
లక్నో: దేశవ్యాప్తంగా అందరి చర్చ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మీద సాగుతోంది. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అన్ని పార్టీలు టికెట్ల కేటాయింపు విషయంతో జాగ్రత్త వహిస్తూ గెలుపుగుర్రాలను మాత్రమే బరిలోకి దించుతున్నాయి. ఆయా పార్టీల అధిష్టానం ఇచ్చే షాక్లకు అసెంబ్లీ టికెట్ ఆశావహులు తీవ్రమైన భంగపాటుకు గురవుతున్నారు.
తాజాగా సమాజ్వాదీ పార్టీ నుంచి ఎమ్మెలే టికెట్ ఆశించి దక్కకపోవటంతో ఓ నేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాజ్వాదీ పార్టీ కార్యాలయం ఎదుట అలీగఢ్కు చెందిన ఎస్పీ నేత ఆదిత్య ఠాకూర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. అయితే ఆదిత్య ఠాకూర్ అలీగఢ్లోని ఛారా నియోజకవర్గ నుంచి ఎస్పీ తరపున పోటీ చేయాలని భావించాడు. పార్టీ కోసం పని చేస్తున్న ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కచ్చితంగా వస్తుందని ఆశించాడు.
కానీ, చివర క్షణంలో పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆదిత్య ఠాకూర్.. పార్టీ ఆఫీసు ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ముజఫర్నగర్లోని చార్తావాల్ స్థానం నుంచి టికెట్ రాకపోవడంతో ఆందోళన చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేత అర్షద్ రాణా మీడియా ముందు భోరున విలపించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment