రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగులను పట్టించుకోని సర్కారు
డీఏలు, సరెండర్ లీవులపై మౌనం
ఉమ్మడి జిల్లాలో 80 వేల మంది పెన్షనర్లు, ఉద్యోగులపై ప్రభావం
ఏలూరు(మెట్రో): ఎన్నికల సమయంలో ఉద్యోగులపై వరాలు కురిపించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా కనికరం చూపడం లేదు. ఉద్యోగులకు అంత చేస్తాం, ఇంత చేస్తాం అని ప్రగల్భాలు పలికిన సర్కారు ఉద్యోగులను పట్టించుకోవడమే మానేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగుల ప్రస్తావనే రాకుండా బడ్జెట్ సమావేశాన్ని ముగించింది. ప్రతి పథకం అమలు చేయడంలో, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం. ఆ ఉద్యోగులను పట్టించుకోకపోవడంపై పెదవి విరుస్తున్నారు.
రూ.200 కోట్ల మేర బకాయిలు
ఉద్యోగులకు ఇప్పటికే వారి వేతనాలకు అనుగుణంగా 2.5 నుంచి 5.5 శాతం వరకు డీఏలు ఇవ్వాలి. ఉద్యోగులకు 2 డీఏలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ వీటిపై కూటమి సర్కారు నోరు మెదపడం లేదు. కేంద్ర ప్రభుత్వం మరో డీఏ ప్రకటిస్తే మూడు డీఏ బకాయిలు పేరుకుపోయే అవకాశం ఉంది. సరెండర్ లీవ్లు రెండు ఇవ్వాల్సి ఉండగా.. వాటి ఊసే బడ్జెట్లో ప్రస్తావించలేదు. సరెండర్ లీవ్ల నిమిత్తం రూ.180 నుంచి రూ.200 కోట్ల మేర బకాయిలు ఉద్యోగులకు చెల్లించాలి.
ప్రతీ ఉద్యోగి సరెండర్ లీవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఏపీ జీఎల్ఐ ఆధ్వర్యంలో లోన్ల ఫైనల్ క్లైమ్స్ పేరుకుపోయాయి. వీటిపై బడ్జెట్లో ప్రస్తావించలేదు. రిటైర్ అయిన ఉద్యోగులకు 300 రోజుల సంపాదిత సెలవు ప్రస్తావన రాకపోవడం శోచనీయం. గ్రాట్యుటీ విషయంలోనూ అదే నిర్లక్ష్యపు ధోరణిని కూటమి సర్కారు ప్రదర్శిస్తోంది. జిల్లా వ్యాప్తంగా గత 8 నుంచి 9 నెలల కాలంలో సుమారు 800 మంది ఉద్యోగులు రిటైర్ అయినా వీరికి గ్రాట్యుటీ, ఆర్జిత సెలవులకు సంబంధించిన వేతనం నేటికీ లభించలేదు.
మెడికల్ రీయింబర్స్మెంట్కు రూ.50 కోట్ల బకాయి
ఉద్యోగులకు వైద్య ఖర్చులు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మెడికల్ రీయింబర్స్మెంట్కు జిల్లాలో రూ.50 కోట్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ దస్త్రాలు నిలిచిపోయాయి. ఉద్యోగులకు రూ. కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించడంలో కూటమి సర్కారు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 35 వేల మంది ఉద్యోగులు, టీచర్లు విధులు నిర్వహిస్తుండగా, మరో 35 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. వివిధ స్కీంలలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మరో 15వేల మంది ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ కూటమి సర్కారు మొండి చేయి చూపింది.
సప్లిమెంటరీ బడ్జెట్ ప్రవేశపెట్టాలి
ఉద్యోగులకు మెడికల్ రీయిబర్స్మెంట్, డీఏలు చెల్లించాల్సి ఉంది. పెన్షనర్లకు గ్రాట్యుటీ, ఆర్జిత సెలవులు ఇవాల్సి ఉంది. ఇటీవల బడ్జెట్లో ఉద్యోగులకు నిధుల కేటాయింపు లేదు. ఉద్యోగులకు సప్లిమెంటరీ బడ్జెట్ను ప్రవేశపెట్టి బకాయిలు చెల్లిస్తే ఉద్యోగులు ఆనందిస్తారు.
– చోడగిరి శ్రీనివాసరావు, ఉమ్మడి జిల్లా ఎన్జీవో అధ్యక్షుడు
బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం
అధికారం చేపట్టి 9 నెలలు కావస్తున్నా ఉద్యోగులపై సర్కారు కనికరం చూపడం లేదు. పేరుకుపోయిన బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.కోట్లలో ఉన్నాయి. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలలి.
– కె.రమేష్కుమార్, చైర్మన్, ఏపీ జేఏసీ, అమరావతి

ఉద్యోగులకు మొండిచేయి

ఉద్యోగులకు మొండిచేయి

ఉద్యోగులకు మొండిచేయి
Comments
Please login to add a commentAdd a comment