
దుర్గగుడి ఈవో పద్మ(పాత చిత్రం)
విజయవాడ : కనక దుర్గమ్మకు రూ. లక్ష లేదా ఆపైన విరాళమిచ్చిన వారికి ఇకపై సంవత్సరానికి రెండుసార్లు అమ్మవారి దర్శనం కల్పిస్తామని, అలాగే వారికి ప్రత్యేక కార్డులు అందజేస్తామని దుర్గగుడి ఈవో పద్మ తెలిపారు. బుధవారం దుర్గగుడి పాలకమండలి సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత దుర్గ గుడి ఈఓ పద్మ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న రూ. 300 టికెట్ ధరను రూ.250 చేసే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలియజేశారు. ఫిబ్రవరి 24 నుండి 26 వరకు ప్రత్యేక పూజలు నిర్వహించి, 26 నుంచి భక్తులకు శివాలయ దర్శనం అనుమతిస్తామని వెల్లడించారు.
రానున్న ఎండాకాలంలో భక్తులు ఎండ వేడిమిని తట్టుకునేందుకు షెల్టర్లు ఏర్పాటు చేసేందుకు దాతల సహకారం కోరతామని చెప్పారు. అమ్మవారి దర్శనానికి రాజ గోపురం మీదుగా క్యూలైన్లు వెళ్లే ఏర్పాటును పరిశీలిస్తున్నామని, చీరల పేరు చెప్పి ముక్కలుగా అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరతామని వెల్లడించారు. కొండ మీద పార్కింగ్ సమస్య పై అధ్యయనం చేస్తున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment