
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్రెడ్డికి తొలిరోజే షాక్ తగిలింది. వేదికపైనే ఆ పార్టీ నాయకుల ఇంటిపోరు బయటపడింది. అసంతృప్త నేతలపై ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపాలని, కనీసం కిషన్రెడ్డినైనా స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని హితవు పలికారు. ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లడంతోనే తన పదవి పోయిందని బండి పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
ఎడమొహం, పెడమొహం
ఇక వేదికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నూతన అధ్యక్షుడు కిషన్రెడ్డి ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. కిషన్రెడ్డి ముందు నుంచే వెళ్లిన రాజగోపాల్రెడ్డి, కిషన్రెడ్డికి అటు వైపు, ఇటువైపు ఉన్నవారితో కరచాలనం చేశారు తప్ప ఆయనను పట్టించుకోలేదు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
(చదవండి: తమాషాలొద్దు.. ఎంపీ అరవింద్కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్)
అందుకే త్వరగా వెళ్లిపోయా..
మరోవైపు కిషన్రెడ్డి పదవీ స్వీకార కార్యక్రమం నుంచి విజయశాంతి మధ్యలోనే వెళ్లిపోయారనే వార్తలు సైతం హాట్టాపిక్గా మారాయి. ‘నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం, అసాధ్యం. ఆ పరిస్థితి వల్ల ముందుగానే వెళ్లవలసి వచ్చింది’ అని ఆమె ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చారు.
నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి కార్యక్రమం వెనుదిరిగానని విజయశాంతి చెప్పుకొచ్చారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని ఉద్దేశించే విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీల్లో వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా, నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కిషన్రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు.
(చదవండి: ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోండి: బండి సంజయ్)
Comments
Please login to add a commentAdd a comment