
ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్తో ఇవాళ (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ ఓటమిని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఐపీఎల్ ఇది రెండో అతి భారీ స్కోర్.
ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్పై సన్రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్గా ఉంది. ఓ సీజన్లో 250పైగా స్కోర్లు రెండు సార్లు నమోదు కావడం 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 17.2 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసి, 106 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రిషబ్ పంత్ (55), ట్రిస్టన్ స్టబ్స్ (54) ఓటమి ఖరారైన దశలో బ్యాట్ను ఝులిపించారు. వీరిద్దరు మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు.
వార్నర్ (18), పృథ్వీ షా (10) రెండంకెంల స్కోర్లు చేయగా.. మార్ష్, పోరెల్, అక్షర్ డకౌట్లయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌల్ చేసి చెరి 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2, రసెల్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో కేకేఆర్ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తాజా ఓటమితో ఢిల్లీ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment