దేశం దృష్టికి ఆటవిక పాలన.. నేడు ఢిల్లీలో ధర్నా | YS Jagan and YSRCP Leaders Went To Delhi To Protest On TDP Govt | Sakshi
Sakshi News home page

దేశం దృష్టికి ఆటవిక పాలన.. నేడు ఢిల్లీలో ధర్నా

Published Wed, Jul 24 2024 4:26 AM | Last Updated on Wed, Jul 24 2024 4:26 AM

ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ నేతలకు  అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

రాష్ట్రంలో అరాచక, విధ్వంసకాండపై వైఎస్సార్‌సీపీ సమరశంఖం  

టీడీపీ కూటమి దాడులను కళ్లకు కట్టినట్లు వివరించేలా ఫొటో ఎగ్జిబిషన్‌

రాష్ట్రపతి పాలన విధించేందుకు అవసరమైన సహేతుక కారణాలున్నాయని చాటి చెప్పనున్న జగన్‌ 

వినుకొండలో నడిరోడ్డుపై హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ కుటుంబానికి పరామర్శ 

టీడీపీ దాడులపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ.. అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని విజ్ఞప్తి 

కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని విచారణ జరపాలని డిమాండ్‌ 

రాష్ట్రంలో అ«థఃపాతాళానికి దిగజారిన శాంతిభద్రతలపై గవర్నర్‌కూ ఫిర్యాదు.. చట్ట సభల్లో నల్ల కండువాలతో నిరసన.. ఇప్పుడు కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని జాతీయ స్థాయిలో పోరాటం  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత 50 రోజులుగా రాజకీయ ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణించి.. వెంటాడి, వేటాడి హతమారుస్తూ.. ఇష్టారాజ్యంగా దాడులు చేస్తూ.. ఆస్తులను ధ్వంసం చేస్తూ చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సాగిస్తోన్న మారణహోమం, అరాచక, ఆటవిక పాలనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమర శంఖం పూరించారు. కేవలం 50 రోజుల్లోనే రాష్ట్రంలో 36 హత్యలు.. నలుగురిపై అత్యాచారాలు, ఆపై హత్యలు.. 16 హత్యాచారాలు.. వెయ్యికి పైగా దాడులతో రాష్ట్రంలో అధఃపాతాళానికి దిగజారిన శాంతిభద్రతలను యావత్‌ దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు బుధవారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో కలిసి భారీ ఎత్తున ధర్నా నిర్వహించనున్నారు. 

కూటమి ప్రభుత్వం సాగిస్తున్న హత్యలు, హత్యాచారాలు, దాడులు, ఆస్తుల విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా అక్కడే ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ దారుణకాండపై కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని పోరాటం చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలోనూ, అంతకు ముందు.. 11 కేసులు ఉంటే నన్ను కలవడానికి అనర్హులు.. 12 కంటే ఎక్కువ కేసులు ఉంటేనే తనను కలవడానికి అర్హులు అంటూ టీడీపీ నేత నారా లోకేశ్‌ ఆ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టారు. 

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను తరిమి తరిమి కొట్టండి అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మరింత రెచ్చగొట్టారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చెప్పుతో కొట్టండి.. హాకీ స్టిక్‌లతో కొట్టండి.. అధఃపాతాళానికి తొక్కేయండి అంటూ కూటమి నేతలు పేట్రేగిపోయారు. వారి పిలుపునందుకున్న టీడీపీ శ్రేణులు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్‌ 4 నుంచే అరాచకాలకు తెరతీశారు.  

బ్లడ్‌ బుక్‌గా రెడ్‌ బుక్‌ రూపాంతరం  
టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వారి పేర్లను రెడ్‌ బుక్‌లో నమోదు చేసుకున్నానని.. అధికారంలోకి వచ్చాక వారి అంతు చూస్తానని పాదయాత్రలో లోకేశ్‌ పదే పదే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. పర్యవసానంగా వందల సంఖ్యలో దాడులు.. విధ్వంసాలతో టీడీపీ శ్రేణులు రాష్ట్రాన్ని హడలెత్తిస్తున్నాయి. వినుకొండలో నడిరోడ్డుపై ప్రజలందరూ చూస్తుండగానే వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ కార్యకర్త జిలానీ కత్తితో నరికి చంపేయడం కూటమి ప్రభుత్వం మోగిస్తున్న మరణ మృదంగానికి పరాకాష్ట. 

లోకేష్‌ రెడ్‌ బుక్‌ బ్లడ్‌ బుక్‌గా రూపాంతరం చెందిందనడానికి ఇదే నిదర్శనం. టీడీపీ శ్రేణుల చర్యలతో సామాన్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు బాధ్యతాయుతంగా స్పందించక పోవడం విభ్రాంతి కలిగిస్తోంది. శాంతి భద్రతలను గాడిలో పెట్టేందుకు ప్రయతి్నంచకపోగా, టీడీపీ మూకల విధ్వంసకాండను వెనుకేసుకొచ్చే రీతిలో మంత్రివర్గ సమావేశంలో మాట్లాడారు. అసలు 36 హత్యలు ఎక్కడ జరిగాయని ఎందుకు ప్రశి్నంచలేదని మంత్రులను తప్పుపట్టారు.  

దారుణకాండపై పోరాటం  
టీడీపీ కూటమి ప్రభుత్వం సాగిస్తోన్న దారుణాలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే పోరాటం ప్రారంభించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని.. హత్యలు, హత్యాచారాలు, దాడులతో టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారని.. తక్షణమే జోక్యం చేసు­కుని శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అంతకు ముందు వినుకొండలో నడిరోడ్డుపై హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ కుటుంబాన్ని పరామర్శించారు. ఇలాంటి దారుణాలన్నింటి గురించి వివరించడానికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు. 

కేంద్ర ఏజెన్సీలతో విచారణ చేయించాలని కోరారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కూడా కలిసి రాష్ట్రంలో విధ్వంసకాండపై ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు సాగిస్తోన్న మారణకాండకు సంబంధించి ఫొటోలు, వీడియోలు వంటి సాక్ష్యాధారాలున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడాన్ని ఎత్తిచూపారు. టీడీపీ గూండాలపై కఠిన చర్యలు తీసుకుని, శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరారు. చట్టసభల్లో నల్ల కండువాలతో నిరసన గళం వినిపించారు. కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని ఇప్పుడు జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు పార్టీ శ్రేణులతో కలిసి ఢిల్లీ వెళ్లారు.
గన్నవరం విమానాశ్రయంలో కార్యకర్తలకు అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 


ఢిల్లీలో స్వాగతం పలుకుతున్న నాయకులు, కార్యకర్తలు 

ఢిల్లీ చేరుకొన్న వైఎస్‌ జగన్‌ 
రాష్ట్రంలో జరుగుతున్న హింసపై 24న నిరసన, ఫొటోగ్యాలరీ ఏర్పాటు 
సాక్షి, అమరావతి/విమానాశ్రయం(గన్నవరం)/సాక్షి, న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హింస, క్షీణిస్తోన్న శాంతి భద్రతలపై బుధవారం (24న) నిరసన కార్యక్రమంతో పాటు ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. 

ఈ ప్రదర్శన ద్వారా ఏపీలో జరుగుతోన్న అకృత్యాలను దేశ ప్రజలందరి దృష్టికి వైఎస్సార్‌సీపీ తీసుకువెళ్లనుంది. వైఎస్‌ జగన్‌ వెంట ఢిల్లీకి వెళ్లిన వారిలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, నియో­జకవర్గ సమన్వయకర్తలు, పార్టీ ముఖ్యులు ఉన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి వైఎస్‌ జగన్‌కు ఘనంగా వీడ్కోలు పలికాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement