
అంజనీసుతపై కౌసల్యతనయ
ఒంటిమిట్ట : ఏకశిలానగరిలో వెలసిన కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం రాత్రి 7 నుంచి 8:30 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండడగా, మంగవాయిద్యాల నడుమ ఊరేగింపు కోలాహలంగా జరిగింది. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు రామయ్య నవనీతకృష్ణాలంకారంలో దర్శనమిచ్చారు. ఉదయం 11 నుంచి 12 వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి.
నేటి అలంకారాలు: బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మోహినీ అలంకారంలో స్వామి వారు భక్తులకు అభయమిస్తారు. రాత్రి 8 నుంచి 9:30 గంటల వరకు గరుడసేవ నిర్వహిస్తారు.
శ్రీరాముడిని రోల్మాడల్గా తీసుకోవాలి
ఒంటిమిట్ట : శ్రీరాముడిని రోల్మాడల్గా తీసుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఒంటిమిట్ట రామయ్యను ఎంపీలు వేర్వేరు సమయాల్లో దర్శించుకున్నారు. వీరికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. అలయ ప్రదక్షణ గావించి, గర్భాలయంలోని మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహిచారు. ఆలయ రంగ మండపంలో వీరికి అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి, ఘనంగా సత్కరించారు. అనంతరం కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రం బాగుండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.శ్రీరాముడు రాజుగా సుభిక్ష మైన పాలన అందిచాడని చెప్పారు.
ఏర్పాట్లు పరిశీలించిన టీటీడీ అధికారులు
ఒంటిమిట్ట: శ్రీ సీతారాముల కల్యాణం ఏర్పాట్లను టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి బుధవారం పరిశీలించారు. భక్తుల రద్దీకి తగ్గట్లు జిల్లా రెవెన్యూ, పోలీసు, స్థానిక పంచాయతీ, టిటిడి అధికారులు సమిష్టిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. టీటీడీ సీఈ సత్యనారాయణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
హనుమంతవాహనంపై రామయ్య విహారం
తిలకించి..పులకించిన భక్తజనం

అంజనీసుతపై కౌసల్యతనయ