
జూన్ 7న ప్రారంభంకానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా వికెట్ కీపర్ ఎవరనే అంశంపై ఇప్పటి నుంచి డిబేట్లు మొదలయ్యాయి. కేఎస్ భరతా లేక ఇషాన్ కిషనా అన్న విషయంపై బెట్టింగ్లు సైతం జరుగుతున్నాయి. టీమిండియా యాజమాన్యం.. కాస్తో కూస్తో అనుభవం (4 టెస్ట్లు) ఉన్న కేఎస్ భరత్వైపు మొగ్గు చూపుతుందా లేక ఇంకా టెస్ట్ అరంగేట్రం చేయని ఇషాన్ కిషన్కు అవకాశం ఇస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వికెట్కీపింగ్ వరకు పర్వాలేదని ఇదివరకే నిరూపించుకున్న భరత్ను తుది జట్టులో ఆడిస్తారా లేక వన్డేల్లోనే డబుల్ సెంచరీ (గతేడాది బంగ్లాదేశ్పై) సాధించిన ఇషాన్ కిషన్కు తొలి అవకాశం ఇస్తారా అనే అంశంపై బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి.
ఈ అంశంపై ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు చెబుతుండగా.. తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సైతం తన మనసులో మాటను బయటపెట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 మొత్తం ఆడిన భరత్కే డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు దక్కుతుందని జోస్యం చెప్పాడు. అదనపు బ్యాటర్ కావాలనిపించినా, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఉంటే మంచిదనిపించినా ఇషాన్ కిషన్కు అవకాశం దక్కుతుందని అభిప్రాయపడ్డాడు. ఆఖరి నిమిషంలో సమీకరణలు ఎలా ఉన్నా తన ఫస్ట్ ఛాయిస్ మాత్రం కేఎస్ భరతేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.
చదవండి: చెన్నైని ‘ఢీ’కొట్టేదెవరు?