
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 44.1 ఓవర్లలో 180 పరుగులకే ఆలౌటైంది. ఇన్నింగ్స్ తొలి బంతికే యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 37 పరుగులు చేసి ఔటయ్యాడు.
వన్డౌన్లో వచ్చిన శుభ్మన్ గిల్ 31 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లి 7, రిషబ్ పంత్ 21 పరుగులు చేశారు. చాలా రోజుల తర్వాత బ్యాటింగ్ స్థానం మార్చుకుని ఆరో స్థానంలో బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ 3 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. 109 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్ను నితీశ్ కుమార్ రెడ్డి (42), రవిచంద్రన్ అశ్విన్ (22) కాసేపు ఆదుకున్నారు. ఆఖర్లో నితీశ్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
స్టార్క్, బోలాండ్ బౌలింగ్లో ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. నితీశ్ ఇంకాసే క్రీజ్లో ఉండి ఉంటే టీమిండియా 200 పరుగుల మార్కు దాటేది. నితీశ్ చివరి వికెట్గా వెనుదిరిగాడు. హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా డకౌట్ కాగా.. సిరాజ్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. కమిన్స్, బోలాండ్ తలో 2 వికెట్లు తీశారు. కాగా, ఐదు మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment