పింఛన్ ఠంఛన్‌గా అందేనా? | Distribution pensions policy change | Sakshi
Sakshi News home page

పింఛన్ ఠంఛన్‌గా అందేనా?

Published Wed, Dec 31 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

పింఛన్ ఠంఛన్‌గా అందేనా?

గజపతినగరం: పాత సీసాలో కొత్త సారాలా ఉంది పింఛన్ల పంపిణీ విధానం మార్పు పరిస్థితి! పోస్టాఫీసుల ద్వారా సామాజిక పింఛన్లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న జిల్లా యంత్రాంగం దీనికి తగిన ఏర్పాట్లు, సౌకర్యాలు లేకుండా పోస్టాఫీసులకు బదలాయిస్తోంది. జిల్లాలో ఎంతో మంది సిబ్బంది, అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు, డేటా ఎంట్రీ సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ పింఛన్ల పంపిణీలో నిత్యం సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కనీస సౌకర్యాలు కానీ, వసతులు, సిబ్బంది కానీ లేని పోస్టాఫీసులకు ఈ భారీ కార్యక్రమాన్ని అప్పగించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.41లక్షల పింఛన్ల పంపిణీని   ఇక నుంచి పోస్టల్ శాఖ చేస్తుందని సెర్ఫ్ కార్యదర్శి హెచ్ అరుణ్‌కుమార్, జిల్లా మంత్రి కిమిడి మృణాళినితో పాటు కలెక్టర్ కూడా ప్రకటించి సిబ్బందికి అప్పగించేశారు.  జిల్లాలో 921 పంచాయతీలుండగా వీటి పరిధిలో కేవలం 600 పోస్టల్ కార్యాలయాలున్నాయి. ఇందులో సబ్ పోస్టు కార్యాలయాలతో పాటు బ్రాంచి కార్యాలయాలు, హెడ్‌పోస్టాఫీసులున్నాయి. అయితే జిల్లాలో బ్రాంచి పోస్టాఫీసులే ఎక్కువ. వాటిలో సిబ్బంది చాలా తక్కువ ఉంటారు.
 
 అలాగే ఇరుకైన అద్దెగదుల్లో ఈ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర పరికరాలు చాలా తక్కువ! ఇటువంటి కార్యాలయాల్లో పింఛన్ల పంపిణీ ఎలా చేస్తారని పలువురు  ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సిబ్బందికి పింఛన్ల పంపిణీపై కనీసం  అవగాహన లేదు. ఎంతో అనుభవం ఉన్న జిల్లా యంత్రాంగం పింఛన్ల పంపిణీకి తలమునకలై నానా అగచాట్లూ పడిన సందర్భాలున్నాయి.ప్రస్తుతం 19 మండలాల్లో పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు పంపిణీ అవుతున్నప్పటికీ ఎక్కువగా పోస్టాఫీసులు లేని చోట్ల సీఎస్‌పీల ద్వారా పంపిణీ చేసేవారు. జిల్లావ్యాప్తంగా ఉన్న దాదాపు 400 మంది సీఎస్‌పీలను ఇటీవలే తొలగించిన యంత్రాంగం వారికి వేతనాలు కూడా ఇవ్వలేదు. అలాగే ఇంకా బయోమెట్రిక్ ప్రింట్లు పింఛనర్ల నుంచి ఇప్పటికీ తీసుకోవట్లేదు. దీంతో బయోమెట్రిక్ ద్వారా పంపిణీ ఎలా సాధ్యమన్న విషయం అధికారులకే తెలియాలి.
 
 ఇందుకోసం జిల్లాలో జనవరిలో మాన్యువల్‌గా కొన్నిచోట్ల పింఛన్లు పంపిణీ చేసి వచ్చే ఫిబ్రవరి నుంచి అన్ని పింఛన్లనూ బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయంలో సడలింపు ఇచ్చారు. దేశంలోనే అత్యంత పెద్ద నెట్‌వర్క్  కలిగిన భారత తపాలాశాఖ తమ కార్యాలయాలకు మౌలిక సదుపాయాల కల్పనలో  మాత్రం బాగా వెనక బడింది. ఇటీవల ఉపాధి కూలీల వేతనాల చెల్లింపు తప్ప పెద్దగా పనుల్లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు వెనుకాడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న పోస్టాఫీసులను బ్రాంచ్ పోస్టాఫీసులుగా మార్చారు. ఇవి సబ్ పోస్టాఫీస్ కంట్రోల్‌లో ఉంటాయి. బ్రాంచ్ పోస్టాఫీస్ పని3గంటలు మాత్రమే.అయితే ఇప్పు డు పింఛన్ల పేమెంట్ బయోమెట్రిక్ పద్ధతిలో జరుపుతారు. పీఓటీడీ(పాయింట్ ఆఫ్ ట్రాంజాక్షన్ డివైస్) మిషన్‌లద్వారా పింఛనుదారుల వేలిముద్రలను తీసుకుని పేమెంట్ చేయాలి.
 
 ఈ విధంగా ఆయితే 3గంటల సమయంలో ఎంత మందికి పింఛన్ల పంపిణీ జరుగుతుందనేది ప్రశ్న.  దీనికి తోడు గ్రామా ల్లో విపరీతంగా కరెంట్ కోతలు ఉన్నాయి. మిషన్‌లు చార్జింగ్‌లేకపోతే అవి మొరాయిం చే పరిస్థితి ఉంది. ఇక సబ్ పోస్టాఫీసుల్లో సాధారణ లావాదేవీలతో పాటు ఈపిం ఛన్ల పంపిణీ చేయాలంటే కష్టసాధ్యమే. చాలా గ్రామాల్లో సిగ్నల్స్ సరిగ్గా ఉండ వు. దీని కోసం సిగ్నల్ ఉన్న  చోటుకు పీఓటీడీని తీసుకువెళ్లాలి. అక్కడికే వృద్ధు లు, వికలాంగులు రావాల్సి ఉంటుంది. వీటిని అధిగమించి తపాలాశాఖ విజయవంతంగా ఈ పింఛన్లను సక్రమంగా  పంపిణీ చేస్తుందో లేక పిం ఛనుదారులను ఇబ్బందులకు గురిచేస్తుందో మరికొద్ది రోజుల్లో స్పష్టం కానుంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement