
నేటి నుంచి అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నుంచి అనంతపురం జిల్లాలో మూడో విడత ‘రైతు భరోసా యా త్ర’కు శ్రీకారం చుట్టనున్నారు. రుణాల మాఫీ జరగక, కొత్త అప్పులు పుట్టక, వ్యవసాయం చేసుకోలేక సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు ఈ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. నిరాశా నిసృ్పహల్లో ఉన్న రైతుల బలవన్మరణాలను నిలువరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో..
రైతులు బలవన్మరణాలను ఆశ్రయించడం సరి కాదంటూ వారికి భరోసా కల్పించడానికి వైఎస్ జగన్ ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి 26వ తేదీ వరకు తొలి విడత, మే 11వ తేదీ నుంచి 18 వరకు రెండో విడత రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించారు. తాజాగా మంగళవారం నుంచి కల్యాణదుర్గం నియోజకవర్గంలో మూడో విడత యాత్రను ప్రారంభించనున్నారు.
జగన్ తొలి రోజు పర్యటన వివరాలను పార్టీ కార్యక్రమాల కమిటీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ సోమవారం పత్రికలకు విడుదల చేశారు. శెట్టూరు మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. అనంతరం ఆయన కైరేవు గ్రామానికి వెళతారు.