
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభంతో స్థానికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. రూ.387 కోట్లతో 1.13 కి.మీ. పొడవుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఫ్లైఓవర్ రిబ్బన్ కటింగ్ ఎవరు చేశారో తెలుసా.. మంత్రి కేటీఆర్ ఓ కూలీ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేయించారు.
ఆమెనే వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ. గత రేండేళ్ల నుంచి ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో ఆమె పాలు పంచుకుంది. శివమ్మ చేతుల మీదుగా ఫ్లై ఓవర్ను ప్రారంభించుకోవడంతో కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది శివమ్మ. కాగా. 6 లైన్లు, 24 మీ. వెడల్పు, 26 పిల్లర్లతో ఫ్లైఓవర్ను నిర్మించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. త్వరలో రహదారుల విస్తరణ చేపడతామన్నారు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మిస్తామని తెలిపారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ను విస్తరిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ప్రారంభోత్సవ క్యార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.