
నెలాఖరకు రాజధానిపై నివేదిక:శివరామకృష్ణన్ కమిటీ
ఒంగోలు: రాజధాని ఎంపికపై తుది నివేదికను ఈ నెలాఖరకు కేంద్రానికి అందజేస్తామని శివరామకృష్ణన్ కమిటీ తెలిపింది. రాజధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్ అధ్యక్షతన కేంద్రం ఒక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ ఈ రోజు ఒంగోలు జిల్లాలో పర్యటిస్తోంది. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో కమిటీ సభ్యులు ఉదయం ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పౌర సమాజ వేదిక నేతలు, ప్రజలతో సమావేశమైంది. వారి అభిప్రాయాలను సేకరించింది.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాజధాని కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి డిమాండ్లు వచ్చినట్లు తెలిపారు. అయితే ఏపిలో ఏ ప్రాంతానికి రాజధానికి కావలసిన అర్హతలు లేవని చెప్పారు. తక్కువ ధరకే భూములు సేకరిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. రాజధాని ఎంపికలో కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలదే తుది నిర్ణయం అని తెలిపారు.
ఇదిలా ఉండగా, కొత్తపట్నం మండలంలోని భూములను కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా రాజధానికి జిల్లాలోని దొనకొండ ప్రాంతం అనువైనదని వైఎస్ఆర్ సిపి ఎంపి వైవి సుబ్బారెడ్డి ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.