పార్లమెంట్‌ను కాపాడలేని బీజేపీ దేశాన్ని రక్షిస్తుందా?  | Telangana Deputy CM Bhatti Vikramarka Satires On PM Modi | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ను కాపాడలేని బీజేపీ దేశాన్ని రక్షిస్తుందా? 

Dec 23 2023 3:55 AM | Updated on Dec 23 2023 3:55 AM

Telangana Deputy CM Bhatti Vikramarka Satires On PM Modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌పై జరిగిన దాడితో ప్రపంచదేశాల్లో భారతదేశ విలువ ఎంతో దిగజారిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. భారత పార్లమెంట్‌ను రక్షించలేని బీజేపీ పాలకులు ఈ దేశాన్ని ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ‘ఇండియా’కూటమి ఎంపీలను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద ఆందోళన నిర్వహించారు.

ఈ ధర్నాకు హాజరైన భట్టి విక్రమా ర్క మాట్లాడుతూ పార్లమెంట్‌పై దాడిని రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావించాలన్నారు. దేశ రక్షణను గాలికి వదిలేసిన ప్రధాని మోదీని ప్రశ్నించిన ఇండియాకూటమి ఎంపీలతోపాటు మొత్తంగా 146 మందిని సస్పెండ్‌ చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే పార్లమెంట్‌పై జరిగిన దాడిపై సభలో సభ్యులు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలు ప్రశ్నించిన సభ్యులను సస్పెండ్‌ చేయడం సిగ్గుచేటు అని అన్నారు.

ఈ దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కా పాడాలనే ఆలోచన బీజేపీకి లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్‌గాందీ, ప్రియాంకా గాంధీ సైతం రోడ్లపైకి వచ్చి ఈ దేశం కోసం తామున్నామని, ప్రజలకు బాసటగా నిలుస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. 

సమాధానం చెప్పకుండా సస్పెన్షనా?
తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ పార్లమెంట్‌ ఘటనపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం విపక్ష సభ్యులను బయటకు పంపించిందని విమర్శించారు. ముఖ్యమైన బిల్లులపై చర్చ జరుగుతుంటే, అందరినీ బయటకు పంపించి బలవంతంగా బిల్లులను ఆమోదింప చేసుకుంటున్నా రని దుయ్యబట్టారు. వెంటనే విపక్ష సభ్యులను సభలోకి అనుమతించాలని డిమాండ్‌ చేశారు.

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పార్లమెంట్‌ మీద దాడి జరగడం అంటే అంబేడ్కర్‌ గుండెపైన దాడి జరిగినట్టేనని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌లో పొగ బాంబులు వేస్తే ఇంతవరకు సమాధానం చెప్పని ప్రధాని మోదీ చరిత్రలో ఎన్నడు లేని విధంగా 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారని విమర్శించారు.

మరో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పార్లమెంట్‌కు భద్ర త ఇవ్వలేని స్థితిలో ఉన్న ఎన్‌డీఏ దేశానికి భద్రత ఎలా కలి్పస్తుందని ఎద్దేవా చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కులమతాల పేరుతో బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, ఆమ్‌ ఆద్మీ పార్టీ కోఆర్డినేటర్‌ దిడ్డి సుధాకర్, ఎమ్మెల్యేలు రాజ్‌ ఠాకూర్, నాగరాజు, విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement