
హత్యకు గురైన తొమ్మిదేళ్ల బాలిక శ్రావణి(పాత చిత్రం)
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్లో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రావణి(14) అనే బాలికను దారుణంగా హత్య చేసి స్కూలు సమీపంలో ఉన్న ఓ బావిలో పడేశారు. వివరాలు.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి చదువుతున్న శ్రావణి నిన్న స్కూల్లో స్పెషల్ క్లాస్ ఉందంటూ బయటకు వెళ్లింది. ఇంటి నుంచి వెళ్లిన శ్రావణి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువుల ఇళ్లల్లో వెతికినా లాభం లేకపోయింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేపట్టారు.
బావి దగ్గర లభించిన శ్రావణి బ్యాగు ఆధారంగా బావిలో శ్రావణి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సకాలంలో బాలిక మృతదేహాన్ని గుర్తించడంలో పోలీసులు విఫలం అయ్యారని గ్రామస్తులు నిలదీశారు. ఎవరు హత్య చేసి ఉంటారనే దానిపై విచారణ కొనసాగిస్తున్నారు. కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.