సబ్‌రిజిస్ట్రార్‌పై ఆగంతకుల దాడి | - | Sakshi
Sakshi News home page

సబ్‌రిజిస్ట్రార్‌పై ఆగంతకుల దాడి

Published Tue, Mar 11 2025 1:17 AM | Last Updated on Tue, Mar 11 2025 1:16 AM

సబ్‌ర

సబ్‌రిజిస్ట్రార్‌పై ఆగంతకుల దాడి

గిద్దలూరు రూరల్‌: గిద్దలూరు రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎన్‌.కృష్ణమోహన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి గిద్దలూరు పట్టణంలోని జువ్విళ్లబావి సమీపంలో సబ్‌ రిజిస్ట్రార్‌ ఇంటి వద్ద చోటుచేసుకుంది. ఇటీవల బదిలీపై గిద్దలూరు సబ్‌ రిజిస్ట్రార్‌గా నియమితులైన కృష్ణమోహన్‌ తన సమీప బంధువుతో కలిసి జువ్విళ్ల బావి వద్ద ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కుటుంబ సభ్యులు మాత్రం చీరాలలో నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి ముఖానికి మాస్క్‌లు ధరించిన నలుగురు వ్యక్తులు సబ్‌ రిజిస్ట్రార్‌పై దాడికి తెగబడినట్లు సమాచారం. పిడిగుద్దులు కురిపించిన వెంటనే అక్కడ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. దాడి అనంతరం తేరుకున్న సబ్‌రిజిస్ట్రార్‌ స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రాత్రి పొద్దుపోయే వరకు భూముల రిజిస్ట్రేషన్లు సాగుతున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది.

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌

ఒకరికి తీవ్ర గాయాలు

కంభం: వేగంగా వెళ్తున్న బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒకిరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం రాత్రి అనంతపురం–అమరావతి హైవే రోడ్డుపై కంభంలో చోటుచేసుకుంది. వివరాలు.. యర్రగొండపాలేనికి చెందిన నలుగురు వ్యక్తులు రెండు బైకులపై వ్యక్తిగత పని నిమిత్తం నంద్యాల జిల్లా పాణ్యం వెళ్తున్నారు. ఈ క్రమంలో కంభం పట్టణంలోని హైవే రోడ్డుపై ఉన్న యూటర్న్‌ అర్థంగాక ఓ బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. బైక్‌పై నుంచి రోడ్డు మీద పడిపోయిన బి.వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

బైకును ఢీకొట్టిన లారీ

చర్చి పాస్టర్‌ మృతి

అద్దంకి: బైకును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ చర్చి పాస్టర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన అద్దంకి పట్టణంలోని బస్టాండు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. మండలంలోని కలవకూరు గ్రామానికి చెందిన పాస్టర్‌ అత్తోటి బాలసుందరం(66) బైకుపై వ్యక్తిగత పని నిమిత్తం అద్దంకి వచ్చారు. బైకు బస్టాండ్‌ సమీపంలోకి రాగానే.. అద్దంకి నుంచి మేదరమెట్ల వైపుకు వెళ్తున్న లోడ్‌ లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాలసుందరం అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని ఎస్సై రవితేజ పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సబ్‌రిజిస్ట్రార్‌పై ఆగంతకుల దాడి 1
1/1

సబ్‌రిజిస్ట్రార్‌పై ఆగంతకుల దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement