● పోలీసులకు అప్పగించిన తండ్రి
భువనేశ్వర్: ఇంట్లో తాళి కట్టిన ఇల్లాలు ఉండగా మరో మహిళతో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు ఆ మృగాడు. అయితే దీన్ని తండ్రి అంగీకరించలేదు. కొడుకుని ఈడ్చుకొని తీసుకొని వెళ్లి స్వయంగా పోలీసులకు అప్పగించాడు. భద్రక్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన చర్చనీయాంశమైంది. ఠాణాలో పెళ్లి తప్పిన దంపతుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తన కొడుకు అజయ్ను రెండో పెళ్లి చేసుకున్నందుకు శిక్షగా ఊరేగింపులో కనిపించిన వద్ధుడు ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. భద్రక్ జిల్లాలోని బాసుదేవ్పూర్ ఠాణా పరిధిలోని ఎడ్తాల్ గ్రామస్తుడు అజయ్ మొదటి భార్య ఉంటుండగా చట్టబద్ధంగా కోర్టులో మరో మహిళతో రెండో పెళ్లికి సిద్ధం అయ్యాడు. ఈ విషయం తన కన్న తండ్రి బిష్ణుమోహన్ జెనా చెవిన పడడంతో హుటాహుటిన కొడుకు రెండో పెళ్లి ప్రాంగణానికి చేరి విషయంపై ఆరా తీశాడు. తాను విన్నది నిజమేనని తేలడంతో కోర్టు ఆవరణ నుంచి కన్న కొడుకు చొక్కా కాలరు పట్టుకుని ఈడ్చుకుంటు నడి రోడ్డు గుండా పోలీసు ఠాణాలో హాజరు పరిచాడు. పది సంవత్సరాల కిందట తన కొడుకు అజయ్కు వివాహం జరిగిందని.. ఈ దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడని పోలీసులకు వివరించాడు. ఇల్లాలు, బిడ్డ ఉండగా రెండో పెళ్లికి పాల్పడడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన తండ్రి తక్షణ స్పందన అందరి హృదయాల్ని చలింప జేసింది. కోడలు, మనవడుతో కలిసి ఆరోగ్య పరీక్షల కోసం గ్రామంలో సామాజిక ఆరోగ్య కేంద్రానికి (సీహెచ్సీ) వెళ్లిన సమయంలో కొడుకు కోర్టులో అజయ్కు రెండో పెళ్లి జరుగుతుందని తండ్రి చెవిన పడింది. తక్షణమే బిష్ణుమోహన్ తన కోడలు, మనవడిని ఇంట్లో వదిలేసి కోర్టుకెళ్లి రెండో పెళ్లికి సిద్ధమవుతున్న కొడుకును చూసి అవాక్కయ్యాడు. ఈ విషయం దాచిపెట్టకుండా తన కొడుకును పోలీసులకు అప్పగించాలని బిష్ణుమోహన్ అప్పటికప్పుడే నిర్ణయించుకున్నాడు. కొడుకును ఈడ్చుకుని పోలీస్ స్టేషకు తీసుకెళ్లాడు. అజయ్తో పెళ్లి చేసుకోబోతున్న మహిళ అతనితో పాటు పోలీస్స్టేషన్కు వెళ్లింది. విచారణ నిమిత్తం పోలీసులు అజయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో అజయ్ తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని అతని భార్య ఆరోపించింది.