Yadadri Bhuvanagiri District
-
క్షణికావేశం.. జీవితం కన్నీటిమయం (ఫొటోలు)
-
చారిత్రక దారి.. 300 ఏళ్ల మెట్లబావి
నాటి చారిత్రక కట్టడాలు నేటి తరానికి గొప్ప సంపద. గతాన్ని చూడని ఇప్పటి జనానికి అలనాటి నిర్మాణాలే సజీవ సాక్ష్యాలు. దశాబ్దాల కాలం నాటి నిర్మాణాలు చెక్కుచెదరకుండా ఇప్పటికీ పటిష్టంగానే ఉండటం అప్పటి సాంకేతికతకు నిదర్శనం. యంత్రాలు, ఇతర నిర్మాణ పనిముట్ల గురించి తెలియని సమయంలో కేవలం మానవుల తెలివితో చేపట్టిన నిర్మాణాలు నేటి సాంకేతికత కంటే చాలా పటిష్టంగా ఉన్నా యి. అలాంటి వారసత్వ సంపద ఎక్కడ ఉన్నా గుర్తించి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.రాజధానికి 52 కి.మీ. దూరంలో..హైదరాబాద్కు (Hyderabad) సరిగ్గా 52 కి.మీ. దూరంలో 65వ నెంబరు జాతీయ రహదారిపై విజయవాడ (Vijayawda) మార్గంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం (Lingojigudem) గ్రామం ఉంది. ఈ గ్రామంలో జాతీయ రహదారి వెంట ప్రస్తుతం ఉన్న సాయిబాబా దేవాలయాన్ని గతంలో గోసాయిమఠంగా పిలిచేవారు. దశాబ్దాల కిందట ఈ మఠాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. దేవాలయం వెనుక భాగాన దిగుడుబావి (మెట్లబావి) ఉంది. ఆ దిగుడు బావిని 300 ఏళ్ల కిందట అప్పటి రాజులు నిర్మించారు. ఎంతో గొప్ప సాంకేతికతతో నిర్మించిన ఈ బావి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉండటంతో కొంత మేరకు నిర్మాణాలు దెబ్బతిన్నాయే తప్పిస్తే మిగతా కట్టడాలన్నీ యథావిధిగా ఉన్నాయి. రాజుల కాలంలో దిగుడుబావి నిర్మాణందిగుడుబావి (మెట్లబావి) గొప్ప చరిత్ర కలిగి ఉంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు ఇక్కడ విశ్రాంత మందిరాన్ని నిర్మించుకున్నారని, ఆ విశ్రాంత మందిరానికి అనుసంధానంగా అన్ని రకాల సౌకర్యాలతో ఈ దిగుడుబావిని నిర్మించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. దిగుడుబావి పరిసరాల్లోని రాజు భూములు కాలక్రమేణా స్థానికులకు వచ్చాయి. పూర్తిగా రాళ్లతోనే..ఈ దిగుడుబావిని పూర్తిగా రాళ్లతోనే నిర్మించారు. తూర్పున 6 అడుగుల వెడల్పు, దిగువకు 20 అడుగులు, ఉత్తరంలో 10 అడుగుల వెడల్పు ప్రకారం మొత్తంగా దిగువకు 60 అడుగుల మేర మెట్లు ఏర్పాటు చేశారు. మెట్ల మార్గాన్ని గ్రానైట్ రాళ్లతో అందంగా తీర్చిదిద్దారు. 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 80 అడుగుల లోతుతో ఈ బావిని నిర్మించారు. భూమి నుంచి 25 అడుగుల దిగువన బావిలో ప్రత్యేకంగా ఆర్చీలతో మూడు గదులు ఏర్పాటు చేశారు. బావిలో స్నానాలు చేశాక దుస్తులు మార్చుకునేందుకు ఈ గదులను నిర్మించారు. ఆ గదులు ప్రత్యేకంగా మహిళలు (నాటి రాణులు) వినియోగించేవిగా తెలుస్తోంది. పొలాలకు సాగునీరు, స్థానిక ప్రజానీకానికి తాగు నీరు అందించడంతో పాటు ప్రజలు స్నానాలు చేసేందుకు అనువుగా బావిని నిర్మించారు. గోసాయి మఠంగా ప్రత్యేక గుర్తింపుచౌటుప్పల్ పట్టణ కేంద్రానికి తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగోజిగూడెం గ్రామం ఒకప్పుడు గోసాయిమఠంగానే గుర్తింపు పొందింది. కొన్నేళ్ల కిందట గోసాయిదొర అనే వ్యక్తి హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారికి ఆనుకొని ప్రస్తుతం సాయిబాబా దేవాలయం ప్రాంతంలో మఠాన్ని ఏర్పాటు చేశాడు. పలు ప్రాంతాలకు ప్రయాణాలు చేసే బాటసారులు అలసిపోయిన సందర్భాల్లో విశ్రాంతి తీసుకోవడంతోపాటు అక్కడే విడిది చేసేందుకు అనువుగా అందులో వసతులు ఉండేవని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో ఆర్టీసీ బస్సులు కూడా గోసాయిమఠం స్టేజీ అంటేనే ఆగేవంటే ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆలయానికి ప్రస్తుతం రెండు ఎకరాలకుపైగా స్థలం అందుబాటులో ఉంది.మెట్లబావి పరిరక్షణకు ముందుకొచ్చిన హెచ్ఎండీఏశతాబ్దాల కాలంనాటి మెట్లబావి గురించి సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. అందుకు సంబంధించి 2022, ఫిబ్రవరి 14న ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనానికి అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్ స్పందించారు. వెంటనే మెట్లబావి విషయాన్ని తెలుసుకుని మరమ్మతులు చేయాలని హెచ్ఎండీఏ (HMDA) అధికారులను ఆదేశించారు. అందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. అలా ఈ మెట్లబావిని సుందరీకరించారు. అనంతరం ఏప్రిల్ 14న దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఆ మెట్లబావి బాధ్యతలు హెచ్ఎండీఏ చూసుకుంటోంది. అయితే ఆ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.ఇదీ చదవండి: రాజాబావి.. రాజసం ఏదీ?కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్తాం పురాతన మెట్లబావి అభివృద్ధి అంశాన్ని కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్కుమార్ దృష్టికి తీసుకెళ్తాం. పర్యాటక ప్రాంతంగా మారితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పురాతన కట్టడాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మూడొందల ఏళ్ల కిందట నిర్మించిన మెట్లబావి మా గ్రామంలో ఉండటం మాకెంతో గర్వకారణం. ప్రభుత్వం, మున్సిపల్ శాఖ నిరంతరం పర్యవేక్షించాలి. – రమనగోని శంకర్, మాజీ సర్పంచ్, లింగోజిగూడెం -
ఒక్క రోజే 800 కోళ్లు మృతి
చౌటుప్పల్ రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని కోళ్ల ఫారంలో శనివారం తెల్లవారుజామున 800 కోళ్లు మృతి చెందాయి. నేలపట్లకు చెందిన పబ్బు మల్లేశ్ ఫారంను లక్కారం గ్రామానికి చెందిన శివ కొంతకాలంగా లీజుకు తీసుకుని నడుపుతున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. సమాచారం అందుకున్న మండల పశువైద్యాధికారి పృథ్వీరాజ్ ఫారం వద్దకు చేరుకుని మరణించిన కోళ్లను పరీక్షించారు. బర్డ్ఫ్లూ లక్షణాలు లేవని, వైరస్ కారణంగా చనిపోయి ఉంటాయని తెలిపారు. పౌల్ట్రీ రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మృతి చెందిన కోళ్లను భూమిలో పాతిపెట్టారు. కోళ్లు మృత్యువాత పడటంతో తీవ్రంగా నష్టపోయానని నిర్వాహకుడు శివ వాపోయాడు. -
పేదింటికి కలెక్టరచ్చిండు... పిల్లగాన్ని చదుకోనికి నిద్ర లేపిండు
తెల్లారింది లేవండోయ్ కొక్కురోకో !!పదోక్లాస్ పిల్లలను నిద్ర లేపుతున్న యాదాద్రి కలెక్టర్ హనుమంత రావుఅప్పుడే తెల్లారుతోంది...కోళ్లు కూస్తున్నాయి... సూరీడు రాలేదు.. ఇంకా మంచు తెరలు తొలగనే లేదు. ఆ చిన్న ఊళ్ళోకి పెద్ద కారొచ్చింది. ఇంత చిన్న పల్లెలోకి ఇంత పొద్దుగాల ఎవరచ్చిర్రా అని తెల్లారి పొలం పనులకు వెళ్ళే రైతులు..నీళ్ళకోసం బావులవద్దకు వెళ్ళే మహిళలు విస్తుపోయి చూస్తున్నారు. కార్లోంచి టిప్ టాప్ గా దిగిన ఒక ఆఫీసర్ ఆ ఊళ్ల పదోక్లాస్ చదూతున్న పిల్లవాడు ఇంటికి వెళ్ళి.. టక్.. టక్ అని డోర్ కొట్టారు.. ఏందబ్బా ఇంత మబ్బులల్ల ఇంటికి ఎవరొచ్చిర్రు.. చుట్టాలు ఇంత వేకువనే వస్తారా... అంటూ పిల్లగాని తల్లి విజయలక్ష్మి తలుపు తీసింది.. ఎదురుగా ఎవరో ఆఫీసర్...అమ్మో ఎవరాయన ఇంత ఉదయం ఎందుకు వచ్చాడు అనుకుంటూ విస్తుపోయి చూస్తుండగా ఆయనే ముందుగా మాట్లాడారు...అమ్మా నేను మీ జిల్లా కలెక్టర్ను.. మీ అబ్బాయి భరత్ చంద్ర పదోక్లాస్ చదువుతున్నాడు కదా..ఎలా ఉన్నాడు.. బాగా చదువుతున్నాడా..బాధ్యతగా ఉంటున్నాడా.. పొద్దున్నే మబ్బులల్ల నిద్ర లేపండి..ఉదయాన్నే చదివించండి...పొద్దీకి టీవీలు. ఫోన్లు చూడనివ్వకండి.. పదో క్లాస్ చాలా ముఖ్యం కదమ్మా.. బాగా చదివించండి.. అంటూ ఒక చైర్..ఎగ్జామ్ ప్యాడ్..పెన్నులు వంటివి అందజేశారు..అసలు కలెక్టర్ ఏందీ..తమ ఇంటికి రావడం ఏందీ అని ఆ తల్లి విజయలక్ష్మి నోట మాట రాలేదు..అసలిదంతా ఏమిటి అని ఆమె షాక్ లో ఉండిపోయింది.. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు పదోక్లాస్ అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు.ఈ నేపథ్యంలో టెన్త్ క్లాస్ పిల్లలను ప్రోత్సహించేందుకు.. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివేందుకు పదో క్లాస్ అనేది తొలిమేట్టు అనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియచెప్పేందుకు తానే నడుంబిగాంచారు. అందులో భాగంగా ఆయన సంస్థాన్ నారాయణపురం మండలంలోని కంకణాలు గూడెం గ్రామానికి వెళ్లి తెల్లవారి ఐదు గంటలకే విద్యార్థులు నిద్రలేపే వేకప్ కాల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ గ్రామంలో పదో క్లాస్ చదువుతున్న పిల్లలు పిల్లలకు వెళ్లి వారు చదువుతున్న తీరు గురించి తల్లిదండ్రులతో ఒక చేసి పిల్లల పట్ల మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. అంతేకాకుండా భరత్ చంద్ర అనే విద్యార్థి ఇంటికి వెళ్లి ఆయన పదవ క్లాస్ పరీక్షలు పూర్తయ్యే వరకు నెలకు రూ.5000 రూపాయలు ఖర్చుల నిమిత్తం తాను చెల్లిస్తానని చెబుతూ.. వెనువెంటనే రూ. 5000 అందజేశారు. అంతేకాకుండా భరత్ ఉన్నత చదువులకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని.. ఆయన జీవితం స్థిరపడేంతవరకు తాను తోడుగా ఉంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. తెల్లవారేసరికి గ్రామంలో కలెక్టర్ పర్యటన ఓ విద్యార్థి ఇంట్లో ఆయన కూర్చుని తల్లిదండ్రులతో మాట్లాడడం క్షణాల్లో ఊరంతా పాకేసింది. మన ఊరు అబ్బాయి భరత్ ఇంటికి కలెక్టర్ సాబ్ వచ్చాడంట.. చదువుకోడానికి డబ్బులు ఇచ్చారట.. పెన్నులు కుర్చీ ప్యాడ్ వంటివి ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఆయన ఎంత చదివితే అంత చదివిస్తానని కూడా మాటిచ్చాడంట.. నిజంగా ఇంతలా ప్రోత్సహించే అధికారులు ఉంటే పిల్లలు ఎందుకు చదువుకోరు అంటూ గ్రామస్తులు అబ్బాయి తో పాటు కలెక్టర్ను సైతం అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంత రావు మాట్లాడుతూ విద్యార్థి దశలో పిల్లలు బాధ్యతగా ఉండాలని.. వృధా కాకుండా తెల్లవారు జామునే లేచి చదువుకోవాలని.. అలాంటప్పుడే ఉన్నత స్థానాలకు చేరుతారని ఉద్బోధించారు.. చదువుకునే పిల్లలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చి ముందుకు కదలారు... ఆయన వెళుతున్న వైపే చూస్తూ భరత్... ఆయన తల్లి విజయలక్ష్మి.. చూస్తూ నిలబడిపోయారు. సిమ్మాదిరప్పన్న -
దెయ్యం పట్టింది.. వదిలిస్తా..
యాదాద్రి భువనగిరి జిల్లా: అనారోగ్యా నికి గురైన చిన్నారికి.. దెయ్యం పట్టింది.. వదిలిస్తా.. అంటూ ఒక భూతవైద్యు డు చేసిన పూజలతో.. ఆమె అపస్మారక స్థితికి వెళ్లింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మటంలంక గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలివి. గ్రామానికి చెందిన ఒక చిన్నారి అనారోగ్యంగా ఉండడంతో.. ఆమె తల్లిదండ్రులు మూడు రోజుల క్రితం ఇల్లెందు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాగా, వారికి తారసపడిన ఒక భూత వైద్యుడు ఆస్పత్రికి అవసరం లేదని, తాను నయం చేస్తానని నమ్మించాడు. ఓ మేకను బలిచ్చి, భూతాలను కట్టడి చేస్తానని పూజలు చేశాడు. రెండు రోజులు గడుస్తున్నా పాప ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో కుటుంబసభ్యులు భూత వైద్యుడిని నిలదీశారు. అతను చేతులెత్తేయడంతో వెంటనే ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్య ఖర్చులు భరించలేక.. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగానే ఉందని, భూత వైద్యుడి మాటలు నమ్మి సకాలంలో చికిత్స అందక అపస్మారక స్థితికి చేరిందని వైద్యులు స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనపై ఎస్ఐ రాజమౌళి స్పందిస్తూ భూత వైద్యం పేరుతో ఎవరైనా వస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
చరిత్రకు సజీవ సాక్ష్యం.. రాజకోట
యాదగిరిగుట్ట: నిజాం ప్రభువులకు లక్షలాది రూపాయల కప్పం కట్టిన సంపన్న సంస్థానం.. ఒకప్పుడు అద్భుతమైన కట్టడంగా భాసిల్లిన కోట నిర్మాణం.. అదే.. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన రాజకోట. 250 ఏళ్ల చరిత్ర కలిగిన రాతి కట్టడాల నిలయంగా.. రాచరికపు మహోన్నత వైభవానికి.. చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది రాజాపేటలోని (Rajapeta) రాజావారి కోట. హైదరాబాద్కు (Hyderabad) 90 కిలోమీటర్లు.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు (Aler) నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిజాం రాజ్యంలోని అన్ని సంస్థానాల కన్నా ఎక్కువ రాబడి ఈ సంస్థానం నుంచే వచ్చేదని చరిత్రకారులు చెబుతారు. అంతేకాదు.. గొప్ప కట్టడాలున్న సంస్థానంగా కూడా పేరు ఉండేది. ఇక్కడ చిన్న చిన్న షూటింగ్లు, ఫొటో షూట్లు సైతం జరుగుతుంటాయి. కోటలోని అద్భుత శిల్ప కళా సంపద అప్పటి శిల్పుల గొప్పతనాన్ని చాటుతుంది. కోట చరిత్ర రాజాపేట గ్రామానికి పడమటి భాగంలో గోపాలపురం (Gopalapuram) అనే గ్రామం ఉండేది. గ్రామం పైభాగంలో చెరువు ఉండేది. ఆ చెరువు వరద ముంపునకు గురైన గోపాలపురం గ్రామం కాలగర్భంలో కలిసిపోయింది. అనంతరం రాజ రాయన్న అనే రాజు 1775లో కోటను నిర్మించి గ్రామాన్ని ఏర్పాటు చేశాడు. రాజ రాయన్న పాలన సాగించిన కోటనే నేడు రాజాపేటగా పిలుస్తున్నారు. రాజాపేట గ్రామం చుట్టూ కందకం తవ్వారు. కోట గోడ ప్రాకారం, ఎత్తయిన రాతి గోడలతో చుట్టూ శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. గ్రామం మధ్యలో ఉండేలా.. మూడు ప్రధాన ద్వారాలు ఏర్పాటు చేశారు. ఎగువ పడమటి వైపున్న గోపాల చెరువు నుంచి కందకంలో నీరు పారేలా ఏర్పాట్లు చేసి.. శత్రువులు చొరబడకుండా మొసళ్లను పెంచేవారు. గ్రామం లోపలి ప్రధాన ద్వారం దాటితే రాజ నివాసం, అంతఃపురం, అద్దాల మేడ, అతిథి గృహం, నీటి కొలను, గిరిగిరి మాల్, ఏనుగుల మోట, ఖైదీల కారాగారం, సైనికుల శిక్షణ స్థలం వంటివి కనిపిస్తాయి. శత్రువుల నుంచి కోటను రక్షించేందుకు చుట్టూ నిర్మించిన ఎత్తయిన బురుజులు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. వారి ప్రాణాలను రక్షించుకునేందుకు కోట నుంచి బయటికెళ్లేందుకు సొరంగ మార్గాలున్నాయి. పర్యాటకుల తాకిడి.. సినిమా షూటింగ్లు.. రాజకోటలో బురుజులు, అంతఃపురం, నీటి కొలను, సైనిక ప్రాంగణం, ఏనుగుల మోట, గిరిగిరిమాల్ తదితర అద్భుత నిర్మాణాలు.. సినిమా షూటింగ్లు, ఫొటోషూట్కు అనుకూలంగా ఉన్నాయి. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి 20 కిలోమీటర్ల దూరంలో, సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ ఆలయాలకు వెళ్లే మార్గాల్లో ఈ కోట ఉండటంతో పర్యాటకులు సందర్శించేందుకు వీలుంది. ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్తో పాటు పలువురు ప్రీ వెడ్డింగ్ (Pre Wedding) షూట్లు ఇక్కడ తీస్తున్నారు. అభివృద్ధికి నోచుకోని గడికోట రాజకోట రాజవంశీకులు ఈ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గతంలో నిర్ణయించారు. దీంతో పర్యాటక శాఖాధికారులు రాజకోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2019 అక్టోబర్ 29న పర్యాటక శాఖాధికారులు గడిని సందర్శించారు. అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం, తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువు, రాజాపేట గడికోట, కొలనుపాకలోని జైన్ మందిర్, సోమేశ్వర ఆలయాలను కలుపుతూ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. చదవండి: తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానంభావితరాలకు అందించాలి రాజకోటను తిలకించేందుకు పర్యాటకులు, సినీ నటులు తరచూ వస్తున్నారు. కోటలో ఇప్పటికే పలు సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్లు జరిగాయి. 250 ఏళ్ల చరిత్ర కలిగిన రాజకోటను భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి, టూరిజం స్పాట్గా తీర్చిదిద్దాలి. – కొత్తకొండ భాస్కర్, రాజాపేట గ్రామస్తుడురాజకోటను పరిరక్షించాలి మా కాలంలో ఈ కోట ఎంతో అద్భుతంగా ఉండేది. కానీ ఇప్పుడు నిరాదరణకు గురైంది. ఎంతో చరిత్ర కలిగిన రాజాపేటలోని రాజకోటను అభివృద్ధి చేయాలి. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదగిరిగుట్ట, కొమురవెల్లి ఆలయాలకు అతి సమీపంలోని ఈ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. – పుల్లంగారి సిద్ధయ్య, రాజాపేట -
మొక్కు తీర్చుకుని వస్తూ మృత్యుఒడికి..
మొక్కు తీర్చుకోవడానికి షిర్డీ వెళ్లిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందారు. అలాగే సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లి తిరిగివస్తున్న వారి కారు అదుపుతప్పి లారీ కింద ఇరుక్కోవడంతో ఇద్దరు మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మహారాష్ట్రలోని గంగాపూర్ వద్ద ఓ ఘటన చోటుచేసుకోగా, భువనగిరి జిల్లా కేంద్రం సమీపంలో మరో ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన శ్యాంశెట్టి కృష్ణమూర్తి, ప్రేమలత దంపతులు తమ కొడుకు, కోడలుతో సరూర్నగర్ గ్రీన్ పార్కు ఏరియాలో నివాసం ఉంటూ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. వీరికి మనవడు పుట్టిన సందర్భంగా మొక్కుతీర్చుకోవడానికి షిర్డీకి వెళ్లాలని అనుకున్నారు. భోగి పండుగ రోజు పెద్ద కూతురు ప్రసన్నలక్ష్మి, చిన్న కూతురు బజ్జూరి స్రవంతి కుటుంబాలతో కలిసి హైదరాబాద్ నుంచి ప్రైవేట్ బస్సులో వెళ్లి షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత స్థానికంగా తుఫాన్ వాహనం కిరాయికి తీసుకొని ఔరంగాబాద్లోని మినీ తాజ్మహల్ను సందర్శించారు. ఔరంగాబాద్ – షిర్డీ మధ్యలో గంగాపూర్ వద్ద బుధవారం రాత్రి వీరు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో శ్యాంశెట్టి ప్రేమలత (57) ఆమె కుమారుడి కొడుకు వైది్వక్ (6 నెలల బాలుడు), పెద్ద కూతురు తొల్పునూరి ప్రసన్నలక్ష్మి (42)తో పాటు ప్రసన్నలక్ష్మి పెద్ద కూతురు తొల్పునూరి అక్షిత (21) మృతిచెందారు. ప్రేమలత పెద్ద అల్లుడు శ్రీనివాస్, ప్రసన్నలక్ష్మి రెండో కూతురు శరణ్యతో పాటు ప్రేమలత భర్త కృష్ణమూర్తి, కుమారుడు వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు ఔరంగాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమలత చిన్న కూతురు బజ్జూరి స్రవంతి, అల్లుడు రాంబాబుతో పాటు వీరి కుమారుడు, కుమార్తె ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం ఔరంగాబాద్ నుంచి స్వగ్రామానికి తరలించారు. సంక్రాంతి పండుగకు వచ్చి వెళ్తూ... మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకట్రాంతండాకు చెందిన గుగులోతు రవి, భూక్య సంతోష్ బావాబావమరుదులు. రవికి భార్య భవాని, కుమార్తె మోక్ష ఉండగా.. సంతోష్ కు భార్య అనూష (26), ఇద్దరు కుమార్తెలు ప్రణశ్వని, చైత్ర (6) ఉన్నారు. రవి, సంతోష్లు కుటుంబాలతో కొంతకాలంగా హైదరాబాద్లోని రామంతాపూర్లో ఉంటున్నారు. రవి, సంతోష్లు తమ భార్యాపిల్లలతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు కారులో స్వగ్రామం వెంకట్రాంతండాకు వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి హైదరాబాద్కు బయల్దేరారు. సంతోష్ కారు నడుపుతుండగా.. అతడి భార్య అనూషతో పాటు చిన్న కుమార్తె చైత్ర అతడి పక్కన కారు ముందు భాగంలో కూర్చున్నారు. మిగతావారు వెనక కూర్చున్నారు. గురువారం తెల్లవారుజామున 6.30 గంటల సమయంలో భువనగిరి జిల్లా కేంద్రానికి సమీపంలోని రాయగిరి వద్దకు రాగానే వరంగల్–హైదరాబాద్ హైవే బైపాస్ రోడ్డుపై ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఇండికేటర్ వేయకుండా పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లోకి ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాడు. వెనకాలే వస్తున్న వీరి కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. కారు లారీ కిందిభాగంలో ఇరుక్కుపోవడంతో నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును జేసీబీ సహాయంతో బయటకు తీయగా.. అప్పటికే అనూష, చైత్ర మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మిగతా ఐదుగురిని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. భూక్య సంతోష్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు, ఎస్హెచ్ఓ సంతోష్ కుమార్ తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన రవి భార్య భవాని 8 నెలల గర్భంతో ఉంది. ఆస్పత్రికి తరలించిన అనంతరం వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కడుపులో ఉన్న శిశువుకు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు. -
పుట్టినింటికి ఆడబిడ్డలు
ఊరు అంటే ఊరు కాదు. జ్ఞాపకాల తోట. ఖండాంతరాలు దాటినా ఆ పరిమళం మనసును వీడిపోదు. ఏదో ఒక సమయాన స్వరూపకు నాగమణి గుర్తుకు వస్తుంది. పక్కింటి నాగమణి, స్వరూప క్లోజ్ఫ్రెండ్స్. దగ్గరలో ఉన్న మండల కేంద్రానికి సినిమాకు వెళ్లడం నుంచి సీమచింతకాయల వేట వరకు వారి జ్ఞాపకాల్లో ఎన్నో ఉన్నాయి. పెళ్లి అయిన తరువాత నాగమణి అక్కడెక్కడో సూరత్లో ఉంటుంది. స్వరూప కూడా పెళ్లయిన తరువాత సొంతూరులో కాకుండా వేరే ఊళ్లో ఉంటుంది. ఆ దూరం అలా కొనసాగుతూనే ఉంది.ఇక అంతేనా?‘ఈ 5జీ జమానాలో కూడా అంతేనా... ఇంతేనా అంటూ నిట్టూరిస్తే ఎలా?’ అంటూ కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజన్న గూడెం మహిళలు. పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న స్నేహితుల ‘పూర్వ విద్యార్థుల సమ్మేళనం’ మనకు తెలుసు. అయితే ఇది అలాంటి సమ్మేళనం కాదు... రాజన్న గూడెం ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం!పెళ్లయిన తరువాత ఎక్కడెక్కడో వేరు వేరు ఊళ్లలో ఉంటున్న ఆడపడుచులు ఈ సమ్మేళనం పుణ్యమా అని ఎన్నో సంవత్సరాల తరువాత కలుసుకున్నారు. రోజంతా సంబరాలు చేసుకున్నారు! ‘నా బిడ్డలందరూ నా దగ్గరికి వచ్చారు’ అని ఊరు సంతోషంతో ఉప్పొంగి పోయిన రోజు అది....బతుకమ్మ పండుగ రోజు...యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాజన్న గూడెం ఆడబిడ్డలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఉన్న ఊరిని వదిలి అత్తారింటికి వెళ్లిన ఆడపడుచులందరు ‘ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో ఒక చోటకు చేరారు. అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చే వారి సంఖ్య ప్రతి యేడూ తగ్గుతోంది. పోయిన బతుకమ్మ పండుగ రోజు ఇదే విషయం గురించి మాట్లాడుకున్నారు కొందరు మహిళలు. ‘అందరం ఒక రోజు కలుసుకొని మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది’ అనుకున్నారు. అది అసాధ్యమైన కోరికేమీ కాదనే విషయం కూడా వారికి తెలుసు. ‘ఎంత బాగుంటుంది అని ఒకటికి పదిసార్లు అనుకోవడం కాదు. కచ్చితంగా కలవాల్సిందే’ అంటూ నడుం బిగించారు.సోషల్ మీడియా వేదికగా....అనుకున్నదే తడవుగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. వివిధ రంగాల్లో ఉన్న తమ ఊరి ఆడబిడ్డలను ఒకదగ్గర చేర్చడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. పేరాల ఇందిర, సూదిని రజిని, యాట ఇందిరాదేవి, రావుల ఉమాదేవి, ఊట్కూరి లక్ష్మి నాలుగు నెలల పాటు ఎంతో శ్రమ తీసుకున్నారు. ఫోన్ నెంబర్లు సేకరించడం నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వరకు ఎన్నో చేశారు.దాగుడుమూతలు... దస్తీబిస్తీలుఅనుకున్న రోజుకు దాదాపు అందరూ వచ్చారు. ఇరవై ఏళ్ల నుంచి తొంభై ఏళ్ల వయసు వరకు ఎంతోమంది మహిళలు వచ్చారు. వయసు తేడా లేకుండా చిన్నపిల్లలై పోయారు. దాగుడు మూతలు, దస్తీబిస్తీ, మ్యూజికల్ చైర్, బెలూన్ బ్లాస్టింగ్, ఒంటికాలి కుంటుడు ఆటలు, డీజే పాటలతో హోరెత్తించారు.‘ఎవరి లోకం వారిదే’ అయిపోయిన ఈ కాలంలో, ఒకే ఇంటి కుటుంబ సభ్యులు కూడా వేరు వేరు ప్రపంచాలు అయిన ఈ ఉరుకులు పరుగుల కాలంలో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తాయి. పల్లె మోములో రోజూ పండగ కళను తీసుకువస్తాయి.మరెన్నో ఊళ్లకు ‘రాజన్న గూడెం ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం’ స్ఫూర్తిని ఇవ్వాలని ఆశిద్దాం.ఇక ప్రతి సంవత్సరం...ఆ రోజు పండగే!మా ఊరి ఆడబిడ్డలం అందరం ఒకచోట చేరి చిన్న పిల్లలమయ్యాం. చిన్నప్పటి పండుగలను, ఆనాటి సంబరాలను గుర్తు చేసుకున్నాం. వయసు తేడా లేకుండా ఆటలాడుకున్నాం. మా ఊరి మీద మరింత ప్రేమ పెంచుకున్నాం. ప్రతి సంవత్సరం ‘ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం’ ఏర్పాటు చేయాలని, మరింత ఎక్కువమంది హాజరయ్యేలా చూడాలనుకుంటున్నాం.– ఊట్కూరి లక్ష్మి, నల్లగొండకళ్లనీళ్లు పెట్టుకున్నారు‘రాజన్న గూడెం ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో చేపట్టిన కార్యక్రమం మా జీవితంలో మరవలేనిది. ఎన్నోతరాల ఆడబిడ్డలను ఒకచోటికి రప్పించాం. రకరకాల కారణాలతో పుట్టిన ఊరికి ఇక రాలేమనుకున్న వారిని సైతం గుర్తించి రప్పించడం విశేషంగా భావిస్తున్నాం. ఆడబిడ్డలందరినీ ఒకచోట చూసి పెద్ద వయసు వారు కన్నీటి పర్యంతమయ్యారు.– పేరాల ఇందిర, మోత్కూరుమళ్లీ మళ్లీ రావాలని...తల్లిదండ్రులు చనిపోయిన వారు, సింగిల్ పేరేంట్స్... మొదలైనవారు మా ఊరికి చాలా ఏళ్లుగా రావడం లేదు. అలాంటి వారందరినీ ‘ఆత్మీయ సమ్మేళనం’ ద్వారా రప్పించాం. వచ్చినవారంతా ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకున్నారు. నిక్నేమ్లను గుర్తు చేసుకున్నారు. మరోసారి ఇలాంటి కార్యక్రమం పెడితే మళ్లీ పుట్టింటికి వచ్చినట్లు వస్తామని సంతోషంగా చెప్పి వెళ్లారు. – సూదిని రజిని, సిరిపురంఅంబరాన్ని అంటిన సంబరంప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు కొద్దిమందిమి మాత్రమే పుట్టింటికి వస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఆత్మీయ సమ్మేళనం’కు రూపకల్పన చేశాం. ఊరు దాటగానే ఎవరి లోకం వారిదై పోతుంది. అలా కాకుండా పట్టుదలగా, ఇష్టంగా పనిచేశాం. రాలేమన్న వారిని ఒప్పించి రప్పించాం. మా ఊరి ఆడబిడ్డల ముఖాల్లో మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని చూశాం. – యాట ఇందిరాదేవి, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్,సీతాఫల్ మండి, సికింద్రాబాద్ – యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి -
యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు.. కార్మికుడు మృతి
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి జిల్లాలోని పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒక కార్మికుడు కనకయ్య మృతిచెందినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటన చోటుచేసుకుంది. పేలుడు కారణంగా పెద్ద శబ్ధం రావడంతో కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను హుటాహుటిన భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో చికిత్స పొందుతూ కనకయ్య మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ప్రకాశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, పరిశ్రమ లోపల ఎవరైనా చిక్కుకున్నారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. ప్రమాద ఘటనపై కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన కార్మికుల కుటుంబాల సభ్యులు పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసనలు తెలుపుతున్నారు. -
గుండెపోటుతో 9వ తరగతి విద్యార్థిని మృతి
భూదాన్పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో గుండెపోటు తో 9వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. మృతురాలి సోదరుడు తెలిపిన వివరాల మేరకు.. గ్యార స్వామి, యాదమ్మ దంపతుల కుమార్తె నవ్య (16) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కాగా మంగళవారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన కావ్య జ్వరంతో అస్వస్థతకు గురికాగా తల్లిదండ్రులు అదే రోజు రాత్రి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించగా తగ్గింది. బుధవారం సాయంత్రం తిరిగి జ్వరం రావడంతో బీబీనగర్లోని ఓ ఆసుపత్రిలో చూపించారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు జ్వరం, బీపీ ఎక్కువ ఉందని చెప్పడంతో మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి.. అనంతరం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే నవ్య మార్గమధ్యలోనే గుండెపోటుతో మృతి చెందిందని యశోద ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఆడపిల్ల కావాలనే కోరికతో స్వామి, యాదమ్మ దంపతులు రెండు నెలల వయసున్న నవ్యను బంధువుల నుంచి దత్తత తీసుకుని ఎంతో గారాబంగా పెంచుకున్నారు. Hydra: ఇల్లు పోతుందన్న భయంతో పేద గుండె ఆగింది -
ఉపాధికి అడ్డ.. భువనగిరి గడ్డ
సాక్షి, యాదాద్రి: ఒకప్పుడు వలసలకు కేంద్రమైన యాదాద్రి భువనగిరి జిల్లా ఇప్పుడు వలస కార్మికులకు ఉపాధి అడ్డాగా మారింది. ఉపాధి లేక ముంబై, భివండీ, సోలాపూర్, బెంగళూరు, ఆంధ్ర, సూరత్ వంటి పట్టణాలకు జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి నిరంతరం వలసలు సాగేవి. కానీ ఇప్పుడు వ్యవసాయం, పరిశ్రమలు, గృహనిర్మాణ రంగాలు పుంజుకోవడంతో వివిధ రకాల పనులు ఊపందుకున్నాయి. దీంతో కూలీల కొరత నెలకొనడంతో జిల్లాకు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కార్మికులు వలసవచ్చి ఉపాధి పొందుతున్నారు.30 వేల మందికి పైగా.. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, అసోం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన వేలమంది జిల్లాలో ఉపాధి పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి యాదాద్రి జిల్లాకు రైళ్లు, బస్సులు అందుబాటులో ఉండటంతో కార్మికులు నేరుగా చేరుకుంటున్నారు. జిల్లాలోని 17 మండలాలు, 6 మున్సిపాలిటీల్లో 30 వేలకు పైగా ఇతర రాష్ట్రాల కార్మికులు పలు రకాల పనులు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రైస్ మిల్లులు, హోటళ్లు, భవన నిర్మాణం, ఇటుక బట్టీలు, టైల్స్, పీవోపీ, పౌల్ట్రీ, ఎయిమ్స్, కంపెనీలు, వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నారు. చౌటుప్పల్, బీబీనగర్ పారిశ్రామిక వాడల్లో వీరు ఎక్కువగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా రైస్మిల్లులు, భవన నిర్మాణ పనులు, వ్యవసాయంలో నాట్లువేయడం, పత్తి ఏరడం తదితర పనులు చేస్తున్నారు. బార్బర్ పని, హోటళ్లలో మాస్టర్లు, వెయిటర్లు, ఇలా ఒకటేమిటి అన్ని రకాల పనులు చేస్తున్నారు. ఒక్కో రాష్ట్రం కార్మికులది ఒక్కో ప్రత్యేకత బిహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వలస వచ్చిన వారు జిల్లాలోని రైస్ మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీ పనులు చేస్తుండగా.. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వారు భవన నిర్మాణంలో తాపీ మేస్త్రీలుగా, పార కూలీలుగా.. రాజస్తాన్ నుంచి వచ్చిన వారు హోటళ్లు, పీవోపీ, హార్డ్వేర్ దుకాణాల్లో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారు పత్తి ఏరడం, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వారు పొలంలో నాట్లు వేయడం లాంటి పనులు చేసి జీవనోపాధి పొందుతున్నారు.అధికంగా రైస్ మిల్లుల్లో.. ఒక్కో రైస్ మిల్లులో 20 నుంచి 30 మంది కార్మికులు పనిచేస్తారు. ఒక గుంపునకు ఒక ముఠామేస్త్రి కార్మికులను సూపర్వైజ్ చేస్తారు. అందరికంటే ముఠామేస్త్రికి కాస్త కూలి ఎక్కువగా ఉంటుంది .రైస్ మిల్లుల్లో మిల్లు డ్రైవర్, ప్లాంటు డ్రైవర్, హమాలీలుగా పని చేస్తారు. మిల్లు ప్లాంటు, డ్రైవర్లకు రోజుకు సుమారు రూ.800 కూలి పడుతుంది. మిల్లుకు వచ్చే లారీల ధాన్యం లోడింగ్, అన్లోడింగ్, హమాలీ కార్మికులు చేస్తారు. వీరికి రోజుకు సుమారు రూ.500 కూలి పడుతుంది. మిల్లు యజమానులు వీరికి భోజనం, వసతి కల్పిస్తారు. అడ్వాన్స్లు చెల్లించి మరీ.. పలు గ్రామాల్లో గల ఇటుక బట్టీల్లో సుమారు 6,000కుపైగా ఒడిశా కార్మికులు పనిచేస్తున్నారు. నాలుగు నెలల పనుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.50 వేల అడ్వాన్స్ చెల్లించి ఇటుక బట్టీ యజమానులు పనులకు తీసుకువస్తారు. ఒక్కో వ్యక్తికి వారానికి రూ.వెయ్యి చొప్పున కిరాణా సరుకుల కోసం ఖర్చులు ఇవ్వడంతో పాటు వారు చేసిన పనులను బట్టి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు అడ్వాన్స్లో కటింగ్ చేస్తారు. ఒడిశా కూలీలు తాము తీసుకున్న అడ్వాన్స్కు సరిపోను ఈ నాలుగు నెలల కాలంలో పనులు చేస్తారు.చదవండి: రియల్ఎస్టేట్ పడిపోతే పోయేదేం లేదు.. ఎమ్మెల్యే కాటిపల్లిబెంగాల్ నుంచి వచ్చాను మాది పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా గొసాబా. మా రాష్ట్రంలో పనులు లేవు. ఉపాధికోసం భువనగిరికి వచ్చాం. తిండి, వసతి ఖర్చులు లేకుండా పనిచేసే గ్రామాల్లోనే షెల్టర్ వెతుక్కుంటున్నాం. ఒక్కొక్కరం రోజుకు రూ.1,000 దాకా సంపాదిస్తాం. దాదాపుగా రెండు నెలల పాటు పనులు చేసి తిరిగివెళ్తాం. కుటుంబ పోషణ చూసుకుని మరో సారి వస్తాం. ఇలా సంవత్సరానికి రెండు మూడుసార్లు వస్తాం. ఇక్కడ పనులకు కొరతలేదు. – దాలీమ్షేక్, పశ్చిమబెంగాల్మూడు నెలలు ఇక్కడే మా రాష్ట్రం ఛత్తీస్గఢ్లో సరైన ఉపాధి అవకాశాలు లేవు. ఏడాదిలో ఒక సీజన్లో కూడా పని దొరకదు. సాగు అంతంత మాత్రమే. అందుకే మేమంతా తెలంగాణకు వస్తున్నాం. ఇక్కడ మాకు కూలి గిట్టుబాటు అవుతుంది. ఏడాదిలో మూడు నెలలు ఇక్కడే ఉంటాం ధాన్యం ఎత్తడం, దించడం వంటి హమాలీ కూలి పని చేస్తాం. ఉప్పరి మేస్త్రీ పనికి వెళ్తాం. – మహబూబ్ ఆలమ్, ఛత్తీస్గఢ్ఇక్కడ ఉపాధికి కొదవలేదు ఇక్కడ ఉపాధికి కొదవ లేదు. మహారాష్ట్ర నుంచి వచ్చాం. రెండు నెలలు ఇక్కడ పని చేసుకుంటాం. రోజుకు ఖర్చులు పోను రూ.500 సంపాదిస్తాం. హమాలీ, మేస్త్రీ, ఇతర పనులు చేస్తాం. పనులు పూర్తి అయిన తర్వాత వెళ్లిపోతాం. మాకు భోజనానికి బియ్యం, ఉండటానికి ఇళ్లు, తాగునీరు, వైద్య సౌకర్యం, వసతులు పని ఇచ్చే వారే చూసుకుంటారు. ఉమ్మడి స్నేహితులతో కలిసి వస్తాం పనిచేసి డబ్బు సంపాదించుకుంటాం. – అన్వర్, మహారాష్ట్రరోజుకు రూ.1,000 సంపాదిస్తున్న జీవనోపాధి కోసం ఒడిశా నుంచి యాదగిరిగుట్టకు వచ్చాం. దాదాపు సంవత్సరం అవుతోంది. ఇక్కడ బిర్యానీ హోటల్లో పనిచేస్తూ బతుకుతున్నాను. రోజుకి రూ.1,000 సంపాదిస్తున్నాను. ప్రస్తుతం అయితే డబ్బుల కోసం కష్టపడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను.– జాకీర్, ఒడిశాఇక్కడే ఆరు నెలలు ఉపాధి మా రాష్ట్రంలో పనులు దొరకవు. తెలంగాణలో పంటలు బాగా పండుతున్నాయి. జిల్లాకు ఏటా వచ్చి రైసు మిల్లులో పనిచేస్తా. ఆరేడు నెలలపాటు ఇక్కడే ఉంటా. వారానికోసారి సేటు పైసలు ఇస్తరు. నా ఖర్చులకు ఉంచుకొని మిగిలినవి ఇంటికి పంపిస్తాను. ఇక్కడా బాగా వుంది. – బాబులాల్, బిహార్ -
ఆ మలుపులో ఎన్నో ప్రమాదాలు!
భూదాన్ పోచంపల్లి: అసలే ఇరుకు రోడ్డు.. దానిపై ప్రమాదకరంగా మూల మలుపు.. దాని పక్కనే చెరువు.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురంలో శనివారం కారు చెరువులో బోల్తా కొట్టిన ప్రాంతం దుస్థితి ఇది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక, పక్క నే చెరువు ఉన్నట్టు ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేక, ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాహనాలు చెరువులోకి దూసుకెళ్లాయి. పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇంత జరుగుతున్నా అధికారులు అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాలతో నిత్యం రద్దీ ఉన్నా..పోచంపల్లి పర్యాటక కేంద్రం, చేనేతకు ప్రసిద్ధికావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు, చేనేత వస్త్రాలను కొనుగోలు చేసేవారు వస్తుంటారు. వాహనాల రద్దీ ఉంటుంది. అయితే ఈ రోడ్డుపై జలాల్పురం చెరువు కట్ట వద్దకు రాగానే ఇరువైపులా పెద్ద మూల మలుపులు ఉన్నాయి. ఇరువైపులా చెట్లు, పొదలు పెరిగి, ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరికి వచ్చేంత వరకు సరిగా కనిపించవు. చెరువుకు రక్షణ గోడ కూడా లేదు. ఇవన్నీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.ఇప్పటికైనా అధికారులు స్పందించి మూల మలుపుల సమీపంలో సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, చెరువుకు రక్షణ గోడ ఏర్పాటు చేయాలని... చెట్లు, పొదలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై శనివారం ధర్నా కూడా చేశారు. చెరువు సమీపంలో మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయని, ఎన్నో ప్రమాదాలు జరిగినా ఎవరికీ పట్టింపులేదని జలాల్పురం గ్రామానికి చెందిన పాలకూర్ల జంగయ్య మండిపడ్డారు.చెరువులోకి దూసుకెళ్తున్న వాహనాలు⇒ ఈ ఏడాది జూలై 17న ఇటుకల లోడుతో వెళ్తున్న లారీ మూలమలుపు వద్ద అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.⇒2023 జూలై 24న చెరువు కట్టపై పండ్ల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. అదే ఏడాది డిసెంబర్లో జరిగిన ప్రమాదంలో ప్రశాంత్ అనే యువకుడు మృతిచెందాడు.⇒ 2020 జూలై 24న హైదరాబాద్లోని ఎల్బీ నగర్కు చెందిన జింక వంశీ, తన స్నేహితులతో కలిసి పోచంపల్లి మండలం రాంలింగంపల్లిలోని బంధువులకు పెళ్లి పత్రిక ఇవ్వడానికి వస్తుండగా... ఇదే మలుపు వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. వంశీ మృతిచెందగా, మిగతావారు బయటపడ్డారు.⇒ 2020 జూన్ 26న చెరువు కట్ట మలుపు వద్ద ఎదురెదురుగా వచ్చిన కారు, బైక్ ఢీకొన్నాయి. కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఇక పదుల సంఖ్యలో ద్విచక్రవాహనలు అదుపుతప్పి చెరువులో పడి చాలా మంది గాయాలపాలయ్యారు. -
ఐదుగురు యువకులు జలసమాధి
భూదాన్ పోచంపల్లి: వారంతా 25 ఏళ్లలోపు యువకులు.. కలసి తిరిగే స్నేహితులు.. సరదాగా షికారుకు బయలుదేరారు.. మధ్యలో మద్యం తాగారు.. ఆపై కల్లుతాగాలనే కోరిక పుట్టింది.. దానికోసం వెళుతుంటే, పొగమంచులో దారి సరిగా కనిపించక కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న ఐదుగురు యువకులు జల సమాధి అయ్యారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. శనివారం తెల్లవారుజామున యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురం సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకొంది. మృతులంతా హైదరాబాద్లోని ఎల్బీనగర్ ప్రాంతానికి చెందినవారే. ఆరుగురు కలసి వెళ్లి.. ఎల్బీ నగర్ ప్రాంతంలోని సిరినగర్ కాలనీకి చెందిన తీగుళ్ల వంశీగౌడ్ (23), ఇంద్రపల్లి హర్షవర్ధన్ (22), వీరమల్ల విఘ్నేశ్వర్(20), ఆర్టీసీ కాలనీకి చెందిన కలకోటి అక్షయ్కుమార్ అలియాస్ బల్లు (19), వాస్తుకాలనీకి చెందిన జెల్ల వినయ్ (21), బోడుప్పల్ జ్యోతినగర్ కాలనీకి చెందిన మేడబోయిన మణికంఠయాదవ్ (21) స్నేహితులు. శుక్రవారం రాత్రి వీరంతా ఎల్బీ నగర్లో కలసి పార్టీ చేసుకొందామని అనుకున్నారు. తీగుళ్ల వంశీగౌడ్ తన ఇంటి వద్ద ఓ స్నేహితుడు పెట్టివెళ్లిన కారు ఉండటంతో.. దానిని తీసుకొని శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో బయలుదేరారు.మార్గమధ్యలో అంబర్పేట వద్ద మద్యం తాగారు. అక్కడే రెండు గంటల పాటు గడిపారు. ఆ సమయంలో వారికి ఈతకల్లు తాగాలని కోరిక పుట్టింది. దీనితో సుమారు 3.30 గంటల సమయంలో భూదాన్ పోచంపల్లికి వచ్చారు. ఇంకా చీకటిగానే ఉండటంతో అక్కడే టీ తాగారు. టిఫిన్ చేసి వద్దామనుకుని కొత్తగూడెం ఎక్స్ రోడ్డు వద్దకు వెళ్లారు. టిఫిన్ సెంటర్లు తెరవకపోవడంతో తిరిగి పోచంపల్లికి బయలుదేరారు. మద్యం మత్తులో ఉన్న వంశీ కారు నడుపుతున్నాడు. అయితే మధ్యలో అటవీ ప్రాంతం కావడం, తెల్లవారుజాము సమయం కావడంతో పొగమంచు దట్టంగా కప్పుకొంది. దానితో రోడ్డు సరిగా కనిపించక వంశీ ఒక్కసారిగా కారు హ్యాండ్ బ్రేక్ వేశాడు. వేగంగా ఉన్న కారు దీనితో అదుపుతప్పి పక్కనే ఉన్న జలాల్పురం చెరువులోకి బోల్తా కొట్టింది. ఈత రాక, బయటపడలేక.. కారులో డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్న మణికంఠ కారు సైడ్ అద్దం కొద్దిగా తెరిచి ఉంటడంతో దానిని కాలుతో తన్ని పగులగొట్టి బయటికి వచ్చాడు. ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. కారు నడుపుతున్న వంశీ, వెనుక సీట్లో కూర్చున్న అక్షయ్, వినయ్, హర్షవర్ధన్, విఘ్నేశ్వర్ నీట మునిగి ప్రాణాలు వదిలారు. ఒడ్డుకు చేరిన మణికంఠ రోడ్డుపై వెళ్తున్న పాల వ్యాపారిని ఆపి ప్రమాదం గురించి చెప్పాడు. ఆ వ్యాపారి 100కు, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్థానిక ఎస్సై భాస్కర్రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొన్నారు. నీట మునిగిన కారును జేసీబీతో వెలికితీయించి.. అందులోని మృతదేహాలను బయటికి తీశారు. చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్రెడ్డి, స్థానిక తహసీల్దార్ మహేందర్రెడ్డి, ఇతర అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అంతా పేద కుటుంబాల వారే జల సమాధి అయిన ఐదుగురు యువకులు కూడా పేద కుటుంబాలకు చెందినవారే. ఇందులో వంశీగౌడ్ ఇంటర్ పూర్తి చేసి ఫొటోగ్రాఫర్గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. అతడి తండ్రి శంకర్ ఆటోడ్రైవర్కాగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ఇక అక్షయ్కుమార్ ఇంటర్ పూర్తి చేసి జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అతడి తండ్రి నర్సింహాచారి కార్పెంటర్గా పనిచేస్తున్నారు. జెల్ల వినయ్ ఇంటర్ చదివాడు. అతడి తండ్రి జగన్నాథం చేనేత కారి్మకుడు. హర్షవర్ధన్ డిగ్రీ పూర్తి చేశాడు. ర్యాపిడో బైక్ నడుపుతూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. వీరమల్ల విఘ్నేశ్వర్ ఇంటర్ పూర్తి చేశాడు. అతడి తండ్రి సత్యనారాయణ ఆర్టీసీ కండక్టర్ అని తెలిసింది. అద్దాలు పగలగొట్టుకొని బయటికి వచ్చాను పార్టీ చేసుకొందామని ఫ్రెండ్స్ చెబితే రాత్రి ఎల్బీ నగర్కు వచ్చాం. వంశీ కారు తీసుకొచ్చాడు. ఆరుగురం కలసి రాత్రి 12 గంటలకు బయలుదేరాం. రామోజీ ఫిల్మ్సిటీ వద్ద ఏదో యాక్సిడెంట్ అయి ట్రాఫిక్ జామైతే గంటపైగా అక్కడే ఉన్నాం. కల్లు దొరుకుతుందని రాత్రి 3.30 గంటలకు పోచంపల్లికి వచ్చాం. ఇంకా తెల్లరకపోయేసరికి టిఫిన్ చేయడానికి కొత్తగూడెం ఎక్స్రోడ్డుకు వచ్చి తిరిగి పోచంపల్లికి వెళ్తుంటే ప్రమాదం జరిగింది. పొగమంచుతో రోడ్డు సరిగ్గా కనబడక సడన్గా హ్యాండ్ బ్రేక్ వేసిండు. కారు పల్టీ కొట్టి చెరువులో బోల్తా పడింది. డోర్లు తెరుచుకోలేదు. ముందు సీట్లో ఉన్న నేను కారు సైడ్ అద్దాన్ని కాలితో తన్ని పగులగొట్టి బయటికి వచ్చాను. డోర్లు తెరుచుకుని ఉంటే అంతా ఎలాగోలా బయటపడేవారు. – మణికంఠ యాదవ్, (ప్రాణాలతో బయటపడిన యువకుడు) రాత్రి 11 గంటల దాకా ఇంటివద్దే ›ఉన్నాడు మేం ముగ్గురం అన్నదమ్ములం. వంశీ రెండోవాడు. పెళ్లిళ్లకు ఫొటోలు, వీడియోలు తీస్తుంటాడు. రాత్రి 11 గంటల వరకు అంతా ఇంటి వద్దే ఉన్నారు. ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లారు. ఉదయం నేను జిమ్కు వెళ్తుంటే తెలిసినవారు మీ తమ్ముడు చనిపోయాడని, స్నాప్చాట్లో ఫొటోలు వచ్చాయని చెప్పడంతో చూసి షాక్ అయ్యాం. – తిగుళ్ల ఉదయ్కుమార్ (మృతుడు వంశీ సోదరుడు) -
యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
బీబీనగర్లో భారీ అగ్ని ప్రమాదం.. నిప్పురవ్వలు ఎగిసి
సాక్షి, యాదాద్రి: బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హిందూస్థాన్ శానిటరీ గోడౌన్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. గోడౌన్ సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో రైతులు గడ్డి తగులబెట్టారు. ఈ క్రమంలో నిప్పు రవ్వలు ఎగిరి గోడౌన్లోని కాటన్ బాక్స్లపై పడ్డాయి. దీంతో మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. -
అన్నీ తానై.. తానే నాన్నయి
తండ్రి ఉన్నప్పుడు అఖిలకు చదువే లోకం. ఎప్పుడో తప్ప పొలానికి వెళ్లేది కాదు. నాన్నకు మాత్రం వ్యవసాయమే లోకం. నాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తరువాత అఖిలకు దుఃఖం తప్ప బతుకు దారి కనిపించలేదు. ఆ విషాద సమయంలో ‘నాన్నా... నీకు నేను ఉన్నాను’ అంటూ పచ్చటి పొలం అఖిలకు అభయం ఇచ్చింది. కుటుంబ బాధ్యతలను తలకెత్తుకున్న అఖిల ఇప్పుడు రైతుగా మారింది. తన రెక్కల కష్టంతో కుటుంబానికి అండగా నిలుస్తోంది. ‘డిగ్రీ సదివి ఏందమ్మా ఈ కష్టం’ అంటారు చాలామంది సానుభూతిగా. కానీ వ్యవసాయం చేయడం తనకు కష్టంగా కంటే ఇష్టంగా మారింది. ఎందుకంటే... పొలం దగ్గరికి వెళితే నాన్న దగ్గరికి వెళ్లినట్లు అనిపిస్తుంది. నాన్న ఎక్కడి నుంచో తన కష్టాన్ని చూస్తున్నట్లు, సలహాలు ఇస్తున్నట్లు అనిపిస్తుంది.యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన ఎల్మ శ్రీనివాస్ నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ‘చనిపోవాల్సిన వయసు కాదు’ అని తల్లడిల్లిన వాళ్లు.... ‘పిల్లల గతి ఏం కావాలి’ అని కన్నీళ్లు పెట్టుకున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ‘ఇంత అన్యాయం చేసి పోతవా కొడకా’ అంటూ వృద్ధాప్యంలో ఉన్న శ్రీనివాస్ తల్లి ఏడుస్తుంటే అక్కడ ఉన్నవారికి ఏడుపు ఆగలేదు.‘కాలం ఎంత బాధకు అయినా మందుగా పనిచేస్తుంది’ అంటారు. అయితే రోజులు గడిచినా, నెలలు గడిచినా శ్రీనివాస్ భార్య బాధ నుంచి తేరుకోలేదు. ఆ బాధతోనే ఆమె మంచం పట్టింది. శ్రీనివాస్కు ఇద్దరు కుమార్తెలు. గత ఏడాది పెద్దకుమార్తె వివాహం జరిగింది. ఇక కుటుంబ భారాన్ని మోయాల్సిన బాధ్యత చిన్న కుమార్తె అఖిలపై పడింది.‘ఎవుసాయం నీ వల్ల ఎక్కడ అవుతుంది బిడ్డా... పట్నంలో ఏదన్న ఉద్యోగం చూసుకో’ అన్నారు కొందరు. ‘వ్యవసాయం అంటే వంద సమస్యలుంటయి. నీ వల్ల కాదుగని పొలాన్ని కౌలుకు ఇయ్యండ్రీ’ అని సలహా ఇచ్చారు కొందరు. ‘వ్యవసాయం ఎందుకు చేయకూడదు. అఖిల చెయ్యగలదు’ అనే మాట ఏ నోటా వినిపించలేదు.పూరింట్లో మంచం పట్టిన అమ్మను, వృద్ధాప్యంలో ఉన్న నానమ్మను విడిచి పట్నంలో ఉద్యోగంలో చెయ్యలా? ‘చెయ్యను. వ్యవసాయమే చేస్తాను’ అని గట్టిగా నిశ్చయించుకుంది అఖిల. వ్యవసాయం అనేది కాలేజీని మించిన మహా విశ్వవిద్యాలయం. ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి. కాలేజీలో చదివే వారికి సంవత్సరానికి ఒక సారే పరీక్ష ఉంటుంది. కాని రైతుకు ప్రతిరోజూ పరీక్షే.‘యస్... ఆ పరీక్షల్లో నేను పాస్ కాగలను’ అంటూ ధైర్యంగా పొలం బాట పట్టింది కాలేజి స్టూడెంట్ అఖిల. ‘వచ్చినవా బిడ్డా’ అంటూ నాన్న చల్లగా నవ్వినట్లు అనిపించింది. ఆ ఊహ తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ‘నేను పరాయి దేశానికి పోలేదు. నాన్నకు ఇష్టమైన చోటుకే వచ్చాను. నాకు భయమెందుకు!’ అనుకుంది.మొదట బైక్ రైడింగ్ నేర్చుకుంది. ఆ తరువాత ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. ఇప్పుడు తనకు మరింత ధైర్యం, ‘వ్యవసాయం చేయగలను’ అనే నమ్మకం వచ్చింది. పొలంలో రెండు బోర్ల సాయంతో రెండు ఎకరాల వరకు వరి సేద్యం చేస్తోంది. ఇప్పుడు అఖిలకు వ్యవసాయం మాత్రమే కాదు... ఏ పనులు చేసుకోలేక మంచానికే పరిమితమైన తల్లి ఆలనాపాలన, నానమ్మ ఆరోగ్యం గురించి పట్టించుకోవడంలాంటి ప్రధాన బాధ్యతలు ఉన్నాయి. ఒక్కముక్కలో చె΄్పాలంటే ఇప్పుడు అమ్మకు అమ్మ అయింది. నానమ్మకు కొడుకు అయింది అఖిల. నాన్న చెప్పిన మాట‘ఎందుకింత కష్టపడతవు నాన్నా’ అని పిల్లలు అన్నప్పుడు ‘రెక్కల కష్టం వుట్టిగ పోదురా’ అని నవ్వేవాడు నాన్న. ‘రెక్కల కష్టం’ విలువ గురించి చిన్న వయసులోనే నాన్న నోటి నుంచి విన్న అఖిల ఇప్పుడు ఆ కష్టాన్నే నమ్ముకుంది. ఒకవైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు పోటీ పరీక్షలపై దృష్టి పెట్టింది. కానిస్టేబుల్ కావాలనుకుంటోంది. అలా అని వ్యవసాయానికి దూరం కావాలనుకోవడం లేదు. ఎందుకంటే... తనకు వ్యవసాయం అంటే నాన్న! – బిర్రు బాలకిషన్,సాక్షి, రాజాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా -
Lavanya Namoju: ఆలయచిత్రం
గుడిని గుడికి కానుకగా ఇస్తే ఎంత బాగుంటుంది? తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నామోజు లావణ్య దేశంలోని ఆలయాలకు వెళ్లి అక్కడి ఆధ్యాత్మికతను, గుడి ప్రాంగణాన్ని, ఆలయ గోపురాలను లైవ్ పెయింటింగ్ చేసి ఆ చిత్రాలను గుడికే బహుమానంగా ఇస్తోంది. దీని వల్ల గుడి రూపం చిత్రకళలో నిలుస్తోంది. అలాగే గుడికి వచ్చే భక్తులకు ఆలయ సౌందర్యాన్ని తెలియచేస్తుంది.‘ప్రతి ముఖ్యమైన గుడిలో నా చిత్రం ఉండాలి. అలాగే మరుగున పడిన గుడి నా చిత్రకళ ద్వారా కాస్తయినా ప్రచారం పొందాలని ఆలయ చిత్రాలను లైవ్ పెయింటింగ్ ద్వారా నిక్షిప్తం చేస్తున్నాను. ఇందుకు వస్తున్న ఆదరణ ఆనందం కలిగిస్తోంది’ అంది పాతికేళ్ల నామోజు లావణ్య. ‘ఇందుకు నా పెయింటింగ్స్ అమ్మకాల వల్ల వచ్చే డబ్బునే ఉపయోగిస్తున్నాను ఇటీవల భద్రాచల ఆలయంలోని సీతారాముల వారి మూర్తులు, ఆలయం లైవ్ పెయింటింగ్ చేసి దేవస్థానానికి అందజేశాను’ అందామె. ఒకరకంగా ఇది ఆధ్యాత్మిక చిత్రకళా సాధన అని కూడా అనుకోవచ్చు. మన సంస్కృతి కోసం‘మాది యాదాద్రి భువనగిరి. కామర్స్తో డిగ్రీ పూర్తి చేశాను. పోటీ పరీక్షలకు హాజరై, ఉద్యోగం తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ నా ఇష్టం మొత్తం పెయింటింగ్స్ మీదే ఉంది. దీంతో ఏడాది నుంచి పెయింటింగ్నే నా వృత్తిగా మార్చుకున్నాను. స్కూల్ ఏజ్ నుంచి నోట్ బుక్స్లో పెయింటింగ్స్ వేస్తుండేదాన్ని. పాశ్చాత్య సంస్కృతి పెరుగుతున్న ఈ కాలంలో సోషల్మీడియా ద్వారా మన సంస్కృతిని, మంచిని కూడా పరిచయం చేయవచ్చు అనిపించి సంవత్సరం నుంచి ఆలయ శిల్పాన్ని, హైందవ సంస్కృతిని నా ఆర్ట్ ద్వారా చూపుతున్నాను’.రాక్ స్టోన్స్ పై జంతువులు‘మెదక్ జిల్లా మరపడ దగ్గర ఒక వెంచర్ వాళ్లు ఆర్ట్కు సంబంధించిన విషయం మాట్లాడటానికి పిలిస్తే నేను, మా అంకుల్ శ్రీనివాస్ వెళ్లాం. అక్కడ ఒక గ్రామదేవత టెంపుల్ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద రాళ్లను చూశాక వాటిని ఆకారాలుగా చూపవచ్చనిపించింది. మొత్తం 42 రకాల పెద్ద పెద్ద రాక్ స్టోన్స్ ఉన్నాయి. వాటిని ఏనుగులు, ఆవులు, కోతులు, తాబేలు, కొలనుగా రంగులద్ది మార్చాను. మొన్నటి మే నెల ఎండలో వేసిన పెయింటింగ్స్. అక్కడికి వచ్చినవాళ్లు ‘ఆడపిల్ల అంత పెద్ద రాళ్లు ఎక్కి ఏం పెయింటింగ్స్ వేస్తుంది’ అన్నారు. కానీ అవి పూర్తయ్యాక చాలా సంతోషించారు’ అంది లావణ్య.వెడ్డింగ్ లైవ్ ఆర్ట్‘వివాహవేడుక జరుగుతుండగా ఆ సన్నివేశం, సందర్భం చూడటానికి చాలా బాగుంటుంది. లైవ్ ఆర్టిస్ట్ను అని తెలియడంతో గత పెళ్లిళ్ల సీజన్లో వివాహం జరుగుతుండగా ఆ సీన్ మొత్తం పెయింటింగ్ చేసే అవకాశం వచ్చింది. చాలా ఆనందంగా ఆ కార్యక్రమాన్ని కళ్లకు కట్టినట్టుగా చిత్రించి, ఇచ్చాను. కాలేజీ రోజుల్లోనే తొమ్మిది నెలల పాటు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకున్నాను. యువతకు మోటివేషనల్ స్పీచ్లు ఇస్తుంటాను. షీ టీమ్ వారు ‘షీ ఫర్ హర్’ అవార్డు ఇచ్చారు. నాన్న సురేందర్ కరోనా సమయంలో చనిపోయారు. అమ్మ గృహిణి. తమ్ముడు శివప్రసాద్ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. గ్రామీణ నేపథ్యం గల కుటుంబమే మాది. నా కళకు సపోర్ట్ చేసేవారుంటే మరెన్నో విజయాలు అందుకోవచ్చు’ అంటూ తెలిపింది ఈ హార్టిస్ట్.– నిర్మలారెడ్డి -
తెల్లారితే పెళ్లి.. అంతలోనే మరణం
యాదాద్రి భువనగిరి జిల్లా: కాసేపట్లో పెళ్లి జరగాల్సిన ఇంట... నవ వరుడి ఆకస్మిక మరణంతో విషాదం చోటు చేసుకుంది. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. కక్కిరేణి గ్రామానికి చెందిన కన్నెబోయిన యాదయ్య, అంజమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు నవీన్ యాదవ్ (24) అలియాస్ గురుకి ఇటీవలే బంధువుల అమ్మాయితో వివాహం ఖాయం కాగా.. గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. బుధవారం ఉదయం ఎప్పట్లాగే నవీన్ తమ వ్యవసాయబావి వద్ద కోళ్లఫారంలో కోళ్లకు దాణా పెట్టేందుకు వెళ్లాడు. పెండ్లి కొడుకును చేసే సమయం అవుతున్నా నవీన్యాదవ్ ఇంటికి రాకపోవడంతో అతడి సోదరుడు కోళ్లఫారం వద్దకు వెళ్లాడు. అక్కడ నవీన్యాదవ్ విగతజీవిగా పడి ఉన్నాడు. నవీన్ మృతికి కారణాలు తెలియరాలేదు. అతని అంత్యక్రియలు బుధవారం సాయంత్రం పూర్తి చేశారు. -
యాదగిరి గుట్ట పులిహోర ప్రసాదంలో ఎలుక!
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో తయారు చేసే పులిహోర ప్రసాదంలో ఎలుక వచ్చినట్లు సోష ల్ మీడియాలో శుక్రవారం చక్కర్లు కొట్టింది. ఓ కుటుంబానికి చెందిన భక్తులు శుక్రవారం ఉదయం శ్రీస్వామి వారిని దర్శించుకొని, అక్కడే ఉన్న ప్రసాద విక్రయ శాలలో లడ్డూ, పులిహోర ప్రసాదం కొనుగోలు చేశారు. ఆ ప్రసాదాన్ని మొదటి ఘాట్ రోడ్డులో కూర్చుని తింటున్న క్రమంలో.. చనిపోయిన ఎలుక పులి హోరలో ప్రత్యక్షమైంది. దీంతో కంగుతిన్న భక్తు లు, వెంటనే ఆలయాధికారుల వద్దకు తీసు కెళ్లారు. భక్తులను ఆలయ అధికారులు సము దాయించి, వేరే పులిహోర ప్రసాదం అందజేసి, అక్కడి నుంచి పంపించారు. ఈ విషయాన్ని ప్రసాదం సెక్షన్ అధికారి అశోక్ కుమార్ను వివరణ కోరగా.. పులిహోర ప్రసాదంలో ఎలు క వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విష యాన్ని ఈవో దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. -
‘రాజ్ భవన్ను వెల్లంకికి తీసుకొచ్చిన మహాన్నత వ్యక్తి విఠలాచార్యులు’
సాక్షి, యాదాద్రి భువనగిరి: కూరెళ్ల విఠలాచార్యా గ్రంథాలయానికి రూ.10లక్షల 63 వేల రూపాయలు, 8వేల పుస్తకాలు, వెయ్యి నోట్ బుక్స్ డొనెట్ చేస్తానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో నిర్మించిన గ్రంథాలయ ‘నూతన భవనం’పై అంతస్తులోని ‘సాయి సభా మందిరం’ ను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆచార్య విఠలాచార్యుల గురించి ‘మన్ కి బాత్’ లో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీకి గవర్నర్ తమిళసై కృతజ్ఞతలు తెలిపారు. ‘విఠలాచార్యులు తన ఇంటిని గ్రంథాలయంగా మార్చారు. ఆయన సేవలకు కృతజ్ఞతలు. పుస్తకాల వల్ల విజ్ఞానం పెరుగుతుంది. రాజ్ భవన్ని వెల్లంకికి తీసుకొచ్చిన మహాన్నత వ్యక్తి విఠలాచార్యులు’అని గవర్నర్ తమిళసై విఠలాచార్యులపై ప్రశంసలు కురిపించారు. చదవండి: ఇంటినే గ్రంథాలయం చేసిన విఠలాచార్య -
విద్యార్థుల ఆత్మహత్య ఘటన.. భువనగిరి హాస్టల్ ఎదుట ఉద్రిక్తత
సాక్షి, యాదాద్రి: భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడటంతో ఎస్సీ బాలికల హాస్టల్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. బాలికల బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను హత్య చేశారంటూ బాలికల బంధువులు ఆరోపించారు. హైదరాబాద్లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. స్నేహితులైన వీరిద్దరూ తమను వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థినులు నలుగురు.. పాఠశాల పీఈటీకి ఫిర్యాదు చేశారు. ఆమె హాస్టల్ వార్డెన్ శైలజకు సమాచారం ఇచ్చారు. ఆమె భవ్య, వైష్ణవిలను మందలించడంతో పాటు హాస్టల్లో జూనియర్, సీనియర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతేగాకుండా భవ్య, వైష్ణవిల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. విషయం బయటకి తెలియడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం సాయంత్రం వీరి గదిలో ఉండే ఇతర విద్యార్థినులు ట్యూషన్కి వెళ్లగా .. భవ్య, వైష్ణవి మాత్రం తర్వాత వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. అయితే వారిని తీసుకురావాలని ట్యూషన్ టీచర్ తోటి విద్యార్థినులను గదికి పంపించారు. గదికి వెళ్లిన విద్యార్థినులు తలుపు తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా భవ్య, వైష్ణవి ఫ్యాన్కు పాఠశాల యూనిఫాం చున్నీలతో ఉరి వేసుకుని కన్పించారు. వారు వెంటనే ట్యూషన్ టీచర్ విషయం చెప్పారు. వార్డెన్, ఇతర సిబ్బంది తలుపు బలవంతంగా తీసి ఇద్దర్నీ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మరణించారని వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాలను పోస్ట్మార్టం కోసం మార్చురీకి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. ఇదీ చదవండి: బాలకృష్ణ కక్కుర్తి.. కళ్లు బైర్లు కమ్మేలా.. -
కేటీఆర్ తన భాష మార్చుకోవాలి: కోమటిరెడ్డి
యాదాద్రి భువనగిరి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడని ఎలా అంటావంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లడుతూ.. కాలి గోటికి సరిపోనివాడే మిమ్మల్ని( కేసీఆర్) ఫామ్ హౌలో పెట్టాడా అని విమర్శించారు. కేటీఆర్ తన భాష మార్చుకోవాలని హితవు పలికారు. కాలిగోటికి సరిపోని రేవంత్ రెడ్డే మిమ్మల్ని తొక్కితే ఒక్కొక్కరు 50-60 వేల ఓట్లతో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసేదే చెప్తది మీలాగా పూటకో మాట చెప్పదని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ నుంచి ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా గెలిచి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యాడని తెలిపారు.కేసీఆర్ యాదాద్రి నుంచి తన ఫామ్ హౌస్కు పోతుంటే వాసాలమర్రిలో శ్మశానాలు అడ్డంగా ఉన్నావని గ్రామాన్ని దత్త తీసుకొని వదిలేశాడని మండిపడ్డారు. చదవండి: 24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై పిటిషన్లు.. కేటీఆర్, హరీశ్ విజయంపై కూడా -
కీచక టీచర్.. పదో తరగతి విద్యార్ధినికి అసభ్యకర మెసెజ్లు
సాక్షి, యాదాద్రి : విద్యార్థులను మంచి మార్గంలో నడిపించాల్సిన గురువే తప్పు బాట పట్టాడు. విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే బుద్ధితక్కువ పనులు చేస్తూ కీచకుడిలా మారాడు. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పదో తరగతి విద్యార్థిని టీచరల్ వేధించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది భువనగిరి పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్లో సైన్స్ ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్ 10వ తరగతి విద్యార్థినికి ఫోన్లో అసభ్య మెసేజ్లు పంపుతున్నాడు. గత కొన్ని నెలలుగా అతడి వేధింపులు ఎక్కువ కావటంతో విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులు బుధవారం పాఠశాలకు వచ్చి స్కూల్ యాజమాన్యంపై విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఉపాధ్యాయుడిని చితకబాదారు. అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా బాలికపై వేధింపులకు పాల్పడిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఈస్ట్ కోస్ట్ ట్రైన్లో పొగలు వచ్చాయి. దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులుట్రైన్ దిగి పరుగులు తీశారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న రైలులో వంగపల్లి వద్దకు రాగానే పొగలు రావడాన్ని గుర్తించారు. ఎయిర్ పైప్ పగిలిపోవడంతో పొగలు వచ్చినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు. వెంటనే సిబ్బంది ఎయిర్ పైప్కు మరమ్మత్తులు చేసి రైలును పంపించారు. ప్రమాదం ఏమీ జరగకపోవడంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: ఈయన ఓటేశారు.. ఆ తర్వాత ఏమన్నారంటే.. -
కాంగ్రెస్ నేస్తం కాదు.. భస్మాసుర హస్తం
సాక్షి, యాదాద్రి, మిర్యాలగూడ, ఎల్బీనగర్/మన్సూరాబాద్: ‘కాంగ్రెస్ నేస్తం కాదు.. భస్మాసుర హస్తం’అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని 55 సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఇవ్వమనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, వలి గొండ, నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్షో, కార్నర్ మీటింగ్లలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ రావడం లేదంటున్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. కరెంట్ వైర్లు పట్టుకుంటే రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగుకు అర్ధరాత్రి కరెంట్ ఇస్తే భార్యాపిల్లలను వదిలి పాములు, తేళ్లు, విష పురుగుల భయంతో పొలానికి మోటారు పెట్టడాని కి వెళ్లేవారని చెప్పారు. చీకట్లో కరెంట్ షాక్కు గురై అనేక మంది రైతన్నలు ప్రాణాలు వదిలారని.. ఆ రైతుల ఉసురు తగిలే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైందన్నారు. వారి హయాంలో విత్తనాలు, ఎరువు ల కోసం రైతులు గంటల కొద్దీ పడిగాపులు కాయా ల్సి వచ్చేదని.. కానీ, స్వరాష్ట్రంలో రైతులకు అలాంటి అవస్థలు లేవన్నారు. తెలంగాణ అభివృద్ధితో పాటు సుభిక్షంగా ఉండాలంటే మరోసారి కేసీఆర్ను గెలిపించాలని కేటీఆర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాహుల్గాందీకి వ్యవసాయం తెలియదు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాందీకి వ్యవసాయం గురించి తెలియదని, పబ్బులు క్లబ్బులు మాత్రమే తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే పింఛన్ రూ.4 వేలు ఇస్తామని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అందరూ ప్రియమైన ప్రధాని అని అంటున్నారు.. కానీ ప్రధాని మోదీ పిరమైన ప్రధానిగా మారారని ఎద్దేవా చేశారు. బీజేపికి ఓట్లు వేస్తే మూసీలో వేసినట్లే అన్నారు. టీఎస్పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి జాబ్ కేలెండర్ను విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎల్బీనగర్ అభ్యర్థి దేవిరెడ్డి సుదీర్రెడ్డికి మద్దతుగా ఎల్బీనగర్లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి రోడ్ షో నిర్వహించారు. మన్సూరాబాద్, బీఎస్రెడ్డినగర్ చౌరస్తాలలో మంత్రి మాట్లాడుతూ, టీఎస్పీఎస్సీలోని తప్పులను సవరించి శాశ్వత ప్రతిపాదికన ఉద్యోగులను నియమిస్తామన్నారు. కొత్తపేట ప్రూట్మార్కెట్ స్థలంలో అధునాతన వెయ్యి పడకల టిమ్స్ హాస్పిటల్ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వస్తామని కలలు కంటూ సీఎం కుర్చీ కోసం 11 మంది కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి అన్యాయం అయ్యారని, మళ్లీ అలాంటి తప్పు చేయవద్దని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలపై కేటీఆర్ పరుష పదజాలం ప్రతిపక్ష పార్టీల నేతలపై కేటీఆర్ నిప్పులు చెరి గారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో రోడ్షో సందర్భంగా.. ‘ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎక్కడ, ఇంటికో ఉద్యోగం ఎక్కడ, కేజీ టు పీజీ ఉచిత విద్య ఎక్కడ’అని కొందరు యువకులు ప్లకార్డులు పట్టుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన కేటీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘55 ఏళ్లు పరిపాలించిన వాళ్లు ఏం పీకారు. అడగడానికి ఇజ్జత్ లేదు, మానం లేదు. ఆ సన్నాసులు అడుగుతున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని, వీపు పగులగొట్టే వాళ్లు లేకనా’అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. -
భువనగిరి ప్రజా ఆశీర్వాద సభలో అపశ్రుతి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో అపశ్రుతి నెలకొంది. సభకు హాజరైన కార్యకర్తకు గుండెపోటు రావడంతో.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మరణించినట్లు ప్రకటించారు. మృతుడిని పోచంపల్లి మండలం జూలూరుకు చెందిన సత్తయ్యగా గుర్తించారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి భువనగిరి వేదిక సిద్ధమైంది. కాసేపట్లో భువనగిరి ప్రభుత్వ కాలేజీ ఆవరణలో జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పైలా శేఖర్ రెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు.ఇప్పటికే సభా స్థలికి వేలాది మంది కార్యకర్తలు చేరుకున్నారు. పాటలు, నృత్యాలతో కళాకారులు హోరెత్తిస్తున్నారు. చదవండి: అప్పట్లో జనగామను చూసి ఏడ్చా : ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ -
యాదాద్రిలో నిబంధనలకు తిలోదకాలు
నల్గొండ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిబంధనలకు అధికారులే తిలోదకాలు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాదాద్రి కొండపై ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 5 గంటల వరకు ఆలయంలో ఏర్పాటు చేసిన బ్రేక్ దర్శనాలు ఉత్తర రాజగోపురం నుంచి ప్రధానాలయంలోకి భక్తులను అధికారులు అనుమతిస్తున్నారు. టికెట్ ఉన్న వారినే ర్యాంప్ పైనుంచి బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు. కానీ, ఆలయంలో విధులు నిర్వహించే ఓ అధికారి తనకు తెలిసిన వ్యక్తులు బుధవారం బ్రేక్ దర్శనం సమయంలో వచ్చారు. దీంతో అధికారి వద్ద పని చేసే సిబ్బంది వారిని నేరుగా లిఫ్టు మార్గంలో ప్రధానాలయానికి చేరుకొని, పశ్చిమ రాజగోపురం నుంచి నేరుగా ఆలయంలోకి తీసుకెళ్లారు. దీనిని చూసిన భక్తులు కొందరు అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేక్ దర్శనం కొనుగోలు చేసే భక్తులు ఉత్తర రాజగోపురం నుంచి పోలీసులు తనిఖీలు చేసిన తరువాతనే ఆలయంలోకి పంపిస్తున్నారు. కానీ, అధికారికి తెలిసిన వారు వస్తే నేరుగా ఎగ్జిట్ నుంచి దారి నుంచి పంపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ పోలీసులను అడిగితే.. ఓ ఏఈవో అధికారికి తెలిసిన వ్యక్తులు కాబట్టి, ఆయన దగ్గర పని చేసే సిబ్బంది పశ్చిమ గోపురం నుంచి తీసుకెళ్లారని సమాధానం ఇచ్చారు. దీనిని చూసిన ఇతర సిబ్బంది భక్తులను బ్రేక్ దర్శనం సమయంలో పశ్చిమ రాజగోపురం నుంచి దర్శనానికి వెళ్లారు. -
యాదాద్రి భువనగిరి: మృతదేహాన్ని కొరికేసిన ఎలుకలు!
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చురీలో ఉన్న ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్ (38) కుటుంబం 2016లో భువనగిరికి వలస వచ్చింది. రవికుమార్కు వివాహం జరగా, ఒక కుమార్తె జన్మించింది. కొంతకాలానికి ఆమె చనిపోవడంతో, రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. ఏడాది క్రితం రెండో భార్య రవికుమార్ను వదిలివెళ్లింది. దీంతో ఆయన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి పట్టణంలోని ప్రగతినగర్లో అద్దెకు ఉంటున్నాడు. డ్రైవర్గా పనిచేస్తున్న రవికుమార్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తగాదా పడుతుండడంతో తల్లిదండ్రులు, పిల్లలు సమీపంలోని తెలిసిన వారి ఇంటికి వెళ్లారు. తిరిగి రాత్రి 11:30 నిమిషాలకు ఇంటికి వచ్చేసరికి రవికుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మార్చురీ గదిలోని ఫ్రీజర్లో కాకుండా బయట భద్రపరిచారు. ఆ ఆనవాళ్లు చూసి.. రవికుమార్ మృతదేహాన్ని చూసేందుకు సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో పాటు బంధువులు మార్చురీకి వచ్చారు. అప్పటికే మృతదేహం ముఖం, చెంపలు, నుదుటిపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఎలుకలు కొరికినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆస్పత్రి సూపరింటెండెంట్ చిన్నానాయక్ తెలిపారు. -
బోరు బావిలో ఇరుక్కున్న మహిళ
బొమ్మలరామారం: వరి నాటు వేసేందుకు వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తూ బోరు బావిలో ఇరుక్కుపోయింది. నాలుగు గంటల పాటు శ్రమించి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం సోలిపేట్ గ్రామానికి చెందిన వ్యవసాయకూలీ అయినబోయిన పద్మ స్థానిక గోలిపల్లి వెంకట్రెడ్డి వ్యవసాయ క్షేత్రం వద్దకు మంగళవారం వరి నాటు వేసేందుకు వెళ్లింది. రైతు వెంకట్రెడ్డి తన పొలం వద్ద గతంలో బోరు బావిని తవ్వించగా.. నీరు పడకపోవడంతో వదిలేశాడు. ఆ భూమిలోనే కొత్తగా మడిని చేసి అందులో వరి నాటు వేయడానికి దుక్కి దున్నాడు. ఆ మడిలో మహిళా కూలీలు నాటు వేస్తుండగా పద్మ కాలు పాత బోరు బావి కేసింగ్లో పడింది. ఆమె నడుము వరకు అందులో కూరుకుపోయింది. అప్రమత్తమైన తోటి కూలీలు, యజమాని ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తన సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గ్రామస్తులు, జేసీబీ సహాయంతో కేసింగ్కు సమాంతరంగా గోతిని తీసి 4గంటల పాటు శ్రమించారు. చివరికి బోరు బావి కేసింగ్ ధ్వంసం చేసి పద్మను కాపాడారు. అనంతరం పద్మను చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. -
ఫలక్నుమా ప్రమాదానికి కారణం ఇదే!
సాక్షి, యాదాద్రి: ఫలక్నుమా ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక అంచనా వేస్తున్నారు రైల్వే అధికారులు. ఈ మేరకు శనివారం బీబీ నగర్కు చేరుకున్న క్లూస్ టీం.. దగ్ధమైన బోగీలను పరిశీలించింది. సమగ్ర దర్యాప్తునకు 12 మంది అధికారులతో కూడిన బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే పంపించగా .. ఈ టీం ఘటనకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఇదిలా ఉంటే.. ఎస్-4 కోచ్ బాత్రూమ్లో ముందుగా మంటలు చెలరేగినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. అయితే దర్యాప్తు పూర్తి అయ్యాకే ప్రమాదం వెనక కారణాలపై స్పష్టత ఇస్తామని క్లూస్ టీం అంటోంది. హౌరా నుంచి సికింద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్ప్రెస్.. శుక్రవారం ఉదయం నల్లగొండ దాటి యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్యలో.. రెండు బోగీల నుంచి దట్టమైన పొగలు రావడం ప్రారంభమైంది. అది గమనించి కొందరు ప్రయాణికులు కేకలు వేయడంతో.. రైలు నిలిచిపోయింది. ఇక ప్రయాణికులంతా దిగిపోయి పెను ప్రమాదం తప్పింది. మంటలు క్రమంగా 6 బోగీలకు వ్యాపించగా.. 5 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే.. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తిట్టిపోస్తున్నారు. అయితే.. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ప్రమాద కారణాలపై సందేహాలు ఇంకా నివృత్తి కావాల్సి ఉంది. క్లూస్ టీం చెబుతున్నట్లు.. షార్ట్సర్క్యూటేనా, ప్రయాణికుల్లో ఎవరిదైనా నిర్లక్ష్యమా, కుట్రకోణం ఏమైనా ఉందా, రైలు నిర్వహణ సరిగా లేదా.. అనేది స్పష్టత రావాల్సి ఉంది. -
గ్రూప్-4 ఎగ్జామ్: అభ్యర్థి కొంపముంచిన గూగుల్ మ్యాప్
సాక్షి, యాదాద్రి: తెలంగాణలో టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-4 పరీక్షా ప్రశాంతంగా కొనసాగుతోంది. తొమ్మిదిన్నర లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్ -1 పరీక్ష మొదలవగా పరీక్ష ప్రారంభానికి 15 నిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసేశారు.. 9.45 తర్వాత అభ్యర్థులు ఎవరిని లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆలస్యంగా వచ్చిన పలువురిని లోపలికి అనుతించకపోవడంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ అభ్యర్థిని గూగుల్ మ్యాప్ కొంపముంచింది. జిల్లాకు చెందిన శశిధర్ అనే అభ్యర్థికి చౌటుప్పల్లోని కృష్ణవేణి స్కూల్లో సెంటర్ పడింది. గూగుల్ మ్యాప్ ద్వారా కృష్ణవేణి స్కూల్ లొకేషన్ సెట్ చేసుకోగా.. అది పాత స్కూల్ అడ్రస్ వద్దకు తీసుకెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాకా పాఠశాలను మరోచోటుకు మర్చారని తెలియండంతో హుటాహుటిన అసలు కేంద్రం వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో అధికారులు ఎగ్జామ్ రాసేందుకు అనుమతించలేదు. చదవండి: Balagam Ts Group 4 Question: బలగం సినిమాపై గ్రూప్-4 పరీక్షలో అడిగిన ప్రశ్న ఇదే -
యాదాద్రి జిల్లా రాయగిరి రైతులకు సంకెళ్లు
సాక్షి, యాదాద్రి భువనగిరి : యాదాద్రి జిల్లా రాయగిరి ఆర్ఆర్ఆర్ రైతులకు పోలీసులు సంకెళ్లు వేశారు. రైతులకు బేడీలు వేసి భువనగిరి కోర్టుకు తీసుకెళ్లారు. 14 రోజుల రిమాండ్ పూర్తికావడంతో రైతులను నల్గొండ జైలు నుంచి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పందగా మారింది.నలుగురు రైతులను కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంగా సంకెళ్లు వేయడంపై రాయగిరి ట్రిపుల్ ఆర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం కొట్లాడితే సంకెళ్లు వేస్తారా అని నిలదీశారు రైతులకు సంకెళ్లు వేయడం పట్ల కాంగ్రెస్, బీజేపీ, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా గత నెల 30న ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని యాదాద్రి కలెక్టరేట్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్కు వచ్చిన మంత్రి జగదీష్రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో ఆరుగురిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. నలుగురిని అదే రోజు అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో చూపించారు. నాలుగో తేదీ వరకు భువనగిరి జైళ్లో ఉంచిన పోలీసులు.. రాజకీయ నేతల పర్యటనలు, ఇతర కారణాలతో రాయగిరి రైతులను నల్గొండ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బాధితులు పిటిషన్లు దాఖలు చేయగా.. నలుగురికి బెయిల్ మంజూరు అయ్యింది. ఇదే క్రమంలో 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ ముగియడంతో మరోసారి వారిని కోర్టుకు తీసుకొచ్చారు. ఇప్పటికే బెయిల్ మంజూరు అయినందున కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. అనంతరం బెయిల్పై బయటకు రానున్నారు రైతులు. చదవండి: రంగంలోకి డీకే శివకుమార్.. ట్రబుల్ షూటర్తో రేవంత్ రెడ్డి భేటీ -
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది
-
యాదాద్రి భువనగిరి జిల్లా భీమనపల్లిలో కల్తీ పాల కలకలం
-
వేగంగా వెళ్తున్న బస్సులో కుదుపులు.. డోర్ నుంచి కిందపడటంతో..
సాక్షి, భువనగిరి: మమ్మీ బైబై.. అంటూ స్కూల్కు వెళ్లిన చిన్నారి కానిరాని లోకాలకు వెళ్లిపోయాడు. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి చిన్నారి మృతికి కారణమయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలంలోని హైదర్పూర్ గ్రామానికి చెందిన వడ్డేమోని శ్రీనివాస్, రాణి దంపతులకు మల్లికార్జున్, అభిలాష్(8) ఇద్దరు కుమారులతో పాటు కుమార్తె వర్షిత ఉన్నారు. వీరంతా మండల కేంద్రంలోని లిటిల్ఫ్లవర్ స్కూల్లో చదువుతున్నారు. మల్లికార్జున్ 5వ తరగతి, అభిలాష్ ఒకట తరగతి, వర్షిత ఎల్కేజీ చదువుతుంది. ఉదయం అందరూ రెడీ అయి స్కూల్కు వెళ్లారు. ఒంటిపూట బడులు కావడంతో స్కూల్ వదిలిన తరువాత తిరిగి స్కూల్ బస్సు ఎక్కి ఇంటికి బయలుదేరారు. వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి జారి.. స్కూల్ నుంచి బయలుదేరిన బస్సు.. ఆయా గ్రామాలలో పిల్లలను దింపుతూ చివరగా హైదర్పూర్కు వెళ్తుంది. బస్సులో 10 మంది వరకు విద్యార్థులున్నారు. ఈ క్రమంలో భీమనపల్లి గ్రామం దాటిన తరువాత బస్సు డ్రైవర్ జింకల రాము అతివేగంగా బస్సును నడిపాడు. గ్రామశివారులోని చెరువు దాటిన తరువాత మూలమలుపు వద్ద కుదుపునకు బస్సులో ఉన్న అభిలాష్ కదులుతున్న బస్సులోంచి జారి కింద పడగా, బస్సు వెనుక చక్రాలు అతనిపై నుంచి వెళ్లింది. విద్యార్థి బస్సులోంచి పడిపోయిన విషయాన్ని డ్రైవర్ కనీసం చూడకుండానే వేగంగా అలానే ముందుకు వెళ్తున్నాడు. ఇదే సమయంలో భీమనపల్లి గ్రామానికి చెందిన ముంత కృష్ణ అనే వ్యక్తి బైక్పై వస్తూ విద్యార్థి కిందపడిపోవడాన్ని గమనించి కొద్దిదూరం వెళ్లిన బస్సును ఆపాడు. అందరూ కలిసి అక్కడికి వెళ్లి చూడగా అభిలాష్ రక్తపుమడుగులో విగతజీవిగా మారాడు. బస్సు డోర్కు లాక్ ఉండి ఉంటే... స్కూల్ బస్సు డోర్కు లాక్ సరిగా లేని కారణంగా బస్సులో ఉన్న వృద్ధురాలైన ఆయా పోశమ్మ డోర్ లాక్ వేయలేదు. మరోవైపు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును వేగంగా నడపడం వల్ల నిండుప్రాణం బలైపోయింది. విషయం తెలుసుకొన్న తల్లిదండ్రులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని విగతజీవిగా పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని చూసి గుండెవిసేలా రోదించారు. సమాచారం అందుకొన్న ఎస్ఐ సైదిరెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్ రామును అదుపులోకి తీసుకొన్నారు. అలాగే బస్సును పోలీస్స్టేషన్కు తరలించారు. మృతుడి తండ్రి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు షోకాజ్ నోటీసులు లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు చెందిన బస్సు నుంచి అభిలాష్(6) అనే విద్యార్థి కిందిపడి మృతిచెందిన విషయంపై ఎంఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు తదుపరి చర్యల కోసం షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు భువనగిరి డీఈవో కె నారాయణరెడ్డి తెలిపారు. -
Cheetah Crash: లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి వీరమరణం
సాక్షి, యాదాద్రి: అరుణాచల్ ప్రదేశ్లో ఇవాళ భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ ‘చీతా’ కూలి ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అయితే అమరుడైన లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి తెలంగాణవాసి కావడం గమనార్హం. దీంతో ఆయన స్వస్థలం బొమ్మలరామారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కల్నల్ వీవీబీ రెడ్డి స్వస్థలం యాదాద్రి జిల్లా బొమ్మలరామారం. ఆయన పూర్తి పేరు ఉప్పల వినయ్ భాను రెడ్డి. తల్లిదండ్రులు నర్సింహ్మారెడ్డి, విజయలక్ష్మీలు. అయితే.. మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరిలో ఆయన కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన సతీమణి స్పందన కూడా ఆర్మీలో డెంటల్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చీతా ఎయిర్క్రాఫ్ట్.. సంగే గ్రామం నుంచి అసోం సోనిట్పూర్ జిల్లా మిస్సమారి వైపు వెళ్లాల్సి ఉంది. అయితే పావు గంటకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ కామెంగ్ జిల్లా మండాలా వద్ద అది ప్రమాదానికి గురైనట్లు ఆర్మీ వర్గాలు గుర్తించాయి. అయితే.. ఆపై అందులో ఉన్న పైలట్ లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి, కో పైలట్ మేజర్ జయంత్ ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. చివరకు వాళ్లు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించింది ఆర్మీ. -
భువనగిరిలో బయటపడిన చారిత్రక సంపద
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో శనివారం చారిత్రక సంపద వెలుగు చూసింది. పట్టణంలోని ఖిలా కందకం వద్ద అభివృద్ధి పనుల కోసం చేపట్టిన తవ్వకాల్లో పురాతన కాలంనాటి దేవాలయం ఆనవాళ్లు బయటపడ్డాయి. పదిరోజులుగా కందకం వద్ద ఉన్న మట్టికుప్పలను చదును చేసే పనులు జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి కందకం ప్రాంతంలో ఉన్న మట్టిదిబ్బలను చదును చేసి పార్క్గా అభివృద్ధి చేయడానికి సంకల్పించి, అందులో భాగంగా పనులు చేపట్టారు. అయితే ఇప్పటికే గాంధీనగర్లో మురికికాలువ కోసం జరిపిన తవ్వకాల్లో సంస్కృత లిపి ఉన్న శిలాశాసనం బయటపడింది. కందకం పక్కన గల కోటగడ్డ కింద దేవాలయాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు జరిపిన కోటగడ్డ తవ్వకాల్లో బైరవుడి విగ్రహం బయటపడింది. ప్రస్తుతం తవ్వకాల్లో బయటపడ్డ స్తంభాలు, యాలీ పిల్లర్లు రాష్ట్ర కూటులు, కల్యాణ చాళుక్యుల రాజుల కాలం నాటివని చరిత్ర పరిశోధకుడు శ్రీ రామోజు హరగోపాల్ అంటున్నారు. కోటగడ్డ కింద దేవాలయాల సముదాయం ఉంటుందని భావిస్తున్నారు. కందకం వద్ద బయటపడ్డ పిల్లర్ల అనవాళ్ల ప్రకారం ఇక్కడ త్రికూటాలయం, లేక ఏక కూట ఆలయం ఉంటుందని హరగోపాల్ అన్నారు. ఇది 16 లేదా అంతకంటే ఎక్కువ రాతి పిల్లర్లతో నిర్మించిన అర్ధమంటపమై ఉంటుందని చెప్పారు. భువనగిరి కుమ్మరివాడలో గతంలో సింహయాలీ పిల్లర్కు చెందిన ముక్క దొరికిందని చెప్పారు. బ్రాహ్మణ వాడ, కుమ్మరివాడ మొదలు ఈ ప్రాంతంలో కోటగడ్డ కింద ఉన్న చారిత్రక సంపదను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా, పోలీసులు ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని పనులు నిలిపివేశారు. ఈ మేరకు ఆర్కియాలజీ, రెవెన్యూ శాఖలకు సమాచారం ఇచ్చినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ చెప్పారు. ఆదివారం ఆయా శాఖల అధికారులు వచ్చి పరిశీలిస్తారన్నారు. -
బండకు టాటా.. కట్టెల వేట
రామన్నపేట: గ్యాస్ ధర భారీగా పెరిగిపోవడంతో పల్లెల్లో కట్టెలపొయ్యిలపై వంట మొదలైంది.. పొయ్యిల నుంచి వెలువడే పొగ ఆరోగ్యానికి హానికరంగా మారింది. గ్యాస్ ధర అమాంతం రూ.1,100 దాటడంతో గ్రామీణులు కట్టెల పొయ్యిల వాడకం మొదలుపెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో మంగళవారం కొందరు మహిళలు అడవి నుంచి తలపై కట్టెలమోపులు తీసుకొస్తుండడం కనిపించింది. వారిని వాకబు చేయగా గ్యాస్ ధర పెరగడంతో వంట చేయడానికి అడవి నుంచి కట్టెలను తీసుకొస్తున్నట్లు వాపోయారు. వారిలో కొందరు స్థానికులు కాగా.. మరికొందరు సంచార జాతులున్నారు. -
రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం
మోటకొండూరు: గణతంత్ర వేడుకల వేళ ఓ రైతు కుటుంబం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.మోటకొండూరుకు చెందిన భూమండ్ల వెంకటేశ్కు భువనగిరి మండలంలోని చీమలకొండూరు రెవెన్యూ పరిధిలో 2.26 ఎకరాల వ్యవ సాయ భూమి ఉంది. అయితే బంట్రోతు నాగరత్నం అనే స్థానికేతర మహిళ ఆ భూమి తమదేనని పట్టా చేసుకోవాలని చూస్తోందంటూ వెంకటేశ్, అతడి భార్య శోభ, కుమారుడు శ్రీకాంత్ గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. మండల కేంద్రంలో నివాసం ఉండని నాగరత్నంకు స్థానిక రెవెన్యూ అధికారులు ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. రికార్డులు పరిశీలించాకే సర్టిఫికెట్ ఇచ్చాం: తహసీల్దార్ జ్యోతి అక్కడే ఉన్న మోటకొండూరు తహసీల్దార్ జ్యోతి బాధిత రైతుతో మాట్లా డుతూ ఫ్యామిలీ సర్టిఫికెట్ కావాలని గత నెలలో నాగరత్నం అర్జీ పెట్టుకుందని, రికార్డులు పరిశీలించగా ఆమె తాత నర్సెట్టి వెంకటస్వామికి చీమలకొండూరులో 1985లో పట్టా భూమి ఉందని గుర్తించి ఆమెకు ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ చేశామని పేర్కొన్నారు. ఆ భూమి భువనగిరి రెవెన్యూ పరిధిలో ఉన్నందున సమస్యను భువనగిరి తహసీల్దార్ కార్యాలయంలో పరిష్కరించుకోవా లని, అవసరమైతే ఆర్డీవోకు ఫిర్యాదు చేసుకోవాలని తహసీల్దార్ సూచించారు. -
సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో ఇళ్లులేవు.. అనుమతులూ లేవు..
సాక్షి, యాదాద్రి: సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామస్తులు పక్కా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులు ఎప్పుడు చేపడతారా అని రెండేళ్లుగా వేచి ఉన్నామని.. ఇప్పటికీ ఇళ్లు, మౌలిక వసతుల నిర్మాణం ప్రారంభమే కాలేదని అంటున్నారు. కనీసం సొంతంగా కట్టుకునే పర్మిషన్లూ ఇవ్వడం లేదని చెప్తున్నారు. పాత, సగం కూలిపోయిన ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వాపోతున్నారు. వెంటనే ఇళ్లు కట్టించి ఇవ్వాలని, లేకుంటే సొంతంగా కట్టుకునేందుకు అనుమతులైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులతో కలిసి ఇటీవల భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. రెండేళ్ల క్రితం దత్తత తీసుకున్న సీఎం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు 2020 నవంబర్ 1న సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2021 జూన్ 22న గ్రామసభ నిర్వహించి, స్థానికులతో సహపంక్తి భోజనం చేశారు. బంగారు వాసాలమర్రిగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. అంతకుముందు జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక భవనాన్ని ప్రారంభించడానికి వాసాలమర్రి మీదుగా వెళ్తున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్ ఎదుట గ్రామస్తులు నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. ఆ విషయం తెలుసుకున్న సీఎం సాయంత్రం తిరుగుప్రయాణంలో గ్రామంలోని రామాలయం వద్ద ఆగి మాట్లాడారు. వాసాలమర్రిని ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి ప్రత్యేకంగా లేఅవుట్ అభివృద్ధి చేసి, ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని ప్రకటించారు. తర్వాత ప్రభుత్వ అధికారులు గ్రామంలో పర్యటించి చేపట్టాల్సిన పనులపై సర్వే చేశారు. రూ.152 కోట్లతో డీపీఆర్ను రూపొందించారు. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. 481 ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక వాసాలమర్రిలో ప్రస్తుతం 103 పక్కా ఇళ్లు, మరో 481 పెంకుటిళ్లు, రేకుల ఇళ్లు, గుడిసెలు ఉన్నాయి. ఈ 481 ఇళ్లను కూల్చివేసి వాటి స్థానంలో పక్కా ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నవారి కోసం జీ ప్లస్ వన్, జీ ప్లస్ టూ పద్ధతిలో ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. అంతర్గత మురుగు కాల్వలు, మంచినీటి ట్యాంకు, పార్కు, ఫంక్షన్హాల్, గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లు, పాఠశాల భవనాలు, పోస్టాఫీస్, మినీ మార్కెట్, సబ్ సెంటర్లను నిర్మించాలని నిర్ణయించారు. గ్రామాన్ని పునర్నిర్మించే క్రమంలో తాత్కాలికంగా ఇళ్లు కూడా నిర్మించాలన్న ఆలోచనకు వచ్చారు. కానీ ఇవేవీ ముందుకుపడలేదు. వెంటనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి గ్రామంలో 481 పెంకుటిళ్లు కూల్చివేసి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. రెండేళ్లు అవుతోంది. ఇళ్లను త్వరగా పూర్తి చేయాలనడమేగానీ నిర్మాణం ప్రారంభం కావడం లేదు. గ్రామ అభివృద్ధి కోసం రూ.152 కోట్లతో డీపీఆర్ పంపించారు. నిధులు రాలేదు. లేఅవుట్ కాలేదు. 50 ఇళ్లు కూలిపోయాయి. నా ఇల్లు కూడా సగం కూలిపోయింది. కొత్తగా కట్టుకుందామంటే పర్మిషన్ లేదు. వెంటనే ఇళ్లు కట్టించాలని, లేకుంటే కట్టుకునే పర్మిషన్ అయినా ఇప్పించాలని గ్రామస్తులు పంచాయతీపై ఒత్తిడి తెస్తున్నారు. ఏదైనా సీఎం సార్ నిర్ణయం తీసుకోవాలని అధికారులు అంటున్నారు. మూడు విడుతలుగా నిధులు ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో మౌలిక వసతుల కోసం రూ.58 కోట్లతో మరో డీపీఆర్ పంపించామని కలెక్టర్ చెప్తున్నారు. త్వరగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. – పోగుల ఆంజనేయులు, సర్పంచ్, వాసాలమర్రి కొత్త నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వలేకపోతున్నాం నూతన భవన నిర్మాణాలకు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇవ్వలేకపోతున్నాం. గ్రామంలో చాలా మంది పేదలు ఉన్నారు. వానాకాలంలో పాత ఇళ్లు కొన్ని కూలిపోయాయి. కొందరు గుడిసెలలో జీవిస్తున్నారు. ఇటు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వకుండా.. మరోవైపు సొంత డబ్బులతో కట్టుకుందామనుకున్నా అనుమతులు ఇవ్వక పోవడంతో ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. – పలుగుల మధు, ఉప సర్పంచ్ -
పరిహారం కోసం పాదయాత్ర
సాక్షి, యాదాద్రి: పరిహారం కోసం వెయ్యి మంది రైతులు రోడ్డెక్కారు. పాదయాత్రగా వచ్చి అధికారులకు మొర పెట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వా పూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బీఎన్ తిమ్మాపూర్ రైతులు, ప్రజలు 52 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అధికారుల్లో చలనం లేకపోవడంతో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రాజెక్టులో మునిగిపోతున్న భూములకు, ఇళ్లకు పరిహారం, పునరావాసం, రిహాబిలిటే షన్ అండ్ రీసెటిల్మెంట్(ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ డబ్బు లను ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. -
నరేశ్ హత్య కేసులో సంచలన తీర్పు
సాక్షి, యాదాద్రి: జిల్లాలో ఐదేళ్ల కిందటి నాటి అంబోజు నరేశ్ హత్య కేసులో సంచలన తీర్పు వెల్లడించింది భువనగిరి కోర్టు. సరైన ఆధారాలు లేనందున కేసును కొట్టేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, బంధువు నల్ల సత్తిరెడ్డిలను నిర్దోషులుగా ప్రకటించింది భువనగిరి కోర్టు. ఐదు సంవత్సరాల కిందట.. 2017 మే నెలలో నరేష్ హత్యకు(పరువు హత్య?) గురి కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవంటూ తాజాగా ఈ కేసును కొట్టేశారు జడ్జి బాల భాస్కర్. దీంతో సత్తిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఇక తీర్పుపై నరేశ్ తండ్రి వెంకటయ్య అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు. భువనగిరి కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామని, న్యాయం జరిగేంత వరకు పోరాడతానని, తన పాతికేళ్ల కొడుకును కోల్పోయానంటూ ఆవేదనగా మాట్లాడారాయన. కులాంతర వివాహం చేసుకున్న అంబోజు నరేశ్ ఘోరంగా హత్యకు గురయ్యాడు. అది స్వాతి తండ్రి పనేనన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కూడా జరిగింది. ఆపై స్వాతి కూడా ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ ప్రేమకథ విషాదాంతమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్ కాలేజీ రోజుల్లో.. లింగరాజుపల్లికి చెందిన స్వాతితో ప్రేమలో పడ్డాడు. కులాలు వేరు కావడంతో స్వాతి ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. దీంతో ముంబైలో ఉంటున్న నరేష్ తన తల్లిదండ్రుల వద్దకు స్వాతిని తీసుకెళ్లి కులాంతర వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసి.. భువనగిరికి రావాలని, ఇక్కడ వివాహం జరిపిస్తానని ప్రేమతో కూతురిని నమ్మించాడు శ్రీనివాసరెడ్డి. అలా వచ్చిన స్వాతి-నరేశ్లు వేరయ్యారు. నరేష్ ఏమయ్యాడో.. ఆ తర్వాత జాడ లేకుండా పోయాడు. దీంతో అతని తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. కోర్టు జూన్ 1 కల్లా నరేష్ ఎక్కడున్నా కోర్టులో హాజరుపరచమని పోలీసులను ఆదేశించింది. కాగా నరేష్ హతమార్చినట్టు పోలీసు ఇంటరాగేషన్లో స్వాతి తండ్రి అంగీకరించాడు. బంధువు సాయంతో నరేశ్ను స్వాతికి చెందిన పొలంలోనే చంపి, దహనం చేసినట్టు ఒప్పుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మరణించాడని తేలడంతో వాళ్లు గుండెలు పలిగేలా రోదించారు. ఆపై మే 16వ తేదీన నరేశ్ ప్రేయసి స్వాతి కూడా బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమె మృతి కేసులోనూ పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వీళ్లే చేశారనేందుకు సాక్ష్యాలేవి? నరేశ్ హత్య కేసులో నిందితులుగా స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి ఏ1గా,ఆయన బంధువు నల్ల సత్తిరెడ్డి ఏ2గా ఉన్నారు. పోలీసుల ఇంటరాగేషన్లో నేరం అంగీకరించారు కూడా. అయితే.. కేసు విషయమై న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్,డిఫెన్స్ తుది వాదనలు ఈనెల 9న పూర్తి కావడంతో బుధవారం కోర్టు నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని నిర్దోషిగా తీర్పునిచ్చింది. 2017లో జరిగిన ఈ కేసులో 2018 జులై 31న కేసు అభియోగపత్రాలు పోలీసులు న్యాయస్థానంలో దాఖలు చేశారు.23 మంది సాక్షుల విచారణతోపాటు భౌతిక ఆధారాలు,ఫోరెన్సిక్ నివేదికలు పోలీసులు కోర్టుకు సమర్పించారు. అయితే.. సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులే హత్య చేశారనేందుకు సరైన సాక్ష్యాలు, ఆధారాలు లేని కారణంగా నిర్దోషులుగా ప్రకటిస్తూ భువనరిగి కోర్టు తీర్పును వెలువరించింది. పోలీసుల దర్యాప్తులో.. 2017 మే2వ తేదీన ముంబాయి నుంచి స్వాతితో కలిసి వచ్చిన నరేశ్ భువనగిరి బస్టాండ్లో భార్యను ఆమె తండ్రి తుమ్మల శ్రీనివాస్రెడ్డికి అప్పగించాడు. అనంతరం అక్కడి నుంచి శ్రీనివాస్రెడ్డి తన కూతురు తీసుకుని స్వగ్రామమైన ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లికి వెళ్లారు. ఆ వెనకాలే నరేశ్ మోటార్ వాహనంపై లింగరాజుపల్లికి వెళ్లాడు. శ్రీనివాస్రెడ్డి ఇంటి సమీపంలో నరేశ్, మరో వ్యక్తితో కలిసి మోటార్ సైకిల్పై కనిపించాడు. దీంతో వీరిని గుర్తించిన శ్రీనివాస్రెడ్డి తన పొలంలోకి తీసుకుపోయారు. రాత్రి సుమారు 10.30గంటల సమయంలో అక్కడ మాట్లాడుతుండగానే వెనుక నుంచి తలపై రాడ్తో గట్టిగా కొట్టడంతో నరేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే నరేశ్ను తగులబెట్టిన శ్రీనివాస్రెడ్డి బూడిదను, అస్థికలను తీసుకువెళ్లి మూసిలో కలిపారు. దీంతోపాటు స్వాతి ఆత్మహత్యకు ముందు తీసిన వీడియోపై పోలీసులు విచారణ చేపట్టారు. మరుగుదొడ్డిలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసిందని ప్రచారం జరిగింది. అయితే సెల్ఫీ కాదని, అది వీడియోగా పోలీసులు భావిస్తున్నా. ఆ సెల్ఫీని స్వాతి స్వయంగా తీసిందా, లేక మరొకరి సమక్షంలో తీసిందా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగింది కూడా. -
గ్రూప్–1 మెయిన్స్కు తండ్రీ తనయుడు
యాదగిరిగుట్ట రూరల్: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి మెయిన్స్కు తండ్రీ కొడుకులు అర్హత సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు ఏలూరు బాలనర్సయ్య (48), ఏలూరు సచిన్ (22) శనివారం విడుదలైన ఫలితాల్లో ఒకేసారి ఈ ఘనత సాధించారు. బాలనర్సయ్య ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. సచిన్ హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటూ గ్రూప్–1కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా తండ్రి ఇంతకుముందే గ్రామంలో సర్పంచ్గా కూడా విధులు నిర్వర్తించారు. ఇద్దరూ ఒకేసారి మెయిన్స్కి అర్హత సాధించడం ఆనందంగా ఉందని బాలనర్సయ్య చెప్పారు. -
ప్రేమోన్మాది వేధింపులకు విద్యార్థిని బలి
భూదాన్పోచంపల్లి: ఓ ప్రేమోన్మాది వేధింపులకు మనస్తాపం చెంది పదో తరగతి విద్యార్థిని ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్పల్లి గ్రామానికి చెందిన ఉప్పునూతల కావ్య(16) చౌటుప్పల్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదోతరగతి చదువుతోంది. కావ్య ఇన్స్టా్రగామ్లో ఇదే గ్రామానికి చెందిన మాచర్ల శివమణి తనను ప్రేమించాలని మెసేజ్లు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో తనను ప్రేమించకపోతే మీ నాన్న, అన్నను చంపేస్తానని, డబ్బులు కూడా కావాలని బెదిరింపులకు గురిచేశాడు. భయపడిన కావ్య ఇటీవల తన సోదరుడు నరేశ్కు విషయం చెప్పింది. దీంతో తన చెల్లెలికి మేసేజ్ పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని శివమణిని నరేశ్ హెచ్చరించాడు. ఇదే క్రమంలో డిసెంబర్ 31న అర్ధరాత్రి నరేశ్, శివమణి మధ్య గొడవ జరిగింది. ఆ రోజు రాత్రి కావ్యకు శివమణి ఫోన్చేసి ‘మీ అన్నను చంపేస్తాను’ అని బెదిరించడంతో ఆమె మనస్తాపం చెంది పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడంతో కోలుకొని ఈ నెల 2న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. మందలించినా మారని తీరు.. ఈ నెల 2న గ్రామంలో ఇరు కుటుంబాల పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు. ఇకపై కావ్య, ఆమె కుటుంబం జోలికి పోకుండా చూసుకోవాలని శివమణి తల్లిదండ్రులకు చెప్పారు. అయినా శివమణి మళ్లీ మెసేజ్లు పెడుతుండటంతో కావ్య కలత చెందింది. బుధవారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె ఫ్యాన్కు చీరతో ఉరేసుకొంది. సాయంత్రం నరేశ్ ఇంటికి వచ్చి చూడగా కావ్య ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. పోలీసులు పోస్ట్మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గురువారం సాయంత్రం కావ్య అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతురాలి తండ్రి కన కయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. కాగా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోచంపల్లిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థినులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. -
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో రోడ్డు ప్రమాదం
-
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీ.. విజయవాడ హైవేపై ప్రమాదం
సాక్షి, యాదాద్రి భువనగిరి: జిల్లాలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి దాటాక రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన రెండు బస్సులు ఒకదానిని మరొకటి ఢీ కొట్టాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. చౌటుప్పల్ మండలం గుండ్లబావి వద్ద హైదరాబాద్-విజయవాడ ఎన్హెచ్-65 పై ఈ ఘటన జరిగింది. రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సులు మైత్రి ట్రావెల్స్, ఆరంజ్ ట్రావెల్స్ బస్సులుగా నిర్ధారణ అయ్యింది. ఓవర్ టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారని ప్రాథమిక విచారణ ద్వారా పోలీసులు వెల్లడించారు. పదహారు మందికి స్వల్ప గాయాలు కాగా, మరో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలై విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లను చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తరలించారు. -
అంతా క్షణాల్లోనే.. రెండు కుటుంబాల్లో అంతులేని శోకం
సాక్షి, గజ్వేల్/జగదేవ్పూర్: వేములవాడ రాజన్న దర్శనం చేసుకొని వస్తున్నామనే సంతోషం.. వారిలో కొద్ది గంటలు కూడా నిలవలేదు. మూలమలుపు దాటేవరకు సజావుగానే సాగిన ప్రయాణానికి మృత్యువు కాపుగాసిందన్న విషయం తెలియకుండానే పైలోకాలకు వెళ్లిపోయారు. అతివేగం ఆరుగురి ప్రాణాలను బలిగొన్నది. రెండు కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. యాదాద్రి–భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన బొల్లు సమ్మయ్య స్టీల్ సామాన్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య స్రవంతి కూడా చేదోడువాదోడుగా ఉంటుంది. వీరికి కూతురు భవ్య, కుమారుడు కార్తీక్ అలియాస్ లోకేష్ ఉన్నారు. అదే గ్రామంలోని మాంటిస్సోరి పాఠశాలలో భవ్య, ఏడో తరగతి, లోకేష్ 5వ తరగతి చదువుతున్నారు. సమ్మయ్య తన కుటుంబ సభ్యులతో పాటు బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన అత్తమామ రాజమణి–బిట్టు వెంకటేష్తో కలిసి రాజన్న దర్శనం చేసుకున్నాడు. మంగళవారం తిరిగి వస్తుండగా, సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల పరిధిలోని మునిగడప వద్ద కాల్వలోకి కారు బోల్తా కొట్టిన ఘటనలో మృత్యువాత పడ్డారు. మూలమలుపు దాటాక.. ప్రమాద ఘటనలో అతివేగం, డ్రైవింగ్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తొంది. గ్రామంలోని ఎల్లమ్మగుడి వద్ద నిజానికి ప్రమాదకరమైన మూలమలుపు ఉంది. సహజంగా అక్కడ ప్రమాదాలు జరగడం పరిపాటి. కానీ ఈ మలుపు దాటిన కొద్ది క్షణాలకే కారు అదుపు తప్పింది. డ్రైవింగ్ చేస్తున్న సమ్మయ్య అజాగ్రత్త వహించాడా? వేరే కారణాలున్నాయా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొండపోచమ్మసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్పై నిర్మించిన కల్వర్టును ఎడమ వైపున ఢీకొట్టిన కారు, అదుపుతప్పి మరింత వేగంతో కుడివైపునకు వెళ్లి అక్కడ మట్టిగడ్డను దాటి కెనాల్లో పడిపోయింది. ఈ క్రమంలో కెనాల్ పైభాగంలో ఉన్న మిషన్ భగీరథ పైప్లైన్ను బలంగా తాకి గుంతలోకి తలకిందులుగా పడిపోయింది. ఆలయాల సందర్శనకు వెళ్లివస్తున్నప్పుడు సహజంగా మధ్యలో ఆగి దావత్లు చేసుకోవడం పరిపాటి. అంతేగాకుండా దైవదర్శనం సందర్భంలో నిద్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవడం చూస్తుంటాం. తాజా ప్రమాదంలో ఈ రెండు కారణాలు కూడా ప్రభావం చూపాయా అనే కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇవే కాకుండా మృతులు ప్రయాణించిన కారు కండిషన్ సక్రమంగా లేకపోవడం, అందులో ఆరుగురు ఇరుకుగా కూర్చోవడం కూడా ప్రమాదానికి మరో కారణంగా భావిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే పారిశుధ్య కార్మికులు గమనించి హుటా హుటిన అక్కడికి చేరుకున్నారు.మృతదేహాలను వెలికి తీయడంలో కీలకంగా వ్యవహరించారు. రోజువారి కూలీలే.. ప్రమాదంలో మృతి చెందిన వెంకటేష్, రాజమణి దంపతులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. కాగా వీరి పూర్వీకులు గ్రామాల్లో భాగవతం ఆడేవారు. వీరు రోజువారి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. రాజమణి గంపలో గాజులు, స్టీల్, ప్లాస్టిక్ సామాన్లు ఇంటింటికి అమ్ముతూ ఉండగా, వెంకటేష్ గ్రామంలో ఎక్కడైన కూలి లభిస్తే వెళ్లేవాడు. లేని పక్షంలో బొమ్మలరామారం మండలంతో పాటు సమీప మండలాల్లో భాగవతం పాటలు పాడుతూ భిక్షాటన చేసేవాడు. అందరితో కలిసిమెలసి ఉండే ఈ దంపతులు ప్రమాదంలో మృతి చెందడంతో మల్యాల గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇంట తీరని శోకం తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడంతో ఆ కుటుంబసభ్యుల బాధ వర్ణణాతీతంగా ఉంది. రాజమణి –వెంకటేష్ దంపతులకు కూతుళ్లు స్రవంతి, విజయ, కొడుకు శ్రీకాంత్ ఉన్నారు. పెద్ద కూతురు స్రవంతి కుటుంబమంతా మృతి చెందగా, విజయకు గోదావరిఖని చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కొడుకు శ్రీకాంత్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. కలిసిరాని సెంటిమెంట్ బీబీనగర్లోని దాసరి కుటంబాలకు చెందిన వారంతా ప్రతీ ఏడాది వారి ఆరాధ్య దైవమైన వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ. రాజన్నను సోమవారం మాత్రమే దర్శించుకోవడం వీరికి సెంటిమెంట్. సమ్మయ్య కుటుంబం ఈ సంవత్సరం కూడా సోమవారమే రాజన్న దర్శనానికి వెళ్లగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషయం వారి బంధువులకు తెలియడంతో బీబీనగర్, బొమ్మలరామారం, మల్యాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఫోన్రాగానే గుండె పగిలింది ‘నిన్న మధ్యాహ్నం తర్వాత మా అమ్మనాన్న, బావ, అక్క పిల్లలతో కలిసి వేములవాడ పోయిండ్రు. మొక్కులు తీర్చుకొని ఇయ్యాల 12 గంటలకు బయలుదేరుతున్నమని నాకు ఫోన్ చేసి చెప్పిండ్రు. సాయంత్రం 4 గంటల తర్వాత జగదేవ్పూర్ పోలీస్స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీవాళ్లకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పడంతో ఒక్కటేసారి గుండె పగిలినట్టయింది’. అంటూ మృతుడు వెంకటేష్ కుమారుడు శ్రీకాంత్ రోదించాడు. తన తండ్రిని గజ్వేల్ ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించే క్రమంలో మాట్లాడారు. (చదవండి: ప్రమాదమా.. తగలబెట్టారా?) -
విశ్వశాంతి స్థాపనకు కృషిచేయాలి
బీబీనగర్: దేశంలోని ఎంతోమంది మహనీయులు విశ్వశాంతి స్థాపనకు పాటుపడ్డారని, వారి బాటలో శాంతిని మరింతగా విస్తరింపజేసేలా అందరూ కృషిచేయాలని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మహదేవ్పురం గ్రామ పరిధిలో నిర్మించిన ఆధ్యాత్మిక శాంతి కేంద్రమైన బ్రహ్మకుమారీస్ భవనంలో సైలెన్స్ రిట్రీట్ సెంటర్ను రాష్ట్రపతి మంగళవారం రాజస్తాన్ నుంచి వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచమంతా ఆధ్యాత్మిక శక్తిగల భారత్ను గురువుగా అంగీకరిస్తుందన్నారు. ప్రజలు శాంతిని, ఆధ్యాత్మికతను, మానవత్వాన్ని అలవర్చుకునే విధంగా బ్రహ్మకుమారీస్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలతోపాటు వివిధ వర్గాల వారిలో ఆధ్యాత్మికత, నైతిక విలువలు పెంపొందించేందుకు సైలెన్స్ రిట్రీట్ సెంటర్ను ఏర్పాటు చేయడం ఆనందదాయకమని అన్నారు. మారుతున్న జీవన శైలిలో మానవుడు ఎన్నో ఒత్తిళ్లకు గురవుతున్నాడని, దాని నుంచి ఉపశమనం పొందేందుకు మెడిటేషన్ టెక్నిక్స్ ఎంతో అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ... జీవితంలో మానసిక మార్పులు, చక్కని మెళకువలు నేర్పించడానికి నిశ్శబ్దం అత్యంత శక్తిమంతంగా పనిచేస్తుందని చెప్పారు. -
నిర్వాసితులకు ఇచ్చేందుకు నిధుల్లేవా?
భువనగిరి: బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని బస్వాపూర్ రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న బీఎన్ తిమ్మాపురం గ్రామస్తులు పరిహారం కోసం ప్రాజెక్టు కట్టపై చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం 26వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారి దీక్షాశిబిరాన్ని ఎంపీ వెంకట్రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ భూ నిర్వాసితులకు ఎంత పరిహారం ఇచ్చారు..? బస్వాపూర్ నిర్వాసితులకు ఎంత చెల్లిస్తున్నారో చె ప్పాలన్నారు. వాస్తు బాగోలేదని రూ.650 కోట్లు ఖ ర్చు చేసి సచివాలయం నిర్మిస్తున్న ప్రభుత్వం వద్ద నిర్వాసితులకు ఇవ్వడానికి డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మంచి మనసుతో నిర్వాసితులకు రూ.350 కోట్లు వెంటనే చెల్లించాలని కోరారు. బస్వాపూర్ ప్రాజెక్టు పేరుతో తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మూసీ నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తూ మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. బస్వాపూర్ నిర్వాసితులకు కొత్త అవార్డు ప్రకటించాలని, వారికి న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. పరిహారంపై హామీ ఇవ్వని పక్షంలో ఈ నెల 27న రిజర్వాయర్ కట్టపై వంటావార్పు చేపడతామని, అందులో తాను పాల్గొంటానని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, పలువురు నిర్వాసితులు కంటతడి పెట్టడంతో వారిని ఆయన ఓదార్చారు. -
ప్రాణాలైనా ఇస్తాం, భూములివ్వం.. రీజనల్ రింగ్ రోడ్డు సర్వేలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో రీజనల్ రింగ్ రోడ్డు కోసం గురువారం చేపట్టిన సర్వేను రైతులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రి క్తత ఏర్పడింది. ‘మా ప్రాణాలైనా ఇస్తాం కానీ, భూములను ఇవ్వబోము’అంటూ రైతులు నినాదాలు చేశారు. సర్వేకు ఒప్పుకోమని అధికారులకు తేల్చిచెప్పారు. దీంతో అధికారులు పెద్ద ఎత్తున పో లీసు బలగాలను దించి ఎక్కడికక్కడ మహిళలు, యువకులు, వృద్ధులను అదుపులోకి తీసుకుని వి విధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. వారికి సంఘీభావం తెలపడానికి వచ్చిన వివిధ పార్టీల నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య మొత్తానికి అధికారులు రాత్రి వరకు సర్వేను పూర్తి చేశారు. రోడ్డుపై బైఠాయించిన రైతులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా సర్వే ఎలా చేస్తారని రైతులు సర్వే సిబ్బందిని అడ్డుకుని రహదారిపై బైఠాయించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహిళలు, పిల్లలు, రైతులు రోడ్డుపైనే కూర్చున్నారు. దీంతో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు. అయితే, రైతులు ఒక్కసారిగా వె ళ్లి సర్వే పనులను అడ్డుకుని అధికారుల చేతుల్లోని యంత్రాలను లాక్కుని పరుగులు తీశారు. ఈ క్ర మంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యాన్ ఎక్కిస్తుండగా మహిళా రైతులు అడ్డుకున్నా రు. ఈ సమయంలో ఓ మహిళా రైతు చేతికి గాయమైంది. మరో మహిళ కాలుకు తీవ్ర గాయం కావడంతో ఇతర మహిళలు ఆందోళన ఉధృతం చేశా రు. మహిళా పోలీసులు వచ్చి వారిని బీబీనగర్, భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఓవైపు ఆందోళన.. మరో వైపు సర్వే రాయగిరి వద్ద రీజనల్ రింగ్ రోడ్డు కోసం సేకరించే భూముల సర్వేకు కలెక్టరేట్ నుంచి ఎనిమిది బృందాలు వచ్చాయి. సర్వే నిలిపివేయాలని రైతులు ఒకవైపు ఆందోళన చేస్తుండగానే.. అధికారులు భూ సర్వే పనులు కొనసాగించారు. గత కొన్ని రోజుల నుంచి రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ సర్వేను రాయగిరి రైతులు అడ్డుకుంటున్నారు. అయితే ఈ ప్రాంతంలో కేవలం భువనగిరి మున్సిపాలిటీ, కొన్ని గ్రామాల్లో మాత్రమే సర్వే మిగిలింది. దీంతో గురువారం రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తుతో వచ్చారు. భువనగిరి మండలం రాయగిరి, ముత్తిరెడ్డిగూడెం, గంగసానిపల్లి గ్రామాల మధ్య సర్వే పనులు పూర్తయినట్లు యాదాద్రి జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి చెప్పారు. రైతులు కొంతమేరకు ప్రతిఘటించారని, అయినప్పటికీ సర్వే పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. 32 మందిని అరెస్టు చేశాం.. రీజనల్ రింగ్ రోడ్డు సర్వే పనులను అడ్డుకున్నందుకు నలుగురు మహిళలతో కలిపి మొత్తం 32 మందిని అరెస్ట్ చేశాం. తర్వాత అందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై సాయంత్రం విడుదల చేశాం. – వెంకట్రెడ్డి, ఏసీపీ, భువనగిరి ఆడపిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలి? నాకున్న మూడు ఎకరాల భూమి రోడ్డులో పోతే నా ముగ్గురు ఆడ పిల్లలను ఎలా పెంచాలి. పెళ్లిళ్లు ఎలా చేయాలి? తలుచుకుంటేనే భయమేస్తుంది. ఒక బిడ్డకు ఒక ఎకరం చొప్పున అమ్మి పెళ్లి చేయాలి అని అనుకున్నాం. కానీ, ప్రభుత్వం భూమి మొత్తం తీసుకుంటోంది. – పద్మ, రాయగిరి బతకడమే వ్యర్థం నా భర్త చనిపోగా ఆయన వారసత్వంగా నాకు ఏడు ఎకరాల భూమి వచ్చింది. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. నా ఆరోగ్యం కూడా బాగుండటంలేదు. ఒక్క గుంట భూమి కూడా లేకుండా పోతుంది అంటే గుండె ఆగిపోయినట్లు ఉంది. బతకడమే వ్యర్థం అనిపిస్తోంది. –– లక్ష్మి, రాయగిరి -
విన్సన్ పర్వతంపై భారత జెండా రెపరెపలు
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన పడమటి అన్వితారెడ్డి అంటార్కిటికాలోని విన్సన్ పర్వతాన్ని అధిరోహించారు. ఈ నెల 2న హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆమె అంటార్కిటికా చేరుకుని అక్కడ నుంచి 8న బేస్ క్యాంప్కు చేరుకున్నారు. మైనస్ 25 నుంచి మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న 4,892 మీటర్ల ఎత్తయిన విన్సన్ పర్వతాన్ని ఈ నెల 16వ తేదీన ఉదయం అధిరోహించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అన్వితారెడ్డి సెప్టెంబర్ 28న నేపాల్లోని మనాస్లు పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారత మహిళగా ఇప్పటికే చరిత్ర సృష్టించారు. అలాగే 2021 మేలో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు పర్వతం, జనవరి 21న దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో, డిసెంబర్ 7వ తేదీన యూరప్లోని ఎల్బ్రోస్ పర్వతాలను ఎక్కారు. -
గురుకులంలో సీటు రాకుంటే రైతు అయ్యేవాడిని
సంస్థాన్ నారాయణపురం: సర్వేల్ గురుకుల విద్యాలయంలో సీటు రాకపోయిఉంటే.. సొంత ఊరైన ఖమ్మం జిల్లా కూసుమంచిలో వ్యవసాయం చేసేవాడినని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. చిన్ననాటి స్నేహితులు కూడా వ్యవసాయం చేస్తున్నారని గుర్తు చేసుకున్నారు. తాను ఉద్యోగ విరమణ చేసేలోపు చదువుకున్న పాఠశాలను సందర్శించాలనుకున్న డీజీపీ.. మంగళవారం సాయంత్రం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల విద్యాలయానికి వచ్చారు. సుమారు రెండు గంటల పాటు ఆయన విద్యాలయంలో గడిపారు. గురుకుల విద్యాలయం ఏర్పాటుకు కారణమైన మద్ది నారాయణరెడ్డి, దివంగత పీఎం పీవీ నర్సింహారావు విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ సర్వేల్ గురుకులం ఎన్నో నేర్పిందని, విద్యాపరంగా వేసిన పునాది తన జీవితాన్ని మలుపు తిప్పిందని వివరించారు. డీజీపీ స్థాయికి ఎదగడానికి ఈ గురుకులమే కారణమని ఆయన స్పష్టం చేశారు. తన గురువులు నేర్పిన విలువలు ఇప్పటి వరకు దిక్సూచిలా పనిచేస్తున్నా యన్నారు. గురుకులంలో చదివితే ప్రపంచంలో దేన్నైనా జయించవచ్చని చెప్పారు. -
ఆడ శిశువుల్ని సాకి.. వ్యభిచార రొంపిలోకి దింపి
యాదగిరిగుట్ట: బాలికలను అక్రమ రవాణా చేస్తూ వ్యభిచారం చేయిస్తున్న ఓ ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లికి చెందిన కంసాని అనసూయ చాలా ఏళ్ల క్రితం ఇద్దరు ఆడ శిశువులను కొనుగోలు చేసి యుక్త వయస్సు వచ్చే వరకు పెంచి పోషించింది. సులువుగా డబ్బు సంపాదించుకునేందుకు ఇద్దరు బాలికలతో వ్యభిచారం చేయించాలని నిర్ణయించుకుంది. అందుకోసం తన బంధువైన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామంలో ఉన్న కంసాని శ్రీనివాస్ వద్దకు బాలికలను పంపించింది. శ్రీనివాస్ అక్కడ ఆ బాలికలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తుండేవాడు. అదే క్రమంలో యాదగిరిపల్లికి కూడా పంపిస్తుండేవాడు. వ్యభిచారం చేయించేందుకు అనసూయ వారిని కొడుతూ ఉండేది. అనసూయ, శ్రీనివాస్కు మరికొంతమంది సహకరించేవారు. తప్పించుకుపోయి.. పోలీసుల కంటపడి.. అనసూయ చిత్రహింసలకు తట్టుకోలేక ఇద్దరిలో ఓ బాలిక ఇటీవల ఇంటి నుంచి పారిపోయింది. జనగామ జిల్లా బస్టాండ్లో తిరుగుతూ పోలీసుల కంట పడింది. వారి విచారణలో యాదగిరిపల్లికి చెందిన అనసూయ, తంగళపల్లికి చెందిన శ్రీనివాస్ వ్యభిచారం చేయిస్తున్న విషయం వెలుగు చూసింది. దీంతో అక్కడి పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా బాలల సంరక్షణ అధికారి సైదులుతో పాటు ఇక్కడి పోలీసులకు సమాచారం అందజేశారు. మెరుపుదాడి చేసి.. ఈ నెల 3న సైదులు ఫిర్యాదు మేరకు యాదగిరిగుట్ట పోలీసులు, షీటీమ్స్, చైల్డ్ ప్రొటెక్షన్ సభ్యులు కలిసి యాదగిరిపల్లిలోని కంసాని అనసూయ ఇంటిపై దాడి చేశారు. అనసూయను అదుపులోకి తీసుకుని విచారించగా సెక్స్ రాకెట్ డొంక కదిలింది. ఆమె ఇచ్చిన సమాచారంతో తంగళపల్లికి చెందిన కంసాని శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన చంద భాస్కర్, చంద కార్తీక్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని టీచర్ కాలనీకి చెందిన కంసాని లక్ష్మిలను పోలీసులు అరెస్టు చేశారు. యాదగిరిపల్లికి చెందిన కంసాని ప్రవీణ్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన కంసాని స్వప్న, కంసాని అశోక్, కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన చందా సరోజనమ్మ పరారీలో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ఇద్దరు బాలికలను బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. దాడుల్లో పాల్గొన్న డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, టౌన్ సీఐ సైదయ్య, యాదగిరిగుట్ట పోలీసు బృందానికి సీపీ మహేష్ భగవత్ అభినందనలు తెలిపారు. -
దేశ సంపదను కాపాడేందుకు ఉద్యమం
యాదగిరిగుట్ట: ప్రధాని నరేంద్రమోదీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న పరిస్థితుల్లో దేశ సంపదను కాపా డుకునేందుకు ఉద్యమాలు చేస్తామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్కౌర్ పక్రటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో జరుగుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర 3వ మహాసభల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో కార్మికులు, ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. నరేంద్రమోదీ కార్మిక సంఘాలను నిర్వీ ర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో కార్మికులు, ప్రజలు నష్టపోతుంటే అదానీ, అంబానీలు రూ.లక్షల కోట్లు సంపాదిస్తున్నారని అన్నారు. నల్లధనాన్ని బయటకు తీసుకువస్తానని చెప్పిన మోదీ.. ఆ నల్లధనం కలిగిన వారిని విదేశాలకు పంపించారని ఆరోపించారు. మోదీ ఆర్ఎస్ఎస్ గొడుగు కింద పని చేస్తున్నారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ గతంలో బ్రిటిష్ వారికి సేవ చేసిందని, నేడు పెట్టుబడి దా రులకు వత్తాసు పలుకుతోందని ఆమె మండిపడ్డారు. కేంద్రం ట్రేడ్ యూనియన్లను పట్టించుకోవడం లేదని, అపాయింట్మెంట్ కోరితే సమయం కూడా ఇవ్వడం లేదని అమర్జిత్కౌర్ నిందించారు. కార్మికుల సమ స్యలపై చర్చిద్దామని పిలిచి కేవలం 3 నిమిషాలు మా త్రమే సమయమిచ్చి అవమానపరుస్తున్నారని విమ ర్శించారు. దేశ సంపదను అమ్మినా, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయాలని చూసినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.బాలరాజు, వీఎస్ బోస్, తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రి ఆలయానికి పెరుగుతున్న భక్తుల తాకిడి
-
Neem Tree: వేపకు మళ్లీ ఆపదొచ్చింది.. మేలుకోకపోతే వింత రోగంతో..
ఆత్మకూరు (ఎం)/యాదాద్రి భువనగిరి: వేపకు మళ్లీ ఆపదొచ్చింది. వింత రోగంతో పచ్చని వృక్షాలు మాడిపోతున్నాయి. ఎన్నో ఔషధ గుణాలున్న చెట్లు కళ్లెదుటే మోడుబారి పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది కూడా వైరస్ సోకి పెద్ద ఎత్తున చెట్లు మోడుబారాయి. గత సంవత్సరం మాదిరిగానే మళ్లీ వేప చెట్లు వైరస్కు గురవుతున్నాయి. వైరస్ ద్వారా తెగులు సృష్టిలో రకరకాల చెట్లు ఉన్నప్పటికీ వేపది ప్రత్యేక స్థానం. ఔషధ గుణాలు కలిగిన ఈ చెట్టుతో అనేక రకాల ప్రయోజనాలున్నాయి. అలాంటి ప్రాధాన్యం కలిగిన వేప చెట్టు ఇప్పుడు డైబ్యాక్, ట్రీమస్టికో వైరస్ బారిన పడింది. ఈ వైరస్ సోకిన చెట్ల కొమ్మలు పసుపు, గోదుమ రంగులోకి మారి ఆ తర్వాత నిర్జీవ స్థితికి చేరుతున్నాయి. ఈ వైరస్ ఒక వేప చెట్టు నుంచి మరో వేప చెట్టుకు వస్తుంది. వాడాల్సిన మందులు వైరస్ బారిన పడిన వేప చెట్లకు కార్భోలానిజిమ్ ద్రావకాన్ని ఒక గ్రాం ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పది రోజుల తర్వాత కాపర్ ఆక్సై డ్ క్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అంతేకాకుండా వైరస్ ఆశించిన చెట్టు కొమ్మలను నరికివేయాలి. నరికిన కొమ్మలకు గోరింటాకు ముద్దగా చేసి అంటించాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు. (చదవండి: వీళ్లు మనుషులేనా.. ప్రేమ పెళ్లి చేసుకుందని.. కూతురుని కిడ్నాప్ చేసి గుండుకొట్టించి) గత ఏడాది మొక్కుబడి చర్యలు గత ఏడాది వేప చెట్లు వైరస్ బారిన పడి ఎండిపోతుండడంతో అప్రమత్తం అయిన ప్రభుత్వం.. చెట్లను కాపాడుకునేందుకు సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారులు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించి వేప చెట్లకు మందులు పిచికారీ చేయాల్సి ఉంది. మొక్కుబడిగా కొన్ని చెట్లకు మాత్రమే మందులు వేసి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. మందు పిచికారీ చేయాలంటే ఖర్చుతో కూడుకున్నది కావడంతో సర్పంచ్లు చేతులెత్తేశారు. దీంతో వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. (చదవండి: హైదరాబాద్లో విచ్చలవిడిగా హాస్టళ్లు, లాడ్జీలు.. పోలీసుల ప్రత్యేక యాప్) ఈసారి తీవ్రత ఎక్కువగా ఉంది వేప చెట్లకు వైరస్ తీవ్ర త ఈసారి ఎక్కువగా ఉంది. తేమ శాతం అధికంగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వైరస్ సోకిన చెట్టు ఆరు నెల్లోపు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగితే చిగురిస్తాయి. గతంలో సర్పంచ్లకు చెప్పి మందు పిచికారీ చేయించాం. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. –అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి మందులు పిచికారీ చేయాలి వేప చెట్లతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. పూర్తిగా ఔషధ గుణాలు కలిగిన వేప చెట్లు వైరస్ బారిన పడి ఎండిపోతుండడం ఆందోళన కలిగి స్తోంది. ప్రభుత్వం ముందుకొచ్చి సంరక్షణలు చర్యలు చేపట్టాలి. అధికారులకు ఆదేశాలు జారీ చేసి మందులు పిచికారీ చేయించాలి. నిర్లక్ష్యం చేస్తే చెట్లు అంతరించే ప్రమాదం ఉంది –డి.వెంకన్న, సైన్స్ ఉపాధ్యాయుడు, ఆత్మకూరు(ఎం) అధికారులు స్పందించాలి నాకు తెలివి వచ్చినప్పటి నుంచి వేప పుల్లతోనే దంతాలు తోముకుంటున్నా. గత ఏడాది వేప చెట్లకు వైరస్ సోకి చాలా వరకు ఎండిపోయాయి. మళ్లీ అదే మాదిరిగా ఇప్పుడు ఎండిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. మొదటిసారి పూర్తిస్థాయిలో నివారణ చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వెంటనే స్పందించి చెట్లను కాపాడాలి. –బద్దం శంకర్రెడ్డి, రైతు, కాల్వపల్లి, ఆత్మకూరు(ఎం) మండలం -
యాదాద్రి: విడిపోయి బతకడం ఇష్టం లేకనే?
సాక్షి, యాదాద్రి జిల్లా: జిల్లాలో ఓ ప్రేమ జంట బుధవారం బలవన్మరణానికి పాల్పడింది. బహూపేట సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది ఈ జంట. మృతుల్ని బస్వాపూర్కి చెందిన గణేష్, నలందగా గుర్తించారు పోలీసులు. నలందకి వివాహం జరిగింది. అయితే.. గణేష్తో అంతకు ముందు నుంచే ఆమెకు ప్రేమ వ్యవహారం నడిచింది. విడిపోయి బతకడం ఇష్టం లేకే ఈ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు కన్పించకుండా పోయారని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు అయినట్లు సమాచారం!. -
తాటిచెట్టుపై 6 గంటలు తలకిందులుగా..
సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువన గిరి జిల్లాలో శుక్రవారం కల్లు తీసేందుకు తాటి చెట్టు ఎక్కిన ఓ గీత కార్మికుడుకి ముస్తాదు ఊడిపోవడంతో కాళ్లుపైకి తల కిందికి వేలాడుతూ ఆరుగంటల పాటు నరక యాతన అనుభవించాడు. సంస్థాన్ నారా యణపురం మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన బాలగోని మాసయ్య కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి వర్షం కురవడంతో మాసయ్య శుక్రవారం ఆలస్యంగా 9గంటల ప్రాంతంలో కల్లు తీసేందుకు అదే గ్రామానికి చెందిన వీరమళ్ల దానయ్య పొలంలోని తాటిచెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో మాసయ్య ముస్తాదు ఊడిపోవడంతో మోకు, గుత్తిపై తలకిందు లుగా వేలాడాడు. సమీప రైతులు గమనించి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది వచ్చి పెద్ద క్రేన్ సహాయంతో మాసయ్యను కిందికి దించారు. అప్పటికే అతడి ఎడమకాలు, చేయి చచ్చుబడ్డాయి. వెంటనే అతడిని అంబులెన్స్లో చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, సహాయక చర్యలు ఆలస్యం కావడంతో మాసయ్య ఆరు గంటల పాటు చెట్టుపైనే నరకయాతన అనుభవించారు. అధిక రక్తపోటుతో పక్షవా తం రావడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. -
ప్రేమ పెళ్లి చేసుకున్నారని దారుణం.. పెళ్లి ఫోటోలు వాట్సాప్లో పెట్టడంతో.
సాక్షి, నల్గొండ: తుర్కపల్లి మండలంలోని గంధమల్ల గ్రామానికి చెదిన యువతీయువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి ఇష్టం లేని అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు ఆగ్రహంతో అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టారు. వివరాలు.. గంధమల్ల గ్రామానికి చెందిన వేముల భాను అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం వీరిద్దరూ ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి గుడిలో వివాహం చేసుకున్నారు. అనంతరం పెళ్లికి సంబంధించిన ఫొటోలను భాను అదే గ్రామానికి చెందిన ఓ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. ఈ పెళ్లి విషయం తెలుసుకున్న అమ్మాయి తరఫున కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనై యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవండతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఇబ్రహీంపట్నం ఘటన.. డాక్టర్ శ్రీధర్ సస్పెన్షన్ను రద్దు చేసిన హైకోర్టు -
నీ కాళ్లు మొక్కుత సారూ.. పైసలిప్పియ్యరూ: రైతు ఆవేదన
‘నీ కాళ్లు మొక్కుత సారు..పైసలిప్పియ్యరూ.. అంటూ ఓ వృద్ధుడు ఎమ్మెల్యే కాళ్లపై పడి వేడుకున్నాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురంలో జరిగింది. బస్వాపురం గ్రామంలో ఆదివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే వస్తున్నట్లు తెలుసుకున్న బస్వాపురం రిజర్వాయర్ భూ నిర్వాసితుడు ఉడుత అంజయ్య అక్కడికి వచ్చాడు. రిజర్వాయర్ నిర్మాణంతో తన వ్యవసాయ భూమి, బోరు పోయిందని పైసలు ఇప్పించాలని ఎమ్మెల్యే కాళ్లపై పడి దండం పెట్టి వేడుకున్నాడు. చదవండి: (అసదుద్దీన్ ఫోన్ నంబర్ కోసం ముంబైలో ఆరా.. బాంబ్ బ్లాస్ట్ వార్నింగ్) -
ఎనిమిదేళ్లలో రూ.5 లక్షల కోట్ల అప్పు
చౌటుప్పల్: కేసీఆర్ తన ఎనిమిదేళ్ల పాలనలో రూ.5 లక్షల కోట్ల అప్పు చేశారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. బీఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర ఆదివారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం, చౌటుప్పల్, తంగడపల్లి గ్రామాల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా చిరు వ్యాపారులు, వివిధ రంగాల కార్మికులతో ఆయన ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్గమధ్యంలో చాకలి ఐలమ్మ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సర్దార్ సర్వాయి పాపన్నల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి స్కీంలతో సీఎం కేసీఆర్ కోట్లు సంపాదించారని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చేవి స్కీంలు కాదని, అన్నీ స్కాంలేనని అన్నారు. స్కీంల ద్వారా పేదల పేరు చెప్పుకొని టీఆర్ఎస్ నాయకులు జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం నాసిరకం బతుకమ్మ చీరలు పంచుతూ మహిళలను అవమానపరుస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని గుజరాత్ షేఠ్లకు అమ్ముతోందని ధ్వజమెత్తారు. మునుగోడు ఎన్నికల కోసం కేంద్రహోంమంత్రి అమిత్ షా తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డికి రూ.150 కోట్లు ఇచ్చారని ఆయన ధ్వజమెత్తారు. -
స్టేటస్ పెట్టి.. బావిలో దూకాడు
భూదాన్పోచంపల్లి: వ్యవసాయబావిలో దూకి ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం పెద్దగూడెంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దగూడేనికి చెందిన నోముల ఆకాశ్రెడ్డి(17) భూదాన్పోచంపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకండియర్ చదువుతున్నాడు. మ్యాథ్స్ అర్థం కావడంలేదని, లె క్చరర్ హోంవర్క్ ఎక్కువ ఇస్తున్నారని వేరే కళాశాలలో చేరుతానని చెబుతుండేవాడు. అన్నట్టుగానే ఐదు రోజుల క్రితం టీసీ తీసుకొని పట్టణ పరిధిలోని మోడల్ స్కూల్లో చేరాడు. స్టేటస్ పెట్టిన 10నిమిషాల్లోనే..: ‘నేను చనిపోవడానికి మా జూనియర్ కళాశాల మ్యాథ్స్ లెక్చరర్, తోటి విద్యార్థిని కారణం’అని ఆదివారం మధ్యాహ్నం 12.55కి తన మొబైల్ లో స్టేటస్ పెట్టాడు. అతని స్టేటస్ చూ సిన స్నేహితులు... ఆకాశ్రెడ్డి తల్లి అరుణకు చెప్పారు. అదే సమయంలో అక్కడి కి వచ్చిన ఆకాశ్ను ప్రశ్నించగా... సరదాగా పెట్టానంటూ వెళ్లిపోయాడు. అనంతరం సైకిల్పై గ్రామ సమీపంలోని వ్య వసాయ బావి వద్దకు వెళ్లాడు. రోడ్డు పక్కన సైకిల్, గట్టు పైన చెప్పులు,సెల్ఫోన్ పెట్టి బావిలో దూకాడు. అతని కోసం వెదుకుతుండగానే బావిలో దూకాడని గ్రామస్తులు చెప్పారు. భయంతోనేనా.. ఆకాశ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న సమయంలో తోటి విద్యార్థిని ఫొటోలను తన ఫోన్లో వాట్సప్ డీపీగా పెట్టుకునే వాడు. కాలేజీ మారాక కూడా కొనసాగించాడు. దీంతో సదరు విద్యార్థిని మ్యాథ్స్ లెక్చరర్కు చెప్పింది. దీనిపై సోమవారం పోలీస్లకు ఫిర్యాదు చేద్దామని లెక్చరర్ చెప్పినట్లు సమాచారం. తనపై కేసు అవుతుందనే భయంతోనే బావిలోకి దూకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అంతేకాక ఆకాశ్ మానసిక స్థితి కూడా సరిగా ఉండదని తెలిసింది. అతడి తండ్రి నోముల శ్రీనివాస్రెడ్డి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. తల్లి అరుణ మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా, బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో పోలీసులు అర్ధరాత్రివరకు వెతికినా మృతదేహం దొరకలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. -
టార్గెట్.. 76 వేల ఓట్లు
చౌటుప్పల్ రూరల్: ‘మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు 90 రోజులకుపైగా సమయం ఉంది. రెండు బూత్లకో ఇన్చార్జిని, పది బూత్లకో క్లస్టర్ ఇన్చార్జిని, మండలానికో టీపీసీసీ నేతను పెట్టాం. వచ్చే వారం రోజుల్లో గ్రామాలవారీగా తిరగాలి. 25 మంది సభ్యులతో బూత్ కమిటీని వేయాలి. అందులోంచి ఇద్దరు యువకులను గుర్తించాలి. వారి సాయంతో ఓటరు లిస్టు ఆధారంగా కాంగ్రెస్ కుటుంబాలను గుర్తించాలి. కనీసంగా బూత్కు 254 ఓట్లను సాధించాలి. ఈ లెక్కన మునుగోడులో మొత్తంగా 76 వేల ఓట్లువస్తే కాంగ్రెస్ విజయం సాధిస్తుంది’అని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెరలో మంగళవారం టీపీసీసీ సమీక్షా సమావేశం జరిగింది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావేద్, ఉత్తమ్కుమార్రెడ్డి, జె.గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ్మ, సంపత్కుమార్, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, బలరాం నాయక్, అంజన్కుమార్యాదవ్, రాంరెడ్డి దామోదర్రెడ్డి, మల్లు రవి, మహేశ్కుమార్గౌడ్, పాల్వాయి స్రవంతితో పాటు 107మంది బూత్ ఇన్చార్జిలతో ఉప ఎన్నికపై సమీక్షించారు. కాంగ్రెస్ ఓటర్లను గుర్తించాలి.. ఈ సందర్భంగా మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ.. ‘దుబ్బాక ఉప ఎన్నికలకు 22 రోజుల గడువు మాత్రమే ఉండే. అక్కడ కూడా ఇలాగే పనిచేసినం. 26వేల ఓట్లు వచ్చాయి. కానీ, ఆరు బూతుల్లోనే మెజారిటీ ఓట్లు సాధించినం. ఆ బూత్ ఇన్చార్జులకు తగిన గుర్తింపునిచ్చాం, పార్టీ పదువులిచ్చినం. మునుగోడులోనూ పనిచేసిన వారికి గుర్తింపునిస్తాం. గత పార్లమెంట్ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్కు 76వేల ఓట్లు వచ్చాయి. బూత్కు కనీసంగా 254 ఓట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ నెల 18 నుంచి బూత్ ఇన్చార్జులంతా కార్యక్షేత్రంలోకి దిగాలి. బూత్లవారీగా కాంగ్రెస్ ఓటర్లను గుర్తించాలి. వారం రోజుల్లోగా ఇదంతా పూర్తి చేయాలి. ఈ నెల 25న మరోసారి మండలాల వారీగా సమీక్షిస్తాం. కాంగ్రెస్ నుంచి పదవులు అనుభవించి వెళ్లిపోయిన రాజగోపాల్రెడ్డికి తగిన బుద్ది చెప్పాలి. రాష్ట్రంలో 13రోజుల పాటు సాగే రాహుల్గాంధీ జోడో యాత్రను విజయవంతం చేయాలి’అని ఠాగూర్ కోరారు. సమావేశంలో ఇంకా టీపీసీసీ నాయకులు విజయరమణారావు, గండ్ర సత్యనారాయణ, అనిల్కుమార్, ప్రేమ్సాగర్రావు, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Regional Ring Road: రాయగిరి రైతులకు కష్టాల ‘రింగ్’! బతికేదెట్లా?
సాక్షి, యాదాద్రి: అది రాయగిరి గ్రామం.. చుట్టూ పొలాలు, చేన్లతో కళకళాడేది.. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టకు, హైదరాబాద్–వరంగల్ ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉంటుంది. ఆ ప్రధాన రహదారి విస్తరణ కోసం గ్రామంలో కొంతమేర పొలాలు, భూములు పోయాయి.. అభివృద్ధి కోసమేకదా అనుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల కోసం మరికొంత భూమి పోయింది.. తమ ప్రాంతం పచ్చగా అవుతుంది కదా అనుకున్నారు. యాదాద్రి అభివృద్ధికి, హైటెన్షన్ విద్యుత్ లైన్ల కోసం ప్రభుత్వం భూములు తీసుకుంది. అటు దేవుడు, ఇటు కరెంటు.. ఇవ్వలేక ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు రీజనల్ రింగు రోడ్డు తెరపైకి వచ్చింది. దాని అలైన్మెంటు కూడా రాయగిరి గ్రామం మీదుగానే వెళుతోంది. ఇన్నిసార్లు భూములు ఇచ్చామని.. ఇప్పుడూ ఇస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని, ఊరు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని రాయగిరి వాసులు వాపోతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని వేడుకుంటున్నారు. రాయగిరి గ్రామంలో వందలాది మందికి ఉపాధి కల్పించే రైస్ మిల్లులు, హోటళ్లు మొత్తం రోడ్డు విస్తరణలో పోతున్నాయని అంటున్నారు. 80 ఎకరాల సేకరణ కోసం.. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై రాయగిరి వద్ద డబుల్ జంక్షన్ సర్కిల్ కోసం 80 ఎకరాలు సేకరిస్తున్నారు. ముందుగా 60 ఎకరాలు సేకరించాలని నిర్ణయించినప్పటికి.. జాతీయ రహదారిపై వాహనాల వేగాన్ని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 20 ఎకరాలు పెంచారు. అలైన్మెంట్ మార్చారా? : ముందుగా రీజనల్ రింగ్ రోడ్డు తుర్కపల్లి మండలం నుంచి రాజాపేట, యాదగిరిగుట్ట, మోటకొండూరు మండలాల మీదుగా భువనగిరి మండలంలోకి వెళ్లేలా ప్రాథమికంగా ప్రతిపాదించారు. తర్వాత యాదగిరిగుట్ట దేవస్థానానికి ఉత్తరం వైపు నుంచి కాకుండా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం, దాతర్పల్లి మీదుగా కలెక్టరేట్ నుంచి రాయగిరి గ్రామం మీదుగా వలిగొండ మండలం వరకు తాజా ప్రతిపాదనతో గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. ముందుగా రాయగిరి గ్రామానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చేసిన ప్రతిపాదనను తర్వాత మార్చడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు, బడా వ్యాపారులకు అనుగుణంగా అలైన్మెంట్ మార్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూడుసార్లు భూములు పోతే ఎలా..? రాయగిరి రెవెన్యూ పరిధిలోని బాలెంపల్లికి చెందిన బద్దం నర్సింహారెడ్డికి ఆరు ఎకరాల భూమి ఉంది. గతంలోనే హైటెన్షన్ లైన్ కోసం ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వకుండా రెండు ఎకరాల భూమిని తీసుకున్నారు. కాళేశ్వరం కాల్వ కోసం 15 గుంటల భూమి తీసుకున్నారు. తాజాగా రీజనల్ రింగ్ రోడ్డు కోసం మూడు 3 ఎకరాలు తీసుకుంటున్నారు. గ్రామంలో పది మంది రైతులది ఇదే పరిస్థితి. పంటలు పండే భూములు ఇలా తీసుకుంటే తాము ఎలా బతకాలని నర్సింహారెడ్డి ప్రశ్నిస్తున్నారు. గుంట భూమి లేకుండా పోతుంది సర్వే నంబర్ 690లో మా అన్నదమ్ములిద్దరి పేరున మొత్తం 14 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంటులో గుంట భూమి లేకుండా పోతోంది. దీంతో మాకు బతుకు దెరువు కష్టమవుతోంది. రోడ్డు అలైన్మెంటు మార్చి మా జీవితాలు కాపాడాలి. – తెల్జూరి ఐలయ్య, రాయగిరి అలైన్మెంట్ మార్చాలి సర్వే నంబర్ 726లో 7.15 ఎకరాల భూమిపోతోంది. ఇందులో ఆరుగురు రైతులు తమ భూములు మొత్తం కోల్పోతున్నారు. ముందుగా ఇచ్చిన మ్యాప్ ప్రకారం ఈ సర్వే నంబర్లో 4 ఎకరాలు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించారు. కానీ తాజా నోటిఫికేషన్ ప్రకారం మార్చిన అలైన్మెంట్తో భూమి మొత్తం పోతోంది. వెంటనే రింగురోడ్డు అలైన్ మెంట్ మార్చాలి. – అవిశెట్టి పాండు, రాయగిరి గుంట భూమి కూడా మిగలకుండా.. రాయగిరికి చెందిన కోటం భద్రయ్యకు ఉన్న 4.17 ఎకరాల భూమి మొత్తం రీజనల్ రింగ్రోడ్డులో పోతోంది. గతంలో ఆయన భూమిలో రెండు ఎకరాలను హైటెన్షన్ విద్యుత్ లైన్లు, టవర్ల కోసం ప్రభు త్వం తీసుకుంది. అలాగే జాతీయ రహదారి విస్తరణ కోసం 34 గుంటల భూమి, ఇల్లు పోయాయి. తాజా ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఉన్న మొత్తం భూమిని కోల్పోతున్నాడు. కూతురు వివాహం కోసం పనికి వస్తుందనుకున్న కోట్ల విలువ చేసే భూము లను కోల్పోయి ఎలా బతకాలని, ప్రభుత్వం అలైన్ మెంట్ మార్చాలని భద్రయ్య వేడుకుంటున్నాడు. -
యాదాద్రి జిల్లాలో 2 గంటల పాటు కుండపోత వర్షం
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి 2 గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 65.4 మి.మీ వర్షపాతం నమోదైంది. భువనగిరిలో 169.2మి.మీ, తుర్కపల్లిలో 125.2 మి.మీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో జిల్లాలో చెరువులు అలుగులు దుంకాయి. వాగులు పొంగిపొర్లాయి. భువనగిరి–యాద గిరి గుట్ట, వరంగల్వైపు వెళ్లే జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు నీట మునిగింది. భువనగిరి– చిట్యాల జాతీయ రహదారిలో ఇంద్రపాలనగరం వద్ద రోడ్డుపై నుంచి వరద నీరు ఉధృతంగా పారడంతో ఈ రెండు ప్రధాన రహ దారులపై రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. అడ్డగూడూరు మండలం లక్ష్మిదేవికాల్వ–ధర్మారం మధ్యన వరద ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. -
క్షుద్రపూజలకు మహిళ బలి?
భూదాన్పోచంపల్లి: యాదాద్రి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం జూలూరులో మూటపురం అనూష(30) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అత్త క్షుద్రపూజల వల్లే ఆమె బలి అయిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామానికి చెందిన అనూష వివాహం జూలూరుకు చెందిన మూటపురం బాబురావుతో 2017లో జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, 6 నెలల కుమారుడు ఉన్నాడు. విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఆపరేటర్ అయిన బాబురావు చేయి ఇటీవల విద్యుదాఘాతానికి గురై కాలిపోయింది. కుటుంబ కలహాలతో నిత్యం బాబురావు భార్యను కొట్టి వేధించేవాడు. ఈ క్రమంలో అనూష వారంరోజులుగా అమ్మతల్లి సోకి అనారోగ్యంతో బాధపడుతోంది. ఆదివారం ఉదయం బాబురావు తన బావమరిది గిరిబాబుకు ఫోన్ చేసి అనూష ఆరో గ్యం విషమంగా ఉందని, వెంటనే రమ్మని చెప్పాడు. ఆయన వచ్చే సరికి ఓ గదిలో అనూష శరీరమంతా కాలిపోయి మృతి చెంది ఉంది. క్షుద్ర పూజలనే అనుమానం.. అనూష అత్త యాదమ్మ తరచూ క్షుద్రపూజలు చేస్తుంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. శనివారం అమావాస్య కావడం, అనూష మృతదేహం పక్కన నిమ్మకాయలు, కొబ్బరికాయలు ఉండటం, ఉదయం వరకు ఇంట్లో పెద్ద దీపం వెలుగుతుండటం వంటివి విచారణలో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇంట్లో క్షుద్రపూజలు జరిగి ఉండవచ్చనే అనుమానాలకు బలం చేకూరుతోంది. అనూషకు మత్తు ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత క్షుద్రపూజలు చేసి చంపి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనూ ష ఆత్మహత్యకు పాల్పడిందని చిత్రీకరించేందుకు భర్త, అత్త ఆమె ఒంటిపై యాసిడ్ పోసినట్లు సమాచారం. ఇంట్లోని వస్తువులు ధ్వంసం : అనూషను భర్త, అత్త కొట్టి చంపారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె బంధువులు బాబురావు ఇంటిపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారు. న్యా యం చేసేవరకు మృతదేహాన్ని తరలించేది లేదని భీష్మించి కూర్చున్నారు. చివరకు ఇరు కుటుంబాల పెద్ద మనుషులు రూ. 7.50 లక్షల పరిహారం ఇచ్చేందుకు అంగీకారం చేసుకు న్నట్లు సమాచారం. బాబురావు, యాదమ్మ పోలీసుల అదు పులో ఉన్నట్లు సమాచారం. గిరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. -
గాంధీ వేషధారణలో 750 మంది చిన్నారులు
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ట్రినిటీ హైస్కూల్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ ప్రతిష్టాన్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 750 మంది విద్యార్థులు మహాత్మాగాంధీ వేషధారణలో అలరించారు. చేనేత మగ్గం, రాట్నం, రాట్నంపై నూలు వడికే విధానాన్ని ప్రదర్శించారు. విద్యార్థులంతా జాతీయ జెండాలు చేతబూని దేశభక్తిని చాటిచెప్పారు. -
బతికుండగానే కాగితాల్లో చంపేశారు!
సంస్థాన్ నారాయణపురం: వితంతు పింఛన్కు దరఖాస్తున్న చేసుకున్న మహిళ బతికుండగానే అధికారులు కాగితాల్లో చంపేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం పరిధి ఆరెగూడెం గ్రామానికి చెందిన బచ్చన బోయిన బాలమ్మ భర్త రామచంద్రం అనారోగ్య కారణాలతో 2021 జనవరి 28న మృతిచెందాడు. దీంతో బాలమ్మ అదే ఏడాది సెప్టెంబర్ 14న పలు ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ ప్రతులతో వితంతు పింఛన్ కోసం గ్రామ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంది. కాగా, స్వాతంత్య్ర వజ్రోత్సవాల కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన పింఛన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బాలమ్మ తనకు పింఛన్ మంజూరైందా? అని అధికారులను ఆశ్రయించింది. దీంతో వారు ఆన్లైన్లో శోధించగా ఆ జాబితాలో మాత్రం బాలమ్మ చనిపోయినట్లు ఉందని చెప్పడంతో ఆమె అవాక్కయింది. తాను బతికే ఉన్నానని, పింఛన్ ఇప్పించాలని బాలమ్మ అధికారులను వేడుకుంది. కాగా, దీనిపై ఎంపీడీవో యాదగిరిని సంప్రదించగా మీ–సేవలో దరఖాస్తు చేసుకోవడంలో జరిగిన పొరపాటుగా గుర్తించామని తెలిపారు. బాధితురాలికి పింఛన్ వచ్చేలా చూస్తామని చెప్పారు. -
ఉత్తమ అవార్డుకు సాక్షి ఫొటోగ్రాఫర్ ఎంపిక
భువనగిరి: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫొటోగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడలో ‘వన్ నేషన్ వన్ ఫ్లాగ్’పై నిర్వహించిన పోటీల్లో సాక్షి దినపత్రిక యాదాద్రి భువనగిరి జిల్లా ఫొటోగ్రాఫర్ కోల్లోజు శివకుమార్ పంపిన చిత్రం ఎంపికైంది. ఈనెల 19న విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో శివకుమార్ అవార్డు అందుకోనున్నారు. -
వేడెక్కిన మునుగోడు రాజకీయం.. అర్థరాత్రి హైడ్రామా
యాదాద్రి భువనగిరి: మునుగోడు రాజకీయం మరింత వేడెక్కింది. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధం కాగా, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్కు చెందిన ముఖ్య నేతలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. చౌటుప్పల్ టీఆర్ఎస్ ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి సహా పలువురు నేతలు బీజేపీ అధిష్టానంతో ఇప్పటికే టచ్లో ఉన్నారు. త్వరలో బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు వెంకటరెడ్డి తెలిపారు. తనతో సహా పలువురు స్థానిక నేతలు బీజేపీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకోబోతున్నట్లు పేర్కొన్నారు. అర్థరాత్రి హైడ్రామా ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో హైదరాబాద్లోని వనస్థలిపురంలో తాడూరి నివాసం వద్ద సోమవారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. తాడూరి ఉండే నివాసానికి ఎస్వోటీ, సీసీఎస్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేందుకు యత్నించారు. భూవివాదానికి సంబంధించిన గతంలో నమోదైన కేసులను మరోసారి తెరపైకి తెచ్చి తాడూరిని అరెస్ట్ చేసే యత్నం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులతో తాడూరి వాగ్వాదానికి దిగారు. విచారణ నిమిత్తం అరెస్ట్ చేసేందుకు వచ్చామని అక్కడకు వచ్చిన పోలీసులు తెలపగా, అసలు ఎందుకు అరెస్ట్ చేసి విచారిస్తారని తాడూరి నిలదీశారు. అర్థరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీస్ లు ఎంపీపీ వెంకట్రెడ్డి ఇంటిని చుట్టూ ముట్టిన విషయం తెలిసి.. ఎంపీపీ ఇంటికి బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి , బీజేపీ నేతలు చేరుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది. తాడూరి అరెస్ట్ను అక్కడకు వచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కాగా, తాడూరికి నోటీసులు ఇచ్చారు చౌటుప్పల్ పోలీసులు. వారు చౌటుప్పల్ పోలీసులు కాదు ఈ అంశానికి సంబంధించి తాడూరి స్పందించారు. ‘హైదరాబాదులో ఉంటున్న తన అపార్ట్మెంట్లోని ఫ్లాట్కి అర్థరాత్రి చౌటుప్పల్ పోలీసులమని చెప్పి అరెస్ట్ చేసేందుకు కొందరు వచ్చారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. చౌటుప్పల్ పోలీసులు కాదు. నేను అందర్నీ గుర్తు పడతాను. నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నేను టీఆర్ఎస్ పార్టీ ఎంపీపీని నాతో పాటు కొద్ది మంది జెడ్పీటీసీలు ఎంపీపీలు మరికొంత మంది కార్యకర్తలు మేమందరం కలిసి మాట్లాడుకునే బీజేపీలోకి పోదామనే అనుకున్నాం. ఈ సమయంలోనే మా ఇంటికి ఎవరో వచ్చి బెదిరింపులకు గురి చేస్తున్నారు’ అని అన్నారు. -
అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లిన బస్సు
బీబీనగర్: వరంగల్–1 డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. శనివారం హైదరా బాద్ నుంచి వరంగల్కు వెళుతున్న సూపర్ లగ్జరీ బస్సు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని ఎయిమ్స్ సమీపంలోకి రాగానే ఒక్కసారి అదుపుతప్పి రహదారి పక్కన గల గుంతలో చెట్లపొదల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. దాదాపు 200 మీటర్లు దూరం వరకు బస్సు అలా ముందుకు వెళ్లిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాదానికి గురికాగానే స్థానికులు వెంటనే వచ్చి ప్రయాణికులను బయటకు తీశారు. కాగా, బస్సులో 20 మంది పైగా ఎస్సై పరీక్షకు హాజరు కావాల్సిన అభ్యర్థులు ఉన్నారు. ఆదివారం పరీక్ష ఉండగా వారు ఒక రోజు ముందుగానే వరంగల్కు బయలుదేరారు. వీరంతా హైదరాబాద్లోని వివిధ ప్రాతాలకు చెందిన వారని తెలిసింది. స్టీరింగ్ లాక్ కావడంవల్లే: డ్రైవర్ రాజన్న ఈ ప్రమాదంపై డ్రైవర్ రాజన్న మాట్లాడుతూ.. ఎయిమ్స్ సమీపంలోకి రాగానే స్టీరింగ్ లాక్ కావడంతో బస్సు ఎడమ వైపు దూసుకెళ్లిందని, వెంటనే బ్రేక్ వేశానని, అయినా కొంతదూరం చెట్లపొదల్లోకి వెళ్లి నిలిచిపోయిందని చెప్పారు. అనంతరం ప్రయాణికులను ఇతర డిపోలకు చెందిన బస్సులలో ఎక్కించి పంపించారు. ఇదిలా ఉండగా బస్సు చెట్లను ఢీకొని ఆగిపోవడంతోనే తమ ప్రాణాలు దక్కాయని ప్రయాణికులు తెలిపారు. -
తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు: బండి సంజయ్
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ నాయకులే ఉప ఎన్నికలకు కారణం కాబోతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు ఉప ఎన్నికల్లో రెండు గెలిచామని, మునుగోడు ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఎన్నికలని అన్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ బీజేపీని, మోదీ పథకాలను చాలా సందర్భాల్లో ప్రశంసించారని ప్రస్తావించారు. చికోటి వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ పాత్ర ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజులో భాగంగా భువనగిరిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయిష్మాన్ భారత్లో జర్నలిస్టులను చేర్చే విషయంపై చర్చిస్తానని తెలిపారు. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులకు రైల్వే పాసులు, ఇళ్లు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులను ఆదుకునే బాధ్యత తమదేనన్నారు. క్యాసినో స్కామ్లో చాలా మంది టీఆర్ఎస్ నాయకులున్నారని బండి సంజయ్ విమర్శించారు. డగ్ర్ కుంభకోణంలో కూడా వారే ఉన్నారన్నారు. నయీమ్ డైరీ ఏమైందని, డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. నయీమ్ వల్ల కేసీఆర్ కుటుంబానికి ఇబ్బంది రావడంతో అతన్ని ఎన్కౌంటర్ చేశారని అన్నారు. నయీమ్ బాధితులను ఆదుకొని, వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. డబ్బులు రికవరీ చేస్తామన్నారు. ఎన్నికల వరకు ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని, మధ్యలో ఆపేది లేదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటినే తమ మ్యానిఫెస్టోలో పెడతామన్నారు. చదవండి: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ -
సీఏం కేసీఆర్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. బీసీ బంధు ఇస్తారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్రకటిస్తారా అని నిలదీశారు. నెలలో సగం రోజులు సీఎం కేసీఆర్ ఫాం హౌజ్లో ఉంటారని, మిగతా సగం రోజులు మోదీని తిట్టడానికే సరిపోతుందని దుయ్యబట్టారు. యాదాద్రి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పాలిట కేసీఆర్ శాపంగా మారారు. దేశాన్ని ఉద్ధరించడం కాదని, ముందు రాష్ట్ర సమస్యలపై స్పందిచాలి. ఈడీ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్కు లేదు. కేజీ టు పీజీ ఏమైంది. ఏడాది తరువాత రాష్ట్రంలో మార్పు వస్తుంది. మజ్లిస్, టీఆర్ఎస్ దొంగాట ఆడుతున్నాయి’ అని మండిపడ్డారు. చదవండి: ఎంపీ నామా కొడుకుపై దుండగుల దాడి.. కత్తితో బెదిరించి -
మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు తెలంగాణ రాజకీయాల్లో మార్పుకు శ్రీకారం
-
50 స్కూళ్లు దత్తత తీసుకున్న మంచు లక్ష్మి
సినీ నటి మంచు లక్ష్మి గొప్ప నిర్ణయం తీసుకుంది. 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 గవర్నమెంట్ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. ప్రైవేటు పాఠశాలలను మరిపించేలా స్మార్ట్ క్లాసెస్ ప్రారంభిస్తామని తెలిపింది. 1 నుంచి 5 తరగతుల వరకు మూడు సంవత్సరాల పాటు స్మార్ట్ క్లాసెస్ నిర్వహిస్తూనే, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. పిల్లలు చదువు మధ్యలో ఆపేయకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మంచు లక్ష్మి చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు అభిమానులు. పిల్లల చదువుకు పెద్దపీట వేసే ఈ ముందడుగు తప్పకుండా విజయవంతం అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: 'నిప్పు' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా? -
చక్రాల కింద ఇరుక్కుని.. చావుని తప్పించుకుని..
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం సాయత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. చౌటుప్పల్ మండలం మసీదుగూడెం గ్రామానికి చెందిన దేవరకొండ విఘ్నేశాచారి (73) ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం చౌటుప్పల్కు వచ్చాడు. ద్విచక్ర వాహనంతో లారీ కింద ఇరుక్కున్న విఘ్నేశాచారి పని ముగించుకుని స్థానిక అంగడి ప్రాంతం నుంచి తిరిగి స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో యూటర్న్ తీసుకునేందుకు బస్టాండ్ వద్దకి వెళ్లాడు. అక్కడ నెమ్మదిగా యూటర్న్ చేస్తుండగా హైదరాబాద్ వైపునకు వెళ్తున్న రెడీమిక్స్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో విఘ్నేశాచారితో పాటు ద్విచక్ర వాహనం లారీ ముందు చక్రాల కింద ఇరుక్కుంది. ఇది గమనించని లారీడ్రైవర్ అలాగే ముందుకు పోనిచ్చాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్తో పాటు స్థానికులు గట్టిగా కేకలు వేయగా లారీడ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. వెంటనే స్థానికులు హుటాహుటిన వెళ్లి ద్విచక్ర వాహనాన్ని, విఘ్నేశాచారిని లారీ కింద నుంచి బయటకు తీశారు. కాలికి చిన్నపాటి గాయం తప్పితే ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లారీ నెమ్మదిగా వెళ్తుండటం, స్థానికుల కేకలతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రాణాపాయం తప్పింది. -
చదువు పేరుతో పెళ్లిళ్లు ఆలస్యం కావొద్దు
సాక్షి, యాదాద్రి: వైద్య విద్యార్థులు చదువు పేరుతో పెళ్లిళ్లు ఆలస్యం గా చేసుకోవద్దని, సకాలంలో పెళ్లి చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంత మైన జీవితం గడుపుతూ లక్ష్యాల ను సాధించవచ్చని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్లో రీసెర్చ్ మ్యాగజైన్ అను సం«ధాన్ను ఆమె ఆవిష్కరించా రు. ఆస్పత్రిలో స్కిల్ ల్యాబ్, బర్తింగ్ సిమ్యులేటర్ను ప్రారంభించిన అనంతరం ఆడి టోరియంలో వైద్యవిద్యార్థులను, వైద్యులను ఉద్దే శించి ప్రసంగించారు. వివాహాలు చేసుకుంటే చదువుకోలేమని మహిళలు అనుకుంటారని, అది నిజం కాదనడానికి తన జీవితమే ఉదాహరణ అని చెప్పారు. ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలోనే తనకు వివాహం జరిగిందని, అయినా ఆ ఏడాది పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాన న్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేయడం, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం, పీజీ పూర్తి చేయడం వంటి విషయాలను తమిళిసై గుర్తు చేసు కున్నారు. కొందరు చదువు పేరుతో వివాహాలు ఆలస్యంగా చేసుకుని అనారోగ్యం పాలవుతున్నారన్నారు. తెల్లని కోటులో తనను డాక్టర్గా చూడాలని తన తల్లి పడిన తపనను గవర్నర్ వివరించారు. ఎయిమ్స్ సేవలు అభినందనీయం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎయిమ్స్ డాక్టర్లు అంది స్తున్న వైద్యసేవలను గవర్నర్ తమిళిసై కొనియా డారు. ఓపీ, ఇన్పేషెంట్ సేవలు, శస్త్ర చికిత్సలు, కోవిడ్ సమయంలో అందించిన సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సర్జరీలకు ఎక్కువ ప్రాధాన్య మివ్వ కుండా సాధారణ ప్రసవాలు చేయాలని సూచించా రు. బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో ఇప్పటివరకు 270 శస్త్రచికిత్సలు, 3,040 మైనర్ చికిత్సలు చేశార న్నారు. ఎయిమ్స్లో రీసెర్చ్ కోసం తనవంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు. ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ వైద్యశాల, కళాశాలకు అవసరమైన అన్ని రకాల వైద్యపరికరా లను రూ.185 కోట్లతో తెప్పిస్తున్నామన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు. -
భువనగిరిలో దారుణం.. మహిళ ఫొటోలు తీసి బెదిరింపులు
సాక్షి, యాదాద్రి భువనగిరి: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంస్థాన్ నారాయణపురం మండలంలోని కొర్ర తండాలో ఇద్దరు మైనర్ బాలురు దారుణానికి ఒడిగట్టారు. రెండు రోజుల క్రితం ఇంటి ముందు నిద్రిస్తున్న ఓ మహిళ(40) వస్త్రాలను తొలగించి ఇద్దరు మైనర్లు.. ఆమె నగ్న చిత్రాలను తీశారు. అనంతరం ఆ ఫొటోలను ఆమెకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా.. నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో వారి మిత్రులకు షేర్ చేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఒక మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: సూర్యాపేటలో ప్రైవేట్ ఆసుపత్రి సీజ్.. ఎందుకో తెలుసా..? -
ఢీ కొట్టి.. ఈడ్చుకెళ్లి..
భువనగిరి: బంధువుల అంత్యక్రియలకు వెళ్లేందుకు స్కూటీపై బయల్దేరిన వారిని డీసీఎం వాహనం రాంగ్ రూట్లో వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో వెనుక కూర్చున్న మహిళ ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. వీరిని ఢీ కొట్టిన తర్వాతైనా బండిపై ఉన్నవారు వేసిన కేకల్ని వినిపించుకుని వాహనాన్ని ఆపితే కనీసం రెండు ప్రాణాలైనా నిలిచేవి. కానీ, మద్యంమత్తులో వాహనాన్ని అత్యంత నిర్లక్ష్యంగా నడుపుతున్న ఆ డ్రైవర్ వీరు వేసిన కేకల్ని వినిపించుకోలేదు. స్కూటీతో పాటు వీరిని కూడా వంద మీటర్లు దూరం ఈడ్చుకెళ్లిపోయాడు. దీంతో వీరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ముగ్గురు ప్రాణాలు తీయడమే కాకుండా ముగ్గురు పిల్లలు అనాథలయ్యేందుకు కారణమయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం గ్రామ పరిధిలో గురువారం చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామానికి చెందిన దండబోయిన నర్సింహ(35), రాజ్యలక్ష్మి(30) దంపతులతో పాటు నర్సింహ వదిన దండ బోయిన జంగమ్మ(40) గురువారం బొమ్మల రామారం మండలం లోని చౌదరిపల్లి గ్రామంలో బంధువుల అంత్య క్రియలకు హాజరయ్యేందుకు స్కూటీపై బయల్దే రారు. అంతకు ముందేగానే జంగమ్మ భర్త బాలు మల్లు అంత్యక్రియలకు బయల్దేరి వెళ్లాడు. అయితే స్కూటీపై బయల్దేరిన ముగ్గురూ భువనగిరి పట్టణం దాటిన తర్వాత హన్మాపురం గ్రామ పరిధిలోని బచ్పన్ స్కూల్ సమీపంలో చేరుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో జగదేవ్పూర్ నుంచి భువనగిరి వైపు వేగంగా వస్తున్న డీసీఎం వాహనం వీరిని ఢీకొట్టింది. దీంతో స్కూటీ డీసీఎం వాహనం ముందు భాగంలో ఇరుక్కుపోయింది. స్కూటీపై వెనుక కూర్చున్న జంగమ్మ ఎగిరి రోడ్డుపైపడి అక్కడికక్కడే మృతి చెందింది. కేకలు పెడుతున్నా వినిపించుకోకుండా.. స్కూటీ ముందుభాగం డీసీఎంలో ఇరుక్కుపోవ డంతో రాజ్యలక్ష్మి, నర్సింహ కేకలు వేశారు. ఎంత గా అరుస్తున్నా వినిపించుకోకుండా డీసీఎం డ్రైవర్ ముందుకు దూసుకెళ్లాడు. కొంతదూరం వెళ్లగానే రాజ్యలక్ష్మి స్కూటీ నుంచి విడిపోయి మృతి చెంద గా..నర్సింహను సుమారు 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లిపోయాడు. అప్పటికే అతడు కూడా మృతి చెందాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి డీసీఎం వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా, పారిపోతున్న డ్రైవర్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బంధువులు కూడా గుర్తించలేదు మృతుల బంధువులు కూడా అదే దారిలో అంత్య క్రియలకు వెళ్తుండగా అప్పటికే ప్రమాదం జరగ డంతో జనం గుమికూడారు. దీంతో చనిపోయింది తమ బంధువులేనని గుర్తించలేకపోయామని వా రు వాపోతున్నారు. జంగమ్మ భర్త బాలుమల్లు ఇ చ్చిన ఫిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడి పిన డీసీఎం డ్రైవర్పై 304( జీజీ) సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనాథలైన పిల్లలు నర్సింహా, రాజ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తల్లిదం డ్రులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ముగ్గురూ అనాథలయ్యారు. మరో మృతు రాలు జంగమ్మకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు ఉచిత సాంకేతిక శిక్షణ
సాక్షి, హైదరాబాద్: స్వామి రామానందతీర్థ గ్రామీణసంస్థలో మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ–హాస్టల్–భోజన వసతితో పాటు ఉద్యోగ కల్పనకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టమ్ ఇన్స్ట లేషన్, సర్వీసు కోర్సుకు 6 నెలల శిక్షణ, దీనికి ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దొజి, క్విల్డ్బ్యాగ్స్ కోర్సుకు 6 నెలలు శిక్షణ, దీనికి 8వ తరగతి పాసై ఉండాలని తెలిపారు. అర్హతలు ► వయసు 18–25 ఏళ్ల లోపు వారై ఉండాలి ► ప్రస్తుతం చదువుకుంటున్న వారు అర్హులు కాదు. ► అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్, పాస్పోర్ట్ ఫొటోలు, ఆధా, రేషన్కార్డులు ఆసక్తి, అర్హతలున్న గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు ఈనెల 13న ఉదయం 10 గంటలకు భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామంలోని తమ సంస్థకు రావాలని స్వామి రామానందతీర్థ గ్రామీణసంస్థ డైరెక్టర్ కిశోర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. (క్లిక్: బస్పాస్ చార్జీలు భారీగా పెంపు?)