సీతారాం ఏచూరిపై దాడిని ఖండిస్తూ ధర్నా
కాకినాడ సిటీ : దేశరాజధాని ఢిల్లీలో ఉన్న సీపీఎం కేంద్ర కార్యాలమైన ఏకేజీ భవన్లో పొలిట్బ్యూరో సమావేశాల అనంతరం మీడియా సమావేశానికి వెళుతున్న సీతారాం ఏచూరిపై హిందూసేన పేరు ఉన్న మతోన్మాదులు దాడికి పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని వివిధ పార్టీల నాయకులు పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయం వద్ద మతోన్మాదుల ఆగడాలు నిరసిస్తూ అఖిలపక్షం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వాశేషుబాబ్జి మాట్లాడుతూ గతంలో రెండుసార్లు సీపీఎం కార్యాలయంపై దాడికి పూనుకున్నారని, తాజాగా జాతీయనేత సీనియర్ పార్లమెంటరీయన్పై దాడికి పూనుకోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్ఎస్ఎస్ తదితర మతోన్మాదులు రెచ్చిపోతున్నారని, రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నవారు ప్రశ్నించేవారిని మట్టుబెట్టాలనుకుంటే బీజేపీ పరిస్థితి ఎలా ఉండేదో గతాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఎవరు ఏమి తినాలో, ఎలా ఉండాలో మతోన్మాదులకు నిర్ణయించే హక్కులేదని, రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛ, లౌకిక స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతం నానాజీ, సీపీఐ నగర కార్యదర్శి తోకల ప్రసాద్, ఆర్పీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయితాబత్తుల రామేశ్వరరావు, లోక్సత్తా నాయకుడు శివరామకృష్ణ, కేవీపీఎస్ నగర అధ్యక్షుడు మోతా కృష్ణమూర్తి, రైతు సంఘం నాయకులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, సీఐటీయూ, సీపీఎం నాయకులు జి.బేబీరాణి, పలివెల వీరబాబు, సీహెచ్ అజయ్, ఎంవీ రమణ, ఎస్.భవాని, ఎం.రాజ్గోపాల్, సీహెచ్వీ రమణ పాల్గొన్నారు.