జహీరాబాద్: భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురై మొగుడంపల్లి మండలంలోని సజ్జారావుపేట తండాకు చెందిన రైతు కీరూ రాథోడ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి అన్న జ్ఞానేందర్ కథనం మేరకు.. కీరు తండ్రి రాంచందర్ సూర్య, అతడి అన్న లక్ష్మన్ సూర్యల పేరిట 14 ఎకరాల భూమి ఉంది. ఇందులో 3 ఎకరాలు లక్ష్మణ్ అమ్ముకున్నాడు. మిగితా భూమి ధరణి మూలంగా రికార్డుల నుంచి మాయమైంది. వీరి ఉమ్మడి కుటుంబమే కబ్జాలో ఉన్నప్పటికీ ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ కావడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. దీంతోపాటు 140 సర్వే నంబర్లో 1.20 ఎకరాల భూమి కీరు కుటుంబం పేరిట ఉంది. ఇందులో నుంచి 10 గుంటల భూమి తనకే వస్తుందని, పాలివారు మాత్రం వేధింపులకు గురి చేస్తూ పోలీసులను ఆశ్రయించి వత్తిడి చేస్తున్నారని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయమై రూరల్ ఎస్ఐ ప్రసాద్రావు స్పందిస్తూ భూ వివాదం విషయాన్ని న్యాయస్థానంలో పరిష్కరించుకోవాలని, ఫిర్యాదు దారుడికి చెప్పినట్లు పేర్కొన్నారు. రైతు సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో..