
పట్టాలు తప్పిన హీరాఖండ్ ఎక్స్ప్రెస్
► పట్టాలు తప్పిన హీరాఖండ్ ఎక్స్ప్రెస్
► 41 మంది మృతి.. 25 మృతదేహాలు వెలికితీత
► విజయనగరం జిల్లా కొమరాడ వద్ద అర్ధరాత్రి ప్రమాదం
► 100 మందికి పైగా తీవ్రగాయాలు
► 8 బోగీలు బోల్తా.. ఒక ఏసీ బోగీ సహా ఐదు బోగీలు పూర్తిగా నుజ్జునుజ్జు
సాక్షి, విజయనగరం/విశాఖపట్నం: ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్ప్రెస్ కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో పట్టాలు తప్పింది. దీనితో ఇంజన్ సహా పలు బోగీలు బోల్తా పడ్డాయి. నాలుగు బోగీలు పక్క ట్రాక్పైనే వెళ్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 41 మందికిపైగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయానికి 25 మృతదేహాలను వెలికితీశారు. పలు బోగీలు నుజ్జునుజ్జు కావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఎస్.6, ఎస్.7 స్లీపర్ బోగీలతో పాటు ఒక ఏసీ బోగీ, నాలుగు జనరల్ సహా 8 బోగీలు బోల్తాపడ్డాయి. సమాచారం అందిన వెంటనే విజయనగరం, విశాఖపట్నం నుంచి సహాయ బృందాలు సంఘటన ప్రాంతానికి చేరుకున్నాయి. బోగీలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉం దని రైల్వేవర్గాలు పేర్కొన్నాయి. వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రలేఖ ముఖర్జీ విశాఖ నుంచి రిలీఫ్, మెడికల్ రిలీఫ్ ట్రైన్లతో హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. ప్రమాద స్థలిలో నాలుగు అంబులెన్సులు వైద్య సేవల్లో నిమగ్నమయ్యాయి. స్థానికులు సైతం ఘటనా స్థలికి పెద్ద సంఖ్యలో చేరుకుని సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. సుమారు 70 మంది క్షతగాత్రులను పార్వతీపురం, రాయ్గఢ్ ఆస్పత్రులకు తరలించారు.
ఒక్కసారిగా పెద్ద శబ్దం
అర్ధరాత్రి.. అటవీ ప్రాంతం.. ఒక్క సారిగా పెద్ద శబ్ధం.. ఏం జరిగిందో అర్థం కాలేదు. నిద్ర నుంచి మేల్కొన్న ప్రయాణికుల అరుపులు.. కేకలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఎలాగైనా బయట పడాలని ఆరాటంలో బోగీల్లో ఒకరిపై ఒకరు పడిపోయారు.. తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకోవడంతో కొందరు, బోగీలు పడిపోయిన తాకిడికి గాయాలై మరికొందరు విగతజీవులయ్యారు. పదుల సంఖ్యలో గాయపడిన వారి హాహాకారాలతో ఘటనా స్థలి దద్దరిల్లింది. తాము ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురైందని తెలుసుకుని బోగీల్లో చిక్కుకుపోయిన వారు వణికిపోయారు. ఘటన జరిగిన సమయం అర్ధరాత్రి కావడంతో సహాయక చర్యలు ఆలస్యంగా మొదలయ్యాయి. విజయనగరం రైల్వేస్టేషన్లో అధికారులు హెల్ప్లైన్ (8106053006 (ఎయిర్టెల్), 8500358712 (బీఎస్ఎన్ఎల్) ఏర్పాటు చేశారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మరిన్ని సంబంధిత వార్తలు :
రైలు ప్రమాద మృతుల వివరాలు
రైలు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా