
సంక్షేమ ప్రదాత !
- నేడు వైఎస్సార్ 65వ జయంతి
- జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషిచేసినదివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి
- నేడు జిల్లా వ్యాప్తంగా సేవాకార్యక్రమాలకు వైఎస్సార్సీపీ పిలుపు
ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి లోనైన నీటిపారుదల రంగానికి ఊతమిచ్చారు.. వ్యవసాయరంగానికి ప్రాణం పోశారు. పట్టణాభివృద్ధిపై సమగ్ర ప్రణాళిక.. పల్లెల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి.. ఇళ్లు, తాగునీరు.. సమస్య ఏదైనా శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా పాలన సాగించారు వైఎస్ రాజశేఖరరెడ్డి. ముఖ్యమంత్రిగా వైఎస్.. ఐదేళ్ల పాలనను.. ఆ పాలనలో తమకు అందిన అభివృద్ధి ఫలాల జ్ఞాపకాలను జిల్లా వాసులు నేటికీ నెమరు వేసుకుంటూనే ఉన్నారు. జిల్లా అభివృద్ధిపై చెరగని ముద్ర వేసిన వైఎస్ఆర్65వ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి.
సాక్షి, చిత్తూరు: వ్యవసాయం తప్ప మరే ఆధారమూ లేని జిల్లా చిత్తూరు. తాగునీటి సమస్యతో కొన్నేళ్లుగా ఈ జిల్లా అల్లాడిపోతోంది. వ్యవసాయానికి ప్రాణాధారమైన సాగునీటి రంగాన్ని గత పాలకులంతా నిర్లక్ష్యం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వైఎస్.రాజశేఖరరెడ్డి చిత్తూరు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపారు. 2004 వరకూ నిర్లక్ష్యానికి లోనైన గాలేరు-నగరి, హంద్రీ-నీవా సుజల స్రవంతి పనులను శరవేగంగా ముందుకు కదలించారు. నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. కాలువల తవ్వకం కూడా పూర్తయింది. వైఎస్ మరణంతో రెండు ప్రాజెక్టుల పురోగతికి బ్రేక్ పడింది.
పారిశ్రామికరంగాన్ని అభివృద్ధి చేయూలనే తలంపుతో మన్నవరంలో కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమ బెల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయించారు. రాజస్థాన్, తమిళనాడు, రాష్ట్రాల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టు మన రాష్ర్టంలో ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇది పూర్తయితే 6 వేల మందికి ఉపాధి లభిస్తుంది.
ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనులకు భూ సేకరణ చేయించారు.
తూర్పు మండలాల్లోని మెట్ట ప్రాంత రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా స్వర్ణముఖి-సోమశిల కాలువ పనులకు శ్రీకారం చుట్టారు.
చిత్తూరు, వైఎస్సార్, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల రైతాంగం కోసం తిరుపతిలో 14 కోట్ల రూపాయలతో వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంటును ఏర్పాటు చేశారు. దీంతో పండ్లను శుద్ధి చేసి విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనువుగా ఉంటుంది.
తిరుపతి, చిత్తూరు మున్సిపాలిటీలకు కార్పొరేషన్ హోదా కల్పించారు. తిరుపతిని జవహరల్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్(జేఎన్ఎన్ యూఆర్ఎం) జాబితాలో చేర్చారు. దీని ద్వారా తిరుపతి అభివృద్ధికి 2.223 కోట్ల రూపాయలు వ్యయం చేసేందుకు అవకాశం ఏర్పడింది. తిరుపతి నగరంలో 20వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతిచ్చారు. మొదటి విడత గృహాలు పూర్తి చేసి పేదలకు అందజేశారు.
తిరుపతిలో వెటర్నరీ యూనివర్సిటీ స్థాపించారు.
వేదవిద్యలో మరింత పురోగతి సాధించేందుకు వీలుగా టీటీడీ ఆధ్వర్యంలో వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.
మదనపల్లె పట్టణానికి శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించేందుకు 43 కోట్ల రూపాయలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.
తిరుపతి స్విమ్స్లో అత్యాధునిక ఆంకాలజీ యూనిట్ ప్రారంభించారు.
రాయలసీమలోనే తొలిసారిగా అధునాతన కలెక్టరేట్తో పాటు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా కొత్త కలెక్టరేట్ నిర్మించారు.
వాల్మీకిపురం వద్ద సుమారు 7 కోట్ల రూపాయలతో బోగంపల్లి రిజర్వాయర్, కలిచెర్ల వద్ద ఆకుమానుగుంట రిజర్వాయర్ నిర్మించారు. ఆయన మరణంతో ఎడమకాలువ పనులు నిలిచిపోయాయి.
తంబళ్లపల్లె వద్ద చిన్నే ప్రాజెక్టును సుమారు 3 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేయించారు.