
కూలి పనులకు వెళ్తున్న చిన్నారితో ముచ్చటిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి
సాక్షి, గోపాలపురం : బడికి వెళ్లాల్సిన వయసులో తల్లితో కూలి పనులకు వెళ్తున్న పాపను చూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చలించిపోయారు. పాపను పాఠశాలలో చేర్పించాలని ఆ తల్లికి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని మారంపల్లిలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తల్లితోపాటు పొలం పనులకు వెళ్తున్న ఓ చిన్నారిని చూసి ఆమెతో మాట్లాడారు. చదువుకోవాలని ఉందా అంటూ ఆ పాపతో ముచ్చటించారు. ఆ తర్వాత పాప తల్లితో మాట్లాడుతూ.. చిన్నారి ఉన్నత చదువులు చదివి పైకి రావాలంటే పొలం పనులకు కాకుండా బడికి పంపాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పిల్లల చదువు భారం కాకుండా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి చేపట్టనున్న కార్యక్రమాలను వైఎస్ జగన్ అక్కడి వారికి వివరించారు.