గుజరాత్‌ బోణీ | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ బోణీ

Published Thu, Mar 7 2024 12:31 AM

First win in the account of Gujarat Giants team - Sakshi

అదరగొట్టిన బెత్‌ మూనీ, లౌరా

న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నిలో ఎట్టకేలకు గుజరాత్‌ జెయింట్స్‌ జట్టు ఖాతాలో తొలి విజయం చేరింది. వరుసగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన గుజరాత్‌ ఐదో మ్యాచ్‌లో గెలుపు బోణీ కొట్టింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 19 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు సాధించింది.

ఓపెనర్లు లౌరా వొల్వార్ట్‌ (45 బంతుల్లో 76; 13 ఫోర్లు), కెప్టెన్‌ బెత్‌ మూనీ (51 బంతుల్లో 86 నాటౌట్‌; 12 ఫోర్లు, 1 సిక్స్‌) బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 13 ఓవర్లలో 140 పరుగులు జోడించారు.

లౌరా అవుటయ్యాక వచ్చిన ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ (18; 1 ఫోర్‌), యాష్లీ గార్డ్‌నర్‌ (0), హేమలత (1), వేద కృష్ణమూర్తి (1) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అనంతరం 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఓడిపోయింది. 

స్మృతి మంధాన (24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎలీస్‌ పెరీ (24; 3 ఫోర్లు), సోఫీ డివైన్‌ (23; 1 ఫోర్, 2 సిక్స్‌లు), రిచా ఘోష్‌ (30; 5 ఫోర్లు, 1 సిక్స్‌), జార్జియా వేర్‌హమ్‌ (48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా ఫలితం లేకపోయింది. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో యూపీ వారియర్స్‌ తలపడుతుంది.

Advertisement
Advertisement