
ఆగ్రా, ఉత్తరప్రదేశ్ : ఆదమరచి నిద్రిస్తున్న వీధికుక్కపై రోడ్డును వేయడం ఆగ్రహజ్వాలలకు దారి తీసింది. రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టు తీసుకున్న ఆర్పీ ఇన్ఫ్రా వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన వర్కర్లు నిద్రిస్తున్న కుక్కపై తారును వేసి సజీవ సమాధిని చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.
ఫూల్ సయ్యద్ క్రాస్ నుంచి సర్క్యూట్ హౌజ్, తాజ్మహల్ల మీదుగా రోడ్డు నిర్మాణం సాగుతోంది. కోల్తారును మరో రౌండ్ వేసేందుకు వచ్చిన కంపెనీ వర్కర్లు నిద్రిస్తున్న కుక్కను అక్కడి నుంచి లేపకుండా దానిపై సలసలకాగే తారును వేశారు. అయితే, ఈ విషయం బయటకు పొక్కడంతో ప్రస్తుతం కుక్క మృతదేహం ఆచూకీలేకుండా చేశారని సామాజిక కార్యకర్త నరేష్ పరాస్ ఆరోపించారు.
ఈ మేరకు కంపెనీపై ఫిర్యాదు చేసినట్లు పరాస్ వెల్లడించారు. కాగా, ఈ ఘటనతో షాక్కు గురైన ఆగ్ర వాసులు కుక్క మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.
Comments
Please login to add a commentAdd a comment