IND VS ENG 5th T20I: 82 పరుగులకే 5 కోల్పోయిన ఇంగ్లండ్‌ | India VS England 5th T20I Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IND VS ENG 5th T20I: 82 పరుగులకే 5 కోల్పోయిన ఇంగ్లండ్‌

Published Sun, Feb 2 2025 6:44 PM | Last Updated on Sun, Feb 2 2025 9:36 PM

India VS England 5th T20I Live Updates And Highlights

మూడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
59 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. బిష్ణోయ్‌ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌ (2) ఔటయ్యాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
48 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. జోస్‌ బట్లర్‌ను (7) వరుణ్‌ చక్రవర్తి పెవిలియన్‌కు పంపాడు. 

టార్గెట్‌ 248.. తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభమే లభించింది. అయితే ఆ జట్టు 3వ ఓవర్‌ తొలి బంతికి తొలి వికెట్‌ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో బెన్‌ డకెట్‌ డకౌటాయ్యాడు. 4 ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోర్‌ 48/1గా ఉంది. ఫిల్‌ సాల్ట్‌ (39) ధాటిగా ఆడుతున్నాడు. 

అభిషేక్‌ విధ్వంసకర శతకం.. టీమిండియా భారీ స్కోర్‌
ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా భారీ స్కోర్‌ (247/9) చేసింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. హాఫ్‌ సెంచరీని 17 బంతుల్లో పూర్తి చేసిన అభిషేక్‌.. సెంచరీని 37 బంతుల్లో శతక్కొట్టాడు. 

టీ20ల్లో అభిషేక్‌ది భారత్‌ తరఫున  రెండో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ (17), సెంచరీ (37). టీ20ల్లో భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు రోహిత్‌ శర్మ (35 బంతుల్లో) పేరిట ఉండగా.. ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ యువరాజ్‌ సింగ్‌ (12 బంతుల్లో) పేరిట ఉంది. అభిషేక్‌కు టీ20ల్లో ఇది రెండో సెంచరీ.

టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక స్కోర్‌ (135) కూడా అభిషేక్‌దే. అలాగే ఓ టీ20లో భారత్‌ తరఫున అత్యధిక సిక్సర్లు (13) కొట్టింది కూడా అభిషేకే. అభిషేక్‌ ధాటికి భారత్‌ పవర్‌ ప్లేల్లో అత్యధిక స్కోర్‌ (95/1) నమోదు చేసింది. అభిషేక్‌ సెంచరీ పూర్తయ్యాక భారత్‌ స్కోర్‌ బాగా నెమ్మదించింది. వరుస క్రమంలో వికెట్లు పడిపోయాయి. ఆరంభంలో సంజూ శాంసన్‌ (7 బంతుల్లో 16; ఫోర్‌, 2 సిక్సర్లు).. మధ్యలో తిలక్‌ వర్మ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్‌), శివమ్‌ దూబే (13 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. 

వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో సూర్యకుమార్‌ యాదవ్‌ (3 బంతుల్లో 2), హార్దిక్‌ పాండ్యా (6 బంతుల్లో 9; సిక్స్‌), రింకూ సింగ్‌ 6 బంతుల్లో 9; ఫోర్‌), అక్షర్‌ పటేల్‌ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు), బిష్ణోయ్‌ (0) ఔటయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్‌ 3, మార్క్‌ వుడ్‌ 2, జోఫ్రా ఆర్చర్‌, జేమీ ఓవర్టన్‌, ఆదిల్‌ రషీద్‌ తలో వికెట్‌ తీశారు.

37 బంతుల్లో శతక్కొట్టిన అభిషేక్‌
హాఫ్‌ సెంచరీ తర్వాత పేట్రేగిపోయిన అభిషేక్‌ శర్మ 37 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో భారత్‌ తరఫున ఇది రెండో వేగవంతమైన శతకం. టీ20ల్లో భారత్‌ తరఫున వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్‌ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్‌ 2017లో శ్రీలంకపై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఓవరాల్‌గా టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్‌ చౌహాన్‌ పేరిట ఉంది. గతేడాది చౌహాన్‌ సైప్రస్‌పై కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ‌

అభిషేక్‌ శర్మ విధ్వంసం.. 17 బంతుల్లో అర్ధ శతకం
ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. సంజూ ఔటయ్యాక ఒక్కసారిగా బీస్ట్‌ మోడ్‌లోకి వచ్చిన అభిషేక ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది 17 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో యువరాజ్‌ సింగ్‌ (12 బంతుల్లో) తర్వాత అభిషేక్‌దే ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి. అభిషేక్‌ దెబ్బకు భారత్‌ తొలి 6 ఓవర్లలో 95 పరుగులు చేసిం‍్ది. అభిషేక్‌ 58, తిలక్‌ 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

సంజూ శాంసన్‌ మరోసారి విఫలం
టీమిండియా ఓపెనర్‌ సంజూ శాంసన్‌ మరోసారి విఫలమయ్యాడు.వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైనా టీమిండియా మేనేజ​్‌మెంట్‌ సంజూకు మరో ఛాన్స్‌ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలి బంతికే సిక్సర్‌ బాదిన సంజూ.. ఆతర్వాత అదే ఓవర్‌లో మరో సిక్సర్‌, బౌండరీ బాదాడు. అయితే సంజూ (7 బంతుల్లో 16; ఫోర్‌, 2 సిక్సర్లు) ఆతర్వాతి ఓవర్‌లోనే మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌
ముంబై వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఇవాళ (ఫిబ్రవరి 2) నామమాత్రపు ఐదో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. భారత్‌ తరఫున అర్షదీప్‌ సింగ్‌ స్థానంలో మహ్మద్‌ షమీ తుది జట్టులోకి రాగా.. గత మ్యాచ్‌లో సంచలన బౌలింగ్‌ ప్రదర్శన చేసిన సాకిబ్‌ మహమూద్‌కు ఇంగ్లండ్‌ రెస్ట్‌ ఇచ్చింది. సాకిబ్‌ స్థానంలో మార్క్‌ వుడ్‌ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ ఇదివరకే 3-1 తేడాతో కైవసం​ చేసుకున్న విషయం తెలిసిందే.

తుది జట్లు..
ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్‌), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్‌ బేతెల్‌, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్‌ వుడ్‌

భారత్: సంజు శాంసన్(వికెట్ కీప‌ర్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), రింకూ సింగ్‌, హార్దిక్ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్ పటేల్, మహ్మద్‌ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement