
మహిళను అభయక్షేత్రం నిర్వాహకురాలికి అప్పగిస్తున్న మహిళా రక్షక్ పోలీసులు
రేణిగుంట: మతిస్థిమితం లేని ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించగా ఆటోడ్రైవర్లు గుర్తించి ఆమెను కాపాడిన ఘటన మంగళవారం తిరుపతి సమీపంలోని ఆటోనగర్ వద్ద చోటుచేసుకుంది. మహిళా రక్షక్ పోలీసుల కథనం మేరకు.. మతిస్థిమితం లేని 45 ఏళ్ల మహిళ ఆటోనగర్ వద్ద రైలుపట్టాలపై అడ్డంగా పడుకుని ఉండడాన్ని కొందరు ఆటోడ్రైవర్లు గుర్తించారు. ఆమెను రక్షించి, రక్షక్ పోలీసులకు సమాచారం అందజేశారు. వారు అక్కడికి చేరుకుని ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె మానసిక స్థితిగా బాగోలేకపోవడంతో రేణిగుంటలోని అభయ క్షేత్రానికి తరలించారు. నిర్వాహకురాలు తస్లీమ్కు ఆమెను అప్పగించి, వివరాలను ఆరా తీశారు. తన పేరు ప్యారీబేగం అని, భర్తపేరు చాను నజీర్, తమది వెంకటగిరి అని చెప్పినట్లు పోలీసులు చెప్పారు. బాధిత మహిళను కుటుంబ సభ్యులు గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని తస్లీమ్ (9291225514) కోరారు.