
సాక్షి, కడప (వైఎస్సార్ జిల్లా) : ఫాతిమా కళాశాలలో కోవిద్ 19 వైద్యశాలను ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 200 మందిని పరీక్షించగా, ఒక్కరోజే 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, మరో 25 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉందని తెలిపారు. ఆసుపత్రిలో అన్ని వసతులు కల్పించి సిబ్బంది కొరత లేకుండా చూశామన్నారు. అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రులను కూడా వినియోగిస్తామన్నారు.
పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించి వారందరికీ నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని ఇస్తిమాకు వెళ్లిన వారందరిని గుర్తించి క్వారంటైన్లో ఉంచామని, అజ్ఞాతంలో ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగా సమాచారం అందించి అధికారులకు సహకరించాలని విఙ్ఞప్తి చేశారు. ఒక్కరోజే 15 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారని, ఇప్పటికే సరిహద్దు ప్రాంతాలను మూసివేసినట్లు తెలిపారు. ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment