
హైదరాబాద్, సాక్షి: మహిళా కార్పొరేటర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. సోమవారం డీసీపీ ఆఫీస్ వద్ద ఆయన మాట్లాడుతూ.. కార్పొరేటర్లపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయగా.. ఫిర్యాదు అందడంతో ఎల్బీ నగర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.
ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో ప్రొటోకాల్ రగడతో మొదలైన వివాదం.. చిలికి చిలికి గాలి వానగా మారింది. ఎమ్మెల్యే కొన్ని పనులకు శంకుస్థాపన చేయగా.. అవే పనులకు బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి సోమవారం మళ్లీ శంకుస్థాపన చేశారు. దీంతో వివాదం మొదలైంది. ఎమ్మెల్యే చేశాక మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈలోపు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేశారు. అయితే..
కాసేపటికే మరో చోటులో శంకుస్థాపనలు పనులు జరగ్గా.. ఈసారి బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్మెట్ పీఎస్కు తరలించారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. పీఎస్కు చేరుకుని వాళ్లను విడిపించారు. అరెస్ట్ సమయంలో కార్యకర్తలకు గాయాలు అయ్యాయని తెలుసుకుని పోలీసుల తీరుపై మండిపడ్డారు. వాళ్లను సరాసరి డీసీపీకి ఆఫీస్కు తీసుకెళ్లి ఉన్నతాధికారులకు జరిగింది వివరించారు.
ఆపై బయటకు వచ్చి మాట్లాడిన ఆయన.. ఈ దాడుల వెనుక కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ప్రమేయం ఉందని, కార్పొరేటర్ల మధ్య హనీమూన్ నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. హస్తినాపురం కార్పొరేటర్ సుజాత పేరును కూడా ప్రస్తావించారు. దీంతో.. వివాదం రాజుకుంది. సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై సుజాత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకానొక తరుణంలో ఆమె తీవ్ర వ్యాఖ్యలే చేశారు. మరోవైపు..
సుజాత నాయక్కు మద్ధతుగా పలువురు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయనపై ఫిర్యాదు అందడంతో.. Cr. No. 254/2025 U/s Sec. 3(2)(va), 3(1)(r)(w)(ii) SC/ST POA Act, 1989 & Sec. 79 BNS సెక్షన్ల కింద సుధీర్ రెడ్డిపై కేసు ఫైల్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment