
IND VS ENG: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడటంతో ఇంగ్లండ్తో జరుగబోయే రీ షెడ్యూల్డ్ టెస్ట్కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో మ్యాచ్కు టీమిండియా పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న అంశంపై సర్వత్రా చర్చ సాగుతుంది. కొందరు పంత్ అయితే బాగుంటుందని అంటే మరికొందరు బుమ్రా పేరును ప్రతిపాదిస్తున్నారు.
ఇదే అంశంపై పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సైతం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా కెప్టెన్గా పంత్, బుమ్రా ఇద్దరూ వద్దని అతను అభిప్రాయపడ్డాడు. పంత్ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే పరిణితిని సాధించాల్సి ఉందని, ఇటీవలి దక్షిణాఫ్రికా సిరీస్లో కెప్టెన్గా అతని వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపించాయని అన్నాడు. అసలు పంత్కు టీమిండియా పగ్గాలు చేపట్టే సామర్థ్యం లేదని సంచలన కామెంట్స్ చేశాడు. కెప్టెన్సీ ప్రభావం అతడి బ్యాటింగ్పై కూడా పడిందని అభిప్రాయపడ్డాడు.
మరోవైపు బుమ్రాకు సైతం కెప్టెన్సీ అప్పజెప్పకుంటేనే మంచిదని సలహా ఇచ్చాడు. కెప్టెన్సీ భారం వల్ల బుమ్రా తన లయను కోల్పోతాడని, ఈ భారాన్ని అతని తలపై మోపి చెడగొట్టొదని సూచించాడు. బుమ్రాకు స్వేచ్ఛగా బౌలింగ్ చేసే అవకాశం కల్పించాలని కోరాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో ఐదో టెస్ట్ ప్రారంభమయ్యే సమయానికి రోహిత్ శర్మ కోవిడ్ నుంచి కోలుకోకపోతే బుమ్రా, పంత్, అశ్విన్లలో ఎవరో ఒకరికి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: పాకిస్థాన్ క్రికెట్ను 'అతను' భ్రష్టు పట్టిస్తాడు..!
Comments
Please login to add a commentAdd a comment