వెంకన్న సన్నిధికి ఇంకో రైలు | another train to tirumala | Sakshi
Sakshi News home page

వెంకన్న సన్నిధికి ఇంకో రైలు

Published Thu, Dec 29 2016 11:56 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

వెంకన్న సన్నిధికి ఇంకో రైలు - Sakshi

వెంకన్న సన్నిధికి ఇంకో రైలు

తాడేపల్లిగూడెం : తిరుమలేశుడిని దర్శించుకునే భక్తుల కోసం ప్రధాన రైలు మార్గంలో నూతన సంవత్సర కానుకగా మరో కొత్త రైలు అందుబాటులోకి రాబోతోంది. ఇక నుంచి డబుల్‌ డెక్కర్‌ రైలులో ఏసీ బోగీల్లో తిరుపతి వెళ్లే అవకాశం కలగనుంది. తిరుపతి–విశాఖపట్నం  మ ధ్య శుక్రవారం నుంచి ఈ రైలు నడుస్తుంది. శుక్రవారం అర్ధరాత్రి 12.10 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఇదే రైలు 31వ తేదీన అర్ధరాత్రి 10.25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి జనవరి 1న మధ్యాహ్నం తిరుపతి చేరుకుంటుంది. ప్రస్తుతానికి తాత్కాలిక నంబర్‌ కేటాయించారు. తిరుపతి నుంచి విశాఖ బయలుదేరే రైలుకు 02708, విశాఖ నుంచి తిరుపతి బయలుదేరే రైలుకు 02707 నంబరు ఇచ్చారు. జిల్లాలోని ఏలూరు, తాడేపల్లిగూడెం స్టేషన్లలో దీనికి హాల్ట్‌ కల్పించారు. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్‌  మీదుగా ఈ రైలు వెళుతుంది.
వారానికి మూడుసార్లు 
జనవరి 1వ తేదీ నుంచి వారానికి మూడుసార్లు తిరుపతి నుంచి విశాఖకు ఆది, బుధ, శుక్ర వారాలలో బయలుదేరుతుంది. తిరుపతిలో రాత్రి 9.50కు బయలుదేరే ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు. నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా 3.50కు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్‌ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి విజయవాడ, ఏలూరు. తాడేపల్లిగూడెం. రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ మీదుగా విశాఖపట్టణానికి చేరుకుంటుంది. విశాఖ వైపు వెళ్లే రైలు తాడేపల్లిగూడెం స్టేషన్‌ కు ఉదయం 6.30కు వస్తుంది.  తిరుపతి వెళ్లడానికి రాత్రి 10.25కు విశాఖ నుంచి బయలుదేరుతుంది. సోమ, గురు, శనివారాలలో తిరుపతి వెళుతుంది. తాడేపల్లిగూడెం స్టేషన్‌ కు అర్ధరాత్రి 2.03 గంటలకు చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాలు ఆగుతుంది. మరుసటి రోజున ఉదయం 11.35 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 
అన్నీ ఏసీ బోగీలే..
ఈ డబుల్‌ డెక్కర్‌ రైలులో మొత్తం 10 బోగీలుం టాయి. అన్నీ ఏసీ బోగీలే. 8 చైర్‌కార్‌ కోచ్‌లు, రెండు పవర్‌ కార్‌ కోచ్‌లు ఉంటాయి. స్లీపర్‌ సదుపాయం ఉండదు. కూర్చుని మాత్రమే ప్రయాణం చేయాలి. తాడేపల్లిగూడెం నుంచి తిరుపతి వెళ్లాలంటే రూ.700 చెల్లించాలి. తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో ఇక్కడి నుంచి స్లీపర్‌లో కోచ్‌లో ప్రయాణించడానికి రూ.350 మాత్రమే.
తిరుగు ప్రయాణానికి మేలు 
జిల్లా వాసులు తిరుపతి నుంచి తిరుగు ప్రయాణం చేసేందుకు మాత్రమే ఈ రైలు ఉపయుక్తంగా ఉంటుంది. తిరుపతిలో రాత్రి 9.50కు బయలుదేరి.. మరునాడు ఉదయం 6.30 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుంటుంది. 
తిరుపతికి వెళ్లిన వారు కొండపైనుంచి కిందకు రావడానికి ఆలస్యమైతే.. తిరుమల ఎక్స్‌ప్రెస్‌ అప్పటికే బయలుదేరిపోతే ఈ రైలు ఉపయోగపడుతుంది. ఇది వేగంగా తిరుపతి చేరుకునే అవకాశం లేదు. గుంటూరు మీదుగా వెళ్లాల్సి ఉండటంతో ప్రయాణ సమయం ఎక్కువ. తెల్లారి 11గంటలు దాటాక తిరుపతి వెళుతుంది. భక్తులు ఈ రైలులో వెళ్లి వెంకన్నను దర్శించుకోవాలంటే ఒక రోజు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సిఫార్సు లేఖలతో వెళ్లే వారు ఆ లేఖలను దర్శనానికి ముందురోజు మధ్యాహ్నం 12 గంటలలోగా ఎంబీసీ–34లో ఇవ్వాలి. రైలు ఉదయం 11 గంటలు దాటాక తిరుపతి చేరుకుంటే అక్కడి నుంచి బస్సులో తిరుమలకు వెళ్లి లేఖలు ఇవ్వాలంటే కుదరని పని. రైలు సేవలు ప్రారంభమయ్యాక ఇలాంటి సమస్యలను, రైలు వేళల్లో మార్పులు చేసే అవకాశాలు ఉండొచ్చు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement