శృంగవరపుకోట: పిడుగు పాటుకు గేదె మృతి చెందిన సంఘటన మండలంలోని సీతారాంపురంలో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం మండల వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగులు కూడా పడడంతో సీతారాంపురంలో ఆర్. శంకరరావుకు చెందిన గేదె మృతి చెందింది. సుమారు లక్షా యాభై వేల రూపాయల విలువైన గేదె చనిపోవడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు.
కొండపేటలో..
రాజాం సిటీ: మున్సిపాలిటీ పరిధి కొండంపేటలో పిడుగులు పడి పలువురి ఇళ్లల్లో గృహోపకరణాలు ధ్వంసమయ్యాయి. శనివారం సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో గ్రామానికి చెందిన అయ్యప్పస్వామి ఆలయ ధర్మకర్త ముద్దన సత్యారావు ఇంటిపై పిడుగుపడింది. దీంతో ఇంటి గోడ కూలిపోవడంతో పాటు టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్, ఫ్యాన్ పాడయ్యాయి. అలాగే అదే వీధికి చెందిన చిప్పాడ సూర్యనారాయణ, రావి రాంబాబులతో పాటు మరికొంత మందికి చెందిన సుమారు 20 వరకు సీలింగ్ ఫ్యాన్లు, 10 వరకు టీవీలు కాలిపోయాయి.