ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల సరిహద్దులోని గూడెం(రాయపట్నం వంతెన) వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.
దండేపల్లి/ధర్మపురి: ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల సరిహద్దులోని గూడెం(రాయపట్నం వంతెన) వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండ్రోజుల క్రితం కడెం ప్రాజెక్టు నుంచి వరద నీటిని వదలడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నదిపై ఉన్న పాత లోలెవల్ వంతెన ఆదివారం మునిగిపోయేలా కనిపించింది.
వంతెనకు సమానంగా నీరు ప్రవహిస్తుండడంతో.. అధికారులు శనివారం రాత్రి నుంచి వాహనాల రాకపోకలు నిలిపి వేశారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, జీపులను ఆదివారం ఉదయం నుంచి కొత్త వంతెనపై నుంచి పంపిస్తున్నారు.
కొత్త వంతెనపై బీటీ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్డు పనులు రాయపట్నం వైపు పూర్తయ్యాయి. గూడెం వైపు ఇంకా సాగుతున్నాయి. వర్షాలు పడడంతో అప్రోచ్ రోడ్డు పనుల్లో కొంత జాప్యం జరిగింది. కాగా, నీటి ప్రవాహం పెరిగితే సోమవారానికి లో లెవల్ వంతెన పూర్తిగా మునిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.