్తా. మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లో దాదాపు 30 వేల ఎకరాల్లో సాగుచేస్తున్న మిర్చి, పత్తి పంటలకు వాటికి సరైన మార్కెట్ సౌకర్యం లేదు. శీతల గిడ్డంగులు లేవు. హుజూర్నగర్లో మహిళా డిగ్రీ కళాశాల కావాలి. మండలానికి ఒక పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ ఉండాలి. సాగర్ ఎడమ కాలువ చివరి భూములకు నీరందడం లేదు. లిఫ్టులు సరిగా పనిచేయడం లేదు. పోడు భూములకు పట్టాలు లేవు. ఇలా నియోజకవర్గంలో అనేక అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆయా సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషిచేస్తా. - చింతకింది గణేశ్ -
తిట్లకు జామర్ను కనుగొనాల్సిన అవసరముంది!
‘‘డార్విన్ పరిణామ సిద్ధాంతమనేది రాజకీయాల్లో తిట్లక్కూడా వర్తిస్తుందేమో నాయనా’’ అంటూ విలక్షణమైన స్టేట్మెంట్ ఇచ్చారు స్వామీ ఎలక్షనానంద అలియాస్ స్వామీ సలక్షణానంద. ‘‘అదెలా స్వామీ?’’ అడిగాడు శిష్యుడు. ‘‘ఒకప్పుడు రాజకీయాల్లో విమర్శలుండేవి. తర్వాత అవి కువిమర్శలయ్యాయి, అటు తర్వాత తిట్లు, ఆపైన బూతులు..తాజాగా ఇప్పుడు బండబూతులు. అందుకే పరిణామ క్రమం ఒక్క జీవులకే కాదు... తిట్లకూ ఉందనిపిస్తోంది. అంతేనా..‘యథా తిట్లూ... తథా యాడ్స్’ అన్నట్టుగా కొన్ని పార్టీల ప్రకటనలైతే ఎదుటివాడిపై అరుస్తున్నట్టు..ప్రేక్షకుణ్ణి కరుస్తున్నట్టూ ఉన్నాయి నాయనా’’ ‘‘మొదట్లో అరే..ఒరే అని తిట్టుకుంటున్నవాళ్లు కాస్తా..ఈమధ్య అంతకంటే ఘోరంగా ముందుకెళ్తున్నారు. మొన్న కేటీఆర్ రేవంత్ను తిట్టాడనుకో. నిన్న మళ్లీ రేవంత్ కేసీఆర్ను తిడతాడు. ‘నీకంటే చాలా పెద్దవాడు కదా..కేసీఆర్ను అలా తిట్టడం సబబేనా?’ అని అడిగితే..‘మరి కేటీఆర్కూ నాకు మధ్య అంతే ఏజ్ గ్యాప్ ఉంది కదా. అప్పుడు నేను కేసీఆర్ను అనడం సమంజసమే కదా’ అంటూ జస్టిఫికేషన్లు ఇచ్చుకుంటూ మరీ తిట్టుకుంటున్నారు. ఇక మైనంపల్లి తిట్లయితే..తాజాగా తెగ వైరల్. పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది స్వామీ’’ అన్నాడు శిష్యుడు దిగులుగా. ‘‘అలనాడెప్పుడో ప్రఖ్యాత సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, తాను రాసిన ‘క–రాజు కథలు’ అనే అద్భుత కథాసంపుటిలోని ‘పలుకుబడి’ అనే కథలో ‘తిట్లు మంచివే’ అంటాడు. పైగా తిట్టేవాడెప్పుడూ (సమాజంలో) పై అంతస్తులో ఉంటాడట. తిట్టేవారికే అందరూ మద్దతు పలుకుతారట. అందుకే (విద్యార్థులు)అందరితోనూ తిట్లు తెగ ప్రాక్టీస్ చేయించాల్సిన అవసరముందనీ, ఎవరైతే తిట్లలో ప్రావీణ్యం సాధిస్తారో, వారి ‘పలుకుబడే’ రాజ్యంలో ఇంతింతై అన్నట్టుగా పెరుగుతుందని, దాదాపు పాతికేళ్ల కిందటే సెలవిచ్చారు. అదేదో యాడ్లో మరక మంచిదే అన్నట్టుగా... సింగీతం వారి సిద్ధాంతం ప్రకారం ‘తిట్లూ మంచివేనేమో’నంటూ సర్దుకుపోవాల్సిందే నాయనా’’ ‘‘అలా ఎలా అన్నారు సింగీతం వారు..తిట్లు మంచివెలా అవుతాయి స్వామీ?’’ ‘‘ఆ హాస్య కథల్లో వ్యంగ్యంగా అన్నమాట అది. ‘భాష రాకపోయినా సరే..బేరాలాడే సమయంలో సైగలతోనైనా సర్దుకుపోతారు ప్రజలు. కానీ బేరం కుదరక కోపం వచ్చిందనుకో..తిట్టుకుంటారూ, ఆపైన కొట్టుకుంటారు. ఇయ్యరమయ్యర కొట్టుకోవడం కంటే..పొట్టుపొట్టుగా తిట్టుకోవడం బెటరంటారు సింగీతం వారు. అలా తిట్టుకుని తాము సాధించిన ‘పై అంతస్తు’తో ఇగో చల్లారిపోయిందనుకో..దాంతో కొట్టుకోవడం ఆగిపోతే అది మంచిదేగా అని ఉద్బోధిస్తారు నాయనా. మనవాళ్లూ తెగ తిట్టుకుని అక్కడితో అలా ఆగిపోతున్నారుగా. కాబట్టి సింగీతం వారి సిద్ధాంతం ప్రకారం అది బెటరేగా’’ ‘‘అసలిలా ఇంతగా తిట్టుకోడానికి కారణం ఏమిటంటారు? ‘‘అదేదో సినిమా డైలాగ్ ఉంది కదా నాయనా. లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరని. దాని కోసమే ఇలా తిట్టుకుంటున్నట్టుంది. కానీ వీళ్లు గ్రహించాల్సిందేమిటంటే..ఎవడికి వాడు ఇదే లాస్ట్ పంచ్ అనుకుంటాడు తప్ప..ఆ లాస్ట్ అనేది ఎప్పటికీ రాదనీ, అదో చైన్ రియాక్షన్లా అలా సాగిపోతూనే ఉంటుందని ఎవరూ గ్రహించడం లేదు. అయినా పర్లేదులే ఇంకెంత..జస్ట్ రెండు రోజులేగా’’ ‘‘రెండ్రోజుల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి సరే..ముందుంది మొసళ్లపండగ అన్నట్టు..మున్ముందు ఎంపీ ఎలక్షన్లూ, ఆ పైన స్థానిక ఎన్నికలూ, అటు తర్వాత మున్సిపల్ ఎన్నికలూ..ఇలా ఎలక్షన్లూ, తిట్లూ ఎప్పటికీ ముగిసేవి కాదు స్వామీ. ఏం జరిగితే అవి ఆగుతాయో తెలియడం లేదు’’ బెంగగా అన్నాడు శిష్యుడు.‘‘అందుకే నాకనిపిస్తోంది నాయనా..బాంబులకు ఉన్నట్టే... బూతులకూ జామర్ కనుగొంటే బాగుండు’’ అంటూ తాను దిగులు పడ్డారు స్వామీ ఎలక్షనానంద. -
TS: ఊపు ఊపిన సోషల్ ప్రచారం
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్.. జనాలకు ఇదొక నిత్యవ్యవహారం(నిత్యావసరం!). కానీ, రాజకీయ పార్టీలకు, నేతలకు మాత్రం అవసరాన్ని బట్టి వాడకంగా మారింది. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో ఇది వాళ్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చే అంశం. త్వరగతిన ప్రజలకు చేరాలంటే సోషల్ మీడియాను మించిన వేగవంతమైన వేదిక వాళ్లకు మరొకటి కనిపించడం లేదు మరి. అందుకే.. అన్ని మాధ్యమాల్లో ఈసారి ఎన్నడూ లేనంతంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల Telangana Assembly Election 2023 కంటెంట్ వైరల్ అయ్యింది. నిస్సారంగా సాగుతున్న నేతల ప్రసంగాల నడుమ.. ఒక రకంగా ఎన్నికల సమరానికి ఊపు తెచ్చింది కూడా ఈ సామాజిక మాధ్యమ ప్రచారమే! సోషల్ మీడియా ప్రచారంలో నేతల ఊకదంపుడు ఉపన్యాసాలుంటేనే సరిపోదు. జనంలోకి దూసుకెళ్లే స్థాయిలోనే కంటెంట్లో దమ్ముండాలి. అయితే ఇక్కడ నేతల డిజిటల్ క్యాంపెయినింగ్పైనా ఎన్నికల సంఘం నజర్ ఉంటుంది. అభ్యర్థుల ఖర్చు పరిమితి రూ.40లక్షలు దాటకూడదని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉన్నాయి. కాబట్టి తమ ప్రచార ఖర్చులన్నింటిలోనే సోషల్ మీడియా నిర్వహణ కూడా ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత ఖాతాల నిర్వహణ.. వాటి కోసం ఎంత మంది పని చేస్తున్నారు.. వాళ్ల జీతభత్యాలు, ఇతర ఖర్చుల వివరాలు.. నేతల ప్రసంగాల్లో ఈసీ కోడ్ ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయా?.. నిశిత పరిశీలన ఉండాలి. అదే.. ఎన్నికల నిబంధనల్లో ఎక్కడా పార్టీల ఖర్చు పరిమితిపై ఆంక్షలు లేవు. దీంతో నేతల పేర్ల ప్రస్తావన తేకుండా.. పార్టీలను గెలిపించాలంటూ ప్రధానంగా సోషల్ మీడియా ప్రచారం ఉవ్వెత్తున సాగింది. పాటలు.. పదనునైన తూటాలు గులాబీల జెండలే రామక్క.. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి.. సాలు దొర, సెలవు దొర అంటూ.. ప్రకటనలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపాయి స్వరాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగేసేలా చేసి.. ఇక్కడి ప్రజల నరాల్ని ఉత్తేజితం చేసిన తెలంగాణ పాటకు ఇప్పుడు రాజకీయ రంగు పలుముకుంది. ఉద్యమ గాయకులు, జానపద కళాకారులుగా పేరొందిన ఎందరో.. పూర్తిగా పార్టీలకు ఆస్థాన గాయకులుగా పని చేశారు. పొగడ్తలు, విమర్శలతో.. విడివిడిగా, కలగలిపి రూపొందించిన పాటలు ఈసారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో Telangana Assembly Election 2023 ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్పెషల్ సాంగ్స్తో పాటుగా జానపద గేయాలకు.. ఆఖరికి సినిమా పాటల పేరడీలు సైతం జనాదరణతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. తెలంగాణ బ్యాక్డ్రాప్తో జబర్దస్త్ ఫేమ్ వేణు డైరెక్ట్ చేసిన బలగం సినిమాను సైతం.. ఏ నేత వదలకుండా ‘ప్రజలే మా బలగం’ అంటూ పోస్టర్లు వదిలారు. ఇంటర్వ్యూల పర్వం.. వయసు తారతమ్యాలు లేకుండా యూట్యూబ్కు ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యం ఉంటోంది. ఫుల్ వీడియోలతో పాటు షార్ట్ వీడియోలపై ఎక్కువ స్క్రీన్ టైం గడిపేస్తున్నారు. అందుకే యూట్యూబ్ ప్లాట్ఫామ్ను తమ ప్రచారం కోసం వాడేసుకున్నాయి పొలిటికల్ పార్టీలు. రాజకీయ మేధావులు, ప్రముఖ జర్నలిస్టులతో పాటు అటు జాతీయస్థాయిలో.. ఇటు స్థానికంగానూ జనాల నోళ్లలో ఎక్కువగా నానుతుండే యూట్యూబర్లు, బుల్లి తెర నుంచి జనాలకు ఎక్కువగా పరిచయమున్న వాళ్లు.. రాజకీయ నేతల్ని ఇంటర్వ్యూలు చేశారు. లీడర్లు సైతం తమ ప్రచారానికి ఉపయోగపడే రీతిలో ఉండేలాగానే ఆ ఇంటర్వ్యూల్ని ప్లాన్ చేయించుకోవడం గమనార్హం. ఈ విషయంలో ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదురైనా సరే నేతలు తేలికగా తీసుకున్నారు. డిజిటల్ ఫ్లాట్ఫామ్ ఇంటర్వ్యూలలో పాడ్కాస్ట్, రేడియోలను సైతం వదల్లేదు. వ్యక్తిగత దూషణలు ఈసారి తెలంగాణలో ప్రధాన పార్టీల కీలక నేతల ప్రచారాల ప్రసంగాల్లో పెద్దగా ప్రత్యేకత ఏం కనిపించలేదు. సామెతలు, పిట్ట కథలతో సమాజాన్ని ఆకట్టుకునే కేసీఆర్ సైతం.. ప్రతిపక్షాలపై సాధారణ విమర్శలతోనే సరిపెట్టారు. అయితే వ్యక్తిగత విమర్శల పర్వం మాత్రం షరా మామూలుగా కొనసాగింది. ‘‘చిప్పకూడు తిన్న సిగ్గు రాలే..!!’’ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని ఉద్దేశించి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బక్కోడు భూబకాసరుడు అంటూ కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు.. ఓ మోతాడు డోసుతో సాగింది విమర్శల పర్వం. బడా-చోటా నేతలు ప్రచారంలో విమర్శలు-ప్రతివిమర్శలకు దిగి ఎన్నికల సమరాన్ని హీటెక్కించారు. రాజకీయ ప్రసంగాలు సాదాసీదాగా సాగినప్పటికీ.. అక్కడక్కడ మాత్రం ఆ విమర్శలు బూతుల దాకా వెళ్లాయి. ఉదాహరణకు.. మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్న ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్.. టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ కండువా కప్పేసుకుని కేసీఆర్పైనే వ్యక్తిగత దూషణలకు దిగారు. మైనంపల్లి, మల్లారెడ్డిల మధ్య విమర్శలైతే ఒక పరిధిని దాటాయి. ఇక.. పార్టీల మధ్య దూషణలు, విమర్శలు తీవ్రతరమై యాడ్స్ రూపేణా కనిపించడంతో ఎన్నికల సంఘం కలుగజేసుకుని చర్యలతో వాటిని కట్టడి చేసింది. Credits: Nenu Mari Antha Yedvanaaaa Insta Page ఇదేందయ్యా ఇది.. ఇది ఊహించలే! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు Telangana Assembly Election 2023 ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇదే. సాధారణంగా.. నేతలు తమ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలలో, పార్టీలు తమ అధికారిక పేజీలలో.. ఇవేగాక ఫలానా నేతల ‘సైన్యం’(ఆర్మీ) పేరిట పేజీలు, ఫ్యాన్ మేడ్ హ్యాండిల్స్ ఉండనే ఉన్నాయి. అయితే అదేం విచిత్రమో.. నిత్యం సినిమా డైలాగులు, ఫన్నీ సీన్ల ఫొటోలతో మీమ్స్ వేసి ఫాలోవర్లకు వినోదం పంచే సోషల్ మీడియా పేజీలు సైతం పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఫలానా పేజీ ఫలానా రాజకీయ పార్టీకి.. వకాల్తా పుచ్చుకుని మరీ పోస్టింగ్లు చేశాయి. ప్రభుత్వ, పార్టీ విజయాలపై లబ్ధిదారులతో ప్రచారం. ఈసారి వ్యహారమంతా పార్టీల పరాజయాలపై పోస్టులు. నేతల స్పీచ్లలోని తప్పులు.. చేష్టలపై మీమ్స్.. ట్రోల్స్ ఇలా నడిచింది. ఆఖరికి.. పార్టీల మేనిఫెస్టోలను కూడా సోషల్ మీడియా పేజీలు ప్రచారం చేశాయంటే ఈసారి సోషల్ ప్రచారం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 29ఏళ్ల లోపు ఓటర్లు 72లక్షల మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 10 లక్షల మంది 18-19 వయసులో(కొత్త ఓటర్లు) ఉన్నవాళ్లు ఉన్నారు. ఇక 30పైబడిన వాళ్లలోనూ సామాజిక మాధ్యమాలలో టైంపాస్ బాపతు ఎక్కువే ఉన్నారు. వీళ్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే.. ఇలాంటి పేజీలను పొలిటికల్ పార్టీలు తమ ఆధీనంలోకి తీసుకుని ఉంటాయనేది స్పష్టంగా తెలుస్తోంది. ట్రెండింగ్లో హెలికాఫ్టర్ ఎక్కడో ఆదిలాబాద్లో పార్టీ ప్రచార సభలో మాట్లాడిన నేత.. గంటన్నర తర్వాత సంగారెడ్డి మీటింగ్లో కనిపిస్తారు. ఆ తర్వాత గంటకు ఎక్కడో నల్లగొండ బహిరంగ సభలో ప్రసంగిస్తుంటారు. వందల కిలోమీటర్ల దూరం.. వాయువేగంతోనే వెళ్తే సాధ్యమవుతుంది కదా!. అలా ఈసారి ఎన్నికల్లో నేతల హెలికాఫ్టర్ల వాడకం ఎక్కువగా కనిపించింది. ప్రధాన పార్టీల అగ్రనేతలు మాత్రమే కాదు.. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నవాళ్లూ, కీలక నేతలు, ఓ మోస్తరు నేతలు సైతం విమానల్లో చక్కర్లు కొట్టేశారు. అదే సమయంలో.. రెంట్కు హెలికాఫ్టర్లను అందించే కంపెనీలకైతే ఫుల్ గిరాకీ నడిచింది. అలా హెలికాఫ్టర్ ట్రెండ్ కూడా సోషల్ మీడియాకు ఎక్కింది. బర్రెలక్క నాగర్ కర్నూల్ పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల కర్నె శిరీష.. ‘బర్రెలక్క’గా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ ఇప్పుడు. స్వతంత్ర అభ్యర్థినిగా నాగర్ కర్నూల్ బరిలో నిలిచిన శిరీష గురించి మీడియా, సోషల్ మీడియా విపరీతంగా చర్చించింది. చాలాకాలం కిందట.. డిగ్రీ చదివి కూడా నిరుద్యోగిగా ఉన్నానంటూ ఉద్యోగాల నోటిఫికేషన్.. నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ బర్రెలను మేపుతూ సరదాగా వీడియో అప్లోడ్ చేసి ‘బర్రెలక్క’ ఫేమస్ అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నామినేషన్ వేయడం.. ప్రచారం చేసుకునేందుకు సైతం డబ్బులు లేవంటూ సోషల్ మీడియాలో విజ్ఞప్తులు.. ఆ వీడియోకు నిరుద్యోగ యువత కదిలివచ్చి చందాలేసుకుని మరీ ఆమె కోసం ప్రచారంలోకి దిగడం.. గుర్తుతెలియని వర్గం ఆమె బృందంపై దాడి చేయడం.. కన్నీళ్లతో ఆమె మాట్లాడిన మాటలు.. ఆ వెంటనే ఆమె లభించిన మేధోవర్గాల, కొందరు రాజకీయ నేతల మద్ధతు.. హైకోర్టు ఆదేశాలతో గన్మెన్ సెక్యూరిటీ.. ఈ పరిణామాలన్నింటిని నడుమ సోషల్మీడియాలో ఆమెకు విపరీతంగా పెరిగిన సానుభూతి రప్పించి ఈ దఫా ఎన్నికల్లో ఈమె గురించి చర్చించుకునేలా చేశాయి. ఇవేకావు తమ నియోజకవర్గ ఓటర్లు ఏ ప్రాంతంలో ఉన్నా.. ఫోన్లు చేసి, మెసేజ్లు పంపి మీటింగ్లకు రమ్మని ఆహ్వానాలు పంపడం. వాట్సాప్లో సందేశాలు.. ఒక అడుగు ముందుకేసి రాజకీయ ప్రత్యర్థుల అవినీతి-అసమర్థతలను ఎండగట్టే రీతిలో రూపొందించిన కరపత్రాల పంపిణీ.. ఫేక్ ప్రచారాలు వాటిని ఖండిస్తూ వచ్చిన ఫ్యాక్ట్ చెకింగ్ కౌంటర్లు.. ఇలా షరామాములుగానే కనిపించింది. నవంబర్ 28 సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో కథనం -
కాంగ్రెస్వాళ్లే రైతుబంధు ఆపారు: కేసీఆర్
సాక్షి, షాద్నగర్: కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ బాధలే. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలని ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. సోమవారం సీఎం కేసీఆర్ షాద్నగర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. ‘ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి వారో అన్నీ చూసి ఓటు వేయాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నాం. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయ్యాలి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పెన్షన్ రూ.5వేలు వరకు ఇస్తాం. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తారట. ధరణి స్థానంలో భూమాత తెస్తామంటున్నారు. కాంగ్రెస్ వాళ్లే రైతుబంధును ఆపారు. కాంగ్రెస్లో కూడా రైతుబంధు తీసుకున్న నేతలు, కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్లకు సిగ్గు ఉందా?. రైతుల నోటికాడ బుక్క గుంజుకుంటారా?. షాద్నగర్ వరకు మెట్రో తెచ్చే బాధ్యత నాది. షాద్నగర్కు మెట్రో వస్తే.. ఇక్కడ భూముల ధరలు మూడింతలు పెరుగుతాయి. రైతుబంధు ఆపేస్తే కాంగ్రెస్ వాళ్లకు కూడా నష్టమే. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతోనే రైతుబంధును ఈసీ నిలిపివేసింది. పాలమూరు ఎత్తిపోతలు పూర్తి కాకుండా కాంగ్రెస్ వాళ్లే స్టేలు తెచ్చారు’ అంటూ విమర్శలు చేశారు. తెలంగాణను ఊటగొట్టిన పార్టీ కాంగ్రెస్.. తెలంగాణను ఊటగొట్టిన పార్టీ కాంగ్రెస్ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ చరిత్ర ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణను సాధించేందుకే ఈ పార్టీ పుట్టిందని గుర్తు చేశారు. ఓటు తలరాతను మారుస్తుందని పేర్కొన్నారు. ఆచితూచి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఆందోల్లో నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. పార్టీల చరిత్ర, అభ్యర్థుల చరిత్రను గమనించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. ప్రజల హక్కులను కాపాడే పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత పెన్షన్లు రూ.5వేలకు పెంచామని తెలిపారు. కంటి వెలుగు వంటి మంచి కార్యక్రమాలతో అభివృద్ధి దిశగా నడిచామని స్పష్టం చేశారు. -
మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు: సచిన్ పైలట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందిపరిచ్చిన గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని రాజస్థాన్ ఎమ్మెల్యే, ఏఐసీసీ జాతీయ నాయకులు సచిన్ పైలట్ తెలిపారు. తెలంగాణ యువత కాంగ్రెస్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పారదర్శక పాలన అందిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్కు ప్రజల్లో మంచి స్పందన ఉందని.. రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంకా గాంధీల పర్యటనలకు మంచి స్పందన వస్తుందని సచిన్ పైలట్ తెలిపారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరలేదని, నిరుద్యోగం పెరిగి పోతుందని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. భారత్ జోడోయాత్ర ద్వారా తెలంగాణలో రాహుల్ గాంధీ 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ‘చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లతోపాటు పాటు తెలంగాణలోను కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 30వ తేదీ జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేయాలి. కాంగ్రెస్కు అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. బీఆరెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. వారికి క్రెడిబిలిటి లేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కర్ణాటక విజయం తరువాత జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితమే వస్తుంది. ఓట్ ఫర్ చేంజ్.. మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బహుమతిగా ఇవ్వండి. రాజస్థాన్లో 5 సంవత్సరాలకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉంది. సంప్రదాయాన్ని బ్రేక్ చేసి అక్కడ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్కు ఎలాంటి సహకారం ఇవ్వలేదు. ప్రజలు అర్ధం చేసుకున్నారు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. సీఎం అభ్యర్థి అనేది కాంగ్రెస్లో ఉండదు. అధిష్టానం సీఎంను సెలెక్ట్ చేస్తుంది.’ అని పైలట్ తెలిపారు -
ఐటీ పార్కుల్లో మతం ఎక్కడిది?.. కేటీఆర్పై కిషన్ రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో ఓడిపోతున్నారని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఈ రెండు చోట్లా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణకు ప్రమాదకరమని సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సూటుకేసుల ప్రభుత్వం వస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణను పాలించిన తీరు, కేంద్రంలో బీజేపీ పాలన తీరును బేరీజు వేసుకుని ఓటు వేయండి. మోదీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయి. కేసీఆర్ పోటీ చేసిన రెండు చోట్లలో ఓడిపోతారు. బీజేపీ అక్కడ విజయం సాధిస్తుంది. కామారెడ్డిలో కేసీఆర్ను గెలిపించడానికి రేవంత్ రెడ్డి పోటీచేస్తున్నారు. తెర వెనుక బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. బీజేపీ కమిట్మెంట్ను మ్యానిఫెస్టో రూపంలో తెలంగాణ ప్రజల ముందు పెట్టాం. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేదు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్, కేసీఆర్ మైనార్టీలకు ఇచ్చిన హామీలు ఒక్కటే. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడి హామీలు ఇస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన హామీలు ఇస్తున్నారు.. ముస్లిం సమాజం అర్థం చేసుకోవాలి. ఐటీ పార్కుల్లో మతం ఎక్కడిది?. ముస్లీం ఐటీ టవర్స్ కట్టడం ఏంటి?. సాప్ట్ వేర్ రంగంలో కూడా కేటీఆర్ మతాన్ని జోప్పిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో పాతబస్తీ ఎందుకు అభివృద్ధి చేయలేదు?. ఇన్నాళ్లు పాతబస్తీ యువతకు ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించలేదు. పాతబస్తీలో అక్షరాస్యత శాతం ఎందుకు తక్కువగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒవైసీ కుటుంబానికి అండగా ఉన్నాయి తప్ప.. సామాన్య ముస్లీం సమాజానికి ఏం చేయలేదు. ఒవైసీ కుటుంబం శాసిస్తే కేసీఆర్ ఏదైనా చేస్తారు. పాతబస్తీ ప్రజలు చదువుకుంటే ఒవైసీ కబంధ హస్తాల నుంచి బయటకు వస్తారని అక్షరాస్యత పెంచకుండా చూస్తున్నారు. పాతబస్తీకి మెట్రో వసతి ఎందుకు కల్పించలేకపోయారు. దారుసలాంను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం దారాదత్తం చేసింది’ అంటూ విమర్శించారు. -
తెలంగాణ ఎన్నికలు.. సీఈవో వికాస్రాజ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సీఈఓ వికాస్రాజ్ కీలక కామెంట్స్ చేశారు. బ్యాలెట్ ఓట్ల వివరాలను కూడా ఆయన వెల్లడించారు. ఈసారి బ్యాలెట్ ఓట్లు భారీగా పెరిగినట్టు తెలిపారు వికాస్ రాజ్. కాగా, రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై ఆదివారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో మాట్లాడుతూ.. శనివారం నాటికి 1,24,239 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. గత శాసనసభ ఎన్నికల్లో మొత్తంగా 1,00,135 పోస్టల్ బ్యాలెట్లే నమోదుకాగా.. ఈసారి భారీగా పెరుగుతున్నాయి. ∙కొత్త ఓటర్ల కోసం ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ పూర్తయింది. ఈ ఏడాది 54.39 లక్షల కార్డులను ముద్రించారు. ఇంకా 3 లక్షల కార్డులను బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ) ద్వారా పంపిణీ చేయాల్సి ఉంది. ∙ 119 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అందులో 2,068 మంది పురుషులు, 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్జెండర్ ఉన్నారు. ∙మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 31 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నాలుగు చొప్పున కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ∙ఎన్నికల్లో 1.85 లక్షల మంది పోలింగ్ సిబ్బంది, 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. బీఎల్ఓలను కలుపుకొంటే మొత్తం 2.5లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల బందోబస్తు కోసం 45వేల మంది రాష్ట్ర పోలీసులు, 3 వేల మంది అటవీ, ఎక్సైజ్శాఖ సిబ్బందితోపాటు 50 కంపెనీల టీఎస్ఎస్పీ, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించనున్నారు. ∙కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రల నుంచి 5 వేల మంది చొప్పున, మధ్యప్రదేశ్, తమిళనాడుల నుంచి 2 వేల చొప్పున, ఛత్తీస్గఢ్ నుంచి 2,500 మంది కలిపి.. మొత్తంగా 23,500 మంది హోంగార్డులు రాష్ట్ర ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. -
రెండున్నర లక్షల ఓట్లు.. ఆర్టీసీ ఉద్యోగులు ఎటు వైపో?
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో ‘ఆర్టీసీ ఓటర్లు’ కీలకంగా మారబోతున్నారు. ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యో గులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల వరకు ఓట్లున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో వారి సంఖ్య అధికంగా ఉంది. నగరంలోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో 10 వేల వరకు ఉన్నాయి. ఇలాంటి నియోజకవర్గాలు మరికొన్ని ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో అంతగా లేనప్పటికీ, వేలల్లోనే ఉండటం విశేషం. ప్రస్తుతం ఆర్టీసీలో 43 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు దాదాపు 20 వేలమంది ఉన్నారు. వారి కుటుంబాలకు సంబంధించి దాదాపు 2.43 లక్షల ఓట్లు ఉన్నట్టు అంచనా. గత రెండు ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారు. ఈసారి వారి ఓట్లను సాధించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా యత్నిస్తోంది. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ వారి ఓట్లు తనకే అధికంగా వస్తాయని ఆ పార్టీ నమ్మకంగా ఉంది. చదవండి: ‘ప్రజల తెలంగాణ’ కల నిజం చేస్తాం ప్రచారంలో ఆర్టీసీ ప్రస్తావన.. నష్టాల్లో కూరుకుపోయి దివాలా దిశలో ఉన్న ఆర్టీసీని ఆదుకుని తిరిగి నిలబెట్టిన ఘనత తమదే అని బీఆర్ఎస్ నేత లు ప్రచారం చేస్తున్నారు. దీనికి కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం వంచించిందని, వారికి అందాల్సిన దీర్ఘకాలిక బకాయిలను కూడా చెల్లించక ఇబ్బంది పెడుతోందని చెబుతోంది. బస్సుల సంఖ్య తగ్గించి ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని, తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఆర్టీసీలో నియామకాలే చేపట్టలేదని, ఫలితంగా ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని పేర్కొంటోంది. ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు రుణాలు ఇస్తూ ఉపయోగపడే సహకార పరపతి సంఘం నిధులు వాడేసుకుందని, సంస్థకు ప్రభు త్వం నుంచి నిధులు రాక సహకార పరపతి సంఘం మూతపడబోతోందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ప్రభుత్వంలో విలీనం చేయటం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు అందబోతున్నాయని బీఆర్ఎస్ చెప్తోంటే, విలీనం పేరుతో కాలయాపన చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క నెల కూడా వేతనాలు అందించలేకపోయిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. బీజేపీ కూడా ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి మద్దతుగా ఉద్యోగులు బీఆర్ఎస్కు అండగా నిలుస్తారో, ఏళ్లు గడుస్తున్నా బకాయిలు చెల్లించకపోవటం, సీసీఎస్ను నిర్వీర్యం చేయటం, నియామకాలు లేకపోవటాన్ని పరిగణనలోకి తీసుకుని వేరే పార్టీలకు మద్దతుగా నిలుస్తారో వేచి చూడాలి. -
కాంగ్రెస్కు ఒక్క చాన్స్ ఇవ్వండి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/పటాన్ చెరు/గచ్చిబౌలి (హైదరాబాద్): తాను ఓడిపోతే రెస్ట్ తీసుకుంటామని చెబుతున్న సీఎం కేసీఆర్ను ఫామ్ హౌస్కే పరిమితం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. ఓటమి తప్పదని తెలిసే కేసీఆర్ ఇలా అంటున్నారని చెప్పారు. తదాస్తు దేవతలు ఉన్నారని, వారంలోనే ఆయన మాట నెరవేరనుందన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు సీఎంగా కేసీఆర్కు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వండి. ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తాం’అని చెప్పారు. ఇవి సెమీఫైనల్ ఎన్నికలని, రాష్ట్రంలో ప్రజలందరి సహకారంతో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దీంతో 2024లో ఢిల్లీ ఎర్రకోటలో తిరంగా జెండా ఎగుర వేయడానికి మార్గం సుగమవుతుందని, మోదీని ఇంటికి పంపిస్తామన్నారు. రేవంత్ ఆదివారం హైదరాబాద్లోని గచ్చిబౌలి, పటాన్చెరు, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్నగర్లో నిర్వహించిన ప్రచార సభల్లో మాట్లాడారు. ‘ఈ బకాసురుడికి రూ. లక్ష కోట్లు దోచినా చాలట్లేదు. ధరణి పేరుతో రాష్ట్రంలో పదివేల ఎకరాలు మింగాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఎక్కడ దాక్కున్నా తోకబట్టి ఈడ్చుకొచ్చి రూ.లక్ష కోట్లను కక్కిస్తాం. సీఎం కేసీఆర్కు చర్లపల్లి జైల్లోనే డబుల్ బెడ్రూం నిర్మిస్తాం.. దోపిడీలో భాగమైన కొడుకు, బిడ్డ, అల్లుడికీ చోటు కల్పిస్తాం’అని వ్యాఖ్యానించారు. పాలమూరు బిడ్డ సంతకంతోనే.. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నా కేసీఆర్ ఏనాడూ పాలమూరును పట్టించుకోలేదని రేవంత్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పూర్తిచేసే బాధ్యత కాంగ్రెస్దని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో పాలమూరు బిడ్డను గెలిపించుకోకుంటే మళ్లీ గుంపు మేస్త్రీలు సంతల్లో పశువుల్లా వలస తీసుకెళ్లే పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్లో శషబిషలు, గ్రూపులు, గుంపులు లేవన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై ఎవరైనా చేయిచేసుకుంటే వారి గుడ్లు పీకి గోళీలు ఆడతానని హెచ్చరించారు. రాష్ట్రంలోని 119 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎంతోమంది పెద్దవాళ్లు, ఉద్దండులున్నా పాలమూరు బిడ్డ సంతకంతోనే పోటీలో నిలుస్తున్నారని, ఇది పాలమూరు గడ్డ గొప్పతనమని చెప్పారు. పాలమూరు బిడ్డలు నాటిన మొక్కను నరికేందుకు ఢిల్లీ నుంచి మోదీ, గల్లీ నుంచి కేడీ, కేటీఆర్, హరీశ్ గొడ్డళ్లు పట్టుకుని వస్తున్నారని, పాలమూరు బిడ్డలు చైతన్యంతో ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు. మూడోసారి మనవడికి ఇస్తారా? కేసీఆర్ మూడోసారి గెలిపించాలని కోరుతున్నారని, ఇప్పటికే తాను సీఎం అయి, కొడుకు, అల్లుడిని మంత్రులను చేశారని, సంతోష్రావును ఎంపీగా చేశారని, నిజామాబాద్లో నేలకేసికొడితే బిడ్డను మళ్లీ ఎమ్మెల్సీని చేశారని, ఈసారి గెలిస్తే మనవడిని మంత్రి చేస్తారని రేవంత్ వ్యాఖ్యానించారు. లక్కీ నెంబర్ ఆరు లాగా మనవడు మంత్రి అయ్యాడంటే అందరికీ పదవులొచ్చినట్లవుతుందని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ 17 పరీక్షలను నిర్వహించి పల్లీలను అమ్మినట్లు పరీక్ష పేపర్లను అమ్మి మోసం చేసిందని, నిరుద్యోగులంతా కేసీఆర్కు బుద్ధి చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని చెప్పారు. కార్యక్రమాల్లో యెన్నం శ్రీనివాస్రెడ్డి (మహబూబ్నగర్), పరి్ణకారెడ్డి (నారాయణపేట), జి.మధుసూదన్రెడ్డి (దేవరకద్ర), జగదీశ్వర్గౌడ్ (శేరిలింగంపల్లి), కాట శ్రీనివాస్ గౌడ్ (పటాన్చెరు) పాల్గొన్నారు. -
పేదరికం లేని తెలంగాణే నా పంతం
నాకు తెలంగాణ తీసుకువచ్చిన ఘనతే ఆకాశమంత పెద్దది. దానికి మించిన పదవి ఉందా? రెండుసార్లు సీఎంగా పనిచేసిన. పదేళ్లు సీఎంగా ఉన్నా. ఇక్కడ నా కంటే ఎక్కువకాలం పదవిలో ఉన్న సీఎం ఉన్నడా? 70 ఏళ్లొచ్చాయి. ఇంతకంటే జీవితంలో ఇంకేం కావాలి? పేదరికంలేని తెలంగాణే నా పంతం. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, సిద్దిపేట/ఖానాపూర్: పేదరికం లేని తెలంగాణ తన పంతమని.. కేరళ తరహాలో వందశాతం అక్షరాస్యత, నిరంతరం తాగునీరు, ప్రతీ ఇంచుకు సాగునీరు రావాలనేదే తన లక్ష్యమని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. రైతాంగం గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోయే తెలంగాణ కావాలని.. దానికోసమే తాను తండ్లాడుతున్నానని, పదవి కోసం కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే దళారీ రాజ్యం వస్తుందని, తెలంగాణ ఆగమైపోతుందని వ్యాఖ్యానించారు. ఆదివారం జగిత్యాల, వేములవాడ, దుబ్బాక, ఖానాపూర్ నియోజకవర్గాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఎన్నికలనగానే ఆగమాగం కావొద్దు. అభ్యర్థులు, పార్టిల చరిత్ర చూసి ఓటేయాలి. అసలు ఉన్న తెలంగాణను ఊడగొట్టి, ఆంధ్రాల కలిపిందే కాంగ్రెస్ పార్టీ. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో ఏడుగురు తెలంగాణ యువకులను కాల్చిచంపారు. తర్వాత 58 ఏళ్లు గోస పడ్డాం. రాష్ట్రం వచ్చా క సంక్షేమానికి పెద్దపీట వేసుకున్నాం. రూ.200 పింఛన్లను రూ.2,000 చేసుకున్నం. మళ్లీ గెలిస్తే దాన్ని రూ.5 వేలు చేసుకుందాం. రైతుబంధు సాయాన్ని రూ.16వేలు చేసుకుందాం. నీటి తీరువా రద్దు చేసి, 24 గంటల కరెంటు ఇస్తున్నాం. కల్యాణలక్ష్మి, అమ్మ ఒడి, ఉచిత ప్రసవాలు, కేసీఆర్ కిట్, రైతుబీమా, పల్లె–బస్తీ దవాఖానాలు, వంద పడకల ఆస్పత్రు లు, మెడికల్ కాలేజీలు ఇలా ఎన్నో చేసుకున్నం. ఇవన్నీ కాంగ్రెస్ వారు ఎందుకు చేయలేకపోయారు ? ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారు. ఎమర్జె న్సీలు, యువతను జైల్లో పెట్టడమేనా ఇందిరమ్మ రాజ్యమంటే? ఆమె పాలనలోనే కదా జగిత్యాల, సిరిసిల్లను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది. కాంగ్రెస్ నేతల అసమర్థత వల్లే.. గులాబీ పార్టీ సామర్థ్యాన్ని శంకించిన నాటి మంత్రి ఎమ్మెస్సార్ ముఖం మీద రాజీనామా విసిరికొట్టా ను. అప్పుడు 2.5 లక్షల మెజార్టితో కరీంనగర్ ప్రజ లు గెలిపించారు. కాంగ్రెస్ నాయకుల అసమర్థత వల్లే తెలంగాణ చాలా ఏళ్లు దుఃఖపడింది. నాడు సీఎం కిరణ్కుమార్రెడ్డి తెలంగాణకు ఒక్క రూపా యి ఇవ్వనన్నప్పుడు ఒక్కరూ నోరు తెరవలేదు. కాంగ్రెస్ వాళ్లది.. భూమేత! అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతుబంధు, రైతు బీమా, ఎమ్మెస్పీ ధరలకు వరి ధాన్యం కొనుగోలుకు మూలం ధరణి. దాని స్థానంలో కాంగ్రెస్ వాళ్లు తెచ్చేది భూమాత కాదు.. భూమేత. మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది. కాంగ్రెస్ వాళ్లు కౌలుదారు చట్టం చేస్తరట. అలా చేస్తే రైతులు చిప్పపట్టుకుని తిరగాలి. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధు వృథా అంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రైతులకు 3 గంటల కరెంటు చాలంటున్నారు. కాంగ్రెస్ అంటేనే రైతుల పాలిట శని. ప్రజలు ఆలోచించి ఓటేయాలి. అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం బీఆర్ఎస్ సర్కారు అసైన్డ్ భూములను లాక్కుంటోందని బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. అది అవాస్తవం. మేం మళ్లీ అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి 100 ఉత్తరాలు రాసినా ఇవ్వలేదు. అలాంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దు. వేస్తే మోరీలో పడేసినట్టే. తండాలను పంచాయతీలు చేశాం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే తండాలను పంచాయతీలుగా చేసి గిరిజనుల కల సాకారం చేశాం. గిరిజనుల ఆత్మగౌరవ ప్రతీకగా బంజారాహిల్స్లో బంజారా భవన్తోపాటు పక్కనే కుమురంభీం భవన్ నిర్మించాం. పోడు పట్టాలిచ్చాం, వాటికి రైతుబంధు, రైతుబీమా కూడా వర్తింపజేస్తున్నాం. కాంగ్రెస్వన్నీ వట్టి మాటలే. బీఆర్ఎస్ భయంకరమైన మెజార్టితో గెలుస్తోంది..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జగిత్యాలలో డాక్టర్ సంజయ్కుమార్, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావు, ఖానాపూర్లో జాన్సన్ నాయక్ను గెలిపించాలని కోరారు. వేములవాడ ముఖచిత్రం మారుస్తా.. వేములవాడతో నాది ప్రత్యేక అనుబంధం. ఇక్కడి రాజన్న గుడిలోనే నా వివాహం జరిగింది. కోర్టు కేసుల కారణంగా ఎమ్మెల్యే రమేశ్బాబును మార్చాల్సి వచ్చింది. వేములవాడ ముఖచిత్రం మార్చే బాధ్యత నాది. ఇక్కడి మూలవాగు, తల్లికోట సూరమ్మ ప్రాజెక్టులను అభివృద్ధి చేసుకుందాం. మల్కపేట రిజర్వాయర్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. జగిత్యాల జిల్లాను కరీంనగర్ తరహాలో అభివృద్ధి చేసుకుందాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంజూరు చేసుకుందాం. -
రిస్క్ వద్దు !
సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. తెలంగాణను ఎన్నో రెట్లు అభివృద్ధి చేసుకున్నాం. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ నీళ్లిచ్చాం. 24 గంటల కరెంటు ఇచ్చాం. 69 లక్షల మంది రైతులకు రైతుబంధు, 47లక్షల మందికి ఆసరా పింఛన్లు, 1.10 లక్షల మందికి రైతుబీమా, 13.50 లక్షల మందికి కల్యాణలక్ష్మి లబ్ధి చేకూర్చాం. వెయ్యి రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకొచ్చాం. అక్షరాస్యత 15 నుంచి 20 శాతం పెరిగింది. ఇవన్నీ కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ సీఎంగా ఉండాల్సిన అనివార్యత ఉంది. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు విని రిస్క్ తీసుకోవద్దని చెబుతున్నాం’ అని బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వివరించారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సాక్షిటీవీ లైవ్షోలో ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే... కర్ణాటక వైఫల్యాల ప్రచారం ఆత్మరక్షణకు కాదు కర్ణాటక ఇచ్చే ప్రకటనలన్నీ అబద్ధం. యువశక్తి అని యాడ్ ఇచ్చారు. అక్కడ ఉద్యోగాలు ఇచ్చారా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. బస్సులు కూడా లేకుండా చేశారు. 10 కిలోల ఉచితబియ్యం అని 5 కిలోలు ఇస్తున్నారు. కర్ణాటకలో జరుగుతున్న విషయాలను చెపుతున్నాం. కర్ణాటక మోడల్ అంటే 3 గంటల కరెంటు, రైతుబంధు తొలగింపు, నోటిఫికేషన్లు ఇవ్వకపోవడమా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కర్ణాటక ప్రకటనలు ఇవ్వటం ఎందుకు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కావొద్దు బీఆర్ఎస్ ప్రజల పార్టీ. బీజేపీ కార్పొరేట్ పార్టీ. ఇక కాంగ్రెస్ దొంగ హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తుంది. ఐదు గ్యారంటీల పేరుతో కర్ణాటకలో జనాన్ని మోసం చేసింది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా అక్కడ ఎన్నికల హామీలు అమలు చేయటం లేదు. ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నోటిఫికేషన్లు లేవు. కర్ణాటకలో 5 గ్యారంటీలు ఏమోగానీ ఉన్న గ్యారంటీలు పోయాయి. గతంలో బీజేపీ ప్రభుత్వం అక్కడ అమలు చేసిన రైతుబంధు, యువశక్తి, 9 గంటల కరెంటును తొలగించింది. విద్యార్థులకు స్కాలర్íÙప్లో 80 శాతం కోత విధించింది. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వటం లేదు. కానీ ఇక్కడ కేసీఆర్ 24 గంటల కరెంట్, రైతుబంధుతో వ్యవసాయం పండగ చేశారు. రేవంత్రెడ్డి 3 గంటల కరెంట్, కర్ణాటక డిప్యూటీ సీఎం 5 గంటల కరెంట్ చాలు అంటున్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే 3 గంటల కరెంట్, 5 గంటల కరెంట్ ఒప్పుకున్నట్టే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవన్నీ రద్దు అవుతాయి. ప్రజలు ఆలోచించాలి. కరెంటు, నీళ్లు వచ్చినోళ్లంత కారుకు ఓటేయాలి 24 గంటల కరెంట్, మిషన్ భగీరథతో ఇంటింటికీ నీరు గురించి కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. పూర్తిస్థాయిలో కరెంట్, ఇంటింటికీ నీళ్లు వచ్చినోళ్లంతా కారుకు ఓటేయండి... రాని వారు కాంగ్రెస్కు ఓటేయండి. సాఫీగా తెలంగాణపాలన సాగుతోంది. అనేకరంగాల్లో మార్గదర్శకంగా తెలంగాణను దేశంలో నంబర్ 1 స్థానంలో ఉంచారు. కేసీఆర్కు వాగు వంక, చెట్టు పుట్ట అన్ని తెలుసు. ప్రతిపక్ష నాయకులకు ఏది తెలియదు. కేసీఆర్ ఫోకస్ రైతులే ఎక్కడా లేనివిధంగా రైతుబంధును రాష్ట్రంలో అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దానిని పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో అమలు చేస్తోంది. అధికారంలోకి వస్తే రైతుబంధు కింద కాంగ్రెస్ పార్టీ రూ.15 వేలు ఇస్తామని చెప్తోంది. కానీ మేము రూ.16 వేలు ఇస్తామని చెప్తున్నాం. గతంలో కరెంట్ కష్టాలు ఉండేవి. ఇప్పుడు 24 గంటల కరెంటు వస్తుంది. కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా అని అందుకే అంటున్నాం. కేసీఆర్ రైతుబిడ్డ. ఆయన ఫోకస్ అంతా రైతులే. వాస్తవాలు చెబుతున్నాం కాంగ్రెస్ ప్రకటనలకో, ప్రచారానికో మేం భయపడడం లేదు. 6 గ్యారంటీల పేరుతో జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏమవుతుందో విడమర్చి చెబుతున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 12 మంది ముఖ్యమంత్రులు కావడం ఖాయం. ప్రజల్లో అపనమ్మకం సృష్టించే ప్రయత్నం ధరణితోపాటు ప్రభుత్వ పథకాలన్నీ భేష్ అని ప్రజలే చెబుతున్నారు. మా బలం ఏందో ప్రతిపక్షాలకు తెలుసు. మా బలం మీద విమర్శ చేస్తేనే, దు్రష్పచారం చేస్తేనే జనం నమ్ముతారు అని వారి ఆలోచన. ప్రజల్లో అపనమ్మకం సృష్టించి జనాన్ని ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇంకా ఆయన ఏమన్నారంటే... ♦ బీఆర్ఎస్ సభలకు ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు. కానీ రాహుల్, ప్రియాంక సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం ఇస్తున్నారు. ♦ కాంగ్రెస్నేతలు కుటుంబపాలన అనడం విడ్డూరం. ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్గాంధీ వీరంతా ఎవరు? మేము ప్రజాక్షేత్రం నుంచి వచ్చిన వాళ్లం. మాది కుటుంబ పార్టీ ఎలా అవుతుంది. ♦ ఉస్మానియా యూనివర్సిటీ వెళ్లడానికి భయపడేది మేము కాదు రేవంత్రెడ్డి భయపడుతున్నారు. విద్యార్థులను బీర్లు, బిర్యానీ ఇస్తే ఏమైనా చేస్తారు అని అన్నాడు. ♦ పేపర్ లీకేజీలు ఇతర రాష్ట్రాల్లో జరగటం లేదా? జరిగిన తప్పును మేమే గుర్తించి సీఐడీ విచారణకు ఇచ్చాం. అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం ♦ మేము ఎవరికి బీ టీమ్ కాదు. కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్కు భయపడుతూ ఒకరిపైఒకరు చెప్పుకుంటూ మా మీద ఆరోపణ చేస్తున్నాయి. ♦ బీఆర్ఎస్ వీక్ అని వచ్చినవన్నీ ఫేక్ సర్వేలు.. పేపర్ల మీద సర్వేలు చేస్తే ఎలా? ♦ కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకతనే కాదు. పాజిటివ్ కూడా ఉండొచ్చు కదా. సంక్షేమ పథకాల లబ్ధి ఎమ్మెల్యేల ద్వారానే వెళ్తుంది కదా. 80 సీట్లతో మేమే అధికారంలోకి వస్తాం ♦ కేటీఆర్ను సీఎంను చేయాలని పార్టీ అనుకుంటే చేస్తుంది. మాకు కేసీఆరే సీఎం కావాలని అనుకుంటున్నాం. -
‘ప్రజల తెలంగాణ’ కల నిజం చేస్తాం
సాక్షి, కామారెడ్డి/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ప్రజల తెలంగాణ కల సాకారం కాబోతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోంది. తొలి మంత్రిమండలి సమావేశంలోనే ఆరు గ్యారంటీలను చట్టబద్ధం చేసి అమలు చేస్తాం’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో సంపదను అంతా ఒకే కుటుంబం అనుభవిస్తోందని, రీడిజైన్ పేరుతో ఒక్క ప్రాజెక్టుతోనే రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ మధ్య తాను మేడిగడ్డకు వెళ్లి చూడగా పునాదులు పగిలిపోయి, డ్యాం లోపలికి కుంగిపోయి కనిపించిందన్నారు. కాళేశ్వరం కట్టింది నీళ్ల కోసం కాదని, దోచుకోవడం కోసమేనన్నారు. ధరణి పోర్టల్ ద్వారా లక్షలాది మంది రైతుల భూములను తమవారికి ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం కామారెడ్డి, సంగారెడ్డి, ఆందోల్లో నిర్వహించిన సభల్లో రాహుల్ ప్రసంగించారు. ఆదాయం వచ్చే ల్యాండ్, లిక్కర్, ఇరిగేషన్, ఇసుక లాంటి శాఖలన్నీ తమ చేతుల్లో పెట్టుకుని, ఇష్టారీతిన దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 8 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, దీనికి ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. ప్రధాని మోదీకి లోక్సభలో అవసరం ఉన్నప్పుడల్లా అండగా నిలవడం వల్లే కేసీఆర్పై సీబీఐ, ఈడీ లాంటి కేసులు నమోదు కాలేదని చెప్పారు. ఒకవేళ కేసీఆర్ మద్దతు ఇవ్వకపోయి ఉంటే సీఎం కురీ్చకీ ఎసరొచ్చేదని రాహుల్ దుయ్యబట్టారు. తొలి సమావేశంలోనే... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ప్రతినెలా బ్యాంకు ఖాతాలో రూ. 2,500 జమ చేస్తామని, బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా నెలకు రూ.5 వేల మేరకు ప్రయోజనం కల్పిస్తామని, గ్యాస్ సిలిండర్ను రూ.ఐదు వందలకు ఇస్తామని, రైతులకు రైతుభరోసా ద్వారా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని, అలాగే రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందిస్తామని తెలిపారు. రైతులకు 24 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇస్తామని, ఇళ్లు లేనివారందరికీ రూ.5 లక్షలు ఇచ్చి సొంతింటి కల నిజం చేస్తామని చెప్పారు. తెలంగాణ కోసం ప్రాణాలొదిలిన అమరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల కోసం ఎంతో మంది రూ.లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్నారని, తాను వాళ్ల దగ్గరకు వెళ్లి మాట్లాడానని రాహుల్ చెప్పారు. విద్యాభరోసా కార్డులను ఇచ్చి, వారి ఉన్నత చదువులు, కోచింగ్ కోసం రూ.5 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు ఇంటికి చేరేలోపు పరీక్ష పత్రాలు లీకైనట్టు తెలిసి గుండెలు బాదుకోవలసిన పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. అవినీతి సొమ్ము ప్రజల ఖాతాల్లోకి.. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్, ఆయన కుటుంబం దోచుకున్న అవినీతి సొమ్మునంతా కక్కిస్తామని రాహుల్గాంధీ పేర్కొన్నారు. కక్కించిన ఈ సొమ్మును నిరుపేదల ఖాతాల్లో వేస్తామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటేనన్నారు. బీజేపీతో కాంగ్రెస్ పోరాడిన ప్రతి ఎన్నికల్లో ఎంఐఎం తమ అభ్యర్థులను బరిలోకి దించి బీజేపీకి సహకరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్కు నష్టం చేసేలా అస్సాం, గోవా, రాజస్తాన్ ఎన్నికలో ఎంఐఎం వ్యవహరించిందని గుర్తుచేశారు. బీజేపీతో పోరాడుతున్నందుకు తనపై 24 కేసులు నమోదు చేశారని, తన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి, తన నివాసాన్ని కూడా లాక్కున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్న మోదీ సర్కానూ వదిలిపెట్టేది లేదన్నారు. విద్వేషాల బజార్లో ప్రేమ అనే దుకాణం తెరిచిన కాంగ్రెస్కు మద్దతు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, నిజామాబాద్ అర్బన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి అభ్యర్థులు షబ్బీర్అలీ, ఏనుగు రవీందర్రెడ్డి, కె.మదన్మోహన్ పాల్గొన్నారు. కామారెడ్డి ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది ‘ప్రజల రక్తానికి మరిగిన పులిని వేటాడేందుకు వేటగాన్ని రంగంలోకి దింపుతారు. అట్లనే తెలంగాణ సంపదను దోచుకుంటున్న కేసీఆర్ను రాజకీయంగా బొందపెట్టేందుకే నన్ను ఇక్కడికి పంపారు. కామారెడ్డి ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది. దేశం మొత్తం మీవైపే చూస్తోంది’ అని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్లో జరిగిన విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. నలభై ఏళ్లుగా ఎన్నో పదవులు అనుభవించినప్పుడు గుర్తుకురాని అమ్మ, అమ్మమ్మ ఊరు కేసీఆర్కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మీకుల కష్టాలను కేసీఆర్ ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇక్కడి భూముల మీద కన్నేసి కామారెడ్డికి వచ్చారని, కేసీఆర్ను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని రేవంత్రెడ్డి ప్రజలను కోరారు. -
కాంగ్రెస్తో కష్టాలు తెచ్చుకోవద్దు
మణికొండ/దుబ్బాకటౌన్: రాష్ట్రంలో కంటికి కనిపించే అభివృద్ధి, ఇంట్లోకి వస్తున్న సంక్షేమ పథకాలను కాదని, ఏరికోరి కాంగ్రెస్ పాలన తెచ్చుకుని కష్టాల పాలు కావద్దని మంత్రి హరీశ్రావు అన్నా రు. ఆదివారం మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్కు మద్దతుగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఏ కోశానాలేదని, ఒకవేళ వస్తే విద్యుత్ కోత లు, బిల్డర్ల వద్ద కర్ణాటకలో మాదిరిగా చదరపు అడుగుకు రూ.80లు వసూలు, స్కాములు, కర్ఫ్యూ లు తప్పవని అన్నారు. రైతులకు రైతుబంధు, బీ మా, బీసీబంధు, దళితబంధు, ఇంటింటికి తాగునీ రు, 24గంటల విద్యుత్, శాంతి భద్రతలు, ప్రభుత్వ ఆసుపత్రులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, న్యూ ట్రిషన్ కిట్లు ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మా ర్చాల్సిన అవసరం ఎందుకని హరీశ్రావు ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రతి మíßహిళకు గృహలక్ష్మి, రూ.400లకే గ్యాస్ సిలిండర్, ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్యబీమా, మరో లక్ష డబుల్బెడ్రూం గృహాలను ఇస్తామని హామీ ఇచ్చారు. మరో మూడు రోజులు మాత్రమే ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కనిపిస్తారని, ఎన్నికలు ముగియగానే వారంతా ఢిల్లీ బాట పడతారని, ఇక్కడ ఉండేది ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ముఖ్యమంత్రి కేసీఆర్లు మాత్రమేనని గుర్తుంచుకోవాలన్నారు. ఉత్తర ప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు మాత్రమే గెలిచిందని, అక్కడి ప్రజలు ఆ పార్టీని నమ్మలేదని, అలాంటిది రాహుల్, ప్రియాంకలు ఇక్కడకు వచ్చి గొప్పలు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. వారిని నమ్మి మోసపోవద్దని హరీశ్రావు కోరారు. వారికి దమ్ముంటే ఇప్పుడు బెంగళూరు ప్రజలతో సమావేశం పెట్టాలని సవాల్ విసిరారు. రాబోయే ఐదు సంవత్సరాలలో హైదరాబాద్ నగరం చుట్టూ నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మణికొండ, శంషాబాద్లకు వంద పడకల ఆసుపత్రులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, మన రాష్ట్రం, మన పాలనకే ప్రజలు పట్టం కట్టాలని.. ఢిల్లీ పార్టీలను తరమికొట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాశ్గౌడ్ అన్నారు. రాష్ట్రంలో మరో మారు బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు ఓటు వేయాలని అన్నారు. కేంద్రం రూ.28 వేల కోట్లు ఎగ్గొట్టింది.. రైతుల బోరు బావుల వద్ద కరెంట్ మీటర్లు పెట్టక పోవడంవల్ల తెలంగాణకు రావాల్సిన రూ.28 వేల కోట్లను కేంద్రం ఎగ్గొట్టిందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్న కాంగ్రెస్, రాష్ట్రంలో 11 సార్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని, పొరపాటున కాంగ్రెస్ వస్తే మళ్లీ చీకటి కష్టాలు వస్తాయని అన్నారు. -
కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ
సాక్షి, యాదాద్రి/నారాయణపేట/ములుగు: కాంగ్రెస్ అంటేనే అమ్ముడుపోయే పార్టీ అని, అది తెలంగాణలో బీఆర్ఎస్ను బీ టీమ్లా కాపాడుతోందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్టేనని, ఆ రెండింటికీ చెక్పెట్టి బీజేపీని గెలిపించాలని కోరారు. మూసీ నదిలా తెలంగాణ మొత్తాన్ని కేసీఆర్ అవినీతితో కలుషితం చేశారని.. ఈ అవినీతి కాలుష్యాన్ని శుద్ధి చేయాలంటే బీజేపీకి అధికారం అప్పగించాలని పేర్కొన్నారు. ఆదివారం మక్తల్, ములుగు, భువనగిరి నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభల్లో అమిత్షా మాట్లాడారు. నారాయణపేట సభలో కురుమూర్తిస్వామి, జోగుళాంబదేవి, సంగమేశ్వరస్వామికి.. ములుగు సభలో సమ్మక్క–సారలమ్మ, రామలింగేశ్వరస్వామికి నమస్కరిస్తున్నా అంటూ అమిత్ షా తన ప్రసంగాలను ప్రారంభించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఇవి తెలంగాణ భవిష్యత్ కోసం జరుగుతున్న ఎన్నికలు. ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలి. కేసీఆర్ సర్కారు గత పదేళ్లలో అవినీతిలో కూరుకుపోయింది. కుంభకోణాల మయంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో, మియాపూర్ భూముల్లో వేల కోట్లు దోచుకున్నారు. బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కేసీఆర్ భూకబ్జాల కారును గ్యారేజీకి పంపిస్తాం. కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి జైలుకు పంపిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారు. అసలు కేసీఆర్ జాతీయ హోదా కోసం ఒక్కనాడు కూడా ప్రధాని మోదీని కలవలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డీల్.. కాంగ్రెస్కు వేసే ప్రతి ఓటు బీఆర్ఎస్కు వేసినట్లే. వారిలో ఎవరికి ఓటు వేసినా ఒక్కటే. కాంగ్రెస్ అమ్ముడు పోయే పార్టీ. అది బీఆర్ఎస్ను బీ టీంలా కాపాడుతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో వారి మధ్య అధికారాన్ని పంచుకునే డీల్ కుదిరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలాగూ అధికారంలోకి రాదు. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇక్కడ కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేస్తారు. బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో కేంద్రంలో రాహుల్గాందీని ప్రధాన మంత్రిని చేయాలనేది ఒప్పందం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. ఎస్సీ వర్గీకరణ చేపడతాం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. కేసీఆర్ రజాకార్ల పార్టీ ఎంఐఎంకు భయపడి విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు. మేం అధికారంలోకి రాగానే సెపె్టంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తాం. బీఆర్ఎస్ ఇస్తున్న నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెంచుతాం. మేం అధికారంలోకి రాగానే గిరిజనేతరులకు సైతం ఆంక్షలు లేని పోడుపట్టాలు జారీ చేస్తాం. గిరిజన రైతులకు రూ.12 వేల చొప్పున అందజేస్తాం. అయోధ్యలో రాముడి దర్శనం చేయిస్తాం భవ్యమైన, దివ్యమైన అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతోంది. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరగనుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి ప్రజలకు ఉచితంగా అయోధ్య ప్రయాణం, వసతి, దర్శనం కల్పిస్తాం..’’అని అమిత్ షా ప్రకటించారు. 'డబుల్ ఇంజన్’తో రాష్ట్రం నంబర్వన్ రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుందాం. దేశాన్ని సురక్షితంగా అభివృద్ధిపథంలో నడిపిస్తున్న మోదీని 2024లో మరోసారి ప్రధాని చేసుకుందాం. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారుతో తెలంగాణను నంబర్వన్గా అభివృద్ధి చేసుకుందాం. బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి. -
30న తెలంగాణ భవిష్యత్తు తేలిపోతుంది
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్)/నారాయణపేట: గత పదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ముషీరాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్కుమార్యాదవ్కు ఆశీస్సులు అందించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం బాగ్లింగంపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిద్ధరామయ్య మాట్లాడుతూ నవంబర్ 30న తెలంగాణ భవిష్యత్తు తేలిపోతుందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అన్ని కుల, మతాల ప్రజల సంక్షేమం కోసం పని చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్సే అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రమేయం లేదని, పార్లమెంటులో ఆయనకు ఎంపీలు లేకపోయినా సోనియా గాంధీ ధైర్యం చేసి రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని ధ్వజమెత్తారు. కేసీఆర్, మోదీలకు ఓడిపోతామనే భయం ప్రారంభమైందని, బీజేపీకి మూడు సీట్లు మించి రావని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మూడే రోజులు ‘బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర అభివృద్ధిని మరచి పక్కనున్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని సిద్ధరామయ్య అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి శ్రీహరి తరపున ఏర్పాటు చేసి రోడ్షోలో సిద్ధరామయ్య మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇంకా మూడురోజులే గడువు ఉందన్నారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారని, కానీ అది మూణ్నాళ్ల ముచ్చటగా మారిందని విమర్శించారు. మా రాష్ట్రం వస్తే గ్యారంటీల అమలు చూపిస్తాం సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తున్నామని, ఈ విషయంలో ఎవరికైనా అనుమానాలుంటే తమ రాష్ట్రానికి వస్తే చూపిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఐదు గ్యారంటీల ను కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అమలు చేయడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ఈ పథకాల అమలు కోసం తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.38 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఆదివారం తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన హైదరాబాద్లోని తాజ్కృష్ణా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ రాష్ట్ర మంత్రులు బోసురాజు, లక్ష్మీ హెబ్బాల్కర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులతో కలసి మాట్లాడారు. ఐదు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామని, ఎన్నికల సందర్భంగా కర్ణాటక ప్రజలకిచ్చిన 165 హామీల్లో ఇప్పటివరకు 158 నెరవేర్చామని సిద్ధరామయ్య వెల్లడించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం గత పదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 10 శాతం కూడా నెరవేర్చలేదన్నారు. ఐదు గ్యారంటీల అమలు కారణంగా కర్ణాటక ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని ప్రధాని మోదీ చెపుతున్న మాటల్లో వాస్తవం లేదని సిద్ధరామయ్య అన్నారు. -
TS: సీనియర్లకు ఫ్రెషర్ల ఛాలెంజ్
ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్ర ఎంతో కీలకమైనది. యువత ముందుకొచ్చి ఓటు వేయడమే కాకుండా.. ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహారించాలన్న చర్చ ఎప్పటి నుంచో నడుస్తున్నదే. అయితే ఈసారి జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో పలుచోట్ల యువరక్తం.. పైగా కొత్త ముఖాలు.. అందునా సీనియర్లతో పోటాపోటీకి సిద్ధం కావడం గమనార్హం. కార్నె శిరీష(బర్రెలక్క) : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కార్నె శిరీష(బర్రెలక్క) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఈ దఫా ఎన్నికల్లో చిన్నవయస్కురాలైన అభ్యర్థిగా ఈమెకు ఓ గుర్తింపు దక్కింది. సోషల్ మీడియాలో బర్రెలక్కగా బాగా పాపులర్ అయిన శిరీష.. నామినేషన్ మొదలు నుంచి వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రచార సమయంలో ఆమె వర్గం దాడి జరిగాక.. ఆ చర్చ తారాస్థాయికి చేరింది. చివరాఖరికి హైకోర్టు సైతం ఆమెకు భద్రత కల్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్ధన్రెడ్డి, బీజేపీ సుధాకర్ లాంటి సీనియర్లను ఈమె ఢీ కొడుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: పవన్ కంటే బర్రెలక్క నూరుపాళ్లు నయం! మామిడాల యశస్వినీరెడ్డి: ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మరో అత్యంత యువ అభ్యర్థి యశస్విని కావడం విశేషం. కాంగ్రెస్ తరఫున పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు లాంటి సీనియర్ మీద మామిడాల యశస్వినీ(26) పోటీకి దిగింది. యశస్వినీరెడ్డి హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసింది. ఆపై ఝాన్సీరెడ్డి కొడుకు రాజారామ్ మోహన్ రెడ్డిని వివాహం చేసుకుని అమెరికా వెళ్లింది. అత్త ఝాన్సీరెడ్డికి కాంగ్రెస్ టికెట్ విషయంలో పౌరసత్వ అభ్యంతరాలు తలెత్తడంతో.. కోడలు యశస్వినీకి ఆ అవకాశం దక్కింది. ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కూడా ఈ యువ అభ్యర్థి కోసం ప్రచారం కూడా చేశారు. నాన్ లోకల్ అనే ప్రత్యర్థి ప్రచారాన్ని తిప్పి కొడుతూ.. పాలకుర్తిలో గెలుపుపై యశస్విని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదీ చదవండి: ఎర్రబెల్లికి చుక్కలు చూపిస్తున్న హనుమాండ్ల ఫ్యామిలీ మైనంపల్లి రోహిత్రావు: మైనంపల్లి హనుమంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్(27). మెదక్ జిల్లా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మెడిసిన్ పూర్తిచెసిన రోహిత్ తన తండ్రి.. ఆయన అనుచర గణం అండతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్’ పేరిట కరోనా టైంలో అందించిన సేవలకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. మెదక్లో పద్మాదేవేందర్రెడ్డి లాంటి సీనియర్తో పోటీకి రోహిత్ సిద్ధం అయ్యారు. ఇదీ చదవండి: మెదక్లో మళ్లీ పాతయుద్ధమేనా? ఉషా దాసరి: ఐఐటీ గ్రాడ్యుయేట్ ఉషా దాసరి (27).. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థినిగా పోటీలో ఉన్నారు. కలెక్టర్ కావాలనే కలని సైతం పక్కన పెట్టి తల్లిదండ్రుల పేరు మీద ట్రస్ట్ నెలకొల్పి.. ఉచిత ట్యూషన్లతో స్థానికంగా మంచి పేరు సంపాదించుకున్నారీమె. దాసరి మనోహర్తో పాటు చింతకుంట విజయరమణారావులాంటి సీనియర్ల నడుమ పోటీకి నిలిచారు. ఇదీ చదవండి: ఐఐటీ స్టూడెంట్... పొలిటికల్ ఎంట్రీ వీళ్లేకాదు.. మిరియాల రామకృష్ణ(28) జనసేన అభ్యర్థిగా ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల.. పువ్వాడ అజయ్లాంటి వారితో పోటీ పడుతుండగా.. అలాగే ములుగు నుంచి సీతక్కకు పోటీగా బీఆర్ఎస్ అభ్యర్థిని బడే నాగజ్యోతి(29) ఎన్నికల బరిలో దిగి యువసత్తా చాటాలని చూస్తున్నారు. -
ఏం మేలు జరిగిందని ఇందిరమ్మ రాజ్యం రావాలి?: కేసీఆర్
సాక్షి, నిర్మల్: యాభై ఏళ్ల పాలనలో తెలంగాణకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. ఆదివారం ఖానాపూర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. ఓటేసే ముందు పార్టీల చరిత్రను గుర్తు తెచ్చుకోవాలని ప్రజానీకాన్ని అభ్యర్థించారాయన. ‘‘తెలంగాణను బలవంతంగా ఏపీలో కలిపిందే కాంగ్రెస్. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయంతో 58 ఏళ్లు గోస పడ్డాం. కాంగ్రెస్ పాలనలో తాగునీరు కూడా ఇవ్వలేకపోయారు. ప్రాణాలు పణంగా పెట్టి 15 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొంటున్నాం. ..ఆడబిడ్డలకు కల్యాణ కల్యాణ లక్ష్మి, షాదీముబాకర్లు ఇస్తున్నాం. గిరిజనుల, ఆదివాసీల ఆత్మగౌరవ భవనాలు నిర్మించాం. అన్ని వర్గాల ఆత్మగౌరవం కోసం పని చేశాం. దేశంలో రైతు బంధు పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తుందట. ధరణి తీసేస్తే రైతు బంధు ఎలా వస్తుంది?.కాంగ్రెస్ వస్తే మళ్లీ దళారీల రాజ్యం వస్తుంది. ఈసారి గెలిచాక.. పెన్షన్ రూ.5 వేలకు పెంచుతాం. తెల్ల రేషన్కార్డు దారులకు సన్నబియ్యం ఇస్తాం. రైతుబంధు రూ.16 వేలకు పెంచుకుందాం అని అన్నారాయన. జగిత్యాలలో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ తెచ్చింది ఎవరు? 24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవరు?. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన.. పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఏంటో ప్రజలకు తెలుసు. ఏం మేలు జరిగిందని మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలి?. ఇందిరమ్మ రాజ్యంలో జగిత్యాలను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు. యువకులను జైల్లో పెట్టారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ వర్గం బాగుపడింది?. ఇందిరమ్మ రాజ్యంలో అన్నీ చీకటి రోజులే కదా. ఏపీ పాలకుల కంటే కాంగ్రెస్ నేతలే తెలంగాణను ఎక్కువ ముంచారు. ఎవరు నిజమైన సిపాయిలో గుర్తించాలి’’ అని కేసీఆర్ జగిత్యాల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. యాభై ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేయలేదు. రైతు బంధు గురించి ఎవరైనా ఆలోచించారా? రైతు బంధు పుట్టించిందే బీఆర్ఎస్.. కేసీఆర్. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ ఉత్తమ్కుమార్రెడ్డి అంటున్నారు. రైతు బంధు ఉండాలా? వద్దా?. కాంగ్రెస్ వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతారట. ధరణిని ఆపేస్తే.. రైతు బంధు ఎట్లా వస్తది?. ఓటు వేసే ముందు పార్టీ చరిత్ర, అభ్యర్థుల గుణగణాలు చూడాలి అని అన్నారాయన. -
రైతు చుట్టూ రాజకీయం
ఎన్నికల్లో రైతులను ఆకర్షించే పనిలో అన్ని పార్టీలూ నిమగ్నమయ్యాయి. రైతులను ప్రసన్నం చేసుకుంటేనే అధికారం దక్కుతుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అందుకే రైతు కేంద్రంగా అనేక పథకాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఈ మేరకు ఆయా పార్టీలు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలే నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన రైతులు, వ్యవసాయ కూలీలను పార్టీలు టార్గెట్గా చేసుకొని ప్రచారం చేస్తున్నాయి. వ్యవసాయం : 2 కోట్ల మంది రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతులు 66 లక్షల మంది ఉన్నారు. వీరే కాకుండా సెంటు భూమిలేని కౌలు రైతులు 6 లక్షల మందికి పైగా ఉంటారు. అంటే రైతులు, కౌలుదారులు కలిపి దాదాపు 72 లక్షల రైతు కుటుంబాలు ఉన్నట్లు ఓ లెక్క. కుటుంబంలో కనీసం ఇద్దరు చొప్పున ఓటు హక్కు కలిగి ఉన్నా, దాదాపు కోటిన్నర మంది వరకు ఉంటారు. ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్న కూలీల సంఖ్య 52 లక్షలు. అంటే రాష్ట్రంలో వ్యవసాయం, దానిపై ఆధారపడిన వారే 2 కోట్ల మంది ఉంటారని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ రైతుబంధు రూ.16 వేలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రైతులపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. సాగునీటి ప్రాజెక్టులు మొదలు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టింది. రైతుబంధు కింద రైతులకు ఇప్పటివరకు రాష్ట్రంలో రూ. 72 వేల కోట్లు అందజేసింది. ప్రస్తుతం ఎకరానికి ఏడాదికి రూ. 10 వేలు ఇస్తుండగా, మరోసారి అధికారం అప్పగిస్తే విడతల వారీగా పెంచుతామని తెలిపింది. రైతుబంధు సాయాన్ని మొదటి సంవత్సరం ఎకరానికి ఏటా 12 వేల రూపాయలకు పెంచుతామని హామీనిచ్చింది. వచ్చే ఐదేళ్లలో రైతుబంధు సహాయాన్ని క్రమంగా పెంచుతూ... గరిష్టంగా ఎకరానికి ఏటా 16 వేల రూపాయలకు పెంచుతామని చెబుతోంది. రైతుబీమా ఎలాగూ ఉంది. అయితే గత రెండుసార్లు రైతులకు రూ. లక్ష రుణమాఫీ ప్రకటించి అమలు చేసిన బీఆర్ఎస్, ఈసారి మాత్రం తన ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీని ప్రకటించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రూ.2 లక్షల రుణమాఫీ రైతులకు భరోసా దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. 24 గంటల ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ అని ఆ పార్టీ చెబుతోంది. రైతుబంధుకు బదులుగా రైతు భరోసా పేరుతో ఏడాదికి ఎకరానికి ఒక్కో రైతుకు రూ. 15 వేలు ఇస్తామని వెల్లడించింది. కౌలు రైతులకు రైతు భరోసా రూ. 15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది. ఇక వ్యవసాయ కూలీలకు, ఉపాధి కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని చెబుతోంది. అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధర, వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని పేర్కొంది. అలాగే రైతు డిక్లరేషన్లో భాగంగా ఒకేసారి రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని తెలిపింది. మద్దతు ధరకు అన్ని పంటలను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. మూతపడిన చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపింది. భూమి యాజమాన్య హక్కులను అందిస్తామని, పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూముల లబ్దిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని తెలిపింది. రైతు కమిషన్ ఏర్పాటుతో సహా సరికొత్త వ్యవసాయ విధానం తెస్తామని చెబుతోంది. వరికి మద్దతు ధర రూ. 3,100 ఇస్తామన్న బీజేపీ మరోవైపు తామూ అధికారంలోకి వస్తామని చెబుతోన్న బీజేపీ కూడా తన మేనిఫెస్టోలో చిన్న సన్నకారు రైతులకు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకునేందుకు రూ. 2,500 సాయం అందిస్తామని తెలిపింది. ఉచిత పంటల బీమాను ప్రకటించింది. వరికి రూ. 3,100 మద్దతు ధర ఇస్తామని తెలిపింది. పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఆసక్తి కలిగిన రైతులకు దేశీ ఆవులను ఉచితంగా అందిస్తామని తెలిపింది. జాతీయ పసుపు బోర్డు నిర్ణయానికి అనుగుణంగా నిజామాబాద్ టర్మరిక్ సిటీని అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఏమాత్రం తగ్గని లెఫ్ట్ పార్టీల మేనిఫెస్టో... ఇక ఒంటరిగా బరిలో నిలిచి 19 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న సీపీఎం తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతుకు అనుకూలంగా అనేక హామీలు ఇచ్చింది. రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ కోసం కృషి చేస్తామని తెలిపింది. కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం రూపొందించాలని కోరుతామని, రైతుల పంటలపై 80 శాతం రుణాలు ఇచ్చి గోదాముల సౌకర్యం కల్పించాలని, ధరల నిర్ణాయక కమిషన్ ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంటలు సేకరించాలని కోరుతామని స్పష్టం చేసింది. కౌలు రైతుల గుర్తింపు, వ్యవసాయ రుణాలు, సబ్సి డీలు, పంట బీమా, కౌలు, పోడు తదితర రైతులందరికీ రూ. 5 లక్షల రైతు బీమా సౌకర్యం కల్పించా లని, ప్రకృతి వైపరీత్యాలు, అటవీ జంతువుల వల్ల పంట నష్టం జరిగితే సాగు చేసిన రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తా మని సీపీఎం పేర్కొంది. మరోవైపు కాంగ్రెస్ మద్దతుతో ఒక స్థానంలో పోటీ చేస్తున్న సీపీఐ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో కీలకమైన అంశాలను పొందుపర్చింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ. 20 వేలు ఇవ్వాలని కోరింది. ఒకేసారి రైతులకు రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని పేర్కొంది. -బొల్లోజు రవి -
అనుమానం లేదు అధికారంలోకి వస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ ఆ పార్టీ నేతలు ఎన్నికల సంగ్రామంలోకి దిగారు. ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని గట్టిగానే సౌండ్ వినిపిస్తున్నారు. నాటి దుబ్బాక ఎన్నికల్లో గెలుపు నుంచి మొన్నటి జీహెచ్ఎచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పొందిన సీట్లే ఇందుకు నిదర్శమని కాషాయనేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి సాక్షితో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎలా, ఎందుకు అధికారంలోకి వస్తుందో చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు మద్దతిస్తారో క్లారిటీ ఇచ్చారు. జోడు పదవులకు న్యాయం జరుగుతుందా? నేను పదవిలోకి వచ్చి రెండు నెలలే అవుతోంది. ఈ సమయంలో పార్టీ కోసం, ఎన్నికల కోసం పూర్తిస్థాయిలో నా అనుభవం పెట్టి పనిచేస్తున్నాను. బీజేపీ టెంపో డౌన్ అయ్యిందా? ఒక పథకం ప్రకారం కొన్ని శక్తులు ఇలాంటివి ప్రచారం చేస్తున్నాయి. ప్రజల్లో అలాంటి పరిస్థితి లేదు. సుమారు 100 స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్కు, మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్కు దీటుగానే బీజేపీ ఉంది. మాకొచ్చే ఫీడ్ బ్యాక్లో మేం బలంగా ఉన్నాం. కిషన్రెడ్డి వల్ల బీజేపీకి లాభమా?.. బీఆర్ఎస్కి లాభమా? రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై సోషల్ మీడియాలో కొంత అసత్య ప్రచారం జరుగుతోంది. సామాన్య ప్రజలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కొన్నేళ్లుగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది బీజేపీనే. నేను అధ్యక్షుడైన రెండు నెలల్లో పలుమార్లు కేసీఆర్ సర్కార్కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపాను. రెండుసార్లు నన్ను అరెస్ట్ కూడా చేశారు. ప్రజల కోసం కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై ఏనాడూ పోరాటం చేయలేదు. జైళ్లకు వెళ్లింది, కేసులు పెట్టించుకున్నది బీజేపీ నేతలే. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయి. బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేసిన విషయం ప్రజలకు తెలుసు. బీజేపీ ఎప్పటికీ కుటుంబ పార్టీలో కలవదు. బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటే. కానీ, మజ్లిస్ పార్టీతో బీజేపీ ఎన్నటికీ కలిసే ప్రసక్తే లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో.. మజ్లిస్తో బీజేపీ కలవదు అన్నది కూడా అంతే నిజం. తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్ ఉందా? కరా్టటక ఫలితాల తర్వాత తెలంగాణకు భారీ మొత్తంలో డబ్బు చేరుతోంది. అక్కడ పన్నుల ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారు. రూ.వేల కోట్లను మీడియా మేనేజ్మెంట్, సోషల్ మీడియాకు వాడుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్ను ప్రజలు నమ్మడం లేదు. అంబర్పేట నుంచి ఎందుకు పోటీలో లేరు? నేను పోటీ చేయాలనుకున్నాను. నా వ్యక్తిగత నిర్ణయం వేరు.. పార్టీ హైకమాండ్ నిర్ణయం వేరు. నాకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. బీసీని సీఎంను చేయాలని మా పార్టీ నిర్ణయించింది. ఈ సమయంలో నేను పోటీ చేస్లి గెలిచి.. ప్రజల్లో సీఎం అభ్యర్థిపై సందిగ్ధత ఉండకూడదనే ఉద్దేశంతోనే నేను పోటీలో లేను. 4 శాతం రిజర్వేషన్ల తొలగింపు కరెక్టేనా? ఇది రాజకీయపరమైన అంశం. రాష్ట్ర హైకోర్టు నాలుగు శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పు ఇచ్చింది. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం. ఇప్పటికే ముస్లింలలో కొందరికి బీసీ–డీలో రిజర్వేషన్ దొరుకుతోంది. మేము ఈబీసీలో ఏదైతే 10 శాతం రిజర్వేషన్ ఇస్తున్నామో అందులో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం. అందులో అందరికీ రిజర్వేషన్ ఉంటుంది. మతపరమైన రిజర్వేషన్లను బాబా సాహెబ్ అంబేడ్కర్ కూడా వ్యతిరేకించారు. బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరు.. మీ మద్దతు ఎవరికి ? నా మద్దతు పార్టీకి ఉంటుంది. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుంది. పార్టీ అభ్యర్థుల అభిప్రాయాలను తీసుకుంటాం.. ఢిల్లీలో పార్లమెంటరీ బోర్డు ఉంటుంది.. వాళ్ల అభిప్రాయాలు తీసుకుని, విశ్లేషించి, మిగతా ఎమ్మెల్యేల అందరితో మాట్లాడిన తర్వాతే సీఎంను ప్రకటిస్తాం. యూపీ ఎన్నికలప్పుడు కూడా యోగి ఆదిత్యనాథ్ను తర్వాతే ఎంపిక చేశాం. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ ప్రతీ విషయంలోనూ ముద్రవేశారు. ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు? అధికారంలోకి రావడానికి కావలసినన్ని సీట్లు బీజేపీ గెలుస్తుంది రాజకీయాల్లో అటు ఇటు అయితే ? ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఒకవేళ బీజేపీకి సరిపడా సీట్లు రాకపోతే ప్రతిపక్షంలో కూర్చుంటుందా? బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మాకు 100 సీట్లు వస్తాయని బీఆర్ఎస్ చెప్పింది. బీజేపీకి కేవలం రెండు మూడు సీట్లు వస్తాయని చెప్పింది. కానీ ఫలితాలు వెల్లడైన తర్వాత పరిస్థితి తారుమారైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఇన్ని సీట్లు వస్తాయని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందని భావిస్తున్నాం. దేని ఆధారంగా చెబుతున్నారు? తెలంగాణలో 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న యువతలో బీజేపీ పట్ల అభిమానం ఉంది. ఒక ఇంట్లో తండ్రి బీఆర్ఎస్ పార్టీలో ఉండవచ్చేమో కానీ వాళ్ల పిల్లలు బీజేపీ పట్ల.. నరేంద్ర మోదీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతోమంది యువత అభిమానులుగా ఉన్నారు. ఇదే మిగతా పార్టీలకు బీజేపీకి ఉన్న తేడా. బీఆర్ఎస్ లౌకిక రాజ్యం, కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, మీరేమో రామరాజ్యం అంటున్నారు? హిందువుల గురించి మాట్లాడితే మతోన్మాద పార్టీనా? ఈ దేశ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను.. దేశంలో హిందూయిజం ఉన్నప్పుడే సెక్యులర్గా ఉంటుంది. హిందువులు మైనార్టీలోకి వెళ్లినప్పుడు దేశంలో సెక్యులరిజం ఉండదు. నేను రాసిస్తాను. మేము అన్ని మతాల గురించి మాట్లాడతాం. క్రిస్టియన్ల గురించి, ముస్లింల గురించి మాట్లాడతాం. మేం ముస్లింలను వ్యతిరేకించం, కేవలం మజ్లిస్ పార్టీ విధానాలతో వ్యతిరేకిస్తాం. హిందువుల గురించి కచ్చితంగా మాట్లాడతాం. హిందువులు దేశ పౌరులు కారా? వాళ్లకి ఇక్కడ హక్కులు లేవా?. వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు మేము ప్రశ్నిస్తే అది మతోన్మాదం ఎలా అవుతుంది? నేను మళ్లీ మళ్లీ చెబుతున్నాను హిందూయిజం ఉన్నంతకాలమే దేశంలో సెక్యులరిజం ఉంటుంది. -
తెలంగాణ: బరిలో కురువృద్ధులు.. ఎవరో తెలుసా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ప్రధాన పార్టీల అభ్యర్థుల నడుమ పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. అదే సమయంలో ఈసారి ఎన్నికల్లో కురువృద్ధులు తమ సత్తా చాటాలనుకుంటున్నారు. అత్యధిక వయసుతో ఎలక్షన్ బరిలో దిగిన నేతల జాబితాను పరిశీలిస్తే.. 1. వనమా(బీఆర్ఎస్.. కొత్తగూడెం) వనమా వెంకటేశ్వరరావు..(78) కొత్తగూడెం ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి కూడా. ప్రస్తుత అసెంబ్లీలో అందరికంటే వయస్సులో పెద్ద నేత వనమానే కావడం గమనార్హం. వనమా 1989లో మొట్టమొదటిసారిగా కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటికే ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి.. ఒకసారి మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం మళ్ళీ కొత్తగూడెం నుంచే పోటీ చేస్తున్నారు. మొదటిసారి గెలిచిన తర్వాత, రెండుసార్లు 1999లో 2004లోనూ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2008లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. పదేళ్ల తరువాత కాంగ్రెస్ కి రాజీనామా చేసి, అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో చేరే ముందు కాంగ్రెస్ లో పార్టీ టికెట్ పై పోటీ చేశారు. ఈ పోటీలో బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్ రావుపై మెజారిటీ ఓట్లతో గెలుపొందారు. కాని, గెలిచిన అనంతరం ఆయన కాంగ్రెస్ను వీడి.. బీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. 2018 ఎన్నికల్లో ఇవే తనకు చివరి ఎన్నికలని.. ఒకసారి అవకాశం కల్పించాలని ప్రజల ముందుకు వచ్చి విజయం సాధించారు. ఆ ఎన్నిక ప్రత్యర్థి అభ్యంతరంతో కోర్టు దాకా చేరి.. చివరకు సుప్రీంలో ఊరటతో గట్టెక్కింది. ఇక ఇప్పుడు తన తనయుడ్ని బరిలోకి దింపాలని చూసినా.. చివరకు వనమాకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. 2. మర్రి శశిధర్ రెడ్డి (బీజేపీ.. సనత్నగర్) సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి(74).. తండ్రి అడుజాడల్లో రాజకీయంలోకి వచ్చి నాలుగు సార్లు నెగ్గి.. రెండుసార్లు ఓటమిపాలయ్యారు.ఈయన జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ మాజీ చైర్మన్ కూడా. ప్రస్తుతం సనత్నగర్ లో బీజేపీ నుంచి పోటీలో నిలిచారు. మొదట్లో రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా నెగ్గారు. మూడోసారి పోటీలో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత వరుసగా రెండుసార్లు గెలుపొందారు. అప్పటివరకు జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థకు చైర్మన్ గా నిలిచిన శశిధర్.. 2014లో తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. విజయం దక్కలేదు. ప్రస్తుతం సనత్ నగర్ నుంచే బరిలో నిలిచారాయన. 3. పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్.. బోధన్) మరో సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి(74).. 2023లో బోధన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. వ్యాపారి అయిన పొద్దుటూరి సుదర్శన్రెడ్డి.. 1989లో మొదలుపెట్టిన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (1989) బోధన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాతి ఎలక్షన్స్లో గెలిచి.. మరో రెండుసార్లు బోధన్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. బోధన్ నుంచి పోటీలో నిలిచారాయన. 4. టీ.జీవన్ రెడ్డి (కాంగ్రెస్, జగిత్యాల) సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి (72). కాంగ్రెస్ తరఫున జగిత్యాల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. మొత్తం ఆరుసార్లు జగిత్యాల ఎమ్మెల్యేగా ఈయన గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1983లో జరిగిన ఎన్నికల్లో నెగ్గి.. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు నెగ్గి జీవన్ రెడ్డి.. 1994 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత వరుసగా మూడుసార్లు గెలిచి.. హ్యాట్రిక్ రికార్డు సాధించారు. అయితే.. 2006, 2009 కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన ఈయన ఓటమి పాలయ్యారు. తిరిగి, 2014లో తెలంగాణ ఏర్పడ్డాక మరోసారి గెలిచారు.. 2018 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఇప్పుడు మరోసారి జగిత్యాల నుంచే బరిలో నిలిచారాయన. 5. నడిపెల్లి దివాకర్ రావు (బీఆర్ఎస్.. మంచిర్యాల) కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నడిపెల్లి దివాకర్ రావు..(71) మంచిర్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్గా విజయం దక్కించుకున్నారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్లోనే వివిధ శాఖల్లో పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ వచ్చాక.. మంచిర్యాల ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు ఈయనే నెగ్గారు. ప్రస్తుతం మంచిర్యాల నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు. 6. తుమ్మల నాగేశ్వర్రావు (కాంగ్రెస్.. ఖమ్మం) తుమ్మల నాగేశ్వరరావు..(71) సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రారంభించిన ఈయన రాజకీయ జీవితం.. ప్రస్తుతం ఖమ్మం నియోజకవర్గానికి చేరింది. తుమ్మల తొలి పోటీలోనే ఓటమి పలకరించింది. ఆ తరువాత 1985లో మధ్యంతర ఎన్నికల్లో విజయం అందుకున్నారు. అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికైయ్యారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక బీఆర్ఎస్కు మారిన అనంతరం.. 2014లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2016లో ఉప ఎన్నికలో పోటీ చేసి నెగ్గారు. తెలంగాణ 2018 ఎన్నికల్లో.. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023లో బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ చేరి ఖమ్మం బరిలో నిలిచారు. 7. బాబూ మోహన్ (బీజేపీ.. ఆందోల్) సినీ నటుడైన బాబూ మోహన్..(71) సీనియర్ ఎన్టీఆర్పై ఉన్న అభిమానంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1999లో జరిగిన ఎన్నికల్లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడంతో పాటు మంత్రిగానూ అవకాశం అందుకున్నారు. ఆపై 2014లో బీఆర్ఎస్లో చేరారు. అటుపై బీజేపీ కండువా కప్పేసుకుని.. ఆందోల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం, సంగారెడ్డి ఆందోల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి నిలిచారు. 8. రేవూరి ప్రకాష్ రెడ్డి (కాంగ్రెస్.. పరకాల) సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి..(71) టీడీపీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో టీడీపీలో ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2023 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రకాష్ రెడ్డిని వరంగల్ రూరల్ నియోజకవర్గం పరకాల అభ్యర్థిగా ప్రకటించింది. 9. రాంరెడ్డి దామోదర్ రెడ్డి (కాంగ్రెస్.. సూర్యాపేట) సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి..(71).. ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ట్రాక్ ఈయనది. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ.. తుంగతుర్తి, సూర్యాపేట నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సూర్యాపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. 10. ముఠా గోపాల్ (బీఆర్ఎస్.. ముషీరాబాద్) ముఠా గోపాల్..(70) రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2014 ఎన్నికలో ఓడినా.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 11. మంచి రెడ్డి కిషన్ రెడ్డి (బీఆర్ఎస్.. ఇబ్రహీంపట్నం) మంచి రెడ్డి కిషన్ రెడ్డి..(70) టీడీపీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేసి 2009, 2014 శాసనసభ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తరువాత టీడీపీని వీడి బీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి 376 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చున్నారాయన. -
పువ్వాడకి సీపీఐ మద్దతా? నారాయణ ఏమన్నారంటే..
సాక్షి, ఖమ్మం: ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తుగా ముందుకు వెళ్తున్నాయి. కానీ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోసం కాకుండా.. పువ్వాడ అజయ్ కోసం సీపీఐ ప్రచారం చేస్తోందన్న ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ప్రచారాన్ని నారాయణ ఖండించారు. అజయ్ను తులసి వనంలో గంజాయి మొక్కగా అభివర్ణించిన నారాయణ.. ఉమ్మడి ఖమ్మంలో ఓడిపోయే బీఆర్ఎస్ సీటు అజయదేనని జోస్యం చెప్పారు. ‘‘ఖమ్మంలో సీపీఐ కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు అనే ప్రచారం నడుస్తోంది. కానీ, అది అపోహ మాత్రమే. సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు కొడుకు పువ్వాడ అజయ్కు మద్దతు ఇస్తుందనే కొందరు చెప్పుకుంటున్నారు. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇవాళ్టి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా సీపీఐ నుంచి అజయ్కు మద్దతు ఇస్తే.. అది ఎంత పెద్ద నేత అయినా సరే చర్యలు తీసుకుంటాం’’ అని నారాయణ చెప్పారు. ఖమ్మంలో సీపీఐ కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి పువ్వాడ నాగేశ్వర్ రావు. కానీ, తండ్రి నాగేశ్వరరావుకి మూడు నామాలు పెట్టిన వ్యక్తి అజయ్ కుమార్. అటువంటి వ్యక్తికి ఎటువంటి పరిస్థితుల్లోనూ సీపీఐ మద్దతు ఇవ్వదు. ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోయే సీటు అజయదే అని నారాయణ అన్నారు. ఆ మూడు పార్టీలవి ఒప్పందమే! కాంగ్రెస్, సీపీఐకు ఓటేస్తే.. బీజేపీ, బీఆర్ఎస్ ,ఏంఐఎం.. మూడు పార్టీలు ఎలిమినేట్ అవుతాయి. ఆ మూడు ఒక ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్తున్నాయి. గోషామహల్లో బీజేపీ తరఫున రాజాసింగ్ పోటీ చేస్తున్నారు. అక్కడ ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టలేదు. కానీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న చోట మాత్రం ఏంఐఎం అభ్యర్థిని నిలబెట్టింది. ఇది ఒక్కటి చాలు వీళ్లంతా ఎంతలా కలిసి ఉన్నారో చెప్పటానికి. పైకి ఒకరిపై ఒకరు విమర్శించుకున్నట్లు కనిపిస్తూ డ్రామాలు ఆడుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్లే తెలంగాణలో ఆ పార్టీ గ్రాఫ్ పెరిగింది. కాంగ్రెస్, సీపీఐ గెలిస్తే దేశ రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయి అని నారాయణ అన్నారు. -
కాంగ్రెస్లో చేరిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం..
సాక్షి, జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుతుండటంతో.. గెలుపే లక్ష్యంగా అన్నీ పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఎన్నికల పోరుకు మరో ఆరు రోజులే సమయమున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. అలంపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్ఎస్ను వీడి. కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహంను మరోసారి బీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్.. అనూహ్యంగా అభ్యర్థిని మార్చారు. అబ్రహం స్థానంలో చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి టికెట్ ఖాయం చేసింది పార్టీ అధిష్టానం. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో అబ్రహం బీర్ఎస్ పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. -
చిన్న చిన్న లోపాలపై రాద్ధాంతం తగదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిన్నరేళ్లలో తగిన న్యాయం చేసిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో.. తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రస్థానం పేరిట మీడియాకు ప్రజంటేషన్ ఇచ్చారాయాన. ఈ సందర్భంగా.. తెలంగాణ అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకూ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారు. నేడు తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్వన్ స్థానంలో తెలంగాణ ఉంది. సాగు నీటి ప్రాజెక్టుల కోసం లక్ష 70 వేల కోట్లు ఖర్చు పెట్టిన కొత్త ప్రోజెక్ట్ లు కట్టాం. దీంతో తెలంగాణ పల్లెల్లో కరువు పూర్తిగా కనుమరుగు అయ్యింది. శిథిలావస్థలో పాఠశాలలు ప్రస్తుతం కొత్త బడులు కట్టించాం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం. అందరికీ వైద్యం అందుబాటులో ఉంచాం. రైతు బంధు ద్వారా 70 లక్షల మందికి రూ. 73,000 వేల కోట్లు ఇచ్చాం. దేశంలో రైతును రాజును చేసింది తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం. రోజులో 24 గంటల కరెంట్ ఇచ్చేది దేశంలో కేవలం తెలంగాణ మాత్రమే. రైతు వేడుకలు నిర్మించి రైతులకు లబ్ధి చేకూరుస్తున్నాం. రైతులకు 5లక్షల రైతు భీమా అందిస్తున్నాం. తెలంగాణలో కేజీ టూ పీజీ విద్యను అందిస్తాం. ‘పలకతో రండి.. పట్టా పోండి’.. ఇదే మా విద్యా విధానం.. ప్రతిపక్షాల విమర్శలపై.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను.. అనవసరమైన రాద్ధాంతంగా కొట్టిపారేశారు కేటీఆర్. ‘‘సముద్ర మట్టానికి ఎత్తులో నీటిని తీసుకురావటం కష్టమైన పని. అందుకే లిఫ్ట్ ఇరిగేషన్ తోనే ఎత్తులో ఉన్న తెలంగాణకు నీటిని తీసుకురావాలనే ఆలోచనతోనే కాళేశ్వరం కట్టింది. ప్రాజెక్టులు కట్టాక.. చిన్న చిన్న లోపాలు సహజమే. ప్రతిపక్షాలు వాటి మీద రాద్ధాంతం చేయడం తగదు. కాళేశ్వరంపై నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. అది కేవలం ఒక్క ప్రాజెక్ట్ కాదు. అందులో మూడు బ్యారేజ్ లు ఉన్నాయి. ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు రెండు పంటల నీళ్ళు అందిస్తున్నాం. దాని సామర్థ్యం 160 టీఎంసీలు, పైగా 1,531 కిలోమీటర్ల గ్రావేటి కెనాల్ ఉంది. గతంలో ఇతర రాష్ట్రాల్లో కట్టిన ప్రాజెక్టుల విషయంలోనూ ఇలాగే జరిగిన సందర్భాలు అనేకం. కాబట్టి అనవసరంగా విమర్శలు చేయడం సరికాదు. ప్రజలపై ఒక్క పైసా భారం పడకుండా లక్ష్మి బ్యారేజ్ మరమ్మత్తు పూర్తి చేస్తాం.. .. ప్రచారాల్లో ధరణి తీసేస్తామని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. పట్వారీ వ్యవస్థ తీసుకొస్తే మళ్ళీ దళారీ వ్యవస్థ వచ్చినట్లే!. ప్రతిపక్షాలు పట్వారీ వ్యవస్థ తీసుకొస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. తెలంగాణ సమాజం ఇది గమనించాలి.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాలపై నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా? అని ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ ఎవరైనా సరే లెక్కలతో రండి. నేను చర్చకు సిద్దం. గాలి మాటలు మాట్లాడొద్దు. మా ప్రభుత్వం లక్షా 60 వేల ఉద్యోగాలిచ్చింది. మొత్తంగా.. నీళ్లు, నిధులు, నియామకాలకు తగిన న్యాయం చేసింది కేసీఆర్ సారరథ్యంలోని మా ప్రభుత్వం’’ అని కేటీఆర్ ప్రసంగించారు. -
కేసీఆర్ చదివిన బడి కూడా ఇందిరమ్మ పాలనలోనే కట్టింది
సాక్షి, జగిత్యాల: దీర్ఘకాలిక లక్ష్యాలతో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాలను జోడుగుర్రాల్లా పరిగెత్తించడమే కాంగ్రెస్ లక్ష్యమని జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. సాక్షితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇందిరమ్మ పాలనను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక్షస పాలనగా అభివర్ణించారు. కానీ, ఆయన చదువుకున్న బడి కూడా ఇందిరమ్మ పాలనలోనే కట్టింది. నాకు ఇవే చివరి ఎన్నికలంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆ మాట నేనెప్పుడూ అనలేదు. ఇంకా రెండేళ్లు ఎమ్మెల్సీ ఉంది కదా.. మళ్లీ ఎమ్మెల్యే బరిలోకి ఎందుకు దిగుతున్నానంటూ కొందరు నాపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య తేడాల్ని గుర్తించాలివాళ్లు.. అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలకు కౌంటర్ ఇచ్చారాయన. తన హయాంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడేవాళ్లకు.. పొలాస అగ్రికల్చర్ కాలేజ్, జేఎన్టీయూ, న్యాక్ వంటి కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారాయన. వైఎస్సార్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉంటూ జగిత్యాలను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారాయన. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ పునర్నిర్మాణం చేసి తీరుతామని.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈసారి పది నుంచి పదకొండు సీట్లు కాంగ్రెస్వేనని ధీమా వ్యక్తం చేశారు జీవన్రెడ్డి. -
మిత్రున్ని మోసం చేసిన కేసీఆర్కు మీరు ఓ లెక్కా: రేవంత్రెడ్డి
సాక్షి,నర్సాపూర్ : నర్సాపూర్ కాంగ్రెస్ నాయకులు నమ్మించి మోసం చేసి పార్టీలు మారారని, కార్యకర్తలు మాత్రం పార్టీ జెండా మోస్తూనే ఉన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. నర్సాపూర్లో జరిగిన బహిరంగసభలో రేవంత్ మాట్లాడారు. ‘ఇక్కడి ఎమ్మెల్యే మదన్ రెడ్డి , కేసీఆర్ స్నేహితులు అంటారు. మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా మిత్రున్ని మోసం చేసిన కేసీఆర్కు మీరు ఓ లెక్కా. మదన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించలే. పార్టీ ఫిరాయించిన సునీతా లక్ష్మా రెడ్డికి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని సిరిసిల్ల జోన్లో కలిపి నిరుద్యోగులను మోసం చేశారు. మేం అధికారంలోకి వస్తే చార్మినార్ జోన్లో కలిపే అవకాశాన్ని పరిశీలిస్తాం. నర్సాపూర్ గడ్డ..లంబాడీల అడ్డ మేం అధికారంలోకి వస్తే తండాల అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తాం. కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు బంగారు పళ్లెంలో తింటూ బంగారు తెలంగాణ అంటున్నారు. రైతుల ఆత్మహత్యల్లో, బెల్టు షాపుల్లో తెలంగాణ నెంబర్ వన్ చేసిండు కేసీఆర్. పార్టీ మారి మోసం చేసిన సునీతా లక్ష్మా రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలి. ఆమె కోసం ప్రచారం చేస్తే నాపై కేసులు పెట్టారు. ఆమె మాత్రం కేసీఆర్ పార్టీలో చేరారు. నమ్మక ద్రోహులు ఎవరైనా సరే బండకేసి కొట్టాలి. అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు. ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రాజ్యం అంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే దళితులకు, గిరిజనులకు భూములు పంచి ఇచ్చిన రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం 12 లక్షల పోడు భూముల పట్టాలు ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యం నాగార్జున సాగర్, శ్రీ శైలం కట్టింది. ఇందిరమ్మ రాజ్యం ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ను అభివృద్ధి చేసింది. ఇందిరమ్మ రాజ్యం రిజర్వేషన్లు ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గర నువు బిచ్చం ఎత్తుకుని బతికేటోడివి’ అని రేవంత్రెడ్డి కేసీఆర్పై ఫైర్ అయ్యారు. ఇదీచదవండి..కాంగ్రెస్ తెచ్చేది భూ మాత కాదు..భూ మేత : కేసీఆర్ -
'హస్తం'లో.. చివరి నిమిషం వరకు.. వీడని నామినేషన్ల గందరగోళం!
సాక్షి, తెలంగాణ: 'కాంగ్రెస్ అంటే గందరగోళం. పార్టీలో నేతల ఇష్టారాజ్యం. ఇక ఎన్నికలొస్తే.. తెలంగాణ కాంగ్రెస్లో కనిపించే దృశ్యాలు అసాధారణంగా ఉంటాయి. టిక్కెట్స్ ఆరు నెలల ముందే ప్రకటిస్తామని చెప్పినా.. ఎప్పటిలాగే నామినేషన్ల చివరి రోజు వరకు ప్రహసనం సాగింది. కొన్ని చోట్ల సీనియర్లకే పార్టీ హైకమాండ్ ఝలక్ ఇచ్చింది. 20 మందికి పైగా అప్పటికప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి టిక్కెట్లు తీసేసుకున్నారు. ఇలా ఉంటది కాంగ్రెస్తోని.. సీట్ల గందరగోళం ఎలా ఉందో ఓసారి చూద్దాం.' ఆశావహుల్లో టెన్షన్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడానికి కొన్ని గంటల ముందు కాంగ్రెస్లో అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. ఎన్నికల షెడ్యూల్ రావడానికి చాలా మందే అభ్యర్థులను ఖరారు చేసేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఎప్పుడూ చేసే విధంగానే చివరి నిమిషం వరకు ఆశావహుల్లో టెన్షన్ పెంచింది. నల్గొండ జిల్లా మునుగోడులో రాజగోపాల్రెడ్డి, మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మెదక్ నియోజకవర్గాల్లో మైనంపల్లి హనుమంతరావు, ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో వివేక్ వెంకటస్వామి వంటి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక అతి విచిత్రంగా జరిగింది. వీరంతా అప్పటికప్పుడు పార్టీలో చేరి అభ్యర్థులైపోయారు. ఇలాంటి నాయకులు గతంలో కాంగ్రెస్లో ఉన్నవారే. పార్టీ అధికారంలో లేనపుడు బయటకు వెళ్ళిపోయి.. ఇప్పుడు అధికారం వస్తుందన్న ఆశతో మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడిన నేతలు ఇటువంటి వారిని చూసి హతావులవుతున్నారు. మొత్తానికి నాలుగు విడతలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. జాబితాల ప్రకటించడానికి ముందు పదుల సంఖ్యలో ఎన్నికల కమిటీ సమావేశాలు జరిగాయి. ఆశావాహుల నుంచి వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లకు ఎంత డిమాండ్ ఉందో అర్దం అవుతోంది. దరఖాస్తుల స్వీకరణ తర్వాత టీ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ గాంధీభవన్లో మూడు సార్లు కూర్చోని ఆశావహుల జాబితాను ఫిల్టర్ చేసింది. ఇక ఆ తర్వాత కథ అంతా ఢిల్లీలోనే నడిచింది. టిక్కెట్లు ఆశించిన నేతలు ఢిల్లీలో పడిగాపులు పడ్డారు. టిక్కెట్ దక్కినవారు సంబరాలు చేసుకుంటూ తిరిగివచ్చారు. ఆశాభంగం పొందినవారు నిరాశతో వెనుదిరిగారు. హైదరాబాద్ చేరాక ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కున్నారు. కొత్తగా వారికే ఎక్కువగా అవకాశం.. మొదటి జాబితాలో 55 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. చాలా మంది సీనియర్లకు ఆ జాబితాలో చోటు ఇవ్వలేదు. ఇక రెండో జాబితా ప్రకటించాక మాత్రం టిక్కెట్ రాని నేతలు నానా యాగీ చేసారు. చాలా మంది నేతలు గాంధీ భవన్ ముందే తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. చివరికి గాంధీ భవన్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అభ్యర్థుల ఎంపికలో సునీల్ కనుగోలు ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోందని పార్టీలో టాక్ నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల పేర్లను సునీల్ సిఫార్సు చేసారట. దీంతో చాలా సెగ్మెంట్లలో నేతల మధ్య గొడవలకు దారితీసాయని చెబుతున్నారు. దీంతో పాటు అసలు దరఖాస్తు చేయని నేతలకు టిక్కెట్ ఇవ్వడం పట్ల పార్టీ నేతల్లో వ్యతిరేకత వచ్చింది. చాలా మంది కొత్తగా వచ్చిన వారికి వెంటనే టిక్కెట్లు ఇవ్వడం పార్టీలో అశాంతికి కారణం అయింది. పార్టీలో టిక్కెట్లు అమ్ముకున్నారనే తీవ్ర ఆరోపణలు, దానిపై చర్చకు అప్పటికప్పుడు వచ్చినవారికి సీట్లు ఇవ్వడమే కారణం కావచ్చు. చివరి నిమిషం వరకు ఉత్కంఠ..! ఇక అభ్యర్థులను ప్రకటించి చివరి నిమిషంలో మార్చడంతో పెద్ద దుమారమే రేపింది. వనపర్తి, బోధ్, పటాన్చెరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి చివరి నిమిషంలో మార్చారు. ఇలా మార్చడానికి సునీల్ కనుగోలు ఒక కారణం అయితే.. నేతల ఒత్తిడి మరో కారణం అంటున్నారు. మరోవైపు నల్లగొండ జిల్లాలో మూడు స్థానాల అభ్యర్థులను చివరి రోజు వరకు సాగదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. సూర్యాపేట విషయంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డికి టిక్కెట్ ఇప్పించడంలో ఉత్తమ్ కుమార్రెడ్డి, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ను కాదని మందుల సామ్యూల్కి టిక్కెట్ దక్కేలా చేయడంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సక్సెస్ అయ్యారు. అయితే అన్ని జిల్లాల్లో మెజారిటీ స్థానాలు తన మనుషులకు ఇప్పించుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. నల్లగొండలో మాత్రం ఫెయిలయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇక యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూ ఐ, ఓబీసీ, ఎస్టి సెల్లకు టిక్కెట్లు కేటాయించకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. 119 సీట్లలో కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించగా మిగిలిన 118 సీట్ల లో 22 స్థానాలు బీసీలకు, 31 స్థానలు ఎస్సీ, ఎస్టిలకు, 65 స్థానాలు ఓసిలకు ఇచ్చారు. బీసీలకు 30 కి పైగా ఇవ్వాలని కాంగ్రెస్ మొదట భావించినప్పటికీ టిక్కెట్ల కేటాయింపులో అది సాధ్యం కాలేదు. -
ప్రత్యర్థులకు సవాల్ విసిరిన కేసీఆర్.. షెడ్యూల్ రాక ముందే అభ్యర్థుల ప్రకటన
సాక్షి, తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. గులాబీ పార్టీ అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని పార్టీల కంటే ముందే గులాబీ బాస్ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. గతంలో మాదిరిగానే షెడ్యూల్ రాకుండానే అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు కేసీఆర్. అభ్యర్థులంతా ఎప్పటినుంచో ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా ప్రతి రోజూ మూడు నాలుగు సభల్లో ప్రసంగిస్తూ దూకుడు పెంచారు. నామినేషన్లును పూర్తిచేసిన అభ్యర్థులు.. అసెంబ్లీ ఎన్నికల యుద్ధంలో ఒక కీలక ఘట్టం ముగిసింది. అభ్యర్థులంతా నామినేషన్లు వేసేశారు. ఇక ప్రచార జోరు తీవ్రం కానుంది. రెండు నెలల క్రితమే పార్టీ అభ్యర్థులను ప్రకటించడం..ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అభ్యర్థులందరికీ బి ఫామ్స్ కూడా అందజేయటం పూర్తి చేసింది గులాబీ పార్టీ. రాష్ట్రంలో మొత్తం 119 స్థానాలుండగా...తొలి విడతలోనే 115 స్థానాలకు సెప్టెంబర్ 21న అభ్యర్థులను ప్రకటించించారు. నాంపల్లి, గోషామహల్, జనగామ, నర్సాపూర్ అభ్యర్థులను మాత్రం అప్పుడు పెండింగ్లో ఉంచారు. ఆ తర్వాత నెమ్మదిగా జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించారు. మరికొద్ది రోజులకు నర్సాపూర్ లో సునీత లక్ష్మారెడ్డికి, ఇంకో రెండు స్థానాలకు టిక్కెట్లు కేటాయించారు. రెండుస్థానాల్లో మార్పులు.. అసంతృప్తులను ఎక్కడికక్కడ బుజ్జగించి...వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించి...భవిష్యత్పై భరోసా కల్పిస్తూ...గులాబీ పార్టీ ప్రచారంలో ముందుకు దూసుకెళుతోంది. అందరికంటే ముందుగా జాబితా ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ అందులో రెండు స్థానాల్లో మాత్రమే మార్పులు చేసింది. మల్కాజ్గిరి స్థానం నుంచి మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ కేటాయించినప్పటికీ..ఆయన కొడుక్కి మెదక్ టిక్కెట్ రాకపోవడంతో పార్టీ మీదు బురద జల్లి...బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాంగ్రెస్లో చేరి తనకు మల్కాజ్గిరి, తన కొడుక్కి మెదక్ టిక్కెట్ తెచ్చుకుని బరిలోకి దిగారు. దీంతో మల్కాజ్గిరి స్థానం నుంచి బీఆర్ఎస్ టిక్కెట్ను మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి కేటాయించింది. అలాగే ఆలంపూర్ నియోజకవర్గానికి మొదటి లిస్టులోనే అబ్రహం పేరు ప్రకటించినప్పటికీ అక్కడి పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేవని గ్రహించి విజయుడుకు అవకాశం కల్పించారు. ఇలా రెండు స్థానాల్లో మినహా గులాబీ పార్టీలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే బీ ఫార్మ్స్ నింపాలి.. 2018లో ఎదురైన సమస్యలు.. అనుభవాల దృష్ట్యా నామినేషన్ల దాఖలు, బీ ఫామ్స్ భర్తీ విషయంలో గులాబీ పార్టీ నాయకత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. నిపుణుల సమక్షంలోనే ఫార్మ్స్ నింపాలని కేసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ల పేపర్లు నింపేటప్పుడు ఏమరుపాటు లేకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాతే నింపాలని కూడా ఆదేశించారు. గతంలో గెలుపొందిన అభ్యర్థుల్లో పది మందికి పైగా అనర్హత కేసులు ఎదుర్కొనడమే గాకుండా వారికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రావటంతో ఈ అంశాలపై పార్టీ దృష్టి పెట్టింది పార్టీ. వాటి వల్ల ప్రస్తుతానికి పెద్దగా ఇబ్బంది లేకపోయినా కచ్చితంగా ఈసారి ఏ చిన్న అవకాశం కూడా పక్క పార్టీలకు ఇవ్వకూడదని కేసీఆర్ అభ్యర్థులకు సూచించారు. ఇక ప్రచారం విషయంలో కూడా రాబోయే 15 రోజులు గులాబీదళం కీలకంగా వ్యవహరించనుంది. కేసీఆర్ రాకతో గ్రౌండ్ లెవెల్లో మార్పులు.. పార్టీ అభ్యర్థుల కోసం గులాబీ బాస్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికి తొలివిడత ప్రచారం ముగిసింది. దీపావళి తర్వాత రెండో విడత ప్రచారం ప్రారంభం కానుంది. గ్రౌండ్ లెవెల్ లో మొదటి విడత షెడ్యూల్ కు సంబంధించి ఫీడ్ బ్యాక్ ఏ విధంగా ఉందనే దానిపై కేసీఆర్ ఆరా తీశారు. అంతకుముందున్న కొంత వ్యతిరేకత కనిపించినప్పటికీ.. కేసిఆర్ గ్రౌండ్ లో అడుగు పెట్టగానే పరిస్థితిలో మార్పు వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
-
నేటి నుంచి కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ప్రచారంలో దూసుకుపోతోంది. ఇక, ఈరోజు నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. రెండో విడతలో భాగంగా నేడు సీఎం కేసీఆర్ బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో బీఆర్ఎస్ ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. ఇక, ఈ నెల 28న వరంగల్ ఈస్ట్, వెస్ట్ తోపాటు గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈ నెల 28వ తేదీ వరకు 54 సభల్లో పాల్గొంటారు. ఇప్పటికే తొలి విడుత ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. -
స్నేహితుల మధ్య యుద్ధం.. గెలుపు నీదా నాదా సై..!
వారిద్దరూ స్నేహితులు.. అంతేకాదు.. కుటుంబాల మధ్య కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయంగా ప్రత్యర్థులైనా ఎప్పుడూ బయటపడి ఒకరినొకరు పెద్దగా విమర్శించుకోరు. ఆ సిటీలో రాజకీయవర్గాల్లో అందరికీ తెలిసిన విషయమే ఇది. తాజా ఎన్నికల్లో కూడా వారిద్దరూ చెరో పార్టీ తరపున తలపడుతున్నారు. ఇక తప్పనిసరిగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. నామినేషన్లు ముగిసి ప్రచారం ఊపందుకోవడంతో విమర్శల జోరు పెరుగుతోంది. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ మంచి స్నేహితులు. సామాజికవర్గ లెక్కలు వీరిద్దరినీ ఒక్కటిగా పెనవేశాయనే టాక్ ఎలాగూ ఉంది. గతంలో ఒకింత తీవ్రస్థాయిలోనే ఒకరిపై ఇంకొకరు అటాక్ చేసుకున్న వీరిద్దరూ.. ఆ తర్వాత ఒక అండర్ స్టాండింగ్కు వచ్చారనే అభిప్రాయం కరీంనగర్ జనంలో ఉంది. ఇక అప్పట్నుంచీ వీరిద్దరూ పార్టీల పరంగా కౌంటర్స్ విసురుకుంటారే తప్ప.. వ్యక్తిగత విమర్శలు చేసుకునే పరిస్థితి రాలేదు. ఒక సుహృద్భావమైన వాతావరణంలో రెండు ప్రత్యర్థి పార్టీల నేతలు తమ రాజకీయాలను కొనసాగిస్తున్నారు. కానీ, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు ముందుకు రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాల్గోసారి కూడా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా.. తన చిరకాల ప్రత్యర్థినెలాగైనా ఈ సారి ఓడించి తీరాలన్న కసితో.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బరిలో నిల్చారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి మాటల యుద్ధం రకరకాల రాజకీయ చర్చలకు తావిస్తోంది. కేబుల్ బ్రిడ్డ్ కూలిపోతోంది.. కేబుల్ బ్రిడ్జ్ రోడ్డు చూసి జనం నవ్వుకుంటున్నారు.. ముందు అది చూసుకో.. ఆ తర్వాత నీ అభివృద్ధి గురించి చెప్పుకో అంటూ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్.. మంత్రి గంగులపై కామెంట్స్ చేయడంతో ఈ రాజకీయ కాక మొదలైంది. అంతేకాదు.. గంగుల ఓడిపోతాడనే భయంతోనే కేసీఆర్ ఇంతకాలం బీఫామ్ ఇవ్వలేదంటూ కూడా సంజయ్ చేసిన కామెంట్స్.. సహజంగానే మంత్రి గంగులకు కోపం తెప్పించాయి. దాంతో అసలు రేవంత్ పై బలి కా బక్రా అని సానుభూతి చూపించావు గానీ.. నువ్వూ, నీకోసం వచ్చిన రాజాసింగే అసలు బలి కా బక్రాలంటూ ఆయన ఘాటుగా సమాధానం చెప్పారు. కరీంనగర్ లో మూడో ప్లేస్ కే బండి సంజయ్ పరిమితం కాబోతున్నారన్నారు. అంతేకాదు.. తనకు బీఫామ్ ఇవ్వలేదనడం హాస్యాస్పదమని.. మరి నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థెవ్వరో బండి చెప్పాలన్నట్టుగా గత రెండు రోజులుగా గంగుల కౌంటర్ అటాక్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా అమలవుతున్న స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానిది. ఈ ప్రాజెక్టు కింద ఖర్చు చేసే నిధులను కేంద్రమే ఇస్తోంది. కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులు కూడా కేంద్రానివే. నగరం అందంగా తీర్చిదిద్దే పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయి. కాని బీజేపీ నేతలు ఈ విషయాన్ని ప్రజల్లో సమర్థవంతంగా చెప్పుకోలేకపోతున్నారనే టాక్ నడుస్తోంది. కాని అదే స్మార్ట్ సిటీ అభివృద్ధి కార్యక్రమాలను తమకనుకూలంగా మల్చుకుని.. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్లుతూ బీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రి గంగుల వర్గం జనంలోకి వెళ్లుతుండటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా గతంలో పరుష పదజాలం వాడి నాలుక్కర్చుకుని మళ్లీ తిరిగి ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చిన ఇద్దరు మిత్రులు.. ఇప్పుడు ఎన్నికల వేళ నోటికి పని చెప్పి కౌంటర్ అటాక్స్ తో జనం మధ్య జరిగే చర్చల్లో భాగస్వాములవుతున్నారు. చదవండి: కేసీఆర్కు కొత్త కష్టాలు.. గులాబీ నేతల్లో టెన్షన్? -
నన్ను చంపాలని చూశారు: ఎమ్మెల్యే గువ్వల
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ గూండాలు తనపై దాడి చేశారని, తన కాన్వాయ్ని వెంబడిస్తూ దాడి చేశారని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ నా అనుచరులను చంపినంత పనిచేశారు. రాయితో నాపై దాడి చేశారు. ఈ మధ్యనే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేశారు నిన్న నామీద దాడిచేశారు. నా అదృష్టం, ప్రజల దీవెనల వల్ల బతికి బయటపడ్డా. వంశీకృష్ణ గతంలో నా ఆఫీసు మీద దాడి చేశాడు. అతనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం, కేసీఆర్, కేటీఆర్ ఆశయాల కోసం పనిచేస్తా’ అని బాలరాజు చెప్పారు. కాగా, అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య శనివారం రాత్రి ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ నేతలు కారులో డబ్బు తరలిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు వెంబడించారు. ఇరు పార్టీల నేతలు రాళ్లు విసురుకున్నారు. రాళ్ల దాడిలో గువ్వల బాలరాజుకు గాయాలయ్యాయి. కేటీఆర్, హరీశ్రావు పరామర్శ.. దాడి తర్వాత అపోలో ఆస్పతత్రిలో చికిత్స పొందిన ఎమ్మెల్యే బాలరాజును మంతత్రులు కేటీఆర్, హరీశ్రావు వేర్వేరుగా పరామర్శించారు. దాడి వివరాలు, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇదీ చదవండి..నా భర్తపై దాడిని ఖండిస్తున్నా: ఎమ్మెల్యే గువ్వల భార్య -
నా భర్తపై దాడిని ఖండిస్తున్నా: ఎమ్మెల్యే గువ్వల భార్య
సాక్షి,హైదరాబాద్ : తన భర్త మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అచ్ఛంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భార్య గువ్వల అమల అన్నారు. దాడి ఘటనపై అపోలో ఆస్పత్రి వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారం చేసుకోనివ్వకుండా కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ తన అనుచరులతో దాడులకు తెగబడుతున్నాడు. ప్రచారం ముగించుకొని వెళ్తుండగా మా వాహనాలను అడ్డగించి కార్ల అద్దాలను ధ్వంసం చేసి రాళ్లతో దాడి చేశారు. నా భర్తకు దవడ, మెడ భాగంలో గాయాలయ్యాయి. డాక్టర్లు ఇప్పటికే స్కానింగ్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. గతంలో వంశీకృష్ణ అనుచరులు నాపై అసభ్యకరంగా మాట్లాడారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ల తీరు మార్చుకోవడం లేదు. మా కార్యకర్తలను బెదిరిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాల్స్ చేస్తున్నారు. నియోజకవర్గానికి వస్తే అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నీచమైన రాజకీయాలు సరికాదు. అచ్చంపేట నియోజకవర్గం ప్రజలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆయన అనుచరులకు బుద్ధి చెప్తారు’ అని గువ్వల భార్య హెచ్చరించారు. కేటీఆర్ పరామర్శ.. దాడి తర్వాత హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గువ్వల బాలరాజును ఆదివారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరామర్శించారు. రాళ్ల దాడిలో గువ్వలకు గాయాలు.. కాగా, అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య శనివారం రాత్రి ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ నేతలు కారులో డబ్బు తరలిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు వెంబడించారు. ఇరు పార్టీల నేతలు రాళ్లు విసురుకున్నారు. రాళ్ల దాడిలో గువ్వల బాలరాజుకు గాయాలయ్యాయి. ఇదీ చదవండి..బీఆర్ఎస్లో చేరిన పాల్వాయి స్రవంతి -
కేసీఆర్కు కొత్త కష్టాలు.. గులాబీ నేతల్లో టెన్షన్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇక, నామినేషన్లలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్లో 145 మంది కలిసి 154 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో, గజ్వేల్లో నామినేషన్లతో బీఆర్ఎస్కు కొత్త టెన్షన్ ఎదురైంది. నామినేషన్లపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. వివరాల ప్రకారం.. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా దాఖలైన నామినేషన్లపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. సీఎం కేసీఆర్పై నామినేషన్లు వేసిన బాధితులను నేతలు బుజ్జగిస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఇక, నామినేషన్లు వేసిన వారిలో వందకుపైగా రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి ప్లాట్స్ బాధితులు, రైతులు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించాలని రైతులు నామినేషన్లు వేశారు. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరఫున 30కిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో, రంగంలోకి దిగిన గులాబీ పార్టీ నేతలు వారిని విత్డ్రా చేసుకోవాలని బుజ్జగిస్తున్నారు. ఈ క్రమంలో గజ్వేల్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో నామినేషన్ల దాఖలును సీఈఓ ఆఫీస్ ఫైనల్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో కలిపి 4,798 మంది 5,716 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా గజ్వేల్లో 145 మంది కలిసి 154 నామినేషన్లు దాఖలు. 116 నామినేషన్లతో మేడ్చల్ సెకండ్ ప్లేస్, కామారెడ్డిలో 92 మంది 104 నామినేషన్లు వేశారు. అత్యల్పంగా నారాయణపేటలో 13 నామినేషన్లు వేశారు. వైరా, మక్తల్లో కూడా 13 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఇది కూడా చదవండి: అచ్చంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గాయాలు! -
రాజగోపాల్రెడ్డిని ఓడించి తీరాల్సిందే: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: డబ్బు మదంతో వంద కోట్లు ఖర్చు పెట్టి మళ్లీ మునుగోడులో గెలవాలని రాజగోపాల్రెడ్డి చూస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కచ్చితంగా ఈ సారి రాజగోపాల్ రెడ్డిని ఓడించాల్సిందేనన్నారు. మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి తెలంగాణభవన్లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ కండువా కప్పి ఆమెను ఆహ్వానించారు. పాల్వాయి స్రవంతి చేరిక సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘రాజగోపాల్రెడ్డి ఎందుకు పార్టీలు మారాడనేది అర్థం కావడం లేదన్నారు. అసలు మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో తెలియదు. రాజగోపాల్రెడ్డి మళ్లీ కాంగ్రెస్లో ఎందుకు చేరాడు. మాకు పాల్వాయి కుటుంబంతో అనుబంధం ఉంది. తెలంగాణ బాగుండాలని కోరుకున్న వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్లోనే ఉంటాను అని అనేవారు. అలాంటి పాల్వాయి కూతురికి కూడా టికెట్ ఇవ్వకపోవడం దారుణం పాల్వాయి స్రవంతి అభ్యర్థిగా లేకపోతే మునుగోడు ఉప ఎన్నికలో ఆ ఓట్లు కూడా కాంగ్రెస్కు వచ్చేవి కావు. రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారు. ఇప్పుడు ఒకరి భుజంపై ఒకరు చేతులేసుకొని తిరుగుతున్నారు. మునుగోడులో మాతో కలిసి వచ్చే అందరికీ స్థానిక సంస్థల్లో సముచిత స్థానం కల్పిస్తాం. నల్లగొండ మునుగోడులో ఫ్లోరోసిస్ సమస్య తీర్చింది కేసిఆర్’ అని కేటీఆర్ చెప్పారు బీఆర్ఎస్లో చేరిన పాల్వాయి స్రవంతి పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ‘ చాలా ఆలోచించి నేను బీఆర్ఎస్లో చేరాను. గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు అని నా తండ్రి చెప్పిన మాట. ముందుండి నడిపిన నేతలను వెనక్కి నెట్టి ఇతరులకు అవకాశాలు ఇచ్చారు. నేను పదవుల కోసం ఈ పార్టీలో చేరలేదు. ఇప్పుడు బీఆర్ఎస్తో మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. నన్ను నమ్మి వచ్చిన కార్యకర్తలకు మీరు భవిష్యత్తు ఇవ్వాలని కేటీఆర్ను కోరుకుంటున్న. అందరం కలిసి ముందుకు వెళ్దాం’ అని తెలిపారు. ఇదీ చదవండి...శ్రీవారిని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి -
శ్రీవారిని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి
సాక్షి, తిరుమల: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. జోరు మీదున్న తెలంగాణ ఎన్నికల ప్రచారానికి పండుగ బ్రేక్ రావడంతో ఆయన తిరుమల వచ్చారు. శ్రీవారి దర్శనం అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆంధ్ర, తెలంగాణ మధ్య మానవ, ఆర్ధిక, రాజకీయ సంబంధాలు ఉండాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలిపారు. ‘రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం కావాలని స్వామి వారిని కోరుకున్నా. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి కట్టుగా ఉండాలని ప్రార్ధించా. రాబోయే రోజుల్లో తెలంగాణకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నా’ అని రేవంత్ అన్నారు. కాగా,రేవంత్రెడ్డి శనివారం రామగుండం, బెల్లంపల్లి, ధర్మపురి కాంగ్రెస్ విజయభేరి సభల్లో పాల్గొని సుడిగాలి ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. -
రాష్ట్రంలో మార్పు తప్పదు
సాక్షి, పెద్దపల్లి/ ధర్మపురి/ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు బైబై చెప్పి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి సిద్ధమయ్యారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు కష్టాలు పడుతున్నారని, పదో తరగతి నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాకా ఏ పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేని దుస్థితి ఉందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కేవలం కేసీఆర్ కుటుంబం, చుట్టాలను ముఖ్యమంత్రులు, మంత్రులు చేసేందుకే ఉన్నారా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలుచేస్తామని, చేతి గుర్తుకు ఓటువేసి కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. శనివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, జగిత్యాల జిల్లా ధర్మపురిలలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభల్లో ఆయన ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో చేసిందేమీ లేదు. రాష్ట్రం ఇస్తే ప్రజల జీవన విధానం మారుతుందని, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సోనియాగాంధీ భావించారు. కానీ కేసీఆర్ పాలనలో ఈ ఆశలకు పాతరేశారు. ‘మేడిగడ్డ’కుంగింది.. ‘అన్నారం’పగిలింది లక్షన్నర కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నిరుపయోగం. ఇసుక కదిలిందని అధికారులు చెప్తున్నారు. బుద్ధి ఉన్నవారెవరైనా ఇసుక మీద ప్రాజెక్టు కడతారా? పనిమంతుడు పందిరి వేస్తే కుక్క తగిలి కూలిపోయినట్టు ఉంది. రూ.35 వేల కోట్లతో కట్టాల్సిన ప్రాజెక్టును రూ.లక్షన్నర కోట్లకు పెంచారు. సీఎం కేసీఆర్కు ఆకలి ఎక్కువ. ఆలోచన తక్కువ. 60ఏళ్ల క్రితం కాంగ్రెస్ నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటికీ లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాయి. మూడేళ్ల కింద కట్టిన ‘మేడిగడ్డ’కుంగింది ‘అన్నారం’పగిలింది. ఈ ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. అధికారంలోకి రాగానే వాటిని కక్కిస్తాం. ప్రజలను దోచుకుతింటున్న సీఎం కేసీఆర్ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆదిలాబాద్ను మోసం చేశారు వైఎస్సార్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి కేంద్రంగా చేపట్టారు. దాన్ని అలాగే కొనసాగిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1.60లక్షల ఎకరాలకు సాగు నీరందించేది. కానీ సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించి ఆదిలాబాద్ జిల్లాను మోసం చేశారు. 2004లోనే వైఎస్సార్ రైతులకు ఉచిత విద్యుత్ను అమల్లోకి తెచ్చారు. ఈ పథకంపై పేటెంట్ కాంగ్రెస్దే. ధరణి లేకుంటే రైతుబంధు ఎలాగని కేసీఆర్ అంటున్నారు. మేం అంతకంటే మెరుగైన సాధనం రూపొందించి రైతులను ఆదుకుంటాం. సింగరేణిలో గెలవలేక.. ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులను కుర్చీ వేసుకుని మూయి స్తానన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఎక్కడికిపోయా రు? గనుల్లో ఇసుక, బొగ్గు, బూడిద ఏదీ వదలకుండా దోచుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బందిపోటు దొంగలా మారారు. ఆయన కేసీఆర్ బిడ్డకు, కల్వకుంట్ల కుటుంబానికి కప్పం కడుతున్నాడు కాబట్టే మళ్లీ టికెట్ ఇచ్చారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలిచే సత్తా కేసీఆర్కు లేదు. అందుకే కోర్టుకు వెళ్లి వాయి దా తెచ్చుకున్నారు. సింగరేణి కార్మికులకు కేసీఆర్ దొరికితే బొగ్గుబావుల్లో పాతరేస్తారు. గతంలో సింగరేణి మూతపడే స్థితిలో ఉన్నప్పుడు కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా చేసి ఆదుకున్నారనే విష యాన్ని కార్మికులు మరిచిపోవద్దు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. 2018 ఎన్నికల్లో ధర్మపురిలో శ్రీలక్ష్మినరసింహుడి దయతో అడ్లూరి లక్ష్మణ్కుమార్ గెలిచినా.. ఈవీఎంలను మార్పించిన ఘనత మంత్రి కొప్పుల ఈశ్వర్ కు దక్కింది. ఓట్లను రీకౌంటింగ్ చేయాలని కోర్టు ఆదేశాలిస్తే అధికారులు స్ట్రాంగ్ రూంల తాళాలు పోయననడం సిగ్గుచేటు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దుర్మార్గాలు చేస్తున్నారు. మా సభకు కరెంట్ సర ఫరా కట్ చేయించారు. ప్రజలు ఎన్నికల్లో మీకు కరెంట్ లేకుండా కట్చేస్తారు. ఎమ్మెల్యే బాల్క సు మన్ ఇసుక, సింగరేణి ఉద్యోగాలు, హైదరాబాద్లో భూముల కబ్జాలు చేస్తున్నారు. నూరు కేసులు ఉన్నా యని చెప్పిన సుమన్.. ఇప్పుడు వేల కోట్లు ఎలా సంపాదించారు? అవినీతిపై నిలదీసిన ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నా రు.’’అని రేవంత్రెడ్డి ఆరోపించారు. గోదావరిఖని సభలో ఎమ్మెల్యే శ్రీధర్బాబు, రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్, ఐఎన్టీయూఈ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్, ధర్మపురి సభలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి సభలో మాజీ ఎంపీ వివేక్, నేతలు వినోద్, నల్లాల ఓదెలు, ఏఐటీ యూసీ నాయకుడు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
పొలిటికల్ దీపావళి... పార్టీల స్వగతాలు!
అదేంటోగానీ దీపావళి బాణాసంచాకు చెందిన అనేక అంశాలు ఈసారి ఎన్నికల్లో బాగా రెలెవెంట్ అయి నప్పాయి. ప్రముఖ నేతల, పార్టీల స్వగతాలూ,స్వభావాలూ, ఆలోచనలూ...ఇవన్నీ తమ స్వగతాలుగా బాణాసంచాల్లో రిఫ్లెక్ట్ అవుతున్న తీరు ఇది. బీఆర్ఎస్ స్వగతం... ఎప్పట్నుంచో మన పార్టీ దేదీప్యమానం. మనం జస్ట్ ఓ తాడు పేనితే, అవి ‘దీపావళి తాళ్ల’లా మనకు వెలుగులూ, ప్రత్యర్థుల్ని కట్టడి చేసే మోకులయ్యాయి. మనం ఓ చిన్న గోలీ విసిరితే, అది నల్లగా పాంబిళ్లలా పాకి ప్రత్యర్థులను గజగజలాడించింది. మనమింతగా వెలిగామా! ఎందుకోగానీ తీరా ఎన్నికల ముందే మనకు కొన్ని అపశకునాల బాంబుపేలుళ్లు! మేడిగడ్డను ‘తాటాకు బాంబు’అంటూ ప్రొజెక్ట్ చేసినా, లక్ష్మి బ్యారేజీ కుంగి ‘లక్ష్మి బాంబు’లా పేలింది. సరిగ్గా ఎలక్షన్ టైము చూసుకుని...సర్రుమంటూ కాళ్లకింది భూచక్రంలా గిర్రుమంది. కనీసం డిసెంబరు మూడు నాటికైనా ఈ గండాలన్నీ తొలగి, మనం మతాబులా వెలగాలి మునుపటిలాగే! మన వారసులూ ‘సిసింద్రీ’ల్లా నిలవాలి ఎప్పటిలాగే!! కాంగ్రెస్ స్వగతం... అదేంటోగానీ... నిక్కమైన చక్కటి ‘బాంబు’ఒక్కటైన చాలు అని అధిష్ఠానం అనుకుంటుందా...ఒక్కో నియోజకవర్గంలో ఓ వెయ్యిమంది ‘థౌజెండ్వాలా’ల్లా పటపటా పేల్తారు! అభ్యర్థి ఎంపిక అయ్యేదాకా అందరూ చిటపట, చిటపట, చిటపటలాడుతూనే ఉంటారు. అందర్నీ మనం మన కార్యకర్తలనుకుంటాంగానీ...తామూ నేతలమేనంటూ వాళ్లు ‘టెన్ థౌజెండ్వాలా’లవుతారు. హమ్మయ్య ఎలాగోలా ఎంపిక పూర్తయ్యిందనుకుంటూ, హాయిగా నిట్టూర్చేలోపు...తోటి పోటీదారును సాటి సీఎంగా ఎంచి, ప్రతివాడూ ఎదుటివాడి సీటు కింద మంటపెట్టి వాణ్ని ‘రాకెట్’లా ఎగరేయాలని చూస్తారు. ఒక్కొక్కడు పైపైకెగిరాక...అక్కడా అనేక విన్యాసాలతో రంగురంగుల గోళాల్ని విరజిమ్ముతుంటాడు. అవి ఉల్కాపాతాల్లా సీఎమ్ కుర్చీని తాకి, తమ అవకాశాల్నెక్కడ గండికొడతాయోనంటూ అందరూ భయపడతుంటారు. కమ్యూనిస్టులు... రాజకీయ దీపావళిలో మనకూ బోల్డంత ప్రాధాన్యముందని మనమూ అనుకుంటామా?! కానీ వాస్తవం వేరు. కనీసం మనల్ని దీపావళి అగ్గిపెట్టెలోని వెలుగుపూల అగ్గిపుల్లల్లాగా కూడా చూడరు. తమ సొంత బాణాసంచా పేలడానికి పనికొచ్చే కొవ్వొత్తిలా మాత్రమే చూస్తూ...మనకెలాంటి వెలుగులూ, శబ్దాలూ అక్కర్లేదనీ...కేవలం వాళ్ల కోసమూ, వాళ్ల బాణాసంచాలు వెలగడం కోసమే మనం కొవ్వొత్తుల్లా కాలి, కారి, కరిగిపోతూ త్యాగం చేయాలనుకుంటారు ఈ పొరుగు పార్టీల వాళ్లు. ప్చ్. బీజేపీ... అసలు...ఏ బాంబు వెలగాలన్నా కాకరపువ్వొత్తినే కాల్చి మంట అంటిస్తారు కదా. అసలీ కాకరపువ్వొత్తిని కాకరపువ్వొత్తి అనే ఎందుకనాలి? మన పార్టీ గుర్తు ‘కమలం’కదా. కాబట్టి ఇకపై కాకరపువ్వొత్తిని ‘కమలం పువ్వొత్తి’అనే అనాలంటూ... ‘దీపావళి’సందర్భంగా ఓ రివల్యూషనరీ రిజల్యూషన్ తీసుకోవాల్సిందే మనం. అలా ఎలా కుదురుతుందంటూ మన కాళ్లలోనే పేలేలా ఎవ్వరూ బాంబులు పేల్చకండి. అసలిప్పటివరకు మనం మార్చని పేరంటూ ఏదైనా ఉందా? పథకాలూ, చట్టాల పేర్లూ, వీధుల–నగరాల పేర్లూ మార్చాం. ఆఖరికి...వాళ్లెవరో తమ కూటమికి పెట్టుకున్నారంటూ, ఇంగ్లిష్ లో పలికాల్సిన సొంతదేశం పేరు కూడా ప్రాంతీయ భాషల్లోకే మార్చి పలుకుతున్నప్పుడు కాకరపువ్వొత్తిని... ‘కమలం–పువ్వొత్తి’అని మార్చి పిలిస్తే పోయేదేముంది, ఒక కీలక బాణాసంచాకు మన పార్టీ గుర్తు పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేయడం తప్ప? ఇక సామాన్యుడి స్వగతం... సరే...అన్ని పార్టీలూ బాణాసంచా కాంతులతో ఏదోరకంగా వెలుగుతున్నవే కదా. మరి సామాన్యుడికి మిగిలేదేమిటి, దీపావళినాటి బాంబుల కాలుష్యపు పొగ, నుసి తప్ప! ఆ మర్నాడు వీధుల నిండా బాణాసంచాకు వాడిన కాగితాల చుట్టల వ్యర్థాలు తప్ప! అందుకే...ఇప్పటికైనా తమ బతుకులు వెలిగేపోయేలా ఆలోచించి ఓటేయ్యాలంటూ...ప్రతి సాటి ఓటరుకూ, మరో సామాన్య ఓటరు చేసుకుంటున్న విజ్ఞప్తులివి. తమ బతుకులు చీదేసిన చిచ్చుబుడ్డీలు కాకూడదంటూ చేస్తున్న వినతులివి. -
34 కాలనీలు.. 85 నామినేషన్లు
మేడ్చల్: ఏళ్ల క్రితం చట్ట ప్రకారంగా కొనుగోలు చేసిన భూముల్లో వారు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి ఫిర్యాదుతో వారి స్థలాలు వక్ఫ్ భూములని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తమ సమస్యలను పట్టించుకోవాలని మేడ్చల్ బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని 30 కాలనీల ప్రజలు 85 మందితో అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు వేసి నిరసన తెలిపారు. బోడుప్పల్ ప్రాంతంలో ఆర్ఎన్ఎస్ కాలనీ, పెంటారెడ్డి కాలనీ,ç మారుతీనగర్, ఘట్కేసర్కు చెందిన మధురానగర్ తదితర 30 కాలనీల ప్రజలు నాలుగేళ్లుగా విచిత్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. బోడుప్పల్ ప్రాంతంలో 30 సర్వే నంబర్లలో 300 ఎకరాలు, ఘట్కేసర్ పరిధిలో 10 ఎకరాలు భూమి ఉంది. 40 ఏళ్ల క్రితం అవన్నీ వెంచర్లుగా మారిపోయాయి. బోడుప్పల్, పిర్జాదీగూడ నగర శివారు ప్రాంతాలు కావడంతో శరవేగంగా అభివృద్ధి సాధించాయి. రియల్టర్లు భూములను కొనుగోలు చేసి వెంచర్లను ఏర్పాటు చేశారు. చట్టబద్ధంగా వినియోగదారులకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు ప్లాట్లు కొనుగోలు చేసి సొంతింటి కల నెరవేర్చుకున్నారు. దాదాపు 30 కాలనీలలో ఏడు వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. 2018 వరకు అంతా సాఫీగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. 2018లో ఓ వ్యక్తి కాలనీలు ఉన్న భూములన్నీ వక్ఫ్ భూములని ఫిర్యాదు చేయడంతో ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దీంతో 7వేల కుటుంబాల వారు జేఏసీగా ఏర్పడి పోరాటం మొదలు పెట్టారు. 2022 సంవత్పరంలో 30 కాలనీల్లో ఉన్న భూములన్నీ ప్రభుత్వ నిషేధిత జాబితాలో చేర్చడంతో కాలనీలలో ఇల్లు కట్టుకున్న వారి భవిష్యత్ అంధకారంగా మారంది. జేఏసీ తరపున పోరాటాలు చేసినా పాలకుల నుంచి, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో వారి రోదన అరణ్య రోదనగా మారింది. తమ సమస్యను ఎమ్మెల్యే నుంచి ఎంపీ వరకు ఎవరికి విన్నవించుకున్నా పరిష్కారం కాకపోవడంతో వారు తమ సమస్యపై పాలకులు స్పందించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా 88 నామినేషన్లు వేశారు. శుక్రవారం కాలనీల వాసులు కీసరలోని ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్లను దాఖలు చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో మొత్తం 116 మంది నామినేషన్లు వేయగా అందులో 88 మంది బోడుప్పల్ 30 కాలనీలకు చెందిన వారే. ప్రభుత్వానికి మా సమస్య తెలియాలనే.. మేం ఎన్నికలలో విజయం సాధిస్తామని నామినేషన్ వేయలేదు. మా సమస్య వచ్చే ప్రభుత్వానికి తెలియాలనే మూకుమ్మడి నామినేషన్లు వేశాం. ఎన్నికల ద్వారానైన మా సమస్య ప్రభుత్వం దృష్టికి పోతుందని అనుకుంటున్నాం. – శ్రీధర్రెడ్డి, ఐక్యకార్యాచరణ సమితి అధ్యక్షుడు పాలకులు పట్టించుకోవడం లేదు.. పాలకులు పట్టించుకోకపోవడం వల్లే 88 మంది నామినేషన్లు వేశారు. సమస్యను మంత్రి మల్లారెడ్డికితో పాటు అందరు పాలకులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. మా సమస్య పట్టించుకోని నేతలకు ఓటు ద్వారా బుద్ది చెబుతాం – కుంభం కిరణ్కుమార్, కార్పొరేటర్, జేఏసీ కోచైర్మన్ -
Telangana: వలస ఓటర్ల వేట
సాక్షి, హైదరాబాద్ : బతుకు దెరువు కోసం వలస వెళ్లిన ఓటర్లే ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని మారుస్తారని బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు భావిస్తున్నారు. వారి ప్రసన్నం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వలస వెళ్లిన ఓటర్లు పదివేల మందికిపైనే ఉంటారు. వీరి ఓటింగ్ అభ్యర్థి గెలుపోటములను ప్రభా వితం చేసే వీలుంది. దీంతో పోటాపోటీ ఎన్నికలు జరిగే స్థానాల్లో ఏ ఒక్క ఓటును తేలికగా విడిచిపెట్టకూడదని అభ్యర్థులు నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో దూర ప్రాంతాల నుంచి వారిని రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీ పది మందికి ఓ సమన్వయకర్తను నియమిస్తున్నారు. సంబంధిత గ్రామాల్లో కార్యకర్తలకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఏయే నియోజకవర్గాల్లో ఎక్కువంటే.. ♦ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ, భువ నగిరి, ఆలేరు, తుంగతుర్తి, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోనే 2 లక్షల మంది ఓటర్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించారు. ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే 40 వేలమందికి పైగా వలస ఓటర్లున్నట్టు లెక్కగట్టారు. వీళ్లంతా హైదరాబాద్, భీవండి, ముంబై, సూరత్, షోలాపూర్ ప్రాంతాల్లో వివిధ పనులు చేసుకుంటున్నారు. ♦ దేవరకొండ నియోజకవర్గంలో 25 వేల మంది వరకూ వలస ఓటర్లున్నట్టు తెలుసుకున్నారు. వీళ్లు హైదరాబాద్, మాచర్ల, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లారు. భువనగిరి, ఆలేరుల్లో దాదాపు 20 వేల మంది, తుంగతుర్తి, సాగర్, సూర్యాపేటల్లో పదివేలకు తక్కువ కాకుండా వలస ఓటర్లు ఉంటారని ప్రధాన పార్టీలు లెక్కలేశాయి. ♦ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకునే ఓ నియోజకవర్గంలో 18 వేల వలస ఓటర్లు ఉంటాయని ఓ ప్రధాన పార్టీ లెక్కలేసింది. ముంబై, సోలాపూర్, పుణేలో వివిధ పనులు చేసు కునే వీళ్ల కోసం ఆయా సామాజిక వర్గం నుంచే కొంతమందిని బృందంగా ఏర్పాటు చేసి, పోలింగ్కు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పాలమూరు నియోజకవర్గంలోని రెండు మండలాల పరిధిలో 6 వేలమంది వలస ఓటర్లున్నారు. అక్కడ ఈ ఓట్లే కీలకంగా భావిస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. వారిని రప్పించేందుకు రేషన్ డీలర్ల సాయం కూడా తీసుకుంటున్నారు. ♦నారాయణపేట, కొడంగల్, వనపర్తి నియోజకవర్గాల్లో వలస ఓటర్లు 15 వేలకు పైగానే ఉంటారు. మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, అచ్చంపేట, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లోనూ 10 వేల ఓట్లరు ఉంటారని అంచనా. నారాయణపేట నియోజకవర్గంలోని నారాయణపేట, ధన్వాడ, కోయిల కొండ ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి, బొంరాస్పేట మండలాల ప్రజలు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. మహబూబ్నగర్ జిల్లాలోని గండీడ్, మహ్మదాబాద్, హన్వాడ మండలాలకు చెందిన తండాలకు చెందిన వలస కార్మికులు భారీగా ఉన్నారు. వీరిని రప్పించేందకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రంగంలోకి ప్రత్యేక బృందాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఏదో ఒక ఉద్యోగం కోసమో, పిల్లల చదువుల కోసమో హైదరాబాద్ వచ్చిన వాళ్ళున్నారు. వీళ్ళకు ఇప్పటికీ ఓట్లు, రేషన్ కార్డులు వారి సొంత గ్రామాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వలస ఓటర్లను రప్పించేందుకు అభ్యర్థులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి చిరునామా, ఫోన్ నంబరుతో ఓ డేటాబేస్ రూపొందించడానికి సాంకేతిక నిపుణులూ ఇందులో ఉంటున్నారు. వివిధ పార్టీల నుంచి అందిన సమాచారాన్ని బట్టి ప్రతీ రెండు గ్రామాలకు ఒక్కో బృందం పనిచేస్తోంది. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులుంటున్నారు. నియోజకవర్గం వారీగా వలస ఓటర్ల వివరాలను కంప్యూటరీకరణ చేసేందుకు మరో పది మంది డేటా ఆపరేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరితో మాట్లాడటం, వారికి ఫోన్పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపే యంత్రాంగం కూడా ప్రత్యేకంగా ఉంటోంది. ఓటరు కచ్చితంగా ఏ పార్టీకి ఓటు వేస్తాడనే అంచనాలను ఆయా ప్రాంతాల్లోని నాయకుల ద్వారా సేకరిస్తున్నారు. ఇక పూణే, షోలాపూర్, సూరత్ వంటి ప్రాంతాలకు అభ్యర్థుల ప్రతినిధులు స్వయంగా వెళ్ళి వలస ఓటర్లను కలుస్తున్నారు. ఎన్నికలకు కనీసం రెండు రోజుల ముందే గ్రామాలకు రప్పించాలని నేతలు భావిస్తున్నారు. -
రెండు చోట్ల ఎందుకు పోటీచేస్తారు?
ఎన్నికల్లో ఎవరైనా అభ్యర్థి రెండు, మూడుచోట్ల అసెంబ్లీ/లోక్సభ నియోజకవర్గాల్లో ఎందుకు పోటీచేస్తారు? దానివల్ల లాభనష్టాలేంటి? తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఈ అంశం చర్చకొచ్చింది. ఇక్కడ అత్యంత ఆసక్తికర అంశమేమి టంటే ముగ్గురు సీఎం అభ్యర్ధులు రెండేసి చోట్ల పోటీలో ఉండటం, పరస్పరం పోటీ పడుతుండటం. ఇలా గతంలో ఉమ్మడి ఏపీలో ఎన్నడూ జరగలేదు. ఆ మాటకొస్తే ఇతర రాష్ట్రాల్లోనూ చాలా అరుదుగా జరుగుతుంటుంది. గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు రెండేసి నియోజకవర్గాలకు పోటీచేసే అంశాన్ని నియంత్రించాల ని ప్రతిపాదించారు. దీనివల్ల ఉప ఎన్నికలు జరపాల్సిన ఆవశ్యకత ఏర్పడి అనవసర వ్యయ భారం పడుతోంద ని భావించేవారు. ఈ ఖర్చును సంబంధిత అభ్యర్థి నుంచి వసూలు చేయాలని కూడా కొందరు వాదించేవారు. 1996కి ముందు మూడుచోట్ల పోటీ చేయడానికీ అవకా శం ఉండేది. అలా కొంతమంది చేశారు కూడా. ఆ తర్వా త దానిని రెండు నియోజకవర్గాలకు పరిమితం చేశారు. ఇలా రెండేసి చోట్ల పోటీచేసే వారిలో ప్రముఖ నేతలే ఎక్కువ. తమకు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి, ఒకచోట పోటీ చేస్తే ఓడిపోతామని అనుమానం వచ్చినా జాగ్రత్తపడటానికి, ఇతరత్రా రాజకీయ కారణాలతోనూ రెండేసి చోట్ల పోటీచేస్తుంటారు. కానీ ఈసారి తెలంగాణలో ఏకంగా ముగ్గురు నేతలు రెండేసి చోట్ల పోటీ చేయడం, పైగా వారు ముగ్గురు ఒకరిపై ఒకరు పోటీ పడటం ఈసారి ప్రత్యేకత అని చెప్పాలి. కేసీఆర్ రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయడం తొలిసారి.. తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజక వర్గాల నుంచి రంగంలో దిగారు. గతంలో కేసీఆర్ రెండుసార్లు అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలకు పోటీ చేసి రికార్డు సృష్టించారు. కానీ ఇలా రెండు అసెంబ్లీ స్థానాల్లో ఒకేసారి పోటీచేయలేదు. కేసీఆర్పై కామారెడ్డిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోటీకి దిగుతుండ గా, గజ్వేల్లో బీజేపీ అగ్రనేత, ఒకప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో సభ్యుడైన ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. రేవంత్, ఈటల ఇద్దరూ తమ పార్టీల తరపు న ముఖ్యమంత్రి అభ్యర్థులుగానే పరిగణనలో ఉన్నారు. కొడంగల్ సభలో రేవంత్ ఆ విషయం ప్రజలకు తెలియచెప్పగా, ప్రధాని మోదీ పర్యటన సందర్భంలో బీజేపీ గెలిస్తే ఈటలను ముఖ్యమంత్రిని చేస్తామన్నారని వార్త లు వచ్చాయి. దానిని ధ్రువీకరిస్తూ ఈటల బహిరంగంగానే చెప్పేశారు. సాధారణంగా ఈ స్థాయి నేతలు ఇలా ఒకరిపై ఒకరు తలపడరు. ఎందుకంటే వారి రాజకీయ భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ వీరిద్ద రూ తమకు పట్టున్న వేరే నియోజకవర్గాల్లోనూ పోటీలో ఉన్నందున అసెంబ్లీకి ఎన్నికయ్యే అవకాశాన్ని పదిలపరచుకున్నారని భావించవచ్చు. రేవంత్ కొడంగల్ నుంచి, ఈటల హుజూరాబాద్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో పోటీచేయడంలో ఉద్దేశం గజ్వేల్లో ఓటమి భయంతోనే అని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నా, అంత ఓడిపోయే పరిస్థితి ఉంద ని చెప్పలేం. నిజంగానే అలా జరిగితే బీఆర్ఎస్ అధికా రంలోకి రావడం కష్టమవుతుంది.పైగా గతంలో కేసీఆర్కు కాస్త పోటీ ఇచ్చిన ఒంటేరు ప్రతాపరెడ్డి ఇప్పుడు కేసీఆర్ పక్షానే ఉన్నారు. రెండో సీటుకు పోటీ చేయడం ద్వారా ఆ పరిసర నియోజకవర్గ ప్రజలపై ప్రభావం చూపే లక్ష్యం కూడా ఉంటుంది. ఉదాహరణకు 1983 శాసనసభ ఎన్నికల్లో కొత్తగా టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ గుడివాడతో పాటు తిరుపతిలో పోటీచేస్తారన్న సమాచారం రావడంతో ఆ ప్రాంతంలో విపరీత ప్రభా వం చూపి ప్రత్యర్థి కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై ప్రభావం చూపడానికేనా? మూడు దశాబ్దాల తర్వాత తెలుగు నాయకుడొకరు రెండుచోట్ల పోటీ చేయడం అదే మొదలు కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. బహుశా కేసీఆర్ కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై కొంత ప్రభావం చూపడానికి కామారెడ్డి నుంచి కూడా రంగంలో దిగి ఉండొచ్చు. కామారెడ్డిలో ఇంతవరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ తప్పుకుని కేసీఆర్కు అవకాశం ఇచ్చారు. సీఎం ఈ సీటును గెలిచాక ఆయనకు అవకాశం ఇస్తారా? లేక తన కుమార్తె కవితకు ఇస్తారా అన్న చర్చ కూడా ఉంది. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఈసారి కామారెడ్డిలో విజయం సాధించే పరిస్థితి ఉందన్న వార్తలు వస్తుండేవి. ఎప్పుడైతే కేసీఆర్ పోటీ చేస్తారని వార్తలొచ్చాయో సహజంగానే ఆయన విజయావకాశాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ఆయనను నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి పంపి, రేవంత్రెడ్డి రిస్కు తీసుకుంటున్నారు. తాను పోటీచేయడం ద్వారా కేసీఆర్ను కొంతమేర కామారెడ్డికి పరిమితం చేయొచ్చన్న ఆలోచన ఉండొచ్చు. కానీ కేసీఆర్ దానిని పట్టించుకోకుండా ,ఈ నెలాఖరు వరకు దాదాపు 94 నియోజకవర్గాల్లో ప్రచారానికి షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. రేవంత్ నిజానికి గత ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. కానీ తదుపరి మల్కాజిగిరి లోక్సభ స్థానానికి పోటీచేసి పుంజుకోగలిగారు. తనను గెలిపిస్తే సీఎం చాన్స్ ఉంటుందని చెప్పడంతోపాటు స్థానికంగా కొన్ని ఏర్పాట్లు చేసుకుని వివిధ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయాల్సి ఉంటుంది. రేవంత్ తలనొప్పి తెచ్చుకోవడమే... రేవంత్ కామారెడ్డి నుంచి పోటీచేయడం వల్ల కేసీఆర్కు ఎంత ఇబ్బందో తెలియదు గానీ, ఆయన మాత్రం తలనొప్పి తెచ్చుకోవడమే. ఎందుకంటే కేసీఆర్పై గెలిస్తే సంచలనమే అవుతుంది. కానీ ఓటమిపాలై అది కూడా భారీ తేడాతో అయితే ప్రతిష్ట దెబ్బతింటుంది. అదే సమయంలో కొడంగల్కు ఎక్కువ టైమ్ కేటాయించలేకపోతే ఆయన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొడంగల్లో తనను ఓడించడానికి కుట్ర జరుగుతోందని ఆయనే ఆరోపించారు. అలాగే ఈటల హుజూరాబాద్లో ఆరుసార్లు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నుంచి, ఒకసారి బీజేపీ పక్షాన గెలిచారు. టీఆర్ఎస్కు రాజీనామా చేశాక జరిగిన ఉప ఎన్నికలో భారీ విజయం సాధించడం ఆయనకు ప్రతిష్ట తెచ్చింది. అదే ఊపుతో గజ్వేల్ నుంచి కూడా ఆయన రంగంలో దిగారు. ఇక్కడ కేసీఆర్ను ఓడించడం అంత ఈజీ కాదు. అయినా ఒక చాన్స్ తీసుకుంటున్నారు. అదే టైమ్లో హుజూరాబాద్లో తన బేస్ను కూడా రక్షించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే రెంటికి చెడ్డ రేవిడి అయ్యే పరిస్థితి వస్తుంది. ఓడిన ఘట్టాలు రెండుచోట్ల పోటీచేసిన నేతలు గతంలో గెలిచిన సందర్భాలతోపాటు ఓడిన ఘట్టాలూ ఉన్నాయి. ఈ విషయంలో ఎన్టీఆర్ది ఒక రికార్డు అని చెప్పాలి. ఆయన 1983లో గుడివాడ, తిరుపతి, 1985లో నల్లగొండ, హిందూపూర్, గుడివాడ నుంచి పోటీచేసి చరిత్ర సృష్టించారు. కానీ 1989లో కల్వకుర్తి, హిందూపూర్ నుంచి పోటీచేసి కల్వకుర్తిలో ఓడిపోయారు. అప్పుడు పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. 1994లో టెక్కలి, హిందూపూర్ నుంచి గెలిచారు. ఆ తర్వాత చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నుంచి పోటీచేసి తిరుపతిలో మాత్రమే గెలవగలిగారు. ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీచేసి రెండుచోట్లా ఓడిపోయారు. తెలంగాణలో పెండ్యాల రాఘవరావు అనే కమ్యూనిస్టు నేత 1952లో హన్మకొండ, వర్దన్నపేట అసెంబ్లీ సీట్లకు, వరంగల్ లోక్సభ సీటుకు పోటీచేసి మూడుచోట్లా గెలిచారు. ఆ తర్వాత అసెంబ్లీ సీట్లు వదులుకుని లోక్సభను ఎంపిక చేసుకున్నారు. మరోనేత రాంగోపాల్ రెడ్డి 1962లో బోధన్, మేడారం నుంచి ఇండిపెండెంట్గా ఎన్నికవడం విశేషం. లోక్సభకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఎన్నికలో రెండుచోట్ల పోటీచేసిన నేతలు లేరనే చెప్పాలి. ఏదేమైనా తెలంగాణలో ఈసారి ముగ్గురు సీఎం అభ్యర్ధులు ఎన్నికల గోదాలో దిగడం సంచలనమే. ఒక్కోసారి పెద్ద నేతలు చిన్న నేతల చేతిలో ఓడిపోతుండటం కూడా జరగవచ్చు. ఉదాహరణకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ ఎవరికీ పెద్దగా తెలియని శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు. ఇందిరాగాంధీ రాయ్బరేలీలో రాజ్ నారాయణ అనే చిన్న నేత చేతిలో పరాజయం పాలయ్యారు. ముఖ్యమంత్రి కాకముందు టి.అంజయ్య ముషీరాబాద్లో కార్మిక నేత నాయిని నరసింహారెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత కాలంలో ఆయనకు సీఎం అవకాశం వచ్చినప్పుడు ఏకగ్రీవంగా నెగ్గారు. ఎన్టీఆర్ను చిత్తరంజన్ దాస్ అనే కాంగ్రెస్ నేత కల్వకుర్తిలో ఓడించారు. ప్రఖ్యాత నేతలు ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి వంటివారు సైతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలే. సంజీవరెడ్డి స్వయంగా తన బావమరిది తరిమెల నాగిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇలా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల్లో పలు చిత్రాలు కూడా జరుగుతుంటాయి. మరి తెలంగాణలో ఎలాంటి ఫలితాలు వస్తాయో, ఎవరి భవిష్యత్తు ఎలా మారుతుందో చూద్దాం! - కొమ్మినేని శ్రీనివాసరావు -
గుర్తుంచుకునేలా..
సాక్షి మంచిర్యాల డెస్్క: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తు ప్రధానమైనది. రిజిష్టర్డ్ పార్టీలకు ఎన్నికల సంఘం కామన్ సింబల్ను కేటాయిస్తుంది. ఇక స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉంటే ఈసీ సూచించిన గుర్తుల్లో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ కండిషనర్, అల్మారా, ఆపిల్, ఆటోరిక్షా, బేబీవాకర్, బెలూన్, బ్యాంగిల్స్, బ్యాట్, బ్యాట్స్మెన్, బ్యాటరీ టార్చ్, బెల్ట్, బెంచ్, బ్రష్, బకెట్, కేక్, కెమెరా, డీజిల్ పంప్, ఫుట్బాల్, గ్యాస్ స్టౌవ్, గిఫ్ట్ప్యాక్, గ్రామఫోన్, హార్మోనియమ్, హాకీ అండ్ బాల్, లేడీ ఫింగర్, లాప్టాప్, లెటర్ బాక్స్, లూడో, మిక్సీ, నెయిల్కట్టర్, పెన్డ్రైవ్, కుండ, టెలిఫోన్, టెలివిజన్, టూత్బ్రష్, టూత్పేస్ట్.. ఇలా ఏ అక్షర క్రమం నుంచి డబ్ల్యూ వరకు 193 రకాల వస్తువులను ఎన్నికల సంఘం గుర్తులుగా సూచించింది. స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులో ఈసీ కొన్ని విధానాలు అవలంభిస్తుంది. స్వతంత్ర అభ్యర్థులు మూడు గుర్తులను ప్రాధాన్యత క్రమంలో సూచించాల్సి ఉంటుంది. ఈ గుర్తులను మిగతా ఎవరూ ఎంపిక చేసుకోకుంటే వాటిలో ఒకటి కేటాయిస్తుంది. ఒకే గుర్తును ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటే రిటర్నింగ్ అధికారి లాటరీ ద్వారా ఒకరికి కేటాయిస్తారు. జనసేనకు 32 స్థానాల్లో కామన్ సింబల్ జనసేన పార్టీ విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం తెలంగాణలోని 32 అసెంబ్లీ స్థానాల్లో కామన్ సింబల్ను కేటాయిస్తూ ఈ ఏడాది సెపె్టంబర్ 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. కానీ, పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించిన ఎనిమిది స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేస్తోంది. ఈ స్థానాల్లో ఏడు చోట్ల మాత్రమే అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు ఉంటుంది. జనసేన పార్టీ కోరిన 32 స్థానాల్లో తాండూర్ అసెంబ్లీ స్థానం లేకపోవడంతో ఎన్నికల సంఘం జాబితాలో లేదు. దీంతో ఇక్కడి అభ్యర్థి మరో గుర్తు ఎంచుకోవాల్సి ఉంటుంది. -
డబ్బిచ్చే వాడిదే తప్పు..
‘ప్రజాస్వామ్యం ధనస్వామ్యం, కార్పొరేట్ స్వామ్యం అయిపోయింది. ఓటుకు నోటు ఎప్పుడైతే వచ్చిందో ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతోంది.. డబ్బు ఇస్తున్నవాడిది తప్పా.. తీసుకుంటున్న వాడిది తప్పా అంటే డబ్బు ఇచ్చే వాడిదే తప్పు. ఎందుకంటే నాయకుడనేవాడు ఆదర్శంగా ఉండాలి కాబట్టి డబ్బివ్వడం అనేది అతడి తప్పే అవుతుంది. ఈ ఎన్నికల్లో ప్రజల ఎజెండానే కీలకం కావాలి’అంటున్నారు సినీ విప్లవ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి. ‘దేశంలో పీడిత ప్రజల కోసం కమ్యూనిస్టులు చేసిన త్యాగాలు మహోన్నతం. తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారు. ప్రజా సమస్యలు ఎక్కడున్నా కమ్యూనిస్టులే ముందుకు వచ్చి పోరాటం చేస్తుంటారు’ అని చెప్పిన ఆయన ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రపంచ కమ్యూనిస్టుల్లారా ఏకం కండి.. దేశంలో మొదట్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే ఉండేవి. తర్వాతి కాలంలో కమ్యూనిస్టు పార్టీలు అనేక చీలికలు పేలికలు అయ్యాయి. త్యాగాలు, సిద్ధాంతాలు గొప్పవైనా ఇప్పుడు అలా ఆ పార్టీలు ఉండకపోవడంపై చాలా బాధపడుతున్నాను. ఒకటా రెండా.. ఎన్ని సీట్లు గెలుస్తామన్నది ముఖ్యం కాదు. ఎన్నికల పోరాటంలో వామపక్షాలు కలిసి పోటీ చేయాలి. అందుకు ప్రపంచ కమ్యూనిస్టులంతా ఏకం కావాలి. బీజేపీ కులగణనకు ముందుకొస్తే అప్పుడు నమ్ముతాం అధికారంలోకి వస్తే తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని బీజేపీ అంటోంది. మహిళా బిల్లు పెట్టి దాన్ని ఇంకా పాస్ చేయలేదు. కులగణన చేయమంటే చేయట్లేదు. అలాంటప్పుడు బీసీలకు వారేం న్యాయం చేయగలరు? బీసీలకు మన దేశంలో అన్యాయం జరుగుతోంది. పార్లమెంటులో 13–14 శాతానికి మించి బీసీలు లేరు. వాస్తవంగా దేశంలో బీసీల జనాభా 54 శాతంగా ఉంది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కులగణనకు ముందుకు రావాలి అప్పుడు బీసీ సీఎంను చేస్తామంటే మేం నమ్ముతాం. భయంతోనే ఎన్నికల్లో వెనక్కి తగ్గిన టీడీపీ.. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తామని చివరలో వెనక్కి తగ్గింది. టీడీపీ ఎన్నికల్లో నిలబడకుంటే ఆ పార్టీ క్యాడర్ నైరాశ్యానికి గురవుతుంది. వారు ఆ పార్టీలో మిగలరు. దాని పర్యవసానమే కాసాని జ్ఙానేశ్వర్ పార్టీ మారడం. ఇక్కడ సొంతంగానో, లేదా ఏదైనా పార్టీతో పొత్తుతోనే బరిలోకి దిగిన తర్వాత వ్యతిరేక ఫలితాలు వస్తే, ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పడుతుందన్న భయం కూడా టీడీపీలో కనిపించింది. అందుకే వెనక్కి తగ్గింది. అన్ని పార్టీల్లోనూ వారసులు.. వారసత్వం అనేది దేశవ్యాప్తంగా అన్ని పార్టీల్లో ఉంది. వారసత్వానికి మేం వ్యతిరేకం అని మోదీ చెబుతున్నారు కానీ బీజేపీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఎంతోమంది వారసులు ఎమ్మెల్యేలుగా లేరా? సాక్షాత్తూ హోం మంత్రి అమిత్ షా తనయుడికి క్రికెట్ బోర్డులో కీలక పదవి ఇవ్వలేదా? ఇక రాహుల్గాంధీ సీఎం కేసీఆర్పై చేస్తున్న విమర్శల సందర్భంగా వారసత్వం ప్రస్తావించడం మరీ విచిత్రం. కాంగ్రెస్కు మించిన కుటుంబ పాలన ఇంకెక్కడ ఉంది? వారిది వారసత్వం కాదా? పార్టీ మారే వారిని బహిష్కరించాలి.. పార్టీలు మారడం సులువైంది. ఒక పార్టీ నుంచి గెలిచాక మరో పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ఇది దుర్మార్గం. దీన్ని నిరోధించడానికి పార్లమెంటులో బిల్లుపెట్టాలి. సిద్ధాంతం, పార్టీని చూసి ఓటు వేస్తే, ఆ తర్వాత పార్టీ మారితే అలాంటి వారిని నిలదీయాలి. పార్టీలను మారే వారిని బహిష్కరించాలి. రోజుకు మూడు పార్టీలు మారడమా? ఇదేం విచిత్రం? అలాగే డబ్బులిచ్చేందుకు వచ్చే వారినీ బహిష్కరించాలి. ఏం చేస్తారో బాండ్ రాసివ్వాలి.. ఎన్నికల్లో వచ్చే నాయకులను తమకేం చేస్తారో బాండ్ పేపర్ మీద రాసి సంతకం చేయాలని ప్రజలు కోరాలి. గెలిపించిన తర్వాత బాండ్ పేపర్లో రాసిన హామీలు అమలు చేయకపోతే, కోర్టుకు వెళ్లాలి. అలా ఎన్నికలను పీపుల్స్ ఎజెండాగా మార్చాలి. పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్నింటినీ నెరవేర్చేలా మనం ఒత్తిడి చేయాలి. -బొల్లోజు రవి -
వీరంతా బీజేపీ అభ్యర్థులేనా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అభ్యర్థుల జాబితాపై పార్టీలోని పాతకాపులతోపాటు ఏబీవీపీ, యువమోర్చా విభాగాల్లోని వారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. పార్టీ ప్రకటించిన 111 మంది అభ్యర్థుల్లో 30–35 మంది మాత్రమే పాతనేతలు, పార్టీ సిద్ధాంత భూమిక ఉన్నవారని.. ఇలాంటి పరిస్థితుల్లో సైద్ధాంతిక భూమిక ఉన్న పార్టీగా ప్రజలకు ఏరకమైన సందేశాన్నిస్తారని నిలదీస్తున్నారు. అసలు ఈ అభ్యర్థులను బీజేపీ వారిగా భావించవచ్చా? ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడ్డాక వీరిలో ఎంత మంది పార్టీలో మిగులుతారనే ప్రశ్నలను సంధిస్తున్నారు. పార్టీలో ప్రస్తుత ముఖ్యనేతలు, మరీ ముఖ్యంగా బయట నుంచి వచ్చిన నేతలు వర్గాల వారీగా విడిపోయి తమ అనుయాయులకు పెద్దసంఖ్యలో టికెట్లు ఇప్పించుకున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. టికెట్ల ఖరారులో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలతో బీజేపీ విమర్శల పాలైదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్రపార్టీలోని ముఖ్యనేతలు తమ వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు చేసిన హెచ్చరికలకు జాతీయ, రాష్ట్రనాయకత్వాలు లొంగిపోవడం ఎలాంటి సంకేతాలిస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర పార్టీలో ముందు నుంచి ఉన్న ముఖ్యనేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కొందరు వర్గాలుగా విడిపోయి టికెట్ల కేటాయింపులో తమ పట్టును నిలుపుకునేలా ఒత్తిళ్లు తెచ్చి పైచేయి సాధించడం వంటి పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదంటున్నారు. ఏళ్లకు ఏళ్లు పనిచేసినా... నల్లగొండ, చేవెళ్ల, మహబూబాబాద్ ఎంపీ సీట్ల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా పాతకాపులు, పార్టీ సిద్ధాంతాలు నమ్ముకుని ఏళ్లకు ఏళ్లుగా పనిచేస్తున్న వారికి అవకాశం లభించలేదని వారు వాపోతున్నారు. ఈ స్థానాల్లో కొత్తగా పార్టీలో చేరిన వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక పోతున్నామంటున్నారు. రెండు, మూడువారాల వ్యవధిలోనే పార్టీలో చేరిన పది, పదిహేను మందికి సీట్లు ఇవ్వడం పట్ల విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఈ స్థానాల్లో వీరంతా కచ్చితంగా గెలుస్తారని నాయకత్వం చెప్పగలదా అని ప్రశ్నిస్తున్నారు. అలాంటపుడు అన్నిచోట్లా కాకపోయినా వీలున్న చోట్ల అయినా పార్టీని నమ్ముకున్న వారికి పార్టీకి బలపడేందుకు అవకాశం ఉండేదని వాదిస్తున్నారు. మొత్తంగా 111 స్థానాల వారీగా పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల పూర్వాపరాలు, గతంలో ఉన్న పార్టీలు వంటి వాటిని పరిశీలిస్తే... వీరిలో చాలామంది రెండు, మూడుపార్టీలు మారిన వారేనని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి తర్వాత సమావేశమై భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలనే యోచనలో దీర్ఘకాలం పార్టీలో పనిచేసిన పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. -
గజ్వేల్లో 145 .. కామారెడ్డిలో 92
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసిపోగా, రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. మొత్తం 5,716 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్తోపాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండగా, గజ్వేల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 145 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. కామారెడ్డిలో సైతం 92 మంది నామినేషన్ వేయడం గమనార్హం. మేడ్చల్ నియోజకవర్గంలో 116 మంది, ఎల్బీనగర్ నుంచి 77 మంది, మునుగోడు నుంచి 74 మంది, సూర్యాపేట నుంచి 68 మంది, మిర్యాలగూడ నుంచి 67 మంది, నల్లగొండ నుంచి 64 మంది, సిద్దిపేట నుంచి 62 మంది, కోదాడ నుంచి 61 మంది నామినేషన్ వేశారు. అత్యల్పంగా నారాయణపేట్ స్థానం నుంచి 13 మంది మాత్రమే నామినేషన్లు వేశారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన నిర్వహించనుండగా, 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. పోస్టల్ బ్యాలెట్ కోసం 31,551 దరఖాస్తులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం భారీ సంఖ్యలో ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. దివ్యాంగులు, వయోజనులు, ఎన్నికలతో సంబంధం లేని అత్యవసర సేవల్లో ఉండే ఓటర్లు కలిపి మొత్తం 31,551 మంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా సిద్ధిపేట నుంచి 757 మంది, అత్యల్పంగా మక్తల్ నియోజకవర్గం నుంచి 5 మంది దరఖాస్తు చేసుకున్నారు. వయోజన, దివ్యాంగ ఓటర్లకు ఇంటి వద్దే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు అవకాశం కల్పిం చనున్నారు. 3.26 కోట్లకు పెరిగిన ఓటర్లు ఈ నెల 5న తుది ఓటర్ల జాబితాను ప్రకటించగా, ఆ తర్వాత వచ్చిన ఓటర్ల నమోదు దరఖాస్తులను పరిష్కరించి శుక్రవారం అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,26,18,205కి పెరిగింది. అందులో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705 మంది మహిళలు, 2,676 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. తొలిసారిగా మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్లకు మించిపోయింది. 15,406 మంది సర్విసు ఓటర్లు, 2,944 మంది ఓవర్సీస్ ఓటర్లున్నారు. 2023 జనవరితో పోల్చితే తాజాగా రాష్ట్రంలో 8.75 శాతం మంది ఓటర్లు పెరిగారు. 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు 44,371 మంది ఉండగా, వికలాంగ ఓటర్లు 506921 మంది ఉన్నారు. 18–19 ఏళ్ల యువ ఓటర్ల సంఖ్య 9,99,667 కాగా, మొత్తం ఓటర్లలో వీరి శాతం 3.06గా ఉంది. -
బీజేపీకి భయపడుతున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘కమ్యూనిస్టులను కేసీఆర్ దూరం పెట్టడానికి ప్రధాన కారణం బీజేపీకి భయపడటమే. ఒకవేళ పొత్తు కుదిరితే కమ్యూనిస్టులు ఒకే వేదికపై బీజేపీని విమర్శిస్తారు. ఇది కేసీఆర్కు ఇబ్బందికరమైన అంశం. అలా చేస్తే కేసీఆర్ను బీజేపీ సహించదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే వస్తే ఏమవుతుందోనని కేసీఆర్కు భయం పట్టుకుంది’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం టీయూడబ్ల్యూజే నిర్వహించిన మీట్ ది ప్రెస్లో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పట్ల బీఆర్ఎస్ వైఖరి మారడం వల్లే ఆ పార్టీ తో పొత్తు కుదరలేదన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ తమను సంప్రదించిందని చెప్పారు. తమకు భయపడే కాంగ్రెస్ పొత్తుల విషయంలో కిరికిరి చేసిందన్నారు. కొన్ని జిల్లాల్లో తమ పార్టీ ఉనికినే దెబ్బతీయాలనేది వాళ్ల కుట్ర అని ఆరోపించారు. సీపీఐ, సీపీఎంతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్కు నష్టమని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తమ్మినేని మండిపడ్డారు. రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని, అధికారం వస్తే సోనియాతో మాట్లాడి చెరో మంత్రి పదవి ఇప్పిస్తామనడంపై ధ్వజమెత్తారు. 1996లో జ్యోతిబసును ప్రధానిని చేస్తామంటేనే తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. అధికార పార్టీపై ఎదురుగాలి... బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈ తొమ్మిదేళ్లలో ప్రజా వ్యతిరేకత ఏర్పడిందని తమ్మినేని అన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రస్తుతానికి ఎదురుగాలి వీస్తోందని, అయితే, అధికారం కోల్పోయేంత ఎదురుగాలి వీస్తుందో లేదో చూడాలన్నారు. ఒకవేళ మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిచినట్లయితే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. కాంగ్రెస్లో ఇప్పుడు చేరిన అనేక మంది నాయకులు అప్పుడు బీజేపీతో మంతనాలు జరిపిన వారేనన్నారు. బీఆర్ఎస్ను ఎవరు ఓడించగలరో ఆలోచిస్తున్నామని, మునుగోడు ఉప ఎన్నిక తర్వాత నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వంటి వారు చెప్పారన్నారు. మునుగోడులో బీజేపీ గెలిచినట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ ఇలా ఉండేది కాదన్నారు. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్లా మారిందన్నారు. బీజేపీ ఐదారు సీట్లలో గెలిచే అవకాశముందనీ, అక్కడ ఆ పార్టీని ఓడించే సత్తా ఉన్న బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ లేదా ఇతర లౌకిక ప్రజాతంత్ర అభ్యర్థులకు ఓటేస్తామన్నారు. మగదేవుళ్ల ఆధిపత్యం సామాజిక, ఆర్థిక పరిస్థితులు మారడం వల్ల కమ్యూనిస్టులు కొంత వెనుకబడుతున్నారని తమ్మినేని చెప్పారు. కమ్యూనిస్టులు ఇప్పటివరకు ఆర్థిక అంశాలపైనే దృష్టిపెట్టారన్నారు. కడుపు నిండే డిమాండ్లపైనే దృష్టిపెట్టామని, మైండ్ను వదిలేశామన్నారు. పార్టీ ఆలోచనా విధానంలో మార్పు రావాలని, సామాజిక అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. క్యాపిటలిజంలో సజీవ దేవుళ్లు అంటే బాబాలు ఉంటారన్నారు. వెంకటేశ్వరస్వామి, శ్రీకృష్ణుడు వంటి దేవుళ్లంతా ఫ్యూడల్ సమాజంలో భాగమేనన్నారు. ఇంకా వెంకటేశ్వరస్వామి ఆధిపత్యమే ఉందన్నారు. సమాజంలో మగదేవుళ్ల ఆధిపత్యమే ఉందని చెప్పారు. మగ ఆధిపత్యం ఎక్కడున్నా అది ఫ్యూడల్ సమాజమే అవుతుందన్నారు. వచ్చేసారి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మారుతాడేమో... పార్టీ లో ఇంకా కమ్మ, రెడ్డోళ్ల ఆధిపత్యమేనా? జెండాలు మోసేది మాత్రం అణగారిన వర్గాలా అన్న ప్రశ్నపై తమ్మినేని స్పందిస్తూ... ‘కమ్యూనిస్టు ఉద్యమం అనేది రెవెల్యూషనరీ మూవ్మెంట్. నాలెడ్జ్ లేకుండా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లలేం. కొన్ని వేల సంవత్సరాల వరకు కొన్ని కులాలకు చదువు, జ్ఞానం నిషేధం. నాలెడ్జ్ సంపాదించకుండా అభ్యుదయ ఉద్యమాలకు రావడం అసాధ్యమైన విషయం. ఆస్తి, చదువు సమకూరినప్పుడు అక్కడ విజ్ఞానానికి అవకాశం ఉంటుంది. ఈ చారిత్రక అసమతుల్యతను సరిదిద్దేందుకు కమ్యూనిస్టులు కృషిచేస్తున్నారు. తెలంగాణలో 33 జిల్లాల్లో ఐదారు జిల్లాలు తప్ప ఓసీలు ఎక్కడా సీపీఎం జిల్లా కార్యదర్శులుగా లేరు. ఎస్సీల జనాభా ఎంతుందో అంతమంది జిల్లా కార్యదర్శులున్నారు. బీసీ జనాభా ఎంతుందో అంతకంటే ఎక్కువగా పార్టీ కార్యదర్శులున్నారు. రాష్ట్ర కార్యదర్శి (తమ్మినేని) ఒకడున్నాడు. బహుశా వచ్చేసారి అది కూడా ఆలోచిద్దాం. ఒక్క లీడర్ను బట్టి కమ్మ అనడం సరికాదు. పార్టీలో చాలా మార్పులు తెచ్చామని’తమ్మినేని చెప్పారు. సీపీఐ, సీపీఎం ఐక్యమయ్యే అవకాశముందని, అయితే, దానికి సమయం పడుతుందన్నారు. -
కేసీఆర్కు రెండుచోట్లా ఓటమి తథ్యం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లోనూ సీఎం కేసీఆర్కు ఓటమి తప్పదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కూడా ఓడిపోతారన్నారు. బీజేపీ అభ్యర్థుల చేతుల్లోనే వారికి పరాభవం వస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో బీజేపీకి ఇన్ని సీట్లు, అన్ని సీట్లు అని కేటీఆర్ చెబుతున్నారని, ఆయన చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా పరిస్థితులున్నాయన్నారు. శనివారం కిషన్రెడ్డి, రాజాసింగ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్సింగ్ రాథోడ్, సుదర్శన్ సింగ్ రాథోడ్, విద్యావేత్త బాలాజీ నాయక్, బీఆర్ఎస్ నాయకులు జబ్బార్ నాయక్, శ్రీరాములు తదితరులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ...బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతల అక్రమ సంపాదనను కక్కిస్తామన్నారు. తెలంగాణలో అవినీతి, మాఫియా, కుటుంబపాలనతో కూడిన చీకట్లను తరిమి.. బీజేపీని అధికారంలోకి తేవడం ద్వారా డిసెంబర్ 3న నిజమైన దీపావళి రావాలని కోరుకుంటున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలోని కారు చీకటి పోయి, మరో కమ్ముకున్న చీకటి (కాంగ్రెస్) రాకుండా కమలం పువ్వుతో లక్ష్మీదేవి వచ్చేలా చూడాలని చెప్పారు. భూములు అమ్మితేనే జీతాలు సీఎం కేసీఆర్ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణను దగా చేశారని కిషన్రెడ్డి విమర్శించారు. మద్యం అమ్మకాలు, హైదరాబాద్ చుట్టుపక్కల భూములు అమ్మితే తప్ప ఉద్యోగులకు నెలవారీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాంటి బీఆర్ఎస్ పోయి ఇక్కడ కాంగ్రెస్ వస్తే రాష్ట్ర పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని చెప్పారు. పదేళ్లుగా అధికారంలో లేమని కాంగ్రెస్ నేతలు ఆవురావురు మంటున్నారని, రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ దోచుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. ప్రజలను మభ్యపెట్టి బీజేపీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మజ్లిస్, బీజేపీ రెండూ ఒకటేనంటూ కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ, ఇతరనాయకులు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఎంఐఎంను పెంచి పోషించి లాభపడింది కాంగ్రెస్ కాగా, ఇప్పుడు బీఆర్ఎస్ మజ్లిస్ను మోస్తోందని విమర్శించారు. సూర్యుడు పడమట ఉదయించినా ఎంఐఎంతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదన్నారు. మతతత్వ, రజాకార్ల పార్టీతో బీజేపీ కలవబోదన్నారు. కర్ణాటకలో ఐదు నెలల పాలనలోనే ఐదేళ్ల అసంతృప్తిని, వైఫల్యాలను కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుందని ధ్వజమెత్తారు. ఐదు గ్యారంటీలంటూ కర్ణాటక ప్రజల తలలపై భస్మాసుర హస్తం పెట్టి కాంగ్రెస్ మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించిందన్నారు. ఆ పార్టీ ట్రాక్రికార్డ్ ఘోరంగా ఉంటే ఆరు గ్యారంటీలతో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామంటూ గొప్పలకు పోతోందన్నారు. -
ఒకే నెలలో ఐదు సార్లు రాష్ట్రానికి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ నెల ఏడో తేదీన, తాజాగా శనివారం హైదరాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలకు హాజరయ్యారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లోనూ బహిరంగసభలు, రోడ్షోలలో పాల్గొనేందుకు రాష్ట్రానికి రానున్నట్టు తెలిసింది. ఈనెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో.. బీజేపీకి ఊపు తెచ్చేందుకు 25న కరీంనగర్, 26న నిర్మల్ బహిరంగ సభల్లో, 27న హైదరాబాద్లో నిర్వహించే రోడ్షోలో మోదీ పాల్గొననున్నట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. ఈ పర్యటన షెడ్యూల్ ఖరారైతే.. ప్రధాని మోదీ నెల రోజుల్లోనే ఐదుసార్లు రాష్ట్రానికి వచ్చినట్టు అవుతుంది. అయితే ప్రధాని గత నెల 1, 3వ తేదీల్లో మహబూబ్నగర్, నిజామాబాద్లలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అవి కూడా కలిపితే రెండు నెలల్లో ఏడుసార్లు రాష్ట్రానికి వచ్చినట్టు అవుతుంది. దీపావళి దాటగానే జోరు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దీపావళి పండుగ దాటగానే జోరు పెంచాలని బీజేపీ నిర్ణయించింది. దీపావళి తర్వాత పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఆరోజు నుంచి ప్రచార గడువు ముగిసే 28వ తేదీ వరకు ఉధృతంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్, యూపీ, మహారాష్ట్ర, అస్సాం, గోవా సీఎంలు యోగి ఆదిత్యనాథ్, ఏక్నాథ్ షిండే, హిమంత బిశ్వశర్మ, ప్రమోద్ సావంత్లతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. -
కేసీఆర్పై పోటీ.. సరికొత్త రికార్డు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నామినేషన్ ప్రక్రియ శుక్రవారంతోనే ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,355 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అయితే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోటీ చేస్తోన్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచే అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్ 157 నామినేషన్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు బాధితులు సీఎం కేసీఆర్పై పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో 100 మంది వట్టెనాగులపల్లి శంకర్ హిల్స్ ప్లాట్ బాధితులు ఉన్నారు. జగిత్యాల చెరుకు రైతులు కూడా పోటీ చేసేందుకు మొగ్గు చూపారు. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరఫున కూడా పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎక్కువమంది ధరణి సహా వివిధ బాధితులు ఉన్నారు. నిరసన తెలిపే ఉద్దేశంలో భాగంగా వీరు నామినేషన్లు దాఖలు చేశారు. గజ్వేల్ తర్వాత మేడ్చల్ నియోజకవర్గం నుంచి 125 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇక్కడ మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు. మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు ఎక్కువగా ఉండటంతో బాధితులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మూడోస్థానంలో కామారెడ్డి నియోజకవర్గానికి 102 నామినేషన్లు వచ్చాయి. ముఖ్యమంత్రి కెసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో కూడా అత్యధిక నామినేషన్లు రావడం గమనార్హం. ఆ తర్వాత.. మునుగోడు నుంచి 83, సూర్యాపేట నుంచి 81, మిర్యాలగూడ నుంచి 79, సిద్దిపేట నుంచి 76, నల్గొండ నుంచి 71, హుజూరాబాద్ నుంచి 70, కోదాడ నుంచి 66, రాజేంద్రనగర్ నుంచి 64, మల్కాజిగిరి నుంచి 60, ఎల్బీ నగర్ నుంచి 62, శేరిలింగంపల్లి నుంచి 58, సిరిసిల్ల నుంచి 42 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈసీ షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 10వ తేదీతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. నవంబర్ 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 15వ తేదీ ఆఖరు. ఇప్పటిదాకా వంద మంది అఫిడవిట్లు లేకుండా నామినేషన్లు వేయడంతో ఎన్నికల సంఘం వాళ్లకు నోటీసులు జారీ చేసింది. అలాగే.. బీఫామ్ లేకుండా నామినేషన్లు వేసిన వాళ్లను స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణించనుంది ఈసీ. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ నెల 30న పోలింగ్ ఉంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. తెలంగాణ ఎన్నికల సమగ్ర కథనాల కోసం క్లిక్ చేయండి -
మోదీ ఆలింగనం.. మందకృష్ణ కంటతడి
సాక్షి, హైదరాబాద్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మా) జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కంటతడి పెట్టారు. శనివారం పరేడ్ గ్రౌండ్లో మాదిగల విశ్వరూప సభకు హాజరైన ప్రధాని మోదీ ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. దీంతో మందకృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోదీ పక్కనే కూర్చున్న మందకృష్ణ.. కంటతడి పెట్టారు. అది గమనించిన ప్రధాని మోదీ.. ఆయన భుజంపై తడుతూ ఓదార్చారు. ఈ క్రమంలో ఆయన్ని మరోసారి హత్తుకుని ఓదార్చారాయన. పరేడ్గ్రౌండ్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలోనే మాదిగ విశ్వరూప సభ జరిగింది. ‘‘దశాబ్దాలుగా మమ్మల్ని మనుషులుగా చూడలేదు. మేం ఊహించని కల ఇది. బలహీన వర్గాల నుంచి దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన వ్యక్తి మోదీ. మా సామాజిక వర్గానికి ధైర్యం చెప్పడానికి వచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. మన సమస్యలు పరిష్కరించడానికి ప్రధానే స్వయంగా వచ్చారు. అత్యంత వెనుకబడిన మాదిగలకు తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దళితుడ్ని రాష్ట్రపతి చేసిన ఘనత మోదీది. రెండోసారి అధికారం చేపట్టాక ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం’’ అని మందకృష్ణ ఈ వేదికపై భావోద్వేగంగా ప్రసంగించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ తన కుర్చీలోంచి లేచి సభకు హాజరైన జనసందోహంను చూస్తూ వంగి నమస్కరించారు. -
కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదికి 11 వేల కోట్ల రూపాయలను ఉచిత కరెంట్ కోసం ఖర్చు చేస్తున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. శనివారం సాయంత్రం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో కాంగ్రెస్పై, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై మండిపడ్డారు. ‘‘రేవంత్రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారు. మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారు. తెలంగాణలో ఉన్నది చిన్న, సన్నకారు రైతులే.. కాబట్టి 3 గంటల కరెంట్ చాలని రేవంత్ అంటున్నారు. రైతులకు రేవంత్ క్షమాపణలు చెప్పాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 3-4 గంటలకు మించి కరెంట్ వచ్చిందా?. బీఆర్ఎస్ అంటే పంట కోతలు.. కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు. కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? ఆలోచించుకోండి’’ అని తెలంగాణ రైతులను ఉద్దేశించి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. ‘‘ధరణితో రైతులకు ఎంతో మేలు జరిగింది. పెండింగ్ ప్రాజెక్టులను త్వరగతిన పూర్తి చేసుకున్నాం. కాంగ్రెస్ పాలనలో రైతులు గోస పడ్డారు. రైతులకు అండగా నిలిచిన కేసీఆర్ కావాలా? కాంగ్రెస్ కావాలా?. మీటర్లు పెట్టాలని కేంద్రం బెదిరిస్తోంది. ఉచిత విద్యుత్ వద్దంటున్న కాంగ్రెస్ నేతల్ని ఊరి పొలిమేర అవతలకు తరిమి కొట్టండి’’ అని ప్రజలకు కేటీఆర్ పిలుపు ఇచ్చారు. -
vijayashanti: కాంగ్రెస్లోకి విజయశాంతి!
సాక్షి, హైదరాబాద్: సీనియర్ సినీ నటి, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమెకు ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అలాగే చాలాకాలంగా ఆమె పార్టీ పట్ల అసంతృప్తి ఉన్నారు. బీజేపీ అధికారిక కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొనడం లేదు. మరోవైపు స్టార్ క్యాంపెయినర్ జాబితాలోనూ ఆమె పేరు లేకపోవడం చర్చనీయాంశాలుగా మారాయి. ఈ తరుణంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ఈ విషయాన్ని ధ్రువీకరించారు కూడా. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే విజయశాంతి బీజేపీకి మద్దతుదారుగా ఉన్నారు. తమిళనాడులో 1996 ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేకు, అటుపై లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించి పరోక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్వయహరించారు. అటుపై 1998లో బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో తన ప్రస్థానం ప్రారంభించారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో కడప లోక్సభ స్థానం నుంచి సోనియా గాంధీపై విజయశాంతి బీజేపీ తరఫున పోటీ చేయాలనుకున్నారు. అయితే సోనియా గాంధీ బళ్లారి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో.. విజయశాంతి కడప రేసు నుంచి తప్పుకున్నారు. దాదాపు దశాబ్దంపాటు బీజేపీలో కొనసాగిన ఆమె.. 2009లో బయటకు వచ్చి తల్లీ తెలంగాణ అనే సొంత పార్టీని స్థాపించారు. అటుపై ఆ పార్టీని బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్)లో విలీనం చేశారు. 2009లోనే మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి నెగ్గారు. కేసీఆర్తో విభేదాల వల్ల 2014లో ఆమె కాంగ్రెస్లో చేరారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్లో ఆమెకు ఎన్నికల స్టార్ క్యాంపెయినర్, టీపీసీసీకి ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారుగా నియమించారు అప్పటి ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. 2019లో ప్రధాని మోదీపై ఆమె చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. 2020లో కాంగ్రెస్కు రాజీనామా చేసిన విజయశాంతి.. అదే ఏడాది డిసెంబర్లో అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరారు. -
ధరణి కంటే మంచి పోర్టల్ తెస్తాం: రేవంత్రెడ్డి
సాక్షి, బెల్లంపల్లి: తెలంగాణలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్దే అధికారమని ధీమా వ్యక్తం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి .. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరతామని అన్నారు. బెల్లంపల్లిలో శనివారం జరిగిన కాంగ్రస్ విజయభేరి ఎన్నికల ప్రచార సభలో ఆయన బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ‘‘దేశంలో గాంధీ కుటుంబంలా.. తెలంగాణలో వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులు. ఇటు బెల్లంపల్లిలో అటు చెన్నూరులో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ మేడిగడ్డకు తీసుకెళ్లారు. మేడిగడ్డ కుంగిపోయింది.. అన్నారం మిగిలిపోయింది. సీఎం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం వాన వస్తేనే కుంగిపోయింది. అంత పెద్ద ప్రాజెక్టును ఇసుక మీద ఎవరైనా కడతారా?. అదేమైనా పేక మేడనా?.. ఇసుకపై బ్యారేజీ కడితే అది కుంగిపోయింది. మేడిగడ్డ అణా పైసాకు పనికిరాదు.. అన్నారం అక్కరకు రాదు. .. బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య దుర్మార్గాల గురించి రాష్ట్రమే కాదు... దేశమంతా తెలుసు. అలాంటి దుర్మార్గుడిని గెలిపించాలని కేసీఆర్ చెబుతున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్కు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి..?, సింగరేణి ఉద్యోగాలు, భూములు అమ్ముకోలేదా?. అలాంటి వారినా కేసీఆర్ గెలిపించాలనేది’’ అని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి ఆదిలాబాద్ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాం. ఆదిలాబాద్ ఆత్మగౌరవం పెరగాలంటే గడ్డం వినోద్, వివేక్లను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ అంటున్నారు. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి తీరుతాం. ధరణి తీసేస్తే రైతు బంధు రాదని కేసీఆర్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ధరణి రాకముందు 2018లో రైతు బంధు ఎలా ఇచ్చారు?, ధరణికంటే మెరుగైన సాంకేతికతతో పోర్టల్ తీసుకొస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు భరోసా ద్వారా రైతులకు ప్రతీ ఎకరానికి ఏటా రూ.15వేలు అందిస్తాం. రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు అందిస్తాం. మాట తప్పని, మడమ తిప్పని ఉక్కు మహిళ సోనియా. ఇచ్చిన మాట ప్రకారం సోనియా తెలంగాణ ఇచ్చారు.’’ అని రేవంత్ వివరించారు. సింగరేణి కార్మికుల్ని కేసీఆర్ మోసం చేశారు తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కూడా పాల్గొన్నారని.. కానీ, వాళ్లను కూడా కేసీఆర్ మోసం చేశారని రేవంత్రెడ్డి అన్నారు. రామగుండం కాంగ్రెస్ విజయభేరి యాత్ర సభలో రేవంత్ మాట్లాడుతూ.. ‘‘ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం జరిగింది. కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు అంతా పాల్గొన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఎందుకు క్రమబద్దీకరించలేదు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఎందుకు బంద్ కాలేదు?. సింగరేణి సొంతింటి కల నెరవేరిందా?. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం’’ అని అన్నారాయన. -
‘రేవంత్.. మేము కూడా నీలా మాట్లాడగలం’
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై మంత్రి తలసాని యాదవ్ మండిపడ్డారు. రేవంత్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేకంగా తనను, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును నోటికి వచ్చినట్లు రేవంత్ తిడుతున్నాడని, తాము కూడా అలా మాట్లాడగలం అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన తలసాని.. ‘ గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని సీట్లు గెలుస్తున్నాం. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు. తొమ్మిదిన్నర ఏళ్లలో అద్భుతంగా అభివృద్ది చెందింది. పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి పిసిసి నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. హోదా కలిగిన వ్యక్తి పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. నియోజకవర్గం లో ఉన్న ప్రజా ప్రతినిధులను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు. ప్రజలు వీడి భాషను గమనించాలి. రేవంత్ రెడ్డి ఒక్కడికే వస్తుందా ఆ భాష. నీచంగా మాట్లదటం ఎంత వరకు సబబు. కాంగ్రెస్ పార్టీ దీన్ని గమనించాలి’ అని పేర్కొన్నారు. -
మళ్లీ వచ్చేది మేమే: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : డిసెంబర్ 3న మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్లో 24 గంటలు మంచినీళ్లు సరఫరా చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. రానున్న రోజుల్లో హైదరాబాద్లో ట్రాఫిక్ తగ్గిస్తామన్నారు. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో హైదరాబాద్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర వాసుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ‘నగరంలో ట్రాఫిక్ సమస్యను రాబోయే రోజుల్లో తగ్గిస్తాం. మీరు చెప్పిన సమస్యలన్నీ డిసెంబర్ 3 తర్వత పరిష్కరిస్తాం. డిసెంబర్ 3న మళ్ళీ మేమే వస్తాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. హైదరాబాద్లో తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎన్నో అనుమానాలు ఉండేవి. వాటన్నింటినీ పటాపంచలు చేశాం. రాబోయే రోజుల్లో మెట్రోను మరింత విస్తరిస్తాం. ట్రాఫిక్ తగ్గాలంటే మెట్రో సేవలు మరింత పెరగాలి. జీహెచ్ఎంసీకి ఒక కమిషనర్ సరిపోరు. మరో ఇద్దరు స్పెషల్ కమిషనర్లను నియమిస్తాం. వీరిలో ఒకరు పచ్చదనం, పార్కుల పరిరక్షణకు ,మరొకరు చెరువుల పరిరక్షణ చూసే విధంగా చూస్తాం’ అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చూడండి..జంగ్ తెలంగాణ -
అప్పుడే మొదలైన కుర్చీలాట.. కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే కుర్చీ ఆట మొదలైంది. కచ్చితంగా అధికారంలోకి వస్తామన్న నమ్మకమో, లేక ఎమ్మెల్యేగా గెలవడానికి ఆ కుర్చినీ చూపిస్తున్నారో కాని మొత్తం మీద ముఖ్యమంత్రి పదవి తనదంటే తనదని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కొన్ని సర్వేలలో కాంగ్రెస్కు అనుకూల వాతావరణం ఉందన్ని సమాచారంతో సీఎం పదవి కుర్చీపై కూడా కొందరు ఖర్చీఫ్ వేసుకుంటున్నట్లుగా ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కొడంగల్ శాసనసభ స్థానానికి నామినేషన్ వేసిన సందర్భంగా కుర్చీ పేరుతో చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకర్షించాయి. పార్టీలో కొందరికి కాస్త అసహనం కూడా ఏర్పడింది. నాకే సీఎం పదవి: రేవంత్ రేవంత్ చాలా స్పష్టంగా తనకే ముఖ్యమంత్రి పదవి వస్తుందని కొడంగల్ ప్రజలకు చెప్పడం ద్వారా ఆ ప్రాంత ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు. ఇందులో రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి తానే ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నానని పార్టీలో పోటీ పడేవారికి సంకేతం ఇవ్వడం, తాను ముఖ్యమంత్రి అవుతాను కనుక తనను మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరడం. నిజానికి ఇది ఒకరకంగా సాహసం అని చెప్పాలి. వర్గాలతో నిండి ఉండే కాంగ్రెస్లో ఇలా చెప్పడం అంటే సమస్యలను కొని తెచ్చుకోవడమే. అయినా ఆ పని చేయడానికే ముందుకు వెళ్లారు. దానికి కారణం సెంటిమెంట్ను ప్రయోగించడమే. ఉమ్మడి మహబూబ్నగర్నుంచి ఒక్కరే ఈ సందర్భంగా గతంలో బూర్గుల రామకృష్ణారావు ఒక్కరే ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు తనకు అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. మరో విషయం చెప్పాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆఆర్ పోటీ చేసే కామారెడ్డి నుంచి కూడా నామినేషన్ వేశారు. అక్కడ గెలిచే అవకాశం సహజంగానే తక్కువ. ఒకవేళ అక్కడ గెలిస్తే, కాంగ్రెస్ అధికారంలో వచ్చే పక్షంలో ఆయనే సీఎం అవుతారని చెప్పవచ్చు. మరో పాయింట్ ఏమిటంటే రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు కోట్లు కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లారు. అది నెగిటివ్ మార్క్ అయినా, ఆ విషయం తెలిసి కూడా పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు కనుక అది పెద్ద అభ్యంతరం కాకపోవచ్చు. కాంగ్రెస్లో అతి వేగంగా పీసీసీ అధ్యక్షుడిగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అయ్యే అర్హత బాగానే ఉంటుంది. అందులోను రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరి అతి వేగంగా పీసీసీ అధ్యక్ష స్థాయికి చేరారు. కాని అన్నిసార్లు అలా జరగాలని లేదు. గతంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రాగా, ఆయన ఆ రెండుసార్లు సీఎం కూడా అయ్యారు. కాని రెండేళ్లలోపే పదవిని వదలుకోవల్సి వచ్చిన సంగతి కూడా గుర్తుచుకోవాలి. కానీ ఆ తర్వాత కాలంలో అలాంటి అవకాశంఎవరికి రాలేదు. ఉదాహరణకు డి.శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ, వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వానికి జనామోదం ఉండడంతో ఆయనను ముఖ్యమంత్రిని చేశారు. లైన్లో కోమటిరెడ్డి కూడా.. తాజాగా కర్నాటకలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ను కాదని, సిద్దరామయ్యను సీఎంగా చేశారు. సిద్దరామయ్య అంతకు ముందు కూడా సీఎంగా పనిచేసిన అనుభవం ఉపయోగపడింది. వీరిద్దరి పోటీ అక్కడ వర్గ కలహాలకు ప్రాతిపదికగా మారింది. కాంగ్రెస్ రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పలువురు తామూ సీఎం అభ్యర్దులమేనని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రకటించుకున్నారు. రేవంత్ రెడ్డి సభలో ఆయన అభిమానులు సీఎం, సీఎం అని నినాదాలు చేసి ఉత్సహాపడ్డారో, అదే మాదిరి మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్ ఘట్టం సందర్భంగా జరిగిన సభలో కూడా ఆయనను సీఎం, సీఎం అని అనుచరులు నినాదాలు చేశారు. దానిపై ఆయన స్పందించారు. తాను కూడా సీఎం రేసులో ఉన్నానని చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ లో తనకు సీనియారిటీ ఉందన్నది ఆయన భావన. ఆయనతో పాటు నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్కుమార్ రెడ్డి కూడా తనకు అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించవచ్చు. అందరికన్నా సీనియర్ అయిన మాజీ మంత్రి జానారెడ్డి ఈసారి పోటీ చేయకపోయినా, ఆయా ప్రచార సభలలో తనకు సీఎం అయ్యే అర్హత ఉందని చెప్పి మనసులో మాట బయటపెట్టారు. మరో నేత జగ్గారెడ్డి ఎప్పటికైనా సీఎం అవుతానని అంటున్నారు. పైగా సీఎం పదవిని అధిష్టానం నిర్ణయిస్తుందని పరోక్షంగా రేవంత్ రెడ్డికి ఆయన జవాబు ఇచ్చారు. భట్టికి చాన్? మరో నేత మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్లో క్రియాశీలక పాత్ర పోషించారు. దళితవర్గానికి చెందినవారికి సీఎం పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయిస్తే ఆయనకు చాన్స్ రావచ్చు. మరోవైపు బీజేపీ బీసీ కార్డు ప్రయోగిస్తున్నందున, ఆ వర్గాలకు చెందినవారు కూడా తాము రేసులో ఉంటామని ప్రకటించవచ్చు. బీజేపీ గెలిస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని, ప్రధాని మోదీ ఈ మేరకు హామీ ఇచ్చారని ఈటెల రాజేందర్ కూడా ప్రచారం ఆరంభించారు. ఆయన లక్ష్యం కూడా ఆ సెంటిమెంట్ ద్వారా తొలుత శాసనసభ్యుడిగా ఎన్నికవడమే అన్న సంగతి తెలుస్తూనే ఉంది. ఇదంతా ఎన్నికల ముందు జరుగుతున్న చర్చ. అసలు ఎన్నికలలో గెలవడం ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు వీరంతా పోటీ పడే అవకాశం ఉంటుంది. ఈలోగా ఎవరికి వారు తొలుత ఎమ్మెల్యే అవడం కోసం వ్యూహాత్మకంగా సీఎంపదవిని ఒక ఆకర్షణగా తమ నియోజకవర్గాలలో ప్రచారం చేసుకుంటున్నారని అనుకోవచ్చు. ఇంతకీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటారా? :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
-
కమలంలో కొత్త లొల్లి
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల దాఖలు చివరిరోజు అభ్యర్థుల జాబితాలో కొన్ని మార్పులు చేసి, ఇదివరకే ప్రకటించిన వారికి బీఫాంలు ఇవ్వకపోవడం బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. టికెట్లు దక్కని వారితో పాటు జాబితాలో ప్రకటించినా బీఫామ్స్ దక్కని వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. శుక్రవారం ప్రకటించిన 14 మంది అభ్యర్థుల జాబితా అంతా వివాదాస్పదం కావడంతో సమస్య మరింత ముదిరింది. వేములవాడలో తుల ఉమకు బదులు వికాస్రావుకు, సంగారెడ్డిలో రాజేశ్వర్ దేశ్పాండేకు బదులు పులిమామిడి రాజుకు బీఫామ్లు ఇవ్వడంతో తుల ఉమ, దేశ్పాండే కన్నీటి పర్యంతం అయ్యారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలవనున్నట్లు ప్రకటించడంతో పార్టీ నాయకులు వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. చివరి క్షణంలో పలువురికి చెయ్యి బీసీ మహిళ (కురుమ) ఉమకు టికెట్ కోసం ఈటల రాజేందర్ గట్టిగా పట్టుబట్టారు. ఆమెకు సీటు కేటాయించకపోతే తాను ఎన్నికల్లో పోటీ చేయనని అల్టిమేటమ్ కూడా ఇచ్చారు. దీంతో నాయకత్వం దిగివచ్చినట్టు ప్రచారం జరిగింది. కానీ చివరకు బీఫామ్ ఇవ్వలేదు. సంగారెడ్డిలో పులిమామిడి రాజుకు కూడా సీటు కేటాయించాలని ఈటల కోరారు. దీంతో ఏదో ఒక సీటు ఎంపిక చేసుకోవాలని అధిష్టానం సూచించిందని, గెలిచే అవకాశాలున్న సంగారెడ్డి వైపు ఈటల మొగ్గుచూపినట్టుగా తెలుస్తోంది. కాగా తనను నామినేషన్ వేసుకోమని చెప్పి బీఫామ్ ఇవ్వకపోవడంపై తీవ్ర మనస్థాపానికి గురైన దేశ్పాండే.. కిషన్రెడ్డికి ఫోన్చేసి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జాబితాలో బెల్లంపల్లి స్థానానికి ఏమాజీ పేరుంటే శ్రీదేవిని, ఆలంపూర్లో మారెమ్మ ప్లేస్లో రాజగోపాల్ను బీజేపీ ఖరారు చేయడం కూడా వివాదానికి తెరతీసింది. అనూహ్యంగా కంటోన్మెంట్ సీటు... సికింద్రాబాద్ కంటోన్మెంట్ను చివరి నిమిషం వరకు కాంగ్రెస్లోనే ఉండి ఇంకా బీజేపీలో చేరని సాయి గణే‹Ùకు కేటాయించడంపై కూడా పారీ్టవర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక్కడ మాజీ డీజీపీ కృష్ణప్రసాద్కు నామినేషన్ వేసేందుకు సిద్ధం కావాలంటూ చెప్పిన బీజేపీ.. ఆయనకు మొండిచేయి చూపి సాయి గణే‹Ùకు టికెట్ కేటాయించడం పారీ్టలో తీవ్ర చర్చనీయాంశమైంది. అదేవిధంగా తుది జాబితాలో పోటీకి సుముఖంగా లేని మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావుకు మల్కాజిగిరి సీటును కేటాయించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. మల్కాజిగిరి టికెట్ కోసం ఆకుల రాజేందర్, బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో నాయకత్వం మధ్యే మార్గంగా రామచంద్రరావుకు అవకాశం ఇచ్చినట్టు సమాచారం. దీంతో భానుప్రకాష్ పారీ్టకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. శేరిలింగంపల్లి టికెట్ను రవికుమార్ యాదవ్కు కేటాయించడంతో గత కొంతకాలంగా ఇక్కడ పనిచేస్తూ ఈ సీటును గట్టిగా కోరుకున్న గజ్జెల యోగానంద్ ఎలాంటి కార్యచరణకు దిగుతారనేదది చర్చనీయాంశమైంది. బీసీలకు 36 సీట్లు బీజేపీ ప్రకటించిన మొత్తం 111 సీట్లలో (జనసేనకు 8 సీట్లు) బీసీలు–36, ఓసీ–44 (రెడ్డి–29, వెలమ–8, కమ్మ–3, బ్రాహ్మణ–2, వైశ్య–1, నార్త్ ఇండియన్అగర్వాల్–1) ఎస్సీ 19+2 (రిజర్వ్డ్తో పాటు అదనంగా 2 జనరల్ సీట్లు (నాంపల్లి, చాంద్రాయణగుట్ట), ఎస్టీలకు 10 కేటాయించారు. బీసీలకు ఇతర పారీ్టల కంటే అధిక సీట్లనే కేటాయించినా.. 40కి పైగా సీట్లు కేటాయిస్తామనే హామీని నేతలు నిలబెట్టుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా మాదిగలకు ఎక్కువ ప్రాధా న్యం దక్కింది. 21 స్థానాలను ఎస్సీలకు కేటాయించగా, అందులో మాదిగ సామాజిక వర్గానికి 14, మాల సామాజిక వర్గానికి 7 ఇచ్చారు. బీసీలకు కేటాయించిన 36 సీట్లలో ముదిరాజ్ 9, మున్నూరు కాపు 7, యాదవ 5, గౌడ 5, పెరిక 2 లోధ్ 2 పద్మశాలి, ఆరే కటిక, లింగాయత్, వాలీ్మకి బోయ, ఆరే క్షత్రియ, విశ్వకర్మలకు ఒక్కో సీటు కేటాయించారు. -
మార్పులతో బీజేపీ ఐదో జాబితా!
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజున బీజేపీ అధిష్టానం విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల ఐదో జాబితా గందరగోళానికి దారితీసింది. తీవ్ర కసరత్తు అనంతరం శుక్రవారం 14 మంది అభ్యర్థులతో చివరి జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ విడుదల చేసింది. ఇందులో 11 మంది కొత్తవారు కాగా.. మిగతా నలుగురు మార్పులతో టికెట్ దక్కించుకున్నవారు. కానీ అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా ఐదో జాబితాలోని మూడు చోట్ల అభ్యర్థులను మార్చడం గందరగోళానికి తెరలేపింది. ఇటీవల వేములవాడ నుంచి తుల ఉమ పేరును ప్రకటించిన బీజేపీ అధిష్టానం అనూహ్యంగా బీఫాంను చెన్నమనేని వికాస్రావుకి ఇచ్చింది. సంగారెడ్డి నుంచి దేశ్పాండే రాజేశ్వర్రావు పేరును ఐదో జాబితాలో ప్రకటించినా.. అక్కడ పులిమామిడి రాజుకు బీఫాం అందింది. బెల్లంపల్లి (ఎస్సీ) నుంచి తొలి జాబితాలో సీటు పొందిన అమరాజుల శ్రీదేవిని మారుస్తూ.. కొయ్యల ఏమాజీ పేరు ప్రకటించారు. కాసేపటికే మళ్లీ అమరాజుల శ్రీదేవినే బరిలో ఉంటారని ప్రకటించి బీఫామ్ ఇచ్చారు. ఐదో జాబితాలో అలంపూర్ నుంచి మారెమ్మ బరిలో ఉంటారని చెప్పినా.. సాయంత్రానికి మార్చేసి, రాజగోపాల్ పేరు ప్రకటించారు. చాంద్రాయణగుట్టలో సత్యనారాయణ ముదిరాజ్కు బదులు కె.మహేందర్ను ఎంపిక చేశారు. మూడో జాబితాలో వనపర్తికి అశ్వత్థామరెడ్డి పేరు ప్రకటించగా.. తాజా జాబితాలో అనుజ్ఞారెడ్డిని అక్కడ బరిలో దింపారు. ఐదు జాబితాల్లో కలిపి మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను.. 111 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. పొత్తులో భాగంగా మిగతా 8 స్థానాల్లో జనసేన బరిలో ఉంది. -
డిసెంబర్ 13, 14 తేదీల్లో చలో ఢిల్లీ జాతీయ బీసీ సంక్షేమ
కాచిగూడ (హైదరాబాద్): పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 13, 14 తేదీల్లో చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వినర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం, అత్యధిక స్థానాల్లో బీసీ అభ్యర్థులకు పార్టీ టికెట్లు కేటాయించడంతోనే సరిపోదని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజకీయ రంగంలో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదని కేంద్రప్రభుత్వం ఇటీవల సేకరించిన గణాంకాల ద్వారా తేలిందని వెల్లడించారు. బీసీ బిల్లు కోసం బీసీలు సంఘటితంగా పోరాటం చేయాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. తెలంగాణలో 119 ఎమ్మెల్యేలుంటే 22 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం ఏపీ అధ్యక్షుడు ఎన్.మారేశ్, బీసీ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొల్ల మహేందర్, నీల వెంకటేశ్, వేముల రామకృష్ణ, జయంతి, శ్రీనివాస్, ఉదయ్కుమార్, సుధాకర్, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు. -
T Congress: ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇక అంతే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయా లని ఆశించి టికెట్ రాక భంగపడిన తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ తనదైన శైలిలో బుజ్జగించా రు. పార్టీకి మంచి రోజులు వస్తున్నాయంటూ నచ్చజెప్పారు. భవిష్యత్తులో ప్రాధాన్యత ఇస్తామని హా మీ ఇచ్చారు. పలువురికి ఎంపీ సీట్లపై హామీ ఇచ్చినట్లు కూడా సమాచారం. నారాయణఖేడ్పై మీరే తేల్చుకోండంటూ నిర్ణయాన్ని ‘ఆ ఇద్దరికే’వదిలిపెట్టారు. ఒకరోజు పర్యటనకు గాను గురువారం హైదరాబాద్కు వచ్చిన ఆయన అర్ధరాత్రి వరకు తాజ్కృష్ణా హోటల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతల తో సమావేశమయ్యారు. టికెట్లు రాని దాదాపు 15 మంది నేతలను పిలిపించి ఆయన స్వయంగా మాట్లాడారని సమాచారం. ముఖ్యంగా నారాయణఖేడ్ అసెంబ్లీ టికెట్ విషయంలో నెలకొన్న వివాదాన్ని ఆయన పరిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులకు ఎంపీ టికెట్ల విషయంలో హామీ ఇచ్చినట్టు గాందీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మీ ఇద్దరూ తేల్చుకోండి నారాయణఖేడ్ అసెంబ్లీ టికెట్ను జహీరాబాద్ మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్కు కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. అయితే మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టా రెడ్డి కుమారుడు సంజీవరెడ్డి కూడా ఈ టికెట్ ఆశించారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలను పిలిపించిన కేసీవీ ఎవరికి టికెట్ కావాలో తేల్చుకుని తన దగ్గరకు వస్తే వారికే బీఫారం ఇస్తానని చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆ ఇద్దరు నేతలు ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడుకున్నారని, ఈ భేటీలో భాగంగా సంజీవరెడ్డి అసెంబ్లీకి, షెట్కార్ లోక్సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని, అందుకే చివరి నిమిషంలో బీఫారంను సంజీవరెడ్డికి ఇచ్చారని సమాచారం. షెట్కార్ను జహీరాబాద్ లోక్సభకు పోటీ చేయిస్తామని కేసీవీ స్పష్టమైన హామీ ఇవ్వడంతో నారాయణఖేడ్ కథ సుఖాంతమైంది. చదవండి: కాంగ్రెస్ అభ్యర్థుల ఖర్చు కేసీఆరే ఇస్తున్నారు మరికొందరికి కూడా.. ఇదే కోవలో కాంగ్రెస్ నేతలు బలరాం నాయక్, పారిజాతా నర్సింహారెడ్డి, గాలి అనిల్కుమార్, నాగరిగారి ప్రీతం, అద్దంకి దయాకర్, శివసేనారెడ్డి, బల్మూరి వెంకట్, బెల్లయ్య నాయక్ తదితరులతో కేసీవీ విడివిడిగా సమావేశమయ్యారు. వీరిలో బలరాం నాయక్ (మహబూబాబాద్), గాలి అనిల్కుమార్ (మెదక్)లకు లోక్సభ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అద్దంకి దయాకర్ (వరంగల్)ను కూడా పార్లమెంటుకు పోటీ చేయిస్తామని చెప్పినట్టు సమాచారం. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇక అంతే.. ఈ సమావేశాల్లో భాగంగా కేసీవీ మరో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు పట్టుపట్టి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిందేనని, ఒకవేళ ఓటమి పాలైతే మాత్రం మళ్లీ ఎంపీ టికెట్లకు పోటీకి రాకూడదని ఆయన సూచించినట్టు తెలిసింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డిలతో కేసీవీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇద్దరు యువ నాయకులకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని, టికెట్ రానంత మాత్రాన అసంతృప్తి చెందాల్సిన పని లేదని చెప్పారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. బల్మూరి గురించి బోసురాజు ఏదో చెప్పబోగా.. ‘వెంకట్ గురించి అధిష్టానానికి తెలు సు. ఈ ప్రభుత్వంపై పార్టీ పక్షాన గట్టి పోరాటం చేశాడు. 60కి పైగా కేసులు నమోదయ్యాయి. జైలు కు కూడా వెళ్లి వచ్చాడు. రాహుల్గాంధీ జైలుకు వెళ్లి వెంకట్ను పరామర్శించారు..’అని వేణుగోపాల్ అ న్నారు. వెంకట్ రాజకీయ భవిష్యత్తుపై తాను వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటానని, పార్టీ కూడా వెంకట్కు తగిన ప్రాధాన్యతనిస్తుందని హామీ ఇచ్చినట్టు సమాచారం. కాగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బల్మూరి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫోన్లో కేసీవీ తో మాట్లాడారని తెలుస్తోంది. అయితే ఆయన ఏం మాట్లాడారనేది పార్టీ వర్గాలు గోప్యంగా ఉంచాయి. కాగా వేణుగోపాల్ శుక్రవారం ఉదయం 6:30 సమయంలో ఢిల్లీ వెళ్లారు. -
సంక్షేమం కావాలా..? సంక్షోభం కావాలా?
హుజూరాబాద్: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో.. సంక్షోభం సృష్టించే పార్టీలు కావాలో ప్రజలే ఆలోచించాలని మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాందీచౌక్ వద్ద జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సర్వేలన్నీ బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్రెడ్డి గెలుస్తారని చెబుతున్నాయని అన్నారు. ఇక హుజూరాబాద్లో జీ హుజూర్ రాజకీయాలు నడవయని పేర్కొన్నారు. గత ఉప ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఈటల రాజేందర్ ఎన్నో మాయమాటలు చెప్పారని, దళితబంధు రాదని ఒక అపనమ్మకాన్ని సృష్టించారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్లో 100 శాతం దళితబంధు అమలుచేసి చరిత్ర సృష్టించామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలతో రాష్ట్రానికి ఒరిగేదేంలేదన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతీ మహిళకు నెలకు రూ.3 వేలు, అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతామని చెప్పారు. గ్యాస్ సిలిండర్ను రూ.400కు అందిస్తామని వివరించారు. కౌశిక్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యత తనదే అని మంత్రి హామీ ఇచ్చారు. ఈటల మాటలు వింటే పదేళ్లు వెనక్కి హుజూరాబాద్ ప్రజలు ఈటల మాటలు వింటే అభివృద్ధిలో పదేళ్లు వెనకబడిపోతారని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. గెలిచాక హుజూరాబాద్ను విడిచిపెట్టి వెళ్లారని విమర్శించారు. ఈసారి హుజూరాబాద్, గజ్వేల్లో ఈటల ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఢిల్లీ నాయకులను హుజూరాబాద్కు తీసుకొస్తున్న ఈటల.. వారితో ఈ నియోజకవర్గానికి ఒరిగే ప్రయోజనం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. దమ్ముంటే ఉప్పల్ రైల్వే ఓవర్బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టూరిజం డెవలప్మెంట్ సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నో ట్విస్టులు.. ఎంతో కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఖరారయ్యారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించగా, మిగిలిన 118 స్థానాలకు నాలుగు జాబితాల్లో పార్టీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. గత నెల 15వ తేదీన మొదటి జాబితాను ప్రకటించగా, దాదాపు 25 రోజుల కసరత్తు తర్వాత ఈనెల 9వ తేదీన నాలుగో జాబితాను ప్రకటించింది. పలు మార్పులు చేర్పులు, ట్విస్టులు, తర్జనభర్జనల తర్వాత అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కొడంగల్తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరుగుతున్న మూడో ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు రెండుచోట్ల పోటీ చేయడం ఇదే తొలిసారి. మొదటి మూడు జాబితాలకు గాను నాలుగు సీట్లలో (వనపర్తి, బోథ్, పటాన్చెరు, నారాయణఖేడ్) అభ్యర్థులను మార్పు చేయగా, ఒకచోట (చేవెళ్ల) మాత్రం కొంత ఉత్కంఠ, తర్జనభర్జన తర్వాత తొలుత ప్రకటించిన అభ్యర్థికే బీ ఫాం మంజూరు చేసింది. 34 ఇస్తామని.. 23 ఈసారి బీసీ వర్గాలకు పెద్ద పీట వేస్తామని, 34 అసెంబ్లీ స్థానాలకు తగ్గకుండా టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. తర్వాత 34 ఇవ్వడం సాధ్యం కావడం లేదని, 25 ఇస్తామని, సర్దుకోవాలని సూచించింది. బీఆర్ఎస్ నుంచి బీసీలకు 23 టికెట్లు ఇచ్చారని, ఆ పార్టీ కంటే ఒకటో, రెండో ఎక్కువే ఇస్తామని పేర్కొంది. కానీ చివరకు 23 టికెట్లతోనే సరిపెట్టింది. చివరి నిమిషంలో ఇద్దరు బీసీలను మార్చినా మళ్లీ బీసీలకే అవకాశమి చ్చింది. పటాన్చెరులో నీలం మధు ముదిరాజ్ స్థానంలో కాట శ్రీనివాస్గౌడ్, నారాయణఖేడ్లో సురేశ్ షెట్కార్ స్థానంలో సంజీవరెడ్డి (బీసీ)లకు చివరి క్షణంలో బీఫామ్లు ఇ చ్చింది. ఇక అగ్రవర్ణాలకు అత్యధికంగా 58 చోట్ల టికెట్లు కేటాయించింది. ఇందులో రెడ్డి సామాజికవర్గానికి ఏకంగా 43, వెలమ కులస్తులకు 09, కమ్మ, బ్రాహ్మణ సామాజికవర్గాలకు మూడు చొప్పున అవకాశం కల్పించింది. అనుబంధ సంఘాలకు ఒక్కటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 10కి మించి అనుబంధ సంఘాలున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విద్యార్థి, యువజన, మత్స్యకార, మహిళా విభాగాలు ఇందులో క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. ఈ అనుబంధ సంఘాలకు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న చాలామంది నేతలు ఈసారి టికెట్లు ఆశించారు. కానీ కేవలం మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా ముదిరాజ్కు మాత్రమే టికెట్ ఇచ్చారు. మరోవైపు ఒకరిద్దరు మినహాయించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు కూడా పార్టీ మొండి చేయి చూపింది. రిజర్వుడు స్థానాల్లో సామాజిక కూర్పు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసిన 31 (19 ఎస్సీ, 12 ఎస్టీ) నియోజకవర్గాలకు టికెట్లలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా సామాజిక కూర్పును చేసింది. 19 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో 10 చోట్ల మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలకు, మరో 9 చోట్ల మాల వర్గానికి టికెట్లు కేటాయించింది. ఎస్టీ కోటాలో ఏడుగురు లంబాడాలకు, నలుగురు కోయ నేతలకు, ఒక గోండు సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి టికెట్లిచ్చింది. ఎవరి కోటా వారిదే.. టికెట్ల కేటాయింపులో రాష్ట్ర కాంగ్రెస్లోని అగ్ర నేతలు తమ మార్కు చూపెట్టారు. చర్చోపచర్చలు, తీవ్ర కసరత్తుల అనంతరం పూర్తి చేసిన అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో తమ సన్నిహితులు, అనుచరులకు టికెట్లు రాబట్టుకోవడంలో సఫలీకృతమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తాండూరు, మెదక్, మల్కాజ్గిరి, అంబర్పేటలతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి తనతో కలిసి నడుస్తున్న మరో 10 మంది వరకు నాయకులకు టికెట్లు ఇప్పించుకోగలిగారు. ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి కోటాలో సూర్యాపేట, సికింద్రాబాద్, భువనగిరి, కోదా డ స్థానాల్లో టికెట్లు రాగా, మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జడ్చర్ల, జనగామ, మునుగోడు స్థానాల్లో, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వైరా, మహేశ్వరం, రాజేంద్రనగర్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఉడుం పట్టుపట్టి మరీ పటాన్చెరు, నారాయణఖేడ్లలో తమ వారికి టికెట్లు ఇప్పించుకున్నారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. 118 టికెట్లలో సామాజిక వర్గాల వారీ కేటాయింపులిలా.. ఓసీ: 58 (రెడ్డి–43, వెలమ–09, కమ్మ–03, బ్రాహ్మణ–03) బీసీ 23: (మున్నూరుకాపు–05, యాదవ–04, గౌడ–04, ముదిరాజ్–03, ఆర్య మరాఠా, బొందిలి, చిట్టెపు రెడ్డి, వాల్మికి, మేరు, పద్మశాలి, రజకులకు ఒక్కొక్కటి.) ఎస్సీ: 19 (మాదిగ–10, మాల–09) ఎస్టీ: 12 (లంబాడా–07, కోయ–04, గోండు–1) ముస్లిం మైనార్టీ: 06 -
TS: జెండా కూలీలుగా మారిన తెలుగు తమ్ముళ్లు
సాక్షి, సూర్యాపేట: తెలంగాణలో తెలుగు దేశం పార్టీ ముసుగు తొలగించింది. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన పార్టీ.. ఇప్పుడు కాంగ్రెస్ కోసం ప్రచారంలోకి దిగింది. తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసిన కొన్ని గంటలకే.. తన ప్రియ శిష్యుడి కోసం రంగంలోకి దిగాలంటూ టీడీపీ శ్రేణుల్ని నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ.. కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి బహిరంగ మద్దతు ప్రకటించింది. పొత్తులో ఉన్నట్లు, కనీసం మద్దతు ఇస్తున్నట్లు ప్రకటనలు చేయకుండానే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తన ప్రియ శిష్యుడు రేవంత్రెడ్డి(టీపీసీసీ చీఫ్) కోసం పని చేయాలని చంద్రబాబు ఆదేశించడం.. ఆ ఆదేశాల్ని టీడీపీ నేతలు పాటించడం చకచకా జరిగిపోయాయి. శుక్రవారం కోదాడలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిని పద్మావతి ప్రచారం చేశారు. ప్రచార ర్యాలీలో పద్మావతి భర్త ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీ శివకుమార్, ఏపీ మాజీ మంత్రి రఘువీరారెడ్డి పాల్గొన్నారు. అయితే ర్యాలీ కొనసాగే క్రమంలో.. కాంగ్రెస్ జెండాల మధ్య టీడీపీ జెండాలు కనిపించాయి. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసిపోయి మరీ టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు జోష్గా ఆ ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్లలో కొందరు తమను వేరే జెండా కూలీలుగా మార్చేశారంటూ అసహనం ప్రదర్శించడం స్పష్టంగా కనిపించింది. ఏపీలో టీడీపీ కోసం జనసేన కార్యకర్తలకు పట్టిన గతే.. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పట్టిందని, ఇదంతా కర్మ ఫలితమేనని కామెంట్లు చేస్తున్నారు మరికొందరు. మళ్లీ 'ఓటుకు కోట్లు'? -
హుజురాబాద్లో బీజేపీకి మూడో స్థానమే : హరీశ్రావు
సాక్షి, హుజురాబాద్ : హుజురాబాద్లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉందని, బీజేపీ అయితే మూడో స్థానానికి పడిపోయిందని చెప్పారు. హుజురాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కౌశిక్ రెడ్డి ప్రజా జీవితంలో ఆల్ రౌండర్. కౌశిక్ రెడ్డి అంటే ముఖ్యమంత్రికి చాలా ఇష్టం. కౌశిక్ రెడ్డి గెలిచిన తర్వాత సీఎం వద్దకు వెళ్లి నియోజకవర్గ కోసం నిధులు తీసుకొస్తాడు. ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఈటల గెలిచిన నియోజకవర్గంలో తట్టెడు మన్ను కూడా పోయలేదు. ఇక్కడి ప్రజలను పూర్తిగా విస్మరించాడు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ గెలిచినా తెలంగాణ మరోసారి అంధకారంలోకి వెళ్లిపోతుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 3వేల రూపాయలు అందిస్తాం. ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతాం. గ్యాస్ సిలిండర్ను కేవలం రూ. 400కు అందిస్తాం. కేసీఆర్ ధీమా ఇంటింటికి బీమా కింద రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఎవరైనా మరణిస్తే 5 లక్షలు ఇస్తాం. ఇదీ చదవండి..సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?: రేవంత్ సవాల్ హుజురాబాద్లో పేదలకిచ్చిన అసైన్ భూములన్నిటికీ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత పట్టాలు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఏది కావాలన్నా ఢిల్లీ దగ్గర మోకరిల్లాల్సిందే. మొన్న కర్ణాటక నుంచి డీకే శివకుమార్ వచ్చి అక్కడ రోజుకు 5 గంటల కరెంటు ఇస్తున్నాం అని చెప్పాడు. డీకేకు తెలంగాణలో 24 గంటల కరెంటు ఉన్నది అనే విషయం కూడా తెలియదు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ వస్తే మోటర్లు జీపులో వేసుకొని పోతారు. దొంగ రాత్రి కరెంటు వస్తుంది. కాంగ్రెసోళ్లు కర్ణాటకలో ఆరు నెలలు గడవకముందే ఇచ్చిన హామీలను ఎగ్గొడుతున్నారు. కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అని మాట్లాడారు. రైతుకు రైతుబంధు ఇవ్వడం దుభారా అవుతుందా.. అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చే రైతు బంధును బిచ్చమేస్తున్నాం అన్నాడు. రైతుబంధు తీసుకునే రైతులను బిచ్చగాళ్ళ తో పోలుస్తూ మాట్లాడటం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ప్రజల పరిస్థితి అధోగతి పాలవుతుంది’ అని హరీశ్ రావు హెచ్చరించారు. ఇదీ చూడండి.. మిషన్ తెలంగాణ -
కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ బీజేపీ కుట్రే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మైనారిటీలను బీసీల్లో చేరుస్తామని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయమై ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ వెంటనే ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. ‘మైనారిటీలు, బీసీల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతోంది. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.మైనారిటీలకు కులగణనతో సంబంధం లేదు. ఇది బీజేపీ కుట్రలాగా కనిపిస్తోంది. మైనారిటీలను బీసీల్లో కలిపితే వారు తమ హక్కులన్నీ కోల్పోతారు. కాంగ్రెస్ వెంటనే మైనారిటీ డిక్లరేషన్ను ఉపసంహరించుకోవాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: అవినీతి డబ్బుతో కేసీఆర్ గెలవాలనుకుంటున్నారు! -
తెలంగాణ ఎన్నికలు.. పవన్కు బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించలేదు. జనసేన వాడుకునే గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్గానే ఈసీఐ గుర్తించింది. అయితే, తెలంగాణలో జనసేన గుర్తింపు పార్టీ కాకపోవడంతో ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేదు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన తరఫున ఎనిమిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో, ఎనిమిది మంది కూడా జనసేన గుర్తు గ్లాస్ కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల సంఘం తేల్చనుంది. జనసేన ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా జనసేనకు గుర్తింపు లేదు. -
Vemulawada: తుల ఉమకు బీజేపీ షాక్.. వికాస్ రావుకే బీ-ఫామ్
సాక్షి, వేములవాడ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు, నేతలు వేగం పెంచారు. నామినేషన్ల స్వీకరణకు నేడు(శుక్రవారం) చివరి తేదీ కావడంతో నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో వేములవాడ బీజేపీలో కోల్డ్ వార్ జరుగుతోంది. ఒకే అసెంబ్లీ స్థానానికి ఇద్దరు బీజేపీ నేతలు పోటాపోటీ నామినేషన్లు వేశారు. వేములవాడ అసెంబ్లీకి బీజేపీ పార్టీ తరుపున తుల ఉమ శుక్రవారం నామినేషన్ వేశారు. అయితే కమలం పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావు తరపున ఆయన వర్గీయులు నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. వేములవాడ బీజేపీ రెండు గ్రూప్లుగా చీలిపోవడంతో నేతల మధ్య టికెట్ ఫైట్ ఉత్కంఠ రేపుతోంది. తుల ఉమకు షాక్.. వికాస్ రావుకే బీఫామ్ వేమలవాడ బీజేపీలో ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. తుల ఉమను తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించిన బీజేపీ.. చివరికి ఆమెకు మొండిచేయి చూపింది. మరికొద్ది గంటల్లో నామినేషన్ ప్రక్రియ ముగియనున్న సమయంలో వేమలవాడ అభ్యర్థిగా మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావుకు బీ-ఫామ్ అందించింది. దీంతో తనే బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నానని ఆశించిన తుల ఉమకు ఆఖరి క్షణంలో భంగపాటు తప్పలేదు. అదే విధంగా సంగారెడ్డిలో బీజేపీ తమ అభ్యర్థిని మార్చింది. ముందుగా ప్రకటించిన రాజేశ్వరరావు దేశ్పాండేకు కాకుండా పులిమామిడి రాజుకు బీ-ఫామ్ అందజేసింది. చదవండి: తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్ -
బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తుది జాబితా విడుదల
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తన తుది జాబితాను విడుదల చేసింది. 14 మందితో కూడిన చివరి జాబితాను శుక్రవారం ఉదయం బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీ తెలంగాణ చివరి జాబితాలో అభ్యర్థులు వీరే.. మల్కాజ్గిరి - రామచంద్రరావు శేరిలింగంపల్లి - రవికుమార్ యాదవ్ పెద్దపల్లి - దుగ్యాల ప్రదీప్ బెల్లంపల్లి - ఎమాజీ సంగారెడ్డి - దేశ్పాండే రాజేశ్వరరావు మేడ్చల్ - సుదర్శన్ రెడ్డి చాంద్రాయణ గుట్ట- మహేందర్ కంటోన్మెంట్ - గణేష్ నారాయణ్ దేవరకద్ర - కొండా ప్రశాంత్ రెడ్డి వనపర్తి - అనుఘ్నారెడ్డి అలంపూర్ - మేరమ్మ నర్సంపేట - కే. పుల్లారావు మధిర - విజయరాజు నాంపల్లి-రాహుల్ చంద్ర -
హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అద్దంకి దయాకర్ రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోవైపు.. పార్టీలు కొన్ని స్థానాల్లో అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ అద్ధంకి దయాకర్కు హ్యాండిచ్చింది. మరోవైపు, తనకు సీటు ఇవ్వకపోవడంపై దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం గౌరవిస్తాను. మందుల శామ్యూల్ గెలుపు కోసం పనిచేస్తాను. ప్రతీ నిర్ణయం వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. నా మద్దతుదారులు, కార్యకర్తలు అధైర్యపడవద్దు.. ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడవద్దు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇక, తుంగతుర్తి నుంచి మందుల శామ్యూల్కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో, ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. ఇదిలా ఉండగా.. పటాన్చెరు నియోజకవర్గంలో చివరి నిమిషంలో అభ్యర్థి మార్పు జరిగింది. దామోదర రాజనర్సింహ పంతం నెగ్గించుకున్నారు. తన అనుచరుడు కాటా శ్రీనివాస్ గౌడ్కు అధిష్టానం టికెట్ ఇచ్చింది. దీంతో, రాజనర్సింహ శాంతించారు. మరోవైపు.. ఎన్నికల్లో పొత్తుల అంశంలో కాంగ్రెస్-సీపీఎం మధ్య చర్చలు విఫలమయ్యాయి. చివరి రోజు వరకు మిర్యాలగూడ టికెట్ను సీపీఎం కోసం కాంగ్రెస్ పార్టీ ఆపింది. చర్చలు ఫలించకపోవడంతో అభ్యర్థిని ప్రకటించింది. కాగా, సీపీఎం పొత్తు లేకపోవడంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్థానాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. "పార్టీ నిర్ణయమే ప్రధానం మరియు నేను దానిని అంగీకరిస్తున్నాను. రేపు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కు నేను హాజరవుతాను & పార్టీని గెలిపించడానికి కృషి చేస్తా." : అద్దంకి దయాకర్ గారు. pic.twitter.com/unPMA83qHt — Telangana Congress (@INCTelangana) November 9, 2023 -
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
-
వెంగళరావు తర్వాత మళ్లీ నేనే: భట్టి
మధిర/సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు వచ్చిన అవకాశం, మళ్లీ తనకు దక్కనుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మధిర అభ్యర్థి గా గురువారం ఆయన నామినేషన్ సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి మాట్లాడుతూ నెల రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మధిర దశదిశ నిర్దేశించేదిగా ఉండాలని అన్నారు. ఖమ్మం జిల్లా బిడ్డ జలగం వెంగళరావు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా అనేక పరిశ్రమలు జిల్లాకు సాధించారని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి అవకాశం జిల్లాకు రానున్నందున అన్నిరంగాల్లో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి జలగం వెంగళరావుకు మాత్రమే సీఎల్పీ నేతగా అవకాశం లభించగా, మళ్లీ ప్రజల ఆశీస్సులతో తాను ఆ పదవి చేపట్టానని చెప్పారు. రాష్ట్ర సంపద ప్రజలకు చెందకుండా అడ్డుపడిన దోపిడీదారుడు, దుర్మార్గుడైన కేసీఆర్ను ఇంటికి పంపిస్తేనే తెలంగాణకు మెరుగైన భవిష్యత్ ఉంటుందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని భట్టి స్పష్టం చేశారు. కేసీఆర్కు గజ్వేల్లో ప్రజల అసంతృప్తి సెగ తాకడంతో కామారెడ్డికి పారిపోయారని ఎద్దేవా చేశారు. వంద మంది కౌరవుల మాదిరి, శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో.. పాండువుల్లా ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పోరాడానని భట్టి తెలపారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ మంత్రి అవినాశ్ వజహర్ ఇతర నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ చెప్తుంటే బీజేపీ ఐటీ దాడులు.. కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల ఇళ్లపై ఐటీ అధికారులు ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం సరైంది కాదని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు కుమ్మక్కై కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లపై దాడులు చేస్తున్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే కుట్రకు పాల్పడుతున్నాయని గురువారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. బీఆర్ఎస్ చెపుతుంటే బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని, ఐటీ దాడులతో కాంగ్రెస్ అభ్యర్థులను భయపెట్టాలని చూడటం అవివేకమేనని భట్టి అభిప్రాయపడ్డారు. -
వారికి ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి
సాక్షి, సిద్దిపేట: ‘అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎలా క్షేమంగా ఉంటదో సీఎం కేసీఆర్ చేతుల్లో రాష్ట్రం కూడా అంతే క్షేమంగా ఉంటుంది. కేసీఆర్ను కాదని ఇతర పారీ్టలకు ఓట్లు వేయొద్దు. బీజేపీ, కాంగ్రెస్లకు ఓటు వేస్తే రాష్ట్రం పదేళ్లు తిరిగి వెనుకకు పోతుంది’అని మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం ఆయన సిద్దిపేటలో నామినేషన్ వేశారు. అంతకుముందు హరీశ్రావు మరో మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలసి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. నామినేషన్ అనంతరం ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ, గతంలో తెలంగాణలో కరువు కాటకాలు, ఆకలి చావులు, వలసలు ఉండేవన్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ తెలంగాణను ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మార్చారని చెప్పారు. తండ్రి వయసు ఉన్న కేసీఆర్పై కొందరు నాయకులు సంచలనాల కోసం నోరుపారేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో 24 లక్షల ఉద్యోగాలు, ఐటీలో 6 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలో 1.80 లక్షల ఉద్యోగాలు కలి్పంచామని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదన్నారు. తెలంగాణలో బీజేపీ తుడిచి పెట్టుకుపోయిందని ఎద్దేవా చేశారు. ఆ పారీ్టకి రాష్ట్రం మొత్తంలో ఒక్క సీటు కూడా రాదని, డక్ ఔట్ అవుతుందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో సిద్దిపేట నియోజకవర్గానికి 7వ సారి నామినేషన్ వేశానని చెప్పారు. -
కేసీఆర్ గొంతు నొక్కే కుట్ర
సిరిసిల్ల/ కొడంగల్: తెలంగాణ 60ఏళ్ల గోస పోయేలా సీఎం కేసీఆర్ పోరాడి రాష్ట్రాన్ని సాధించారని.. తెలంగాణ కోసం మాట్లాడే ఏకైక వ్యక్తి కేసీఆర్ గొంతు నొక్కేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు ఆరోపించారు. కేసీఆర్ను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక నేతలు తెలంగాణపై దండయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. గురువారం సిరిసిల్లలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తర్వాత కొడంగల్లో నిర్వహించిన రోడ్షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు చోట్లా కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని కులమతాలకు అతీతంగా, అవినీతి రహితంగా అందించాం. ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ గత 55 ఏళ్లలో ఏం చేసింది? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి? నిరంతర కరెంట్, సాగునీరు, తాగునీరు, రైతుబీమా, రైతుబంధు, నేతన్నబంధు వంటి పథకాలపై ఆలోచన కూడా చేయని ఆ పార్టీలకు ఎందుకు ఓటెయ్యాలి? అన్ని రంగాల్లో తెలంగాణ ఆదర్శంగా ఉంది. ప్రలోభాలకు లొంగిపోతే మోసపోతాం, గోసపడతాం. కుట్రలకు, కుతంత్రాలకు ప్రజలు లొంగిపోవద్దు. ఢిల్లీకి దాసులైన నేతల మాటలు నమ్మొద్దు. కేసీఆర్ సీఎం కావడం ఖాయం సీఎం కేసీఆర్ ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఆయన ముచ్చటగా మూడో సారి సీఎం కావడం ఖాయం. బీఆర్ఎస్ ఏనాడూ కులం పేరుతో కుంపట్లు, మతం పేరుతో మంటలు పెట్టలేదు. మోసం చేసే దొంగలు ఢిల్లీ నుంచి వస్తున్నారు. మూకుమ్మడి దాడులు చేయడానికి ప్రయతి్నస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ను గెలిపిస్తే అమ్మేసుకుంటారు టీపీసీసీ చీఫ్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డి భూముల వ్యాపారం చేసే బ్రోకర్ అని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్కు ఓట్లు వేసి గెలిపిస్తే.. కొడంగల్ను ప్లాట్లుగా చేసి అమ్మేసుకుంటారని ఆరోపించారు. అదే బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు పట్టుకొని అయినా ఆయనకు ప్రమోషన్ ఇప్పిస్తానని చెప్పారు. ‘‘ఓటుకు నోటు దొంగ జైలుకు పోవడం ఖాయం. కొడంగల్ను ఏనాడూ పట్టించుకోని రేవంత్రెడ్డి కావాలా?.. ఎల్లప్పుడూ జనం మధ్య ఉండే నరేందర్రెడ్డి కావాలా మీరే నిర్ణయించుకోండి. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని.. కారు గుర్తుకు ఓటేయండి..’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ దంపతుల ఆస్తి రూ.51.26 కోట్లు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సిరిసిల్ల నియోజకవర్గంలో గురువారం నామినేషన్ వేసిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు. దాని ప్రకారం.. కేటీఆర్ మొత్తం ఆస్తులు రూ.17.34 కోట్లు. ఇందులో చరాస్తులు రూ.6.92 కోట్లు, స్థిరాస్తులు రూ.10.41 కోట్లు. అప్పులు రూ.67.20 లక్షల మేర ఉన్నాయి. కేటీఆర్ భార్య శైలిమ పేరిట రూ.26.49 కోట్ల చరాస్తులు, రూ.7.42 కోట్ల స్థిరాస్తులు కలిపి మొత్తంగా రూ.33.92 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. రూ.11.27 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. కేటీఆర్ దంపతులు ఇద్దరికీ కలిపి ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ.51.26 కోట్లు. -
సారుకు కారు లేదు!
సాక్షి, సిద్దిపేట/ సాక్షి, కామారెడ్డి: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తన పేరిట విడిగా సొంత కారు, ద్విచక్ర వాహనం, వ్యవసాయ భూమి వంటివేవీ లేవని ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. గురువారం గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా తనతోపాటు సతీమణి ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించారు. కేసీఆర్, సతీమణి శోభమ్మకు కలిపి మొత్తం ఆస్తులు రూ.58,93,31,800 కాగా.. ఇందులో చరాస్తులు రూ.35,43,31,800, స్థిరాస్తులు రూ.23.50 కోట్లు ఉన్నాయి. మొత్తం అప్పులు రూ.24,51,13,631 ఉన్నాయి. ఇందులో ఇద్దరి పేరిట విడివిడిగా ఉన్న ఆస్తులు కొన్ని, ఉమ్మడిగా మరికొన్ని ఉన్నాయి. విడిగా పరిశీలిస్తే.. కేసీఆర్ చరాస్తులు రూ.17,83,87,492. ఇందులో 95 గ్రాముల బంగారం (రూ. 17.40 లక్షలు విలువ), చేతిలో నగదు రూ 2,96,605 ఉన్నాయి. ఆయన పేరిట ఉన్న స్థిరాస్తుల విలువ రూ.8.5 కోట్లు. రూ.17,27,61,818 అప్పులు ఉన్నాయి. కేసీఆర్ సతీమణి శోభమ్మ పేరిట ఉన్న చరాస్తుల విలువ రూ.7,78,24,488 ఉండగా అందులో 2.841 కిలోల బంగారు అభరణాలు, 45 కేజీల వెండి వస్తువులు (రూ.1,49,16,084 విలువ), అప్పులు ఏమీ లేవు. కేసీఆర్, శోభమ్మ ఉమ్మడి ఆస్తులు రూ.24,81,19,820 ఉన్నాయి. ఇందులో ఉమ్మడి చరాస్తుల విలువ రూ.9,81,19,820. (దీనిలో రూ.1,16,72,256 విలువైన 14 వాహనాలు ఉన్నాయి), ఉమ్మడి స్థిరాస్తుల విలువ రూ.15 కోట్లు. ఉమ్మడి అప్పులు రూ.7,23,51,813. కేసీఆర్ దంపతులు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో 2010 సంవత్సరం నుంచీ ఉమ్మడి ఆస్తులుగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు రూ.1,35,00,116 విలువైన 53.30 ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నట్టు అఫిడవిట్లో తెలిపారు. అలాగే 9.365 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉందని, దానికి నాలా పన్నును సైతం చెల్లించామని వివరించారు. కేసీఆర్కు ముఖ్యమంత్రిగా వచ్చే వేతనం/అలవెన్సులతోపాటు వ్యవసాయ ఆదాయం.. సతీమణి శోభమ్మకు బ్యాంకులోని డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీని ఆదాయంగా చూపించారు. కేసీఆర్పై తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన 9 కేసులు ఉన్నట్టు తెలిపారు. -
కేటీఆర్కు త్రుటిలో తప్పిన ప్రమాదం
ఆర్మూర్/సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రమంత్రి కె.తారకరామారావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రచారరథం రెయిలింగ్ విరిగిపోవడంతో వాహనంపైనున్న ఆయన కిందికి జారారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో గురువారం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆశన్నగారి జీవన్రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు. పట్టణశివారులోని ధోబీఘాట్ నుంచి కిందిబజార్, గోల్బంగ్లా మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీ బయలుదేరింది. ప్రచారరథంపై కేటీఆర్, జీవన్రెడ్డి, ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి, ఇతర నేతలు నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మార్గమధ్యంలో ఓ చోట విద్యుత్ వైర్లు కొద్దిగా కిందికి వేలాడుతుండటంతో అప్రమత్తమైన ప్రచారరథం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా వాహనం రెయిలింగ్ విరిగిపోయింది. దీంతో రెయిలింగ్ పట్టుకొని నిలబడి ఉన్న కేటీఆర్, జీవన్రెడ్డి కిందికి జారారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి మాత్రం అదుపు తప్పి వాహనం పైనుంచి కింద పడిపోయారు. ఆయనకు స్వల్పగాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నామినేషన్ కేంద్రానికి వెళ్లకుండానే కేటీఆర్ కొడంగల్ రోడ్ షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లిపోయారు. నాకేమీ కాలేదు: కేటీఆర్ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్రెడ్డి తరఫున ప్రచారానికి వెళ్లినప్పుడు చిన్న ప్రమాదం జరిగిందని, తనకేమీ కాలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’(ట్విట్టర్)లో స్పష్టం చేశారు. ప్రమాదంపై ఆందోళన చెందిన, తన గురించి వాకబు చేసిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. -
నీలం స్థానంలో కాట..
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగుస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల చివరి, నాలుగో జాబితాను గురువారం రాత్రి ప్రకటించింది. మిగిలిన నాలుగు స్థానాలకు కొత్తగా అభ్యర్థులను ప్రకటించడంతోపాటు అదనంగా పటాన్చెరు అభ్యర్థిని మార్చింది. ఈ స్థానంపై తలెత్తిన పంచాయితీని పరిష్కరించింది. ముందుగా ప్రకటించిన నీలం మధు ముదిరాజ్ స్థానంలో పాతకాపు కాట శ్రీనివాస్గౌడ్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న నీలం మధు ముదిరాజ్కు మూడో జాబితాలో పటాన్చెరు టికెట్ కేటాయించినప్పటికీ బీఫామ్ ఇవ్వని అధిష్టానం.. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అనుచరుడైన శ్రీనివాస్గౌడ్కు టికెట్ కేటాయించింది. దీంతో దామోదర పట్టుబట్టి తన పంతం నెగ్గించుకున్నట్లయింది. అలాగే సూర్యాపేట స్థానం నుంచి రాంరెడ్డి దామోదర్రెడ్డి, పటేల్ రమేశ్రెడ్డి మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొనగా అధిష్టానం మాత్రం దామోదర్రెడ్డినే అభ్యర్థిగా ఎంపిక చేసింది. మరోవైపు తుంగతుర్తి అభ్యర్థిగా అనూహ్యంగా గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల శామ్యూల్ టికెట్ దక్కించుకున్నారు. మాదిగ, మాల కుల సమీకరణల్లో భాగంగానే అధిష్టానం శామ్యూల్ను ఎంపిక చేసిందనే చర్చ జరుగుతోంది. అలాగే పొత్తులో భాగంగా సీపీఎం కోరిన మిర్యాలగూడ టికెట్ ఎట్టకేలకు బలమైన నాయకుడు బత్తుల లక్ష్మారెడ్డికే దక్కింది. దీంతో అక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. చార్మినార్ టికెట్ను స్థానిక నేత మహ్మద్ ముజీబ్ ఉల్లాహ్ షరీఫ్కు పార్టీ కేటాయించింది. గురువారం విడుదల చేసిన నాలుగో జాబితాతో కలిపి మొత్తం 118 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించడం తెలిసిందే. -
అంతా జనంలోనే!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగుస్తుండటంతో పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రచారంపై ఫోకస్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో.. వచ్చే 20రోజుల పాటు పార్టీ యంత్రాంగం మొత్తాన్ని ప్రజాక్షేత్రంలోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలతోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్రావులతో రోడ్షోలు, సభల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ప్రచార గడువు ముగిసేవరకు కూడా పార్టీ అభ్యర్థులు, ఇన్చార్జులు, ఇతర ముఖ్య నేతలెవరూ తమకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించిన చోటి నుంచి కదలవద్దని పార్టీ అధినేత ఆదేశించారు. పార్టీ తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న సెగ్మెంట్లతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థులు బలహీనంగా ఉన్నచోట ఇప్పటికే సుమారు 60కి మందికిపైగా నాయకులకు ఇన్చార్జులుగా సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కీలక నియోజకవర్గాల్లో స్థానికంగా పార్టీ యంత్రాంగాన్ని కదిలించి ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మండల స్థాయిలోనూ ఇన్చార్జులను నియమిస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంతో సొంత నియోజకవర్గం వదిలి ఇతర నియోజకవర్గాలకు వెళ్లేందుకు పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థులపై అసంతృప్తి ఉన్న నేతలను గుర్తించి వారికి ఇతర నియోజకవర్గాల్లో మండల స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనితో ఇటు ఆయా సెగ్మెంట్లలో పారీ్టకి నష్టం జరగకుండా చూసుకోవడంతోపాటు ఇతర నియోజకవర్గాల్లో బాధ్యతల అప్పగింత ద్వారా వారిని విశ్వాసంలోకి తీసుకుంటున్నామనే భరోసా ఇవ్వొచ్చని భావిస్తున్నారు. దీపావళి తర్వాత మళ్లీ కేసీఆర్ సభలు అభ్యర్థుల ఎంపిక, బీఫారాల జారీతోపాటు బహిరంగ సభల నిర్వహణలోనూ బీఆర్ఎస్ విపక్షాలతో పోలిస్తే దూకుడుగా వ్యవహరిస్తోంది. గత నెల 15న బీఫారాల జారీని ప్రారంభించడంతోపాటు హుస్నాబాద్లో బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. గత నెల 15 నుంచి ఈ నెల 9 వరకు 17 రోజుల వ్యవధిలో 43 చోట్ల కేసీఆర్ సభలు నిర్వహించారు. దీపావళి పండుగ నేపథ్యంలో 10 నుంచి 12వ తేదీ వరకు విరామం ప్రకటించారు. తిరిగి ఈ నెల 13 నుంచి 28వ తేదీ వరకు 54 నియోజకవర్గాల్లో జరిగే సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. మొత్తంగా ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి 97 నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పోటీచేస్తున్న జనగామలో ఇప్పటికే ఒక బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. ఆ నియోజకవర్గంలోని చేర్యాలలో ఈ నెల 18న రోడ్షో నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రచారంలో ఇదొక్కటి మాత్రమే రోడ్షో. మిగతావన్నీ సభలే. ఈ నెల 28న గజ్వేల్లో ప్రచారంతో కేసీఆర్ పర్యటనలు ముగుస్తాయి. ఇక తొలి విడతలో సీఎం కేసీఆర్ సభలు జరిగిన నియోజకవర్గాల్లో కేటీఆర్, హరీశ్రావుల రోడ్షోలు, బహిరంగ సభలు ఉండే అవకాశముంది. మరోవైపు 38 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లతో కూడిన జాబితాను బీఆర్ఎస్ గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి సమరి్పంచినట్టు తెలిసింది. అఫిడవిట్లను జల్లెడ పడుతున్న లీగల్ సెల్ నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారం ముగుస్తుండగా పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను బీఆర్ఎస్ లీగల్ సెల్ జల్లెడ పడుతోంది. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లపై న్యాయపరమైన చిక్కులు తలెత్తిన నేపథ్యంలో.. వీలైనంత మేర నామినేషన్ల పత్రాల్లో లోపాలు దొర్లకుండా లోతుగా పరిశీలించి గ్రీన్సిగ్నల్ ఇస్తున్నారు. వార్రూమ్లతో సమన్వయం నియోజకవర్గాల స్థాయిలో వార్రూమ్లను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. వాటిని హైదరాబాద్లోని సెంట్రల్ వార్రూమ్తో అనుసంధానం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్తోపాటు కేటీఆర్, హరీశ్రావుల దిశానిర్దేశం మేరకు సెంట్రల్ వార్ రూమ్ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వార్రూమ్లతో సమన్వయం చేసుకుంటోంది. ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రచార తీరుతెన్నులు తదితరాలపై ఎప్పటికప్పుడు ఆదేశాలు పంపుతోంది. వాట్సాప్, ఎక్స్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలు వేదికగా కూడా పార్టీ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. వివిధ సంస్థల నుంచి అందుతున్న సర్వే నివేదికలు, ఫీడ్బ్యాక్ ఆధారంగా క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థులు, ప్రచార తీరుతెన్నులను బీఆర్ఎస్ పెద్దలు మదింపు చేస్తూ.. వ్యూహాలకు పదును పెడుతున్నారు.