‘ఫ్యూచర్‌ స్టేట్‌’గా తెలంగాణ | Telangana to become The Future State declares Revanth Reddy | Sakshi
Sakshi News home page

‘ఫ్యూచర్‌ స్టేట్‌’గా తెలంగాణ

Published Sat, Aug 10 2024 6:14 AM | Last Updated on Sat, Aug 10 2024 9:04 AM

Telangana to become The Future State declares Revanth Reddy

నినాదాన్ని ఖరారు చేస్తున్నామన్న సీఎం 

‘ఏఐ యూనికార్న్‌’ కంపెనీల సీఈవోలతో భేటీ

‘ఆమ్‌జెన్‌’ రీసెర్చ్‌ సెంటర్‌తో 3 వేల ఉద్యోగాలు 

‘ఐటీ సర్వ్‌ అలయెన్స్‌’ సమావేశంలో పాల్గొన్న రేవంత్, శ్రీధర్‌బాబు

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలోని ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం, నినాదం ఉన్నట్లుగానే తెలంగాణ రాష్ట్రానికి ‘ఫ్యూచర్‌ స్టేట్‌’ అనే నినాదాన్ని ఖరారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. న్యూయార్క్‌కు ‘అవుటాఫ్‌ మెనీ..వన్‌’, టెక్సాస్‌కు ‘లోన్‌ స్టార్‌ స్టేట్‌’, కాలిఫోరి్నయా కు ‘యురేకా’ అనే ట్యాగ్‌లైన్‌ ఉందని.. అదే రీతి లో ఆరి్టఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ హబ్, నెట్‌ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ ఇకపై ‘ది ఫ్యూచర్‌ స్టేట్‌’కు పర్యాయపదంగా నిలుస్తుందని చెప్పారు.

అమెరికా పర్యటనలో ఉన్న సీఎం నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం కాలిఫోరి్నయాలో ‘ఏఐ యూనికార్న్‌’ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యింది. భారతీయ కాన్సుల్‌ జనరల్‌ నిర్వహించిన ‘ఏఐ బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశం’లో వారినుద్దేశించి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కంపెనీల ప్రతినిధులు తెలంగాణను సందర్శించి భవిష్యత్తును ఆవిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐ యూనికార్న్‌ వ్యవస్థాపకులు హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సదుపాయాలు పరిశీలించాలని కోరారు. 

హైదరాబాద్‌లో ‘ఆమ్‌జెన్‌’ రీసెర్చ్‌ సెంటర్‌ 
అమెరికాలో అతిపెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ‘ఆమ్‌జెన్‌’ తెలంగాణలో కార్యకలాపాల విస్తరణలో భాగంగా నూతన ‘రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం’ను ప్రారంభించనుంది. హైటెక్‌ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఏర్పాటవుతున్న ఈ సెంటర్‌ ద్వారా 3 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏడాది చివరలో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ‘ఆమ్‌జెన్‌’ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు, సంస్థ ఎండీ డాక్టర్‌ డేవిడ్‌ రీస్, నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ సోమ్‌ ఛటోపాధ్యాయ భేటీ అయ్యారు. ఆమ్‌జెన్‌ కార్యకలాపాల విస్తరణకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడంపై రేవంత్,  శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. 

ప్రతి రూపాయి భవిష్యత్తుకు పెట్టుబడి: సీఎం 
ప్రతి రూపాయి భవిష్యత్తుకు పెట్టుబడి: సీఎం తెలంగాణలో పెట్టుబడుల ద్వారా హైదరాబాద్‌ అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని ఐటీ సేవల కంపెనీలకు సీఎం రేవంత్‌ పిలుపునిచ్చారు. ఐటీ సంస్థల అసోసియేషన్‌ ‘ఐటీ సర్వ్‌ అలయెన్స్‌’ సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం పాల్గొన్నారు. ‘చారిత్రక నగరం హైదరాబాద్‌తో పాటు సికింద్రాబాద్, సైబరాబాద్‌ తర్వాత నాలుగో నగరంగా ఫ్యూచర్‌ సిటీ ఏర్పాటవుతోంది. ఇక్కడ పెట్టుబడిగా పెట్టే ప్రతి రూపాయి మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది..’ అని రేవంత్‌ చెప్పారు.  

ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు సహకరించండి: శ్రీధర్‌బాబు 
ఏఐ, టెక్నాలజీ సెంటర్‌గా, ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన భవిష్యత్తు నగరంగా హైదరాబాద్‌ మారుతోందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. వచ్చే పదేళ్లలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడంలో అందరూ కలిసి రావాలన్నారు. కాగా ఈ ఏడాది చివరలో వేగాస్‌లో జరిగే ‘ఐటీ సర్వ్‌ అలయెన్స్‌’ వార్షికోత్సవానికి రావాల్సిందిగా సీఎం రేవంత్‌ను అలయెన్స్‌ ప్రతినిధులు ఆహా్వనించారు. 

అడోబ్‌ సిస్టమ్స్‌ సీఈఓతో భేటీ 
అడోబ్‌ సిస్టమ్స్‌ సీఈఓ శంతను నారాయణ్‌తో రేవంత్, శ్రీధర్‌బాబుల బృందం భేటీ అయింది. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ‘హైదరాబాద్‌ 4.0 ఫ్యూచర్‌ సిటీ’ నిర్మాణం, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీ ఏర్పాటు ప్రణాళికలపై శంతను ఆసక్తి కనబరిచారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో పాలు పంచుకునేందుకు అంగీకరించారు.  

రూ.3,350 కోట్లతో గ్రీన్‌ డేటా సెంటర్‌ 
హైదరాబాద్‌లో అత్యాధునిక ఏఐ ఆధారిత గ్రీన్‌ డేటా సెంటర్‌ను రూ.3,357 కోట్ల (400 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు) పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు ఆరమ్‌ ఈక్విటీ పార్ట్నర్స్‌ సంస్థ ప్రకటించింది. కాలిఫోర్నియా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి బృందంతో భేటీ అనంతరం ఆరమ్‌ ఈక్విటీ ఈ ప్రకటన చేసింది. గత ఏడాది 50 మిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెడతామని ప్రకటించిన కంపెనీ.. తాజాగా 100 మెగావాట్ల ఆధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను 400 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పెట్టుబడి హైదరాబాద్‌లో అనేక ఉద్యోగాల కల్పనకు దోహద పడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. భారత్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య డిజిటల్‌ అంతరాన్ని తగ్గించేందుకు తమ పెట్టుబడి ఉపయోగపడుతుందని ఆరమ్‌ సీఈవో వెంకట్‌ బుస్సా ప్రకటించారు. ఈ –సేవ, ఈ– విద్య, ఈ– చెల్లింపులు వంటి సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement