
అవినీతి కంపు కొడుతున్న ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతి మయం చేశారని, ఆయన చేసే ప్రతి పనిలోనూ అవినీతి కంపు కొడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారథి తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు.
- ఏపీని కాపాడేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలి
- వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి
సాక్షి,హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతి మయం చేశారని, ఆయన చేసే ప్రతి పనిలోనూ అవినీతి కంపు కొడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారథి తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని, పట్టిసీమ, రేషన్ మొదలు నీరు చెట్టు, ఆఖరికి వడదెబ్బతో పడిపోయే వాళ్లకు సహాయం చేసే దాంట్లో కూడా టీడీపీ అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం కూడా అవినీతి లేకుండా జరగడం లేదన్నారు.
చంద్రబాబు 2019 నాటికి ఏపీని దేశంలోనే నంబర్ వన్ అవినీతి రాష్ట్రంగా చేయాలని కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు స్విస్ చాలెంజ్ పేరుతో దోపిడీకి తెర తీశారని మండిపడ్డారు. నిజాయితీగా రాజధాని నిర్మిస్తున్నామని భావిస్తే.. నిజంగా ధైర్యం ఉంటే రెండేళ్ల అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో సీబీఐ ఎంక్వైరీ జరిగితే దాన్ని ఎదుర్కోలేక స్టే తెచ్చుకున్న ఘనుడు బాబు అని దుయ్యబట్టారు.
ఎదుర్కొనే దమ్ము లేక అపనిందలు : ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డిని నేరుగా ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం లేక.. ఆయనపై అపనిందలు వేసి రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్నారని చంద్రబాబుపై పార్ధసారధి నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి వైఎస్ జగన్పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు.