
నీలిమేఘ శ్యాముడు.. రఘుకుల సోముడు.. శ్రీరామచంద్రుడు.. కల
● కమనీయంగా సీతారాముల కల్యాణం
● వైకుంఠాన్ని తలపించిన ఏకశిలానగరి
● పోటెత్తిన భక్తజనం
● మార్మోగిన రామనామం
రాజంపేట/ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సీతారామ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. ఏకశిలానగరం రామనామంతో మార్మోగింది. దారులన్నీ భక్తులతో రద్దీగా మారిపోయాయి. జిల్లా నలు మూలల నుంచి కాకుండా పక్క జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందుగా రామాలయంలోని సీతా,రామ,లక్ష్మణ మూర్తులను ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. కోదండ రామయ్య సీతమ్మవారిని పరిణయం ఆడిన వేల శిల్పకళాశోభితమైన కల్యాణ మండపం వైకుంఠాన్ని తలపించింది.
సంప్రదాయం.. ఎదుర్కోలు ఉత్సవం
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సీతారామచంద్రులకు నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. ఉత్సవ వరులను పల్లకీపై కొలువు దీర్చారు. ప్రధాన ఆలయం నుంచి మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. వేదిక పైన రంజిత సింహాసనంపై కల్యాణమూర్తులను ఆశీనులు చేశారు. అనంతరం పూజా సామగ్రిని సంప్రోక్షణ జరిపి ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా విశ్వక్సేన పూజ నిర్వహించారు. ‘కర్మణ్యేపుణ్యాహవచనం’ అనే మంత్రంతో మండప శుద్ధి జరిపి కల్యాణ తంతుకు శ్రీకారం చుట్టారు. బంగారు ఆభరణాలను సీతమ్మకు అలంకరించి సకలోపచారాలు చేశారు. మధుపర్కపాసన అనంతరం పెరుగు, తేనె కలిపిన మిశ్రమాన్ని స్వామి వారికి నివేదించగా.. సీతమ్మ నొసటన కల్యాణ బొట్టును, బుగ్గన కాసింత దిష్టిచుక్క పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించిన ముత్యాలతలంబ్రాలు, పట్టువస్త్రాలను ధరించి పెళ్లికూతురిగా ముస్తాబైంది. ఆమెకు ఏ మాత్రం తీసిపోని విధంగా శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రమూర్తి.. అదే రీతిలో సర్వాభరణ భూషితుడై సీతమ్మ ఎదుట కూర్చున్నారు. తరువాత లోక క్షేమం కోసం మహా సంకల్పం పఠించి కన్యాదానం, గోదానం చేశారు. సీతమ్మకు రామయ్యకు చెరో 8 శ్లోకాలతో మంగళాష్టం చదివారు. హస్త నక్షత్రయుక్త శుభ లగ్నంలో 6:30 నుంచి 8:30 గంటల మధ్య సీతారాముల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం గౌరిదేవి, సరస్వతిదేవి, మహాలక్ష్మీ అమ్మవార్లను ఆహ్వానం చేసి సకల మంగళాలకు ఆలవాలమైన మంగళసూత్రానికి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వీణారాఘవాచార్యులు ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర వేదపండితులు మంగళసూత్రాన్ని భక్తులకు చూపించారు. సాక్షాత్తూ లక్ష్మీనారాయణుడైన శ్రీరామ చంద్రమూర్తి చేత, శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి సీతాదేవికి శాస్త్రోక్తంగా మంగళసూత్రధారణ నిర్వహించారు. ప్రభుత్వం తెచ్చిన ముత్యాల తలంబ్రాలు కల్యాణ ముర్తుల శిరస్సుపై వేసి కల్యాణం జరిపారు. అనంతరం నివేదన ఇచ్చి బ్రహ్మముడి వేశాక మహాదాశీర్వచనం నిర్వహించి హారతి ఇవ్వడంతో కల్యాణ క్రతువు ముగిసింది.
● వేదిక.. సుందర దీపిక
కల్యాణ వేదికను టీటీడీ ఉద్యానవ విభాగం ఆధ్వ ర్యంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా త్రేతా యుగం నాటి జనకపురిని గుర్తుకు తెచ్చేలా సుందరంగా ముస్తాబు చేశారు. వేదికపై ప్రాచీన ఆలయాలలోని కళాకృతులు, దశావతరాల సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరిగింజలతో మండపం ఏర్పాటు చేశారు. రంగురంగుల పుష్పాలతో అందంగా తీర్చిదిద్దారు. చెరుకులు, టెంకాయ గెలలు, టెంకాయ పూత, అరటి ఆకులు, మామిడాకులు, హెలికానియమ్స్, టార్చ్ జింజర్, నీలం, ఆర్కిడ్, రెడ్ ఆంధూరియం తదితర విదేశీ జాతుల పుష్పాలతో అలంకరించారు. ఇందుకోసం 4 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 60 వేల కట్ ఫ్లవర్స్ వినియోగించారు. టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసులు పర్యవేక్షణలో రెండు రోజుల పాటు 120 మంది అలంకరణ నిపుణులు, 120 మంది టీటీడీ సిబ్బంది ఇందుకోసం పని చేశారు.

నీలిమేఘ శ్యాముడు.. రఘుకుల సోముడు.. శ్రీరామచంద్రుడు.. కల