
ప్రతీకాత్మతకచిత్రం
యూపీలో కలకలం రేపిన హత్యాచార ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశారు.
లక్నో : యూపీలోని ఫతేపూర్లో దిశ హత్యాచార ఘటనను మరిపించే ఉదంతం వెలుగుచూసింది. 18 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడి ఆమెను సజీవ దహనం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 90 శాతం కాలిన గాయాలతో కాన్పూర్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న బాధితురాలిని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు పరామర్శించారు. బాధితురాలిని కలిసిన అనంతరం ఆమె కుటుంబ సభ్యులను కమిషన్ సభ్యురాలు కమలేష్ గౌతమ్ పరామర్శించారు. ఫతేపూర్ ఘటన దురదృష్టకరమని, అత్యంత హేయమని అన్నారు. నిందితుడు గోడ దూకి యువతి ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పారు. నిందితుడి మెవాలాల్ని శనివారం సాయంత్రం ఘటన జరిగిన వెనువెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడిని అరెస్ట్ చేశామని, ఆధారాలు లభ్యమైన వెంటనే అతడిపై తదుపరి చర్యలు చేపడతామని ఫతేపూర్ ఎస్పీ ప్రశాంత్ వర్మ వెల్లడించారు. ఉబిపూర్ గ్రామంలో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పొరుగునే ఉండే మెవాలాల్ బలవంతంగా ఇంట్లోకి చొరబడి లైంగిక దాడికి పాల్పడి కిరోసిన్ పోసి నిప్పంటించాడని బాధితురాలు వెల్లడించారు. కాగా నిందితుడు, బాధితురాలు వివాహం చేసుకోవాలని భావించగా యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారని, శనివారం ఉదయం దీనిపై పంచాయితీ జరుగుతుండగానే యువతి ఇంటికి వెళ్లిన నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించడం గమనార్హం.