
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్కు భారీ సంఖ్యలో మహిళలు హాజరుకానున్నారని తెలుస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న జరిగే ఈ మ్యాచ్ కోసం గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం 40,000 మందికి పైగా మహిళలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ వెల్లడించింది.
ఈ మ్యాచ్ను వీక్షించేందుకు వచ్చే మహిళలకు ఉచిత టికెట్లతో పాటు ఆల్పాహారం కూడా అందించనున్నట్లు సమాచారం. గతంలో మహిళల ఐపీఎల్ సందర్భంగా కూడా ఓ మ్యాచ్ కోసం ఇలాగే భారీ సంఖ్యలో మహిళలను తరలించారు. అయితే అప్పుడు ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ చర్యను చేపట్టింది.
ఇదిలా ఉంటే, మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ప్రపంచకప్ కోసం అన్ని జట్లు సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. కొన్ని జట్లు ఇవాళ తమ ఆఖరి వార్మప్ మ్యాచ్లు ఆడుతుండగా.. మిగతా జట్లు వరల్డ్కప్ వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 8న ఆడనుంది. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడుతుంది.
అనంతరం భారత్ తమ రెండో మ్యాచ్ను అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. దీని తర్వాత టీమిండియా అక్టోబర్ 14న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్కు కూడా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ వరల్డ్కప్లో నరేంద్ర మోదీ స్టేడియం మొత్తంగా ఐదు మ్యాచ్లను ఆతిథ్యమివ్వనుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే మైదానంలో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment