
సీమాంధ్రుల ప్రజల ప్రయోజనాలకు ఏం చేస్తారో చెప్పాలి: చంద్రబాబు
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై నిరసనగా సీమాంధ్రలో ఉద్యమాలు, నిరసనలు, ధర్మాలతో అట్టుడుకిపోతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించడంతో సీమాంధ్ర ఒక్కసారిగా భగ్గుమంది. సీమాంధ్ర సెగ కేంద్రాన్ని తాకింది. సీమాంధ్ర ఉద్యమం రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. సమైక్యాంధ్రులు రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇంతవరకూ నోరు మెదపకుండా మౌనంగా ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 10రోజుల తరువాత మౌనం వీడారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకు కేంద్రం ఏం చేస్తుందో చెప్పాలంటూ ఆయన శుక్రవారం ప్రధాని మన్మోహన్కు లేఖ రాశారు. రాష్ట్ర విభజన అంశం కాంగ్రెస్ అంతర్గత అంశంగా మారిందని తెలిపారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రంలో అశాంతి నెలకొందని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.