![We will review the defeat](/styles/webp/s3/article_images/2024/06/24/kasu.jpg.webp?itok=6gZtLRKm)
గురజాల వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి
దాచేపల్లి: తమ ఓటమిపై సమీక్షించుకుంటామని పల్నాడు జిల్లా గురజాల వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి తెలిపారు. టీడీపీ చేస్తున్న అవమానాలు, వేస్తున్న నిందలను తట్టుకుని నిలబడతామన్నారు. ఇవే తమలో పట్టుదల పెంచుతాయని చెప్పారు. ఆదివారం ఆయన దాచేపల్లిలో మీడియాతో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తరువాత వైఎస్ జగన్ను ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ అవమానించిందని గుర్తు చేశారు.
ఈ అవమానాలే ఆయనలో పట్టుదలను పెంచి.. వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసి సీఎం అయ్యేలా చేశాయన్నారు. నిండు సభలో పాండవులను అవమానిస్తే యుద్ధం చేసి రాజ్యం సాధించుకున్నారని గుర్తు చేశారు. అలాగే టీడీపీ చేసే అవమానాలను దీటుగా ఎదుర్కొంటామన్నారు. మళ్లీ ప్రజల అండదండలతో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. టీడీపీకి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారని, దీన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.
గెలిచిన వెంటనే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవమానాల ప్రతిఫలం టీడీపీ అనుభవించాల్సి ఉంటుందన్నారు. తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ప్రజలకు మంచి చేసే విధానంలో హుందాగా వ్యవహరిస్తామని తెలిపారు. జగనన్న నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, మహామహులే ఓడిపోయారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు అద్భుతంగా చేసినప్పటికీ మద్యం, ఇసుక విషయంలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో, కార్మికుల్లో కొంత అసంతృప్తి ఉన్నట్లు గుర్తించామన్నారు. తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకుని మళ్లీ అవి జరగకుండా చూసుకుంటామన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు ధైర్యంగా ఉండాలని, త్వరలోనే ప్రతి ఒక్కరినీ కలుస్తానన్నారు.
శ్యామ ప్రసాద్ ముఖర్జీకి బీజేపీ నివాళి
సాక్షి, అమరావతి: దేశహితం కోసం బలిదానం చేసిన మహనీయుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అంటూ పలువురు బీజేపీ నేతలు కొనియాడారు. బీజేపీ సిద్ధాంతకర్తల్లో ప్రముఖులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఆదివారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనూ, వివిధ ప్రాంతాల్లో పార్టీ నేతలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సోషల్ మీడియా ‘ఎక్స్’లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ కి నివాళి అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment