
సాక్షి,హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన హక్కు, వాటాలు, ప్రయోజనాల పరిరక్షణకు కృష్ణా నదీ యాజమాన్యబోర్డు (కేఆర్ఎంబీ) అధికార పరిధిని ప్రకటించాలని (నోటిఫై) కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కుమార్ శనివారం రాసిన ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏపీ సీఎం జగన్తో కలసిపోయి తెలంగాణ నీటిహక్కులు, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని, అందువల్ల వీలైనంత తొందరగా కేఆర్ఎంబీ పరిధిని నోటిఫై చేయడం ద్వారా తెలంగాణ న్యాయబద్ధ నీటి వాటాను బోర్డు పరిరక్షించే వీలుంటుందన్నారు. ఏదైనా కొత్త ట్రిబ్యునల్ లేదా కేడబ్ల్యూడీటీ–2 కొత్త అవార్డు ప్రకటించినపుడు కేఆర్ఎంబీ కొత్త కేటాయింపుల ప్రకారం నీటిని క్రమబద్ధీకరిస్తుందని, ఆ విధంగా తెలంగాణ హక్కులకు రక్షణ ఉంటుందని తాము అర్థం చేసుకుంటున్నామని పేర్కొన్నారు.