
యువతిని వేధిస్తున్న దృశ్యం
సాక్షి, ముంబై : మహిళలు అప్రమత్తంగా ఉంటున్నా మృగాలు రెచ్చిపోతున్నాయి. ముంబై పోలీసులు గస్తీ కాస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. తాజాగా మరో యువతి వేధింపులకు గురైంది.
నవీ ముంబైలోని టర్బే రైల్వే స్టేషన్ లో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్న ఓ యువతి వెనకాలే వెళ్లిన ఓ వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బలవంతంగా ముద్దు పెట్టేశాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో నమోదు అయ్యింది. ఆ వ్యక్తి తనను స్టేషన్ బయటి నుంచే వెంబడించాడని యువతి చెబుతోంది.
యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు కాసేపటికే సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని పేరు నరేష్ కే జోషి(43)గా తేలింది. కాగా, ఘటన జరిగిన సమయంలో అక్కడే కొందరు ఉన్నప్పటికీ తమకేం పట్టనట్లు ఉండటం గమనార్హం.