
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా ఓట్ల తొలగింపు, డేటా చౌర్యంపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ప్రత్యేక బృందాన్ని పంపినట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా చెప్పారు. ఆదివారం ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా మీడియా ప్రశ్నించగా అరోరా పైవిధంగా బదులిచ్చారు. ‘‘రాష్ట్రాల నుంచి ఇలాంటి కొన్ని ఫిర్యాదులందాయి. ప్రతి కేసు విచారణకు ప్రత్యేక బృందాలను పంపాం. ఏపీ, తెలంగాణ నుంచి రెండు రకాల ఫిర్యాదులందాయి.
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడి నుంచి ఒకటి, ఇతర పార్టీల నుంచి ఫిర్యాదులందాయి. వీటిపై దర్యాప్తు జరిపి, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించాం. ఒకటి, రెండు చోట్ల రాష్ట్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ఎన్నికల నిర్వహణలో నిపుణులైనవారిని పంపి నివేదిక ఇవ్వాలని ఆదేశించాం’’ అని సునీల్ అరోరా తెలిపారు.