తుదిజట్టులో వారికి చోటు లేదు: కారణం చెప్పిన గంభీర్‌ | Gambhir All But Confirms India XI For 1st Test vs Bangladesh Pant Come In So | Sakshi
Sakshi News home page

Ind vs Ban: తుదిజట్టులో వారికి చోటు లేదు.. కారణం చెప్పిన గంభీర్‌

Published Wed, Sep 18 2024 5:49 PM | Last Updated on Wed, Sep 18 2024 6:44 PM

Gambhir All But Confirms India XI For 1st Test vs Bangladesh Pant Come In So

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. తుదిజట్టులో చోటు కోసం.. యువకులు మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పదని పేర్కొన్నాడు. చెన్నై టెస్టులో ఆడబోయే ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ధ్రువ్‌ జురెల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌లకు చోటు దక్కదని సంకేతాలు ఇచ్చాడు.

బంగ్లాదేశ్‌కు వార్నింగ్‌
ఇక చెపాక్‌లో ఈసారి మ్యాచ్‌ జరుగబోయేది ఎర్రమట్టి పిచ్‌ మీదే అయినప్పటికీ.. తమ స్పిన్నర్లు కూడా ప్రభావం చూపుతారని గంభీర్‌ ధీమా వ్యక్తం చేశాడు. దిగ్గజ స్పిన్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌ త్రయంతో బంగ్లాదేశ్‌ జట్టు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్‌ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌ జరుగనుంది.

పంత్‌ జట్టులోకి వచ్చాడు.. కాబట్టి
ఈ క్రమంలో గురువారం చెన్నై వేదికగా తొలి టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ బుధవారం మాట్లాడుతూ.. ‘‘మేము ఎవరినీ జట్టు నుంచి తప్పించం. అయితే, ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఫిట్‌ అయ్యే ఆటగాళ్లను మాత్రమే ఎంచుకుంటాం. జురెల్‌ అద్భుతమైన ఆటగాడు. అయితే, పంత్‌ జట్టులోకి వచ్చాడు.

కాబట్టి.. కొన్నిసార్లు కొంతమంది ఎదురుచూడకతప్పదు. సర్ఫరాజ్‌కూ ఇదే వర్తిస్తుంది. అందరికీ అవకాశాలు వస్తాయి. కానీ ఓపికగా ఎదురుచూడటం అవసరం’’ అని పేర్కొన్నాడు. తద్వారా వికెట్‌ కీపర్‌గా రిషభ్‌ పంత్‌, మిడిలార్డర్‌లో కేఎల్‌ రాహుల్‌ ఆడటం ఖాయమని చెప్పకనే చెప్పాడు.

మాకు అశూ, జడ్డూ ఉన్నారు
ఇక స్పిన్‌దళం అశ్విన్‌, జడేజా, కుల్దీప్‌ల గురించి ప్రస్తావన రాగా.. ‘‘మా స్పిన్నర్లు మొదటి రోజు నుంచి ఐదో రోజు వరకు ప్రభావం చూపగలరు. కేవలం ఒక్కరోజు మాత్రమే ఆటగాళ్లను తుదిజట్టులోకి తీసుకోలేము కదా. అదృష్టవశాత్తూ మాకు అశ్విన్‌, జడేజా ఉన్నారు. 

వాళ్లు డిఫెన్సివ్‌గా ఆడగలరు. అదే సమయంలో దూకుడూ ప్రదర్శించగలరు’’ అని గంభీర్‌ ప్రశంసించాడు. కాగా చెపాక్‌లోని ఎర్రమట్టి పిచ్‌ పేసర్లకు అనుకూలంగా ఉండనుందన్న వార్తల నేపథ్యంలో.. తమ స్పిన్‌ దళం నుంచే ప్రత్యర్థికి ఎక్కువ ప్రమాదమని గౌతీ చెప్పడం విశేషం.

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు భారత తుదిజట్టు అంచనా
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

చదవండి: IND vs BAN: విరాట్‌ కోహ్లినే భయపెట్టాడు..! ఎవరీ గుర్నూర్ బ్రార్?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement